Thursday, 22 December 2011

ప్రజారాజ్యం పార్టీ పునరుద్ధరణ ఉండదు...జెసి దివాకర్ రెడ్డి స్పష్టీకరణ

మెగాస్టార్ చిరంజీవి నాయకత్వంలోని ప్రజారాజ్యం పార్టీ పునరుద్ధరణ ఉండబోదని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి అన్నారు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమని, ప్రజారాజ్యం పార్టీ పునరుద్ధరణ ఉండవచ్చునని ఆ పార్టీ శానససభ్యుడు శ్రీధర్ కృష్ణా రెడ్డి చేసిన వ్యాఖ్యపై ఆయన గురువారం మీడియా ప్రతినిధుల వద్ద ప్రతిస్పందించారు. తెలిసో తెలియకో కొంత మంది ప్రజారాజ్యం పార్టీ పునరుద్ధరణ గురించి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. సందర్భాన్ని బట్టి చిరంజీవి వర్గానికి పదవులు ఉంటాయని ఆయన చెప్పారు. ఉప ఎన్నికల్లో అభ్యర్థిని బట్టే జయాపజయాలు ఆధారపడి ఉంటాయని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో జిల్లా మంత్రులే ప్రచారం చేయాలని, ఇతర మంత్రులు ప్రచారం చేయడం వల్ల లాభం లేదని ఆయన అన్నారు. ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రచారం చేయాలని ఆయన అన్నారు. రాష్ట్రంలోని దాదాపు 26 స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే పరిస్థితి ఉంది. ఇది మినీ సాధారణ ఎన్నికలను తలపించే అవకాశం ఉంది.

తిరుపతి క్షేత్రంలో అందాల పోటీలు నిషేధించాలి...బిజెవైఎం డిమాండ్

తిరుపతి ఒక అధ్యాత్మిక క్షేత్రమని అలాంటి పుణ్యక్షేత్రంలో ఒక ప్రైవేటు సంస్థ అందాల పోటీలు నిర్వహించడానికి తెగపడడాన్ని ప్రతి ఒక్కరు ఖండించి అందాల పోటీలను నిషేధించాలని బిజెవైఎం డిమాండ్ చేశారు. తిరుపతి పవిత్రత కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. అలాంటి ప్రదేశంలో ప్రైవేటు సంస్థ జనవరిలో మిస్ తిరుపతి, మిసెస్ తిరుపతి పోటీలను నిర్వహిస్తామని బహిరంగ ప్రకటన చేసే సాహసం చేసిందన్నారు. భారతీయ మహిళలను వ్యాపార అభివృద్ధికి ఒక పావుగా వాడుకోవడాన్ని భారతీయ జనతా యువమోర్చా సహించబోదన్నారు. మహిళలను ఆకర్షించుకోవడానికి బహుమతులను ఎరగా వేస్తున్నారని, ఇది మరింత దారుణమన్నారు. ఇది భారతీయ సంస్కృతి కాదన్నారు. ఈ పోటీలలో ఏమాత్రం ఆశ్లీలత కనిపించినా భారతీయ జనతా యువమోర్చా అడ్డుకుంటుందని  ఇలాంటి పోటీలు నిర్వహించి యువకులను తప్పుదారి పట్టిస్తున్నారన్నారు. ఇలాంటి పోటీలతో జరిగే లాభాలకన్నా నష్టాలే ఎక్కువని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా వుండగా అందాల పోటీలు నిర్వహించాలని ఆ సంస్థ ప్రకటించిన నేపధ్యంలో ఎన్‌ఎఫ్‌ఎఫ్ ఆధ్వర్యంలో జ్యోతిరావ్ పూలే విగ్రహం ఎదుట ఆ సంస్థ బ్యానర్‌ను, దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. పాశ్చాత్య విష సంస్కృతిని వ్యాపార, లాభార్జనకోసం తిరుపతిలో ప్రవేశపెట్టాలని చూస్తే తాము చూస్తూ ఊరుకోబోన్నారు.

