Wednesday, 30 November 2011

అనంతపురం జిల్లాలో మెడికల్ షాపులపై దాడులు

అనంతపురం జిల్లాలో ఔషధ తనిఖీ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. నిబంధనలు పాటించని 41మందుల దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అనంతపురంలో 30, హిందూపురంలో 11షాపులను సీజ్ చేశారు. రోగుల బంధువులుగా అధికారులే మందులు కొనుగోలు చేశారు. దీంతో దుకాణదారుల నిజస్వరూపం బయటపడింది. డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకపోయినా అమ్మకాలు జరపడం, బీ ఫార్మసి లేకపోయినా యధేచ్చగా విక్రయాలు కొనసాగించడాన్ని గుర్తించారు. దీంతో సంబంధిత దుకాణదారులపై కేసులు నమోదు చేశారు. అధికారుల వరుస దాడులతో హడలి పెద్దఎత్తున మెడికల్ షాపులు మూసేసుకున్నారు.   మెడికల్ షాపుల యాజమాన్యాలు నిబంధనలు పాటించడంలేదని సాక్షాత్ వైద్యఆరోగ్య  మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అంగీకరించారు. రాష్ట్రంలోని 90శాతానికి పైగా దుకాణాల్లో క్వాలిఫైడ్ ఫార్మసిస్టులు లేరని తెలిపారు. అయితే నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు

‘అధినాయకుడు’ చిత్రంలో బాలకృష్ణకి బామ్మగా జయసుధ

నందమూరి బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అధినాయకుడు’ ఇందులో బాలకృష్ణ తాతగా, తండ్రిగా, కొడుకుగా మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆల్ మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన లక్ష్మీరాయ్, ఛార్మీ, సలోని హీరోయిన్ లుగా నటిస్తున్నారు.బాలకృష్ణ నటిస్తున్న ఓల్డ్ గెటప్ కు జోడీగా సహజనటి జయసుధ నటిస్తోంది. ఈ చిత్రంలో జయసుధ బాలకృష్ణకి బామ్మగా కనిపించనున్నారు. బాలకృష్ణ వేసిన ముసలాయన గెటప్ కి ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ లభించనుంది. చాలా కాలం క్రితం ద్విపాత్రాభినయంతో అలరించిన బాలకృష్ణ ‘అధినాయకుడు’గా ఏకంగా మూడు పాత్రల్లో కనువిందు చేయబోతుండటంతో ఈ చిత్రంపై అందరిలోనూ భారీ అంచానాలు ఏర్పడ్డాయి. విశ్వసనీయ వర్గాల సమాచారంప్రకారం కళ్యాణీ మాలిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ 25న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే బాలకృష్ణకు సంబంధించిన మూడు పాత్రల్లో రెండింటిని రివీల్ చేసిన చిత్రవర్గాలు మూడవ గెటప్ ని చాలా రోజులు గా సీక్రెట్ గా వుంచుతూ వస్తోంది.

రామ్ చరణ్.... బ్యాచులర్ పార్టీకి ఘనంగా ఏర్పాట్లు

రామ్ చరణ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన బ్యాచులర్ పార్టీకి ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గోవాలో ఈ పార్టీ జరగనుందని సమాచారం. డిసెంబర్ 2 లేదా మూడవ తేదీల్లో ఈ పార్టీ జరగనుంది. ఈ పార్టీకి అల్లు అర్జున్, రానా, శర్వానంద్, నవదీప్ వంటి తెలుగు హీరోలు, మరికొద్ది మంది రామ్ చరణ్ చిన్నప్పటి ప్రెండ్స్ పాల్గొనన్నారు. ఇక రామ్ చరణ్, ఉపాసనా కామినేనిల ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టర్ చిరంజీవి ఇంట్లోనూ, అటు అపోలో ఛైర్ పర్సన్ ప్రతాప్ రెడ్డి ఇంట్లోనూ సందడి నెలకొందని తెలుస్తోంది. డిసెంబర్ 1న ఉదయం 10గంటలకు ఈ వేడుక ఆరంభమవ్వనుందట. కరెక్ట్ గా 11.55కు రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ రింగ్ ని ఉపాసనాకి తొడగుతాడని తెలుస్తోంది. గండిపేట సమీపంలోని గోల్కోండ రిసార్ట్స్ లో ఈ వేడుక జరగనుంది. తన నిశ్చితార్థానికి రావాలని చెర్రీ గవర్నర్‌ దంపతులను ఆహ్వానించిన విషయం విధితమే. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారని సమాచారం

