Sunday, 26 February 2012

రాజీనామాకు మంత్రి డిఎల్ రెడీ?

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా చేయడానికి సిద్ధపడుతున్నట్లు సమాచారం. మంత్రి పదవికి మాత్రమే కాకుండా శాసనసభా సభ్యత్వానికి రాజీనామా చేయడానికి అనుమతించాలని కోరుతూ ఆయన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖ రాశారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితిలో రాజీనామా చేయడానికి అనుమతించాలని ఆయన సోనియాను కోరారు.ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాల వల్ల తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల, పథకాల వల్ల ప్రస్తుత ప్రభుత్వం విశ్వసనీయతను, ప్రతిష్టను కోల్పోయిందని ఆయన ఆ లేఖలో విమర్శించారు. కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ రవీంద్రా రెడ్డితో మాట్లాడినట్లు, తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దని సూచించినట్లు చెబుతున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుంటుందని, అప్పటి వరకు వేచి ఉండాలని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. పది రోజుల పాటు సెలవులో ఉన్న మంత్రి శుక్రవారం శాసనసభకు హాజరయ్యారు. ఆ తర్వాత కడప జిల్లాకు వెళ్లిపోయారు. సోమవారం కూడా ఆయన సభకు వచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు ప్రభావాన్ని కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారని డిఎల్ సోనియాకు రాసిన లేఖలో విమర్సించినట్లు తెలుస్తోంది. కిరణ్ కుమార్ రెడ్డి ఏకపక్ష వైఖరికి, నిర్లక్ష్యానికి సంబంధించిన పలు సంఘటనలను కూడా ఆయన లేఖలో ఉదహరించినట్లు సమాచారం.

రాయలసీమలో కరెంటు కష్టాలు

మార్చి నెల ప్రారంభానికి ముందే కరెంటు కష్టాలు మొదలయ్యాయి. దాదాపు నెల రోజుల నుంచి కరెంటు కోత లేక పోవడంతో ఊపీరి పీల్చుకున్న ప్రజలకు మళ్లీ ‘ఉక్కపోత’ మొదలైంది. రాష్ట్రంలోని ఆర్టీపీపీ, కెటిజిఎస్, ల్యాండ్‌కో, కాకతీయ థర్మల్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి యూనిట్లు తగ్గిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా 1100 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి లోటు ఏర్పడింది. దీంతో కోతలు మొదలైనట్లు అధికారులు చెబుతున్నారు. నగరంలో ఉదయం 9 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు కరెంటు కోత విధిస్తున్నారు. ఇక  మున్సిపాలిటీల్లో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 1 గంట వరకు సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు విద్యుత్ కోత విధిస్తున్నారు.ఇక మండలాల్లో ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు కోత విధిస్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో కేవలం వ్యవసాయానికి విద్యుత్ సరఫరా ఉన్నప్పుడు మాత్రమే కరెంటు వస్తోందని స్థానికులు చెబుతున్నారు. చీకటి పడితే తప్ప గ్రామీణ ప్రాంతాల్లో బల్బు వెలగడడం లేదు. ఇక రైతన్నలు కరెంట్ కోసం రాత్రి పూట జాగారం చేయాల్సి వస్తోంది.మరోవైపు వేసవి కాలం మరింత ముదిరితే మరిన్ని గంటలు కోత ఉంటుందని అధికారులు చెబుతున్నారు. విద్యుత్ వినియోగం ఎక్కువ కావడంతో అందుకు తగ్గట్టు ఉత్పత్తి లేకపోవడంతో కోత విధించాల్సిన అవసరం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే విద్యుత్ కోత కారణంగా ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భవిష్యత్తులో కోత సమయం మరింత పెరిగితే ప్రజలు బాధలు వర్ణణాతీతం. త్వరలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇటు వంటి తరుణంలో విద్యుత్ కోత కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అనంతపురం పోలీస్ శాఖ ప్రతిష్ట దిగజార్చకండి ...జిల్లా ఎస్పీ