మద్దెలచెరువు సూరి సోదరి గంగుల హేమలత అరెస్ట్

భూవివాదం కేసులో మద్దెలచెరువు సూరి సోదరి గంగుల హేమలతను సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఆమెను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం హేమలతకు రిమాండ్ విధించటంతో చంచలగూడ జైలుకు తరలించారు. మహేశ్వరంలోని ఓ భూవివాదం విషయంలో రియల్టర్ ను ఆమె బెదిరించటంతో పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా మద్దెలచెరువు సూరి జనవరిలో తన ప్రధాన అనుచరుడు భాను చేతిలో హతమైన విషయం తెలిసిందే.

 టి-20 ప్రపంచకప్ అర్హత పోటీలకు 16 జట్లు

వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న ఐసీసీ టి-20 ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధించేందుకు అమెరికా, ఉగాండా సహా మొత్తం 16 జట్లు పోటీపడనున్నాయి. ప్రపంచ కప్‌లో చివరి రెండు స్థానాలు దక్కించుకునేందుకు ఈ జట్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. మార్చి 13 నుంచి 24 వరకు జరిగే ఈ అర్హత పోటీలను దుబాయ్, షార్జాల్లోని ఐదు వేదికల్లో నిర్వహించనున్నారు. జట్ల వివరాలు : గ్రూప్ ఎ: అఫ్ఘానిస్తాన్, నెదర్లాండ్స్, కెనడా, పపూవా న్యూ గినియా, హాంకాంగ్, బెర్ముడా, డెన్మార్క్, నేపాల్. గ్రూప్ బి: ఐర్లాండ్, కెన్యా, స్కాట్లాండ్, నమీబియా, ఉగాండా, ఒమన్, ఇటలీ, అమెరికా.

