Wednesday, 21 December 2011

అప్పులు తీర్చలేక రైతన్నకు కన్నీటి కష్టాలు

ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన  రైతులు రబీ సీజన్‌లో తమ అదృష్టం పరీక్షించుకుందామని వేరుశనగ తదితర పంటలు సాగు చేశారు. అయితే ఆదిలోనే ఎడతెగని వర్షాలు పంటలను నాశనం చేయగా, ప్రస్తుతం విద్యుత్తు కోతలు రైతన్నకు క'న్నీటి' కష్టాలు తెస్తున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు నీరు లేక ఏం చేయాలో తెలియక ఆందోళనలో పడ్డారు. రబీ సీజన్‌లో  రైతులు వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. విత్తిన వారం రోజులకే ఎడతెగని వర్షాల ధాటికి పొలాల్లో నీరు నీలిచి విత్తనాలు మొలకెత్తక పంటలు నాశనమయ్యాయి. అయితే వర్షానికి ముందు విత్తిన రైతులు మాత్రం కొంత ఊరట చెందుతున్నారు. ప్రస్తుతం కలుపు కాలం కావడంతో మొక్కల ఏరివేతకు నీటి సమస్య మొదలైంది. విద్యుత్తు కోతల కారణంగా సరఫరా ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పలువురు రైతులు విధిలేక పొలాల వద్దకు నీరు తెచ్చుకుని కలుపు తొలగిస్తూ తమ పంటలు కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక వర్షాలతో రబీ సీజన్ ఆరంభంలోనే దెబ్బతిన్న వేరుశనగకు ఏం చేయాలో తోచని పలువురు రైతన్నలు ఆర్థిక భారమైనా చివరకు ట్రాక్టర్ల సాయంతో దున్నేస్తున్నారు. ఇకపై అప్పు చేసి పంటలు సాగు చేయడం తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు సర్వే చేసి పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలంటూ మొరపెట్టుకుంటున్నారు. లేదంటే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమంటూ గోడు వెల్లబోసుకుంటున్నారు. అధికారులు ఆదుకోకున్నా ఉన్న పంటకు సరిపడా నీరందించేందుకు ఏడు గంటల విద్యుత్తు సరఫరా చేస్తే చాలని కొన్ని ప్రాంతాల రైతులు విన్నవిస్తున్నారు.

2 comments:

  1. పాలకులు రైతులను ఓటర్లుగా కాక అన్నదాతలుగా గౌరవించే రోజులు వచేవరకు ఈ కష్టాలు తప్పవు !

    ReplyDelete
  2. rayalaseema ratanalaseema annaru manapeddalu adi nijam 100% garantee

    ReplyDelete