మంచి పనిచేస్తే సహకారం, ప్రశంసలుంటాయని, చెడు పని చేస్తే చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ షహనవాజ్ ఖాసీం పోలీసు అధికారులకు ఘాటైన హెచ్చరిక చేశారు. ఇందులో హోం గార్డులైనా, అధికారులైనా ఉపేక్షించేది లేదన్నారు. ఎవరికైనా 15 రోజులు గడువిస్తానని, ఆ లోపు బాధ్యతరహితంగా మెలిగే వారు, చెడు ప్రవర్తన కలిగిన వారు తమ పద్ధతులను మార్చుకోవాలన్నారు. లేని పక్షంలో చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి శనివారం సెట్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆ శాఖ సిబ్బంది, అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు. చిన్న సమస్యకు పెద్ద రాద్ధాంతం చేయవద్దన్నారు. ఎస్‌హెచ్ఓలు హుందాగా పనిచేయాలన్నారు. పోలీస్ శాఖ ప్రతిష్టను దిగజార్చే విధంగా వ్యవహరించవద్దన్నారు. అందుకు అవకాశం కూడా ఇవ్వకూడదన్నారు. సిబ్బందిపై నియంత్రణ, ప్రజలతో సత్సబంధాలు కొనసాగించాలన్నారు.అలాగే నూతనంగా బాధ్యతలు స్వీకరించిన డీఎస్పీ, ఎస్‌ఐలకు సూచనలు చేశారు. అనంతరం స్థానిక వన్ టౌన్ సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యంగా కదిరి ప్రాంతంలో యువతులకు ట్రాఫికర్లు మాయమాటలు చెప్పి నగరాల్లోని వ్యభిచార గృహాలకు తరలిస్తున్నారని తెలిపారు. వీరిని గుర్తించడంలో సరైన ప్రగతి సాధించలేక పోయామని, ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని త్వరలో మంచి ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలో నేరాలు పూర్తిస్థాయిలో తక్కువయ్యాయని, అయితే కదిరి-బత్తలపల్లి మధ్య చిత్తూరుకు చెందిన చోరీ ముఠా సంచరిస్తుందని, వారిని పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశామన్నారు. గుంతకల్లు రూరల్ సర్కిల్ పరిధిలో మిస్టరీగా మారిన గుర్తు తెలియని మహిళల హత్య సంఘటనలకు సంబంధించి ప్రశ్నించగా దశబ్దాలు గడిచిన వాటి సమాచారం బయటకు రావడం ఇబ్బందికరమని నమ్ముతానని దాటవేశారు. ధర్మవరం, గుంతకల్లులో ట్రాఫిక్ పోలీసుస్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. పోలీసుల సంక్షేమంలో భాగంగా ఉరవకొండ సర్కిల్ పరిధిలో పోలీసు స్టేషన్, పోలీసు క్వార్టర్స్ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. కిందిస్థాయి సిబ్బంది ఎవరైనా అదుపు తప్పి ప్రవర్తిస్తే అలాంటి వారిపై ఆ ప్రాంత అధికారులు దృష్టి పెట్టాలన్నారు. అప్పటికీ వారిలో మార్పు రాకపోతే తీవ్రంగా పరిగణిస్తామన్నారు. ఐడీ పార్టీ పోలీసులైనా ...ఇతర సిబ్బంది అయినా క్రమశిక్షణతో మెలగాలన్నారు. అక్రమాలకు పాల్పడితే కేసులు నమోదు చేయిస్తానన్నారు. ఎవరో ఒకరు చేసే తప్పిదం ప్రభావం పోలీసు శాఖపైనే పడుతుందనే విషయాన్ని గ్రహించి మసలుకోవాలన్నారు.దీర్ఘకాలంగా పనిచేస్తున్న సిబ్బంది జాబితా సిద్ధం చేయాలని ఆయన అదనపు ఎస్పీని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో విఫలమయ్యే అవకాశమున్న ప్రాంతాలు, అవినీతి, అక్రమాలకు పాల్పడే అధికారులపై దృష్టి పెట్టాలని సూచించారు.

