తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి ఆస్తులపై హైకోర్టులో పిటిషన్ వేసిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మపై తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్ తీవ్రంగా ధ్వజమెత్తారు. విజయమ్మపై ప్రశ్నల వర్షం కురిపించారు. వైయస్ విజయమ్మను ఆయన మహాభారతంలోని గాంధారితో పోల్చారు. దృతరాష్ట్రుడు, గాంధారి తమ పుత్రుడికి జ్ఞానోదయం కలిగించకుండా వ్యవహరించడం వల్ల కురువంశాన్నే పోగొట్టుకున్నారని, వైయస్ విజయమ్మ, వైయస్ రాజశేఖర రెడ్డి పరిస్థితి కూడా అదేనని ఆయన అన్నారు. విజయమ్మ చేసిన ఆరోపణల్లో ఒక్కటి కూడా నిజం లేదని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రతి ఆరోపణపై తీర్పు ఇప్పటికే వెలువడిందని ఆయన అన్నారు. అబద్ధాలను అల్లడంలో కూడా వైయస్ విజయమ్మ విఫలమయ్యారని ఆయన అన్నారు. సింగపూర్లో హోటల్ ఉందంటూ జతచేసిన ఫొటో ఇంటర్నెట్ నుంచి డౌన్ లోడ్ చేశారని, అదే ఫొటోను తాను కూడా డౌన్ లోడ్ చేశానని, ఆ హోటల్ కట్టినప్పుడు చంద్రబాబు రాజకీయాల్లోకి కూడా రాలేదని ఆయన అన్నారు.
ఆరేళ్లు వైయస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నారని, ఆ ఆరేళ్లు చర్యలు తీసుకోకుండా ఏం చేశారని ఆయన అన్నారు. ఆరేళ్లు చర్యలు తీసుకోలేదంటే వైయస్సార్ చేతకానివాడైనా అయి ఉండాలి లేదా ఆరోపణలు అసత్యాలైనా ఉండాలని అంటూ ఈ రెండింటిలో ఏది నిజమో విజయమ్మ చెప్పగలరా అని ఆయన అడిగారు. చంద్రబాబు బినామీలుగా ఈనాడు రామోజీరావు, మురళీమోహన్, సుజనా చౌదరి, నామా నాగేశ్వరరావు పేర్లను చేర్చడాన్ని ఆయన తప్పు పట్టారు. చంద్రబాబు రాజకీయాల్లోకి రాక ముందే రామోజీ రావు ఈనాడు ఉన్నత స్థాయిలో ఉందని ఆయన చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు జిఎంఆర్, జివికె, రిలయన్స్ లబ్ధి పొందాయని విజయమ్మ ఆరోపించడాన్ని ప్రస్తావిస్తూ ప్రయోజనాలు పొందినవారి పేర్లు చేర్చకుండా ప్రయోజనం పొందనివారి పేర్లను చేర్చారని ఆయన అన్నారు. చంద్రబాబు హయాంలో భూములు కొన్న విధంగానే వైయస్సార్ బంధువులు కూడా పెద్ద యెత్తున భూములు కొన్నారని ఆయన అన్నారు. రాజకీయాల్లోకి రాక ముందే సుజనా చౌదరి, నామా నాగేశ్వర రావు వ్యాపారాలు చేస్తున్నారని ఆయన గుర్తు చేశారు