బెజవాడ రిలీజ్... పోలీసులు అప్రమత్తం

నాగచైతన్య తాజా చిత్రం   బెజవాడ రిలీజ్ అవుతోందంటే బెజవాడలో భయం మొదలైంది. మళ్ళీ ఏ గొడవలు మొదలవుతాయో, కులాల మధ్య కొట్లాటలు ప్రారంభమవుతాయో అని అంతా భయపడుతున్నారు. మరో ప్రక్క పోలీసులు సైతం అప్రమత్తంగా ఉండాలని పైనుంచి ఆర్డర్స్ ఉండటంతో బెజవాడ విడుదలైన మూడు రోజుల వరకూ చాలా జాగ్రత్తగా అన్ని చోట్లా కన్నేసి ఉంచుతున్నారు. అల్లరి మూకలు చెలరేగి పోకుండా ఉండేందుకు వారు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాదాపు అప్రకటిత 144 సెక్షన్ నడిచే అవకాశముందని తెలుస్తోంది. ధియోటర్స్ వద్ద కూడా పెద్ద హంగామా జరపకూడదని ధియోటర్స్ ఓనర్స్ ప్రత్యేకంగా చెప్పినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే వంగవీటి రంగా వర్గీయులు ఈ చిత్రంలో తమ కాపు కులాన్ని తక్కువ చేసి చూపెట్టినా,రంగాని సరిగ్గా చూపకపోయినా ఫలితాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మరో వర్గం అయితే ఆ చిత్రంలో తమ వారిని బాగా చూపెట్టారని బ్యానర్స్ కట్టి మరీ సంతోషం వెల్లబుచ్చుతోంది. ఈ గొడవలు ఎక్కడికి దారి తీస్తాయో అని అంతా భయం భయం గా చూస్తున్నారు.

ప్రొద్దుటూరు కోర్టుకు నిర్మాత సింగనమల రమేష్‌

పలు క్రిమినల్, చెక్‌బౌన్స్ కేసులకు సంబంధించి తెలుగు చలనచిత్ర నిర్మాత సింగనమల రమేష్‌  కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టుకు హజరయ్యారు. హైదరాబాదు నుంచి బందోబస్తుతో ప్రొద్దుటూరు వచ్చి ఒకటో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. రమేష్‌కు వడ్డీకి డబ్బులిచ్చామని, ఆ డబ్బులు ఇవ్వాలని కోరినపుడు బెదిరించాడని ప్రొద్దుటూరుకు చెందిన కొంత మంది ఫిర్యాదు చేశారు. తనకు భాను, మద్దెలచెర్వు సూరి తెలుసునని, బాకీ ఇవ్వాలని అడిగితే వారి చేత చంపిస్తానని బెదిరించాడంటూ రుణదాతలు ప్రొద్దుటూరు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సింగనమల రమేష్‌పై ఫిర్యాదు చేశారు.ఈ మేరకు అతనిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. క్రైం నెంబర్ 146/11, 147/11, 148/11, 151/11లకు సంబంధించి, అలాగే పలు చెక్‌బౌన్స్ కేసుల్లో విచారణ పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపర్చిన తర్వాత తిరిగి హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు

ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు నోటీసులు !!

ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా.. సాక్షులను భయాందోళనలకు గురిచేసేలా తప్పుడు కథనాలను ప్రచురిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను కట్టడి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. పరిశోధనాత్మక జర్నలిజం పేరుతో సాక్షుల వాంగ్మూలాలంటూ దర్యాప్తును తప్పుదోవ పట్టించే కథనాలను ప్రచురిస్తున్నారన్న ఆరోపణలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలకు హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ చేసిన ఆరోపణలకు సీబీఐ హైకోర్టుకు వివరణ ఇచ్చుకుంది. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను తామెవ్వరికీ లీక్ చేయటం లేదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. దీనిపై సంతృప్తి చెందని న్యాయమూర్తి.. పిటిషనర్ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని సీబీఐకి స్పష్టం చేశారు. సీబీఐ తన దర్యాప్తు వివరాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు లీక్ చేస్తోందని, సిటింగ్ జడ్జి లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఎమ్మార్ హిల్స్ ప్లాట్ కొనుగోలుదారు కె.రఘురామకృష్ణరాజు గత వారం హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పి.మునికృష్ణారెడ్డి వాదనలను వినిపిస్తూ.. ఎమ్మార్ వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పట్ల ప్రజల్లో ద్వేషభావం కలిగేలా.. సీబీఐ జాయింట్ డెరైక్టర్, అతని సహచరులు దర్యాప్తునకు సంబంధించి అతి సున్నితమైన అంశాలను ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు చేరవేస్తున్నారని తెలిపారు. చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసిన తన క్లయింటు లాంటి కొనుగోలుదారులను నేరస్తులుగా చిత్రీకరించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని కోర్టుకు నివేదించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు సాక్షుల వాంగ్మూలాలు, వారి ప్రకటనలు, నేరాంగీకారాలు తదితర అంశాలను యథాతథంగా ప్రచురిస్తూ.. సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలు జర్నలిజం విలువలను కాలరాసి, అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయని వివరించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ఇప్పటి వరకు ప్రచురించిన తప్పుడు కథనాలను సీబీఐ అధికారులు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఖండించలేదని.. తద్వారా సీబీఐ అధికారులే కీలక సమాచారాన్ని ఆ రెండు పత్రికలకు లీక్ చేస్తున్నారని అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ సమయంలో సీబీఐ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదని, తాము ఎవ్వరికీ ఎటువంటి సమాచారాన్ని లీక్ చేయలేదని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలకు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డెరైక్టర్, సీబీఐ జాయింట్ డెరైక్టర్, ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్స్ ప్రయివేట్ లిమిటెడ్ తదితరులకు నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచాలని సీబీఐ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. 