రాజన్న రివ్యూ


నిజాం పాలన గురించి, తెలంగాణ ఉద్యమం గురించి.. తెలంగాణ వాదులు సినిమాలు తీస్తే ఆశ్చర్యం లేదు. కానీ ఓ అగ్రనటుడు, నిర్మాత.. ప్రముఖ రచయితతో కలిసి రజాకార్ల ఉద్యమ నేపథ్యంలో ఓ కమర్షియల్ సినిమా తీసేందుకు ముందుకొస్తే మాత్రం అది ఆశ్చర్యం కలిగించే అంశం. ఆ సినిమానే రాజన్న. నాగార్జున-విజయేంద్రప్రసాద్-రాజమౌళిల కాంబినేషన్లో వచ్చిన ఈ రాజన్న ఆసక్తి కలిగించే సినిమానే. కానీ అద్భుతమనిపించే చిత్రమైతే కాదు.
స్వాంతత్ర్యం రాకముందు తెల్ల దొరలపై.. ఆపై రజాకార్లపై పోరాడిన యోధుడు రాజన్న. ఈ పోరాటంలో రాజన్న ప్రాణాలు వదులుతాడు. అతని భార్య లచ్చమ్మ (స్నేహ) కూడా చనిపోవడంతో అనాథైన కూతురు మల్లమ్మను ఓ ముసలాయన చేరదీస్తాడు. ఇదంతా పూర్వ కథ. మల్లమ్మ పుట్టడంతో కథ మొదలవుతుంది. మల్లమ్మ పెరిగి పెద్దదవుతూ పాట మీద ప్రేమ పెంచుకుంటుంది. ఆమె ఉండే నేలకొండపల్లి దొరల అధీనంలో ఉంటుంది. దొరసాని (శ్వేతమీనన్)కు రాజన్న వల్ల జరిగిన అవమానం కారణంగా పాటంటే అసహ్యం. తన మాట కాదని పాటలు పాడుతున్న మల్లమ్మను చంపేయబోగా ఆమె సంగీతం మాస్టారు కులకర్ణి (నాజర్) సాయంతో తప్పించుకుంటుంది. అతని మాట విని ఢిల్లీలో ప్రధానిని కలవడానికి బయల్దేరుతుంది. అదే క్రమంలో తన తండ్రి రాజన్న కథ కూడా తెలుసుకుంటుంది. రాజన్న కథేంటి? మల్లమ్మ ప్రధానిని కలిసిందా అన్నది మిగిలిన కథ.
రాజన్న తన పాటతో గ్రామ ప్రజల్లో ఉత్తేజం తెచ్చి, ఉద్యమాన్ని లేవనెత్తే సన్నివేశాలే సినిమాలో ప్రధాన ఆకర్షణ. 20 నిమిషాల పాటు సాగే ఈ ఎపిసోడ్ సినిమాకు ఆయువుపట్టు. వీటిని రాజమౌళే తెరకెక్కించాడు. రాజన్న పాటతో ఉత్తేజితురాలై ముసలమ్మ పోరాడే తీరు, ఆపై పిల్లాడు ఉరికి వచ్చి దొర మనిషిని చంపే వైనం.. ఆపై గ్రామ ప్రజలంతా కలిసి దొర సైన్యాన్ని మట్టుబెట్టే తీరు ప్రేక్షకుల్నీ ఉత్తేజపరుస్తాయి. ఇవే కాదు రాజమౌళి తీసిన యాక్షన్ సన్నివేశాలన్నీ ఆకట్టుకునేలా సాగాయి. దాదాపుగా నాగార్జున కనిపించే సన్నివేశాలన్నింటికీ రాజమౌళే దర్శకత్వం వహించినట్లు అర్థమైపోతుంది. ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాలన్నీ మాస్ ను, యూత్ ను ఆకట్టుకుంటాయి.  ఐతే నిజాం పాలకుల క్రూరత్వాన్ని ప్రతిబింబించేందుకు తీసిన ‘పన్ను’ సన్నివేశం చాలా ఇబ్బందికరంగా ఉంది. అందుకు మరో మార్గాన్ని ఎంచుకుని ఉంటే బావుండేదేమో. తీవ్రత చూపించడానికి మరో మార్గమే లేదా? వాస్తవంగా అలా జరిగి ఉన్నా కూడా అలా తీయాల్సింది కాదు.  రాయడానికి ఇబ్బంది కలిగించే ఈ సన్నివేశాల్ని మహిళలు, పిల్లలు థియేటర్లలో చూడగలరా?