సచిన్ టెండూల్కర్‌కు ఎస్‌సీజీ గౌరవ సభ్యత్వం

ప్రఖ్యాత భారత క్రికెట్ క్రీడాకారుడు సచిన్ టెండూల్కర్‌కు మరో అరుదైన గౌరవం లభించింది. సచిన్‌కు జీవితకాల గౌరవ సభ్యత్వాన్ని సిడ్ని క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సీజీ) ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో గొప్ప క్రీడాకారుల్లో ఒకరిగా పేరున్న సచిన్‌కు గౌరవ సభ్యత్వాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నట్టు న్యూసౌత్ వేల్స్ ప్రీమియర్ బ్యారీ ఓ ఫెర్రేల్ తెలిపారు. ఈ సందర్భంగా సచిన్‌పై ఫెర్రేల్ ప్రశంసలతో ముంచెత్తారు. విదేశాల్లో సచిన్‌కు సిడ్ని క్రికెట్ గ్రౌండ్ అత్యంత ఇష్టమైన మైదానమని ఆయన అన్నారు.

భారత్ ఓటమి, టోర్ని నుంచి ఔట్!

ముక్కోణపు వన్డే సిరిస్‌లో భాగంగా భారత్ - ఆస్టేలియా మద్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియాపై ఆసీస్ 87 పరుగుల విజయంతో విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో టీమిండియాని ఓడించడంతో ముక్కోణపు సిరిస్‌లో ఆసీస్ ఫైనల్‌కు చేరగా టీమిండియా ఇంటి బాట పట్టనుంది. మొదట టాస్ గెలిచి ఆస్టేలియా జట్టు బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి గాను 252 పరుగులు చేసింది. ఆస్టేలియా ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ అత్యధికంగా 68 పరుగులు చేశాడు. మిడిల్ ఆర్డర్‌లో డేవిడ్ హస్సీ 54, వేడ్ 56 పరుగులు చేశారు. ఇక ఇండియన్ బౌలర్స్‌లలో సెహ్వాగ్ 3 వికెట్లు తీసుకోగా, ప్రవీణ్ కుమార్, యాదవ్‌లు రెండేసి వికెట్లు తీసుకున్నారు.253 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్లు వీరేంద్ర సెహ్వాగ్ 5, సచిన్ టెండూల్కర్ 14 పరుగులకే పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన గంభీర్ 23, కోహ్లీ 21 పరుగులతో నిష్క్రమించారు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన ధోని తనదైన శైలిలో ఆటను ప్రదర్శించినప్పటికీ హిల్ఫన్‌హాస్ వేసిన బంతిలో ఎల్ బిడబ్ల్యు గా పెవిలియన్‌కు చేరుకున్నాడు. టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా 8, స్పిన్నర్ రవిచంద్రన్ ఆశ్విన్ 26, ఇర్పాన్ పఠాన్ 22 పరుగులతో పెవిలియన్‌కు చేరుకున్నారు. ఆసీస్ బౌలర్స్‌లలో షేన్‌ వాట్సన్, దోహార్తి, హిల్ఫన్‌హాస్ రెండేసి వికెట్లు తీసుకోగా... క్రిస్టేన్, మెక్ కే, బ్రెట్ లీ తలో వికెట్ తీసుకున్నారు. ఆస్టేలియాలో అత్యధికంగా పరుగులు చేసిన డేవిడ్ వార్నర్ 68 కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.టీమిండియాపై ఆసీస్ విజయం సాధించడం ద్వారా పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో అగ్రస్దానంలోకి వెళ్లడమే కాకుండా ముక్కోణపు వన్డే సిరిస్‌ ఫైనల్ బెర్తుని ఖరారు చేసుకుంది. ఇక శ్రీలంక 15 పాయింట్లతో రెండవ స్దానంలో ఉంది. మంగళవారం టీమిండియాకి శ్రీలంకతో మ్యాచ్‌లో ఫైనల్‌కు చేరే అవకాశాలు లేవు.