రేపు ముంబయి నగరంలో టీటీడీ సమాచార కేంద్రం ప్రారంభం

ముంబయి నగరంలోని సైమాన్ ఏరియాలో గురువారం టీటీడీ సమాచార కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. శ్రీవారి భక్తులకు కోరిన సమాచారాన్ని అందించేందుకు అత్యాధునిక సమాచార వ్యవస్థ, మౌలిక సదుపాయాలతో ఈ సమాచార కేంద్రాన్ని నెలకొల్పారు. గురువారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ పాటిల్ చేతుల మీదుగా ఈ సమాచార కేంద్రం ప్రారంభమవుతుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఆర్‌వై.గైక్వాడ్, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్‌వీ.సుబ్రమణ్యం, పాలక మండలి సభ్యులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారని టీటీడీ పేర్కొంది

Tuesday, 29 November 2011

తిరుచానూరు పద్మావతి అమ్మవారికి భక్తులు పోటెత్తారు

తిరుచానూరు పద్మావతి అమ్మవారికి మంగళవారం జరిగిన పంచమితీర్థం ఉత్సవానికి భక్తులు పోటెత్తారు. పద్మసరోవరం, పరిసరాల్లో ఎటు చూసినా భక్తులతో నిండిపోయింది. అశేష భక్తజనావళి ఆనందోత్సాహాలు, గోవిందనామస్మరణ మధ్య ఈ వేడుక జరిగింది. కార్తీక మాసం శుక్లపక్షంలో పంచమి తిథి తిధి రోజున పద్మసరోవరంలో అమ్మవారు ఉద్భవించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఆ ప్రకారం.. అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు జరగడం ఆనవాయితీ. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి నిత్య పూజలు నిర్వహించారు. 8 గంటలకు అమ్మవారిని, చక్రతాళ్వార్ ను బంగారు తిరుచ్చిపై తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకొచ్చి మంటపంలో కొలువుదీర్చారు. తిరుమల నుంచి గజరాజులపై ఊరేగింపుగా సారె (పట్టు వస్త్రాలు, స్వర్ణాభరణాలు, పసుపు, కుంకుమ, చందనం) తీసుకొచ్చారు. వీటితో అమ్మవారి ఉత్సవమూర్తికి, చక్రతాళ్వార్‌కు స్నపన తిరుమంజనం నిర్వహించారు. అనంతరం భక్తకోటి గోవింద నామస్మరణల మధ్య కుంభలగ్నంలో 12.48 గంటలకు చక్రతాళ్వార్ పంచమితీర్థం నిర్వహించారు.

హరికృష్ణను చంద్రబాబు కార్నర్ చేసినట్లేనా?