 ఆరంభంలో మల్లమ్మ పాత్ర చుట్టూ నలభై నిమిషాల పాటు సాగే సన్నివేశాల్లో సెంటిమెంట్ ప్రధానంగా నడిచాయి. కొన్ని సన్నివేశాలు కంటతడి పెట్టిస్తాయి. తొలి అరగంటా సినిమా స్వచ్ఛంగా సాగింది. కానీ మల్లమ్మ ప్రధానిని కలవడానికి ఢిల్లీకి బయల్దేరడంతోటే కథ సినిమాటిక్ గా తయారైంది. ఆరేళ్ల పాప నడుచుకుంటూ ఢిల్లీకి వెళ్లిపోవడం టూమచ్. రైలెక్కించి ఉంటే బావుండేదేమో. ఇక యాక్షన్ ప్యాక్డ్ ఫ్లాష్ బ్యాక్ ముగిశాక.. సినిమాను సాదాసీదాగా ముగించిన తీరు కూడా నిరాశ పరుస్తుంది. క్లైమాక్స్ కూడా ఏమాత్రం ఆసక్తి కలిగించలేకపోయింది. కేవలం మల్లమ్మ పాట విని ప్రధాని తెలంగాణ ప్రాంతానికి దొరల నుంచి విముక్తి కలిగించడం అతిశయోక్తిలా అనిపిస్తుంది.
సినిమాకు ప్రధాన బలం కచ్చితంగా కీరవాణి సంగీతమే. సందర్భానుసారంగా గుండెల్ని హద్దుకునే పాటలు, సన్నివేశాలకు చక్కగా సరిపోయే నేపథ్య సంగీతంతో కీరవాణి సినిమాకు ప్రాణం పోశాడు. ముఖ్యంగా బిట్ సాంగ్స్ కథను నడిపించడానికి బాగా ఉపయోగపడ్డాయి. రజాకార్ల నేపథ్యంలో మంచి కథ రాయడంలో, అప్పటి మాండలికాల్ని, మనుషుల ఆహార్యాన్ని తెరమీదకు తేవడంలో విజయేంద్రప్రసాద్ విజయవంతమయ్యాడు. ఆయన దర్శకత్వ ప్రతిభ సెంటిమెంట్ సన్నివేశాల్లో బాగా కనిపించింది. ఐతే యాక్షన్ సన్నివేశాలన్నీ తానే తీసి, తండ్రిని డామినేట్ చేశాడు రాజమౌళి. ఆర్ట్ డైరెక్టర్ అరవై ఏళ్ల కిందటి వాతావరణాన్ని ప్రతిబింబించే వాతావరణాన్ని తేవడంలో బాగానే కృషి చేశాడు. ఫైట్ మాస్టర్లు కూడా అత్యుత్తమ ప్రతిభ చూపారు. మొహమాటం లేకుండా చెప్పాలంటే నాగార్జున రాజన్న పాత్రలో పూర్తిస్థాయిలో రాణించలేకపోయాడు. ఆహార్యం, నటన ఓకే కానీ.. డైలాగ్ డెలివరీలో తేలిపోయాడు. రాజన్న పాత్రకు గంభీరమైన కంఠం అవసరం. కానీ సాఫ్ట్ గా ఉండే నాగార్జున వాయిస్ అందుకు సూటవలేదు. గంభీరమైన డైలాగుల్ని నాగార్జున పలుకుతుంటే ఇబ్బందికరంగా అనిపించింది. స్నేహది పరిమితమైన పాత్ర. సినిమాలో అందరికంటే ఎక్కువ ఆకట్టుకునేది బేబి అనినే. అంత చిన్న వయసులోనూ మల్లమ్మ పాత్రలో అద్భుతంగా నటించి మార్కులు కొట్టేసిందా అమ్మాయి. మల్లమ్మ తాత పాత్ర పోషించిన నటుడు చాలా సహజంగా నటించాడు. మిగతా పాత్రలన్నీ మామూలే.
 తెలంగాణ ప్రజలతో ముడిపడిన కథాంశం కాబట్టి ఈ ప్రాంతంలో రాజన్నకు బాగానే ఆదరణ దక్కే అవకాశముంది. మిగతా ప్రాంతంలో స్పందన తక్కువగా ఉండొచ్చు. తెలంగాణ కథాంశం అన్నది పక్కనబెట్టి ఓ సినిమాగా చూస్తే రాజన్న గుడ్ ఫిలిం. తెలుగులో చారిత్రక కథాంశంతో తీసిన సినిమాల్లో చాలావరకు ఘోరంగా దెబ్బతిన్నవే. ఐతే నాగార్జున, రాజమౌళి, విజయేంద్ర ప్రసాద్ కలిసి చేసిన సిన్సియర్ ఎఫర్ట్ మాత్రం మెచ్చుకోదగ్గదే. కానీ శ్రీరామరాజ్యం లాంటి సినిమాలో కూడా ఎంటర్టైన్మెంట్ కోసం వెతుకుతున్న తెలుగు ప్రేక్షకులు.. సీరియస్ గా సాగే రాజన్నను ఎంతవరకు ఆదరిస్తారన్నది సందేహం. మహరాజ పోషకులైన యువత నుంచి ఎలా స్పందన వస్తుందన్నదాన్ని బట్టే రాజన్న ఫలితం ఆధారపడి ఉంది.