బెజవాడ రాజకీయ వేడిలో దూకుడుగా వ్యవహరించి చంద్రబాబుకు హరికృష్ణ సవాల్ విసిరారు. తనకు తోడుగా పార్టీ నాయకులు వల్లభనేని వంశీకృష్ణ, కొడాలి నాని ఉన్నారని అనుకున్నారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన దేవినేని ఉమామహేశ్వర రావుపై వారి చేత తిరుగుబాటు చేయించారు. కాస్తా రాజకీయం రంజుగా సాగుతుండగానే చంద్రబాబు తన చాణక్యనీతిని ప్రదర్శించి, సీన్‌ను తిరిగేశారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ వెనక్కి తగ్గి, చంద్రబాబు ఆదేశాలకు తలొగ్గారు. అయితే, ఆ తర్వాతనైనా హరికృష్ణ పరిస్థితి చక్కబడిందా అంటే లేదనే చెప్పాల్సి వస్తుంది. దాదాపుగా హరికృష్ణను చంద్రబాబు కార్నర్ చేసినట్లే కనిపిస్తోంది. హరికృష్ణ ఆది, సోమవారాల్లో విజయవాడలో ఉన్నారు. కొన్ని ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన విజయవాడలో ఉన్నారు. ఆయనను తెలుగుదేశం నాయకులు పట్టించుకున్న పాపాన పోలేదు. దేవినేని ఉమా మహేశ్వర రావు సరేసరి, తనకు అత్యంత ఆప్తులని భావించిన వల్లభనేని వంశీ, కొడాలి నానీల అడ్రస్ కూడా లేకుండా పోయింది. గతంలో కృష్ణా జిల్లా పర్యటనకు వచ్చిన హరికృష్ణను పట్టించుకోలేదనే నెపంతోనే వంశీ, కొడాలి నానీ ఉమామహేశ్వరరావుపై సమరానికి సిద్ధపడ్డారు. ఇప్పుడు సమరానికి సమాయత్తం కావడం మాట అటుంచి, వారే హరికృష్ణ పక్కన నిలబడలేని స్థితి వచ్చేసింది. దీంతో హరికృష్ణను చంద్రబాబు కార్నర్ చేశారని అనుకుంటున్నారు. మళ్లీ తన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ ద్వారా హరికృష్ణ విజృంభిస్తాడా, చూడాల్సిందే.

త్వరలో బాలీవుడ్ తెరపై మహేంద్ర సింగ్ ధోని?

మహేంద్ర సింగ్ ధోని త్వరలో బాలీవుడ్ తెరపై మెరవబోతున్నాడు. బాలీవుడ్ దర్శకుడు డేవిడ్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ‘హుక్ యా క్రూక్ ’ సినిమాలో బాలీవుడ్ హీరో జాన్ అబ్రహంతో కలిసి ధోనీ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం. ఇందు కోసం ఇప్పటికే ధోనీ వద్ద డేట్స్ తీసుకున్నారని, ధోనీ ఇందులో ముఖ్యమైన అతిపాత్రలో ధోనీ కనిపించనున్నాడని తెలుస్తోంది. సత్తా ఉన్న క్రికెటర్ గా, సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా దూసుకెలుతున్న ధోనీ....ఇప్పటికే వాణిజ్య ప్రకటనల్లో నటిస్తూ తన హవా కొనసాగిస్తున్నాడు. తాజాగా బాలీవుడ్ ఎంట్రీతో ఒకే సారి మూడు రంగాల్లో రాణిస్తున్న వ్యక్తిగా ధోనీ రికార్డులకు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. కనుక సక్సెస్ అయితే ఆయకు అవకాశాలు కుప్పలు తెప్పలుగా వచ్చి పడటం ఖాయం. ప్రస్తుతం ధోనీ సంపాదన సంవత్సనికి వందల కోట్లలోనే. వాణిజ్య ప్రకటనల్లో నటించడం ద్వారానే ధోనీ ప్రపంచంలోనే అత్యంత ఎక్కవ ఆదాయం గల టాప్ టెన్ ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. ఇక బాలీవుడ్ లోనూ క్లిక్ అయితే ధోనీ ఎవరికీ అందనంత ఎత్తుకు వెళ్లి పోతాడేమో..?

జనవరి 30న విఆర్ ఓ, విఆర్ ఏ పరీక్షలు

జనవరి 30న విఆర్ ఓ, విఆర్ ఏ పరీక్షలు నిర్వహించనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి రఘువీరా రెడ్డి చెప్పారు. ఉదయం విఆర్ ఓ, మధ్యాహ్నం విఆర్ ఏ పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు దరఖాస్తు ఖరీదు 200 రూపాయలు. ఎస్ సి, ఎస్టీలకు వంద రూపాయలు. ఈ పరీక్షల ద్వారా 1172 విఆర్ ఓ పోస్టులు, 6063 విఆర్ఏ పోస్టులు భర్తీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలలో వయోపరిమితి సడలింపుపై రేపు జరిగే మంత్రి మండలి సమావేశంలో చర్చిస్తామని మంత్రి చెప్పారు.

పెరిగిన గ్రూప్-1 పోస్టుల సంఖ్య

గ్రూప్-1 పోస్టులను మరో 41 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంటూ ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. గ్రూప్-1 సంబంధించి 263 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ తాజాగా మరో 39 ఎంపీడీవోలు, 2 డిఎస్పీ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో గ్రూప్-1 పోస్టుల సంఖ్య 304కు పెరిగింది. గ్రూప్-1 పరీక్షకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 19 విభాగాల్లో 263 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 27న ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్ 3న మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని బోర్డు తెలిపింది. డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు బోర్డు ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.

కర్నూలు జిల్లా కప్పట్రాళ్లలో ఉద్రిక్తత

జిల్లాలో మళ్లీ ఫ్యాక్షన్ అలజడి మొదలైంది. కప్పట్రాళ్లలో వెంకటప్పనాయుడు ఇంటిపై మద్దిలేటి వర్గీయులు దాడి చేశారు. ఈ విషయం తెలిసి పోలీసులు గ్రామానికి చేరుకున్నారు. కప్పట్రాళ్లలో ఉద్రికత నెలకొంది దేవనకొండ మండలపరిధిలోని ఫ్యాక్షన్ గ్రామమైన కప్పట్రాళ్లగ్రామాన్ని   కప్పట్రాళ్ల వెంకటప్పనాయుడి అన్న కుమారుడు పరప్ప నాయుడుపై ప్రత్యర్థులు దాడికి పాల్పడినందున వారి స్వగ్రామమైన కప్పట్రాళ్ల గ్రామాన్ని డిఎస్పీ సందర్శించి అక్కడ పరిస్థితిని ఆయన స్వయంగా పరిశీలించారు. వెంకటప్పనాయుడు, పరప్ప నాయుడు, మద్దిలేటి నాయుడు ఇండ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఎవరు హత్యలకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరూ ప్రశాంతంగా ఉండాలని డిఎస్పీ తెలియజేశారు. గ్రామంలో ప్రజలందరూ పొలం పనులకు వెళ్లడం వలన గ్రామ వీధులన్ని నిర్మాణుషంగా మారాయని చెప్పారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అదనపు పోలీసులను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు.  ఐదుమంది ఎపిఎస్‌పి పోలీసులు, నల్గురు సివిల్ పోలీసులను గ్రామంలో బందోబస్తుగా ఏర్పాటు చేసినట్లు డిఎస్పీ  తెలియజేశారు.

చరణ్ తేజ్-ఉపాసన డిసెంబర్ 1న నిశ్చితార్థం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్-ఉపాసన కామినేని నిశ్చితార్థం డిసెంబర్ 1న జరుగనున్న విషయం తెలిసిందే. అయితే నిశ్చితార్థ వేడుక ఎక్కడ జరుగుతుందనే విషయమై ఇప్పటి వరకు సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. నిన్నమొన్నటి వరకు ఈ వేడుక దోమకొండ కోటలో అని ఒకసారి, గోల్కొండ రిసార్ట్స్ లో జరుగుతుందని మరొక సారి ప్రచారం జరిగింది. అయితే అది వాస్తవం కాదని తాజాగా మంగళవారం మెగాకుటుంబ సన్నిహితుల నుంచి అందిన సమాచారం.మొయినాబాద్ మండలం, చిలుకూరు బాలాజీ టెంపుల్ రోడ్డులో ఉన్న ఫామ్‌హౌస్‌లో జరగనున్న ఈ నిశ్చితార్ధానికి ఇరు కుంటుంబాలకు చెందిన అత్యంత సన్నిహితులు, బం«ధువులు మాత్రమే పాల్గొంటారని సమాచారం.

Monday, 28 November 2011

ఎడ్లబండి ఎక్కిన వైయస్ జగన్‌

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ గుంటూరు జిల్లా ఓదార్పు యాత్రలో ప్రజలను ఆకర్షించే పనికి పూనుకున్నారు. ఆయన పాలమర్రు గ్రామంలో ఎడ్ల బండిపై ఎక్కి సవారీ చేశారు. ఓదార్పు యాత్రలో భాగంగా ఆయన సోమవారం సాయంత్రం ఆ గ్రామానికి చేరుకున్నారు. అక్కడ ఎడ్లబండి ఎక్కిన వైయస్ జగన్‌ను చూడడానికి పెద్దయెత్తునే ప్రజలు వచ్చారు. గుంటూరు జిల్లాలో ఆయన రెండ విడత ఓదార్పు యాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
అంతకు ముందు తన ఓదార్పు యాత్రలో ఆయన ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పత్రి రైతులకు గిట్టుబాటు ధర దక్కడం లేదని ఆయన అన్నారు. పత్తి పంట దిగుబడి 15 క్వింటాళ్ల వరకు ఉండేదని, ఇప్పుడు విద్యుత్ లేకపోవడం వల్ల నాలుగు క్వింటాళ్లు కూడా వచ్చే పరిస్థితి లేదని ఆయన అన్నారు. గత వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం 6 వేల రూపాయల గిట్టుబాటు ధర కల్పిస్తే రాష్ట్ర ప్రభుత్వం 3 వేల 600 రూపాయలతో సరిపెడుతోందని ఆయన అన్నారు. ప్రస్తుత పరిస్థితిలో గ్రామీణ ఆర్థిక పరిస్థితి సరిగా లేదని, అయినా పట్టించుకునే వారే లేరని ఆయన అన్నారు  