ప్రతి గ్రామంలో ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా...ఆర్‌బిఐ గవర్నర్

 దేశంలోని ఆరు లక్షల ఆవాస ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను పూర్తిస్థాయిలో విస్తరించాల్సి ఉందని, ఇందుకోసం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) గవర్నర్ డాక్టర్ దువ్వూరి సుబ్బారావు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో బుధవారం ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన ఆయన స్థానిక బ్యాంకర్లు ఏర్పాటుచేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మట్లాడుతూ ప్రతి గ్రామంలో, ప్రతి కుటుంబానికి బ్యాంకు ఖాతా ఉండాలన్నదే ఆర్‌బిఐ ధ్యేయమన్నారు. కేవలం ఖాతాలను ప్రారంభించడమే కాక వారికి ప్రభుత్వం నుండి వచ్చే వివిధ రకాల సబ్సిడీలు ఆయా ఖాతాలకు సక్రమంగా జమ అయ్యేవిధంగా చూడటం, రుణాలు, బీమా వంటి సేవలు బ్యాంకు ఖాతాల ద్వారా జరిగేలా చూడాల్సి ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో రెండువేల జనాభా దాటిన 6,600 గ్రామాల్లో బ్యాంకింగ్ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నామన్నారు. రెండు వేల జనాభా దాటిన అన్ని గ్రామాల్లో బిజినెస్ కరస్పాండెంట్లను నియమిస్తున్నామని, వీరివల్ల బ్యాంకింగ్ సేవల అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.ప్రజల ఆహారపుటలవాట్లలో మార్పులు రావడం, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అభివృద్ధి పెరగడం తదితరాలు ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలన్నారు. అలాగే చమురు ధరలు పెరగడం కూడాద్రవ్యోల్బణం పెరగడానికి ఒక ముఖ్య కారణమన్నారు. 2011 ఆగస్టు 5 నుండి రూపాయి మారకం విలువ తగ్గుతూ వస్తోందని, ఇది దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందన్నారు. దిగుమతిదార్లతోపాటు ప్రభుత్వం, బ్యాంకర్లపై కూడా దీని ప్రభావం అధికంగా ఉంటుందన్నారు. రెండో దశ సంస్కరణలు సక్రమ అమలుకు అన్ని బ్యాంకులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఏడాది 7 శాతం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. సమావేశంలో ఆర్‌బిఐ రీజనల్ డైరెక్టర్ ఎఎస్ రావు, జిల్లా కలెక్టర్ ఎం రవిచంద్ర, ఆంధ్రాబ్యాంక్ డిజిఎం ఎవి రామకృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

రైల్వే రిజర్వేషన్ సిస్టమ్‌లో మార్పు

రైల్వేశాఖలో రిజర్వేషన్ సిస్టం మారనున్నది. సికింద్రాబాద్‌లో చేపట్టే అభివృద్ధి పనుల వల్ల అర్ధరాత్రి నుంచి రైల్వేసేవలకు బ్రేక్ పడింది. బుధవారం ఉదయం 7 గంటల వరకు అంతర్జాలంలో ప్రయాణికులు రిజర్వేషన్ చేసుకునే సదుపా యం నిలిచిపోయింది. రాత్రి పది నుంచే ఈ పరిస్థితి ఉంటుందని రైల్వే అధికారులు అంటున్నారు. అంతేగాకుండా రైల్వే రాకపోకల వేళలు, విచారణ సేవలు, పీఎన్‌ఆర్ స్టేటస్ అందుబాటులో ఉం డవు. ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ నిలిపివేయడంతో ఈ పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని రైళ్లకు సంబంధించి చార్ట్‌లను మంగళవారం రాత్రి తీసుకున్నారు. రీఫండ్ కూడా ఇవ్వడానికి వీలుకాదని రైల్వే వర్గాలు చెబుతున్నాయి. ముఖ్య రైల్వేస్టేషన్‌లలో కేవలం యూటీఎస్ (అన్‌రిజర్వ్‌డ్ టికెట్ సిస్టమ్) మాత్రమే పని చేస్తోంది.
పోర్ట్ సదరన్ రైల్వేకి అప్పగింత
దక్షిణమధ్య రైల్వే పీఆర్‌ఎస్ సిస్టమ్‌ను సదరన్‌రైల్వేకి అప్పగిస్తున్నారు. ఈ మేరకు అభివృద్ధి పనులు సౌత్‌సెంట్రల్ రైల్వే చేపడుతోంది. అం దులోనే భాగంగా అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు రిజర్వేషన్ సిస్టమ్‌ను షడౌన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్సీరైల్వే పీఆర్‌ఎస్ సిస్టమ్‌లో లాగిన్ అయ్యి ఎస్‌సీఆర్‌ఎఫ్‌ఈ1తో రిజర్వేషన్ ప్రక్రియను కొనసాగించేవారు. ఇకపై లాగిన్ ఎంఏఎస్‌ఎఫ్‌ఈ1తో ఈ ప్రక్రియను చేపట్టాల్సి వస్తోంది. అంటే చెన్నైతో రిజర్వేషన్ సిస్టమ్ అనుసంధానం చేస్తారు. ఎస్సీరైల్వేపోర్ట్ నుంచి సదరన్ రైల్వేపోర్ట్‌లో విలీనం చేయనున్నారు.

రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత

రోజు రోజుకూ పెరుగుతున్న చలి తీవ్రత ప్రజలను వణికిస్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే అత్యంత కనిష్ట స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కావడంతో తెల్లవారుజామున జనం బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు. తతిమా రుతువులలో మార్నింగ్ వాకింగ్ కోసం వచ్చే జనంతో నగరంలో ఉదయం 4.30 గంటల నుంచే ప్రధాన వీధులు కిటకిటలాడేవి. ప్రస్తుతం 6.30 దాటుతున్నా రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉంటున్నాయి. వాకిళ్లు, కిటికీలు బిగించుకుని ఇంట్లో ఉంటున్నా చలి బాధ తప్పడం లేదని జనం వాపోతున్నారు. ఉదయం ఏడు గంటలు దాటుతున్నా సూర్యోదయం కాకపోవడంతో బాలభానుని నులివెచ్చని కిరణాల కోసం జనం పరితపిస్తున్నారు. నగరంలో కొన్ని పాఠశాలలు ఉదయం 5.30 గంటలకే ట్యూషన్ క్లాసులు ప్రారంభిస్తాయి. చలి దెబ్బకు పిల్లలు రాలేకపోతున్నారని నిర్వాహకులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా చలి బాధిస్తుండడంతో డిసెంబర్ మాసమే ఇలా ఉంటే ఇక జనవరిలో ఎలా ఉంటుందో ఊహించుకుంటూ వణికిపోతున్నారు.దుప్పటి మీద దుప్పటి కప్పుకున్నా వణుకు ఆగడం లేదు.. మోచేతుల మధ్య తల పెట్టుకుని.. కాళ్లు ముడుకుని పడుకున్న పిల్లలు ఉదయం నిద్రలేవడానికి ససేమిరా అంటున్నారు.. స్నానానికి బాత్రూంలోకి తోస్తేగానీ వెళ్లడం లేదు. ఎనిమిది గంటలు అవుతున్నా ఉదయ భానుడు దర్శనమివ్వడం లేదు. పొగలు కక్కుతున్న చాయ్ కూడా గుటుక్కున లోపలికెళుతోంది. మార్నింగ్ వాక్ కాస్తా.. ఈవెనింగ్‌కు జంప్ అవుతోంది. ఒకవేళ తప్పదనుకుంటే స్వెట్టర్లు, మఫ్లర్లు, షూ, గ్లౌజ్‌తో సైనికుల్లా వెళ్లాల్సివస్తోంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే చలి మంటలు వేసుకుని కాచుకుంటారు. అదే నగరాలలో అయితే చలి మంటలు వేసుకోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు 28-30 డిగ్రీల సెల్సియస్ కాగా రాత్రి ఉష్ణోగ్రతలు 14-16 డిగ్రీల సెల్సియస్ నమోదు అవుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశముందని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తున్న నేపథ్యంలో చలి పులి విజృంభణ ఊహించుకుని జనం ఇప్పటి నుంచే ఆందోళన చెందుతున్నారు. గాలిలో తేమ ఉదయం పూట 88-90 శాతం, మధ్యాహ్నం పూట 35-80 శాతం ఉంటోంది. ఆగ్నేయ గాలులు గంటకు 5-8 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వాతావరణ కేంద్రం చెబుతోంది. ఇప్పటికే చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకొని స్వెట్టర్లు, మఫ్లర్లు, ఉన్ని బెడ్‌షీట్లు, ఇయర్‌బ్యాండ్స్, వేజ్‌లైన్ ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇక్కడివారేగాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వెట్టర్లు తీసుకొని వచ్చి అమ్ముకుంటున్నారు. ఒకప్పుడు రూ.200లకు దొరికే స్వెట్టర్లు ఈ రెండు మూడు రోజుల్లో రెట్టింపు ధర పలకడం విశేషం. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతాయని వైద్యులంటున్నారు. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఇబ్బందులు పడక తప్పదని సూచిస్తున్నారు. తెల్లవారుజామున నగరాన్ని మంచు దుప్పటి కప్పేస్తుండడంతో వాహనాల రాకపోకలకు కూడా అంతరాయమేర్పడుతోంది.