ఓబుళాపురం గనుల కేసులో ఐ.ఎ.ఎస్. శ్రీలక్ష్మి అరెస్టు

ఓబుళాపురం గనుల వ్యవహారంలో గనుల శాఖ కార్యదర్శిగా పనిచేసిన ఐ.ఎ.ఎస్. అధికారిణి శ్రీలక్ష్మిని సోమవారంనాడు ఆమె కార్యాలయంలోనే సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. ఆమెను సోమవారం సాయంత్రమే నాంపల్లిలోని మెట్రోపాలిటన్ కోర్టులో హాజరు పరచగా, మంగళవారం ఉదయం ఆమెను సి.బి.ఐ. కోర్టులో హాజరు పరచవలసిందిగా మేజిస్ట్రేటు ఆదేశించారు

కర్నూలు జిల్లాలో మరో ఫ్యాక్షన్ హత్య

కర్నూలు జిల్లాలో మరో ఫ్యాక్షన్ హత్య జరిగింది. తుగ్గలి మండలం కనుమకుంట్లలో కాంగ్రెస్ నేత అనిమిరెడ్డి సోమవారం ఉదయం దారుణ హత్యకు గురయ్యాడు. ప్రత్యర్థులు వేట కొడవళ్లతో దాడి చేసి దారుణంగా నరికి చంపారు. మృతుడు ఓ హత్యకేసులో నిందితుడు. పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు

గ్రూప్-1 పరీక్షకు నోటిఫికేషన్ విడుదల

గ్రూప్-1 పరీక్షకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్‌సీ) సోమవారం నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 19 విభాగాల్లో 263 పోస్టుల భర్తీకి ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.మే 27న ప్రిలిమినరీ పరీక్ష, అక్టోబర్ 3న మెయిన్స్ పరీక్షలు జరుగుతాయని బోర్డు తెలిపింది. డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు బోర్డు ప్రకటనలో పేర్కొంది

'ఈనాడు'ను ఏకిపారేసిన 'ఆంధ్రభూమి'

పెట్టుబడికి కట్టుకథకు
పుట్టిన విషపుత్రిక
-అంటూ సంసారపక్షపు నడిపాత ఆంధ్రపత్రికనే చడామడా దులిపాడు శ్రీశ్రీ! కూడబలుక్కున్నట్టు చెలరేగి తెలుగు జనానికి పిచ్చెత్తేలా బుద్ధి శుద్ధి చేస్తున్న గొప్ప పత్రికల దూకుడును ఈ కాలంలో చూసి ఉంటే మైకం ఠక్కున దిగి మహాకవి ఏమి చేసేవాడో! ఏమి రాసేవాడో!!
ప్రపంచం ఎంతో ముందుకు పోయినా, జర్నలిజం గురించి మన అవగాహన మాత్రం తాతలకాలం దగ్గరే ఆగిపోయింది. ఇది చాలా బోలెడు ఘోరం. కాకి బంగారపు దీపాల్లా ధగధగ వెలుగుతున్న రాజా పత్రికలను చూసైనా నిక్కమైన పత్రికా రచన అంటే ఏమిటో, ఎలా ఉండాలో తెలుసుకోవటం ప్రతి తెలుగువాడి తక్షణ కర్తవ్యం.
ఉదాహరణకు - ప్రజలకు దారి చూపాల్సిన పత్రికను నడిపే వాడికి కొంచెం నీతి, కాస్త నిజాయతి, రవంత వృత్తి నిబద్ధత, ఆవగింజలో వెయ్యోవంతు నిష్పాక్షికత, సత్యసంధత ఉంటాయని, ఉండాలని మనం చాదస్తంగా అనుకుంటున్నాం.
తప్పు! పత్రికను నడిపించేవాడికి కనీసం కిరోసిన్‌ను స్మగ్లింగ్ చేసిన లోకోత్తర పూర్వానుభవమైనా ఉండి ఉండాలి. వెధవది కిరసనాయిలునే సరిహద్దు దాటించి వేరే రాష్ట్రానికి చేరవేయలేనివాడు ప్రజాప్రయోజనాలను సమస్యలు దాటించి సురక్షిత గమ్యానికి ఎలా చేరవేయగలడు?
అలాగే - పాచినోటితో లోకానికి నీతులు ఉపదేశించే పత్రికాధిపతికి కనీసం ఒక పొలిటికల్ పార్టీలో పాలేరుగా పనిచేసి, ఓ మహానేతాశ్రీ పనుపున డబ్బు మూటలు బట్వాడా చేసిన పావన చరిత్ర ఉంటే మంచిది. మొన్నటిదాకా పూటకు ఠికానాలేని వాడివి ఏకంగా పెద్ద పత్రికనే ఎలా కొట్టెయ్యగలిగావంటే గాండ్రించి, డబాయించి, మీదపడి కరిచి నోళ్లు మూయించగల సత్తా ఉండటం బెటరు. తనకు ఏమీ తెలియకపోయినా అన్నీ తెలిసినట్టు నడమంత్రపు సిరితో కంపరం పుట్టేలా మిడిసిపడి, పెద్దంతరం చిన్నంతరం లేకుండా ఎంతటి వాళ్లన్నయినా గడ్డిపరకల్లా తీసిపారేసి, లక్షలమందికి ఆరాధ్యులైన వారి మీద కూడా గిట్టనివారి పురమాయింపుపై అభాండాల బండలు రువ్వగలిగిన గొప్ప సంస్కారం ఎంత ఉంటే అంత మేలు.
అదే మాదిరిగా - పత్రికారంగాన్ని ఉద్ధరించేందుకే భూమి మీద అవతారమెత్తిన మహానుభావుడికి కనీసం తనది కాని భూమిని దర్జాగా కబ్జా చేసి, రామప్పంతులులా కేసులు బనాయించి, అసలు హక్కుదారులను బతికినంతకాలం ఏడిపించి, ఉసురు పోసుకోగలిగినంత మంచితనమైనా కంపల్సరీ! ఎన్నివేల ఎకరాలను ఎంత అప్పనంగా కాజేస్తే, ఎన్ని కంపెనీలు పెట్టి ఎన్ని నిబంధనల నడ్డి విరగ్గొట్టి ఎన్ని అక్రమాలకు పాల్పడితే... ఊసరవెల్లికి సిగ్గొచ్చేలా సమయానికి తగ్గట్టు ఎన్ని రంగులు మారిస్తే అంత పేరు! అంత పొగరు!!
గోబెల్స్, గోబెల్స్ అని అందరూ తెగ అంటారు కాని గోబెల్స్ గాడిది ఏమి గొప్ప? ఒక అబద్ధం పదేపదే చెబితే నిజమైపోతుందని కనిపెట్టటమే కదా అతగాడు ఊడబొడిచిందల్లా?! అదే మన పుణ్యఫలం కొద్దీ మన పాలబడ్డ పత్రికారాజాలను చూడండి. నిజాన్ని తిరగవేసి అబద్ధంగా, అబద్ధాన్ని మరగవేసి నికార్సయిన నిజంగా చూపించి... గోరంతను కొండంతగా, కొండంతను గోరంతగా అవసరాన్నిబట్టి, ఆయా వ్యక్తులనుబట్టి, వారి మీద తమ ఇష్టానిష్టాలనుబట్టి, కులదైవాల ప్రయోజనాలనుబట్టి, పక్కా వ్యాపార స్వార్థాలనుబట్టి ఎలా తారుమారుగా తిమ్మినిబమ్మి చేసెయ్య వచ్చో తెలుగు పత్రికా మణిదీపాలను చూసే ఎవరైనా నేర్చుకోవాలి!
మాటవరసకు - ఉషోదయంతో అసత్యం నినదించుగాక అని శపథం పట్టిన నీతుల మారి పెద్ద పత్రిక ఒకానొక గాలిరెడ్డి అవినీతి గనుల్ని కూలీ అడక్కుండా కష్టపడి, కళ్లు తిరిగేలా తవ్విపోసింది. ఫలానా గనుల్లో ఎన్ని వేల కోట్లు గోల్‌మాల్ అయిందీ కచ్చితంగా కాకుల లెక్క గట్టి వెరిజనాన్ని ఔరా అనిపించింది. నాలుగు రోజుల తరవాత మళ్లీ అదే నోటితో, అంతే నేర్పుతో... సదరు గనుల ఖనిజం బహు నాసిరకమని, దాని పేరు చెప్పుకుని వేరే రాష్ట్రంలో ఇంకెక్కడో తవ్వకాలు జరిగాయనీ కొత్త కథను అల్లింది. ఔను మరి! ఎప్పుడూ ఒకే కథ అయితే చదివేవాళ్లకు బోరు కదా?!
జగన్ అనే పరమపాపికి ఫలానా అధికారులు నోటీసు ఇచ్చారని సంబరంగా రాసే పత్రిక... అదే పరిస్థితి తమ అభిమాన నాయకుడికి ఎదురైతే ‘‘ఏదో లేఖ రాసారంతే’’ అని తక్కువ చేసేస్తుంది.
పుణ్యాత్ముడు బాబు మీద తస్మదీయుల కేసు అయితేనేమో ‘‘వై.ఎస్. విజయ పిటీషన్ విచారణకు స్వీకరణ’’ అని చప్పగా చెప్పే మేటి పత్రిక అదే తాము పగబట్టిన పాపాత్ముడిపై అస్మదీయుల కేసులో అలాంటి నిర్ణయమే వస్తే ‘‘సిబిఐ బోనులో జగన్’’ అని ఉత్సాహంగా ఉరకలేస్తుంది. తాము పగబట్టిన వాడికి ఎమ్మెల్యేలు జై కొట్టినా, మిడిమేలపు మీడియాకు అది చీకొట్టినట్టే వినపడుతుంది.
పాపిష్టి విరోధి ఢిల్లీకి వెళితే అక్కడి పెద్దల కాళ్లావేళ్లా పడి దేబిరించినట్టు!
మహారాజశ్రీ బాబుగారు అలాంటి టూరే చేస్తేనేమో జాతీయ నాయకులతో భేటీ వేసినట్టు!
మన వాళ్ల మీద దృష్టి పెడితే అది ‘కాంగ్రెసు బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్’!
అదే మన పగవాళ్లమీద కన్ను వేస్తేనేమో అది నిప్పులాంటి నిష్ఠాగరిష్ఠ దర్యాప్తు సంస్థ. ఇలా ప్లేటు మారుస్తారేమిటంటే - హైకోర్టు ఆర్డరు ప్రకారం దర్యాపు కాబట్టి వంకలేదని వింత వివరణ! ‘తమరు కళ్లకద్దుకుంటున్న ఆర్డరును ప్రసాదించిన వారికి వేరేదో పెద్ద కుర్చీ దక్కిందట కదా’ అని మనం అడగాకూడదు. వారు విననూ కూడదు!
సిబిఐ కచేరీ తమ సొంత టీవీ స్టూడియో అయినట్టు, సర్కారీ పత్తేదారులు తమ కొలువులోని యాంకర్లు అయినట్టు, అక్కడ ఎవరిని ఏమి అడిగేదీ, ఎవరు ఏమి చెప్పేదీ, తరవాత ఏమి జరగబోయేదీ కెమెరాలు పెట్టి ప్రత్యక్ష ప్రసారం చేయిస్తున్నట్టు అమాయక జనానికి చెవిలో పూలు పెట్టటం తెలుగు మీడియా మోతుబరుల ప్రత్యేకత! ముఖ్యమంత్రి మహాశయుడు ఎక్కడికి వెళ్లినా ఎదురయ్యే నిరసన నినాదాలను జయజయ ధ్వానాలుగా చిత్రించి... ప్రతిపక్ష మహానాయకుడితో భుజం కలిపి ఏలినవారి పల్లకి మోసి తరించే మీడియాను వీక్షించటం మన పూర్వజన్మ సుకృతం. శత్రువును పాతరెయ్యటం కోసం ఎంతకైనా బరితెగించి, ఎన్ని నిలువుల లోతైనా నిజాన్ని పాతిపెట్టగలగటమే ఈ కాలపు పత్రికా ధర్మం!

రఘువీరాకు లోకాయుక్త పిలుపు!

మేఘమథనంలో అవినీతికి పాల్పడ్డారంటూ వచ్చిన ఆరోపణలపై మంత్రి రఘువీరారెడ్డిని తన ఎదుట హాజరు కావాలని లోకాయుక్త ఆదేశించింది. డిసెంబర్ 23న దీనిపై విచారణ జరుగుతుందంటూ నోటీసులు జారీ చేసింది. మేఘ మథనంలో రఘువీరా అవినీతికి పాల్పడ్డారంటూ.. అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన టీడీపీ నేత నారాయణ స్వామి అక్టోబర్ 27న లోకాయుక్తకు ఫిర్యాదు చేశారు. మేఘమథనం ద్వారా రూ.200కోట్ల వరకు దుర్వినియోగం చేశారని, అందులో రూ.70 కోట్ల దాకా మంత్రికి ముట్టిందని నారాయణస్వామి ఆరోపించారు. దీనిపై లోకాయుక్త స్పందించింది. డిసెంబర్ 23న హాజరుకావాలని రఘువీరారెడ్డికి లోకాయుక్త నోటీసు పంపిందని నారాయణ స్వామి, టీడీపీ అనంతపురం జిల్లా ప్రధానకార్యదర్శి వరదాపురం సూరి ఆదివారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మంత్రి అవినీతికి సంబంధించిన ఆధారాలతో తాము లోకాయుక్త ముందు హాజరవుతామని వారు చెప్పారు. అక్కడ న్యాయం జరగని పక్షంలో హైకోర్టుకు, అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తామన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో కేవలం రూ.15 కోట్లు మేఘ మథనానికి ఖర్చుచేశామని పేర్కొన్నారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి రఘువీరారెడ్డి కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేశారని ఆరోపించారు.