Tuesday, 27 December 2011

న్యూ జెర్సీలో పరిటాల సునీతకు సత్కారం


అనంతపురం జిల్లాలో మహిళలకు రక్షణ లేని సమయంలో, శాంతి భద్రతలు సరిగా లేని సమయంలో పరిటాల రవి రాజకీయంలోకి వచ్చినట్లు శ్రీమతి సునీత గుర్తు చేశారు. ఈ సందర్భంగా రవి చేసిన అనేక కార్యక్రమాలను గురించి వివరించారు. పెనుకొండలో 5000 మంది పేదలకు వివాహాలు, కల్యాణమండపాలు, కాలేజీలు, విద్యార్థుల కోసం పాఠశాలలు, స్కాలర్‌షిప్‌లు అందజేశారని ఆమె తెలిపారు. ఈ సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగించనున్నట్లు సునీత తెలిపారు. తనకు జరిగిన సత్కారానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పరిటాల రవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా రవి కాంక్షించిన వితరణ కార్యక్రమాలు నిర్వహించదలచినట్టు, అలాగే పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పేదలకు వివాహాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కర్నూలు జిల్లాలో వరద ప్రాంతాలైన నిద్‌జూర్, భావపురం గ్రామాలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు. త్వరలో వృద్ధాశ్రమాన్ని నెలకొల్పనున్నట్లు సునీత తెలిపారు. అలాగే ఫోన్స్, మరియు ఇంటర్‌నెట్ ద్వారా తెలుగు దేశం పార్టీ చేసే సేవలను ప్రజలందరీకీ తెలియజేయడంలో తమవంతు సేవనందించవలసిందిగా సునీత ప్రవాసాం«ద్రులను కోరారు. న్యూజెర్సీలో జరిగిన ఈ సత్కార కార్యక్రమంలో పరిటాల సునీత కుమారులు పరిటాల సిద్ధార్థ, పరిటాల శ్రీరామ్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి దాదాపు 400 మంది హాజరయ్యారు. ముందుగా పరిటాల సునీత జ్యోతి వెలిగించగా, పరిటాల రవి జీవిత చరిత్ర 'అస్తమించిన రవి' డాక్యుమెంటరీతో కార్యక్రమం ప్రారంభమైంది. వెంకట్ గరికపాటి ఈ వేడకను నిర్వహించగా, వంశీ ప్రియ వ్యాఖ్యాతగా వ్యవహరించి తన మధురమైన గానంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాగే చిన్నారులు అద్భుతమైన నృత్యాలను ప్రదర్శించారు. వెంకట్ గరికపాటి మాట్లాడుతూ రాజకీయంలో పరిటాల రవి ప్రతిభను తెలియజేస్తూ పరిటాల శ్రీరామ్‌ను రాజకీయాలలోకి రావాల్సిందిగా ఆహ్వానించారు. డాక్టర్ బాబూరావు దొడ్డపనేని, హరనాథ్ దొడ్డపనేని, సతీష్ వేమన, భక్త భల్ల, లక్ష్మి దేవినేని, మోహన్ కృష్ణ మన్నవ, రాధాకృష్ణ నల్లమల ప్రభృతులు ప్రసంగించారు. పరిటాల రవి ఆత్మశాంతి కోసం సభ ముందుగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించింది. ప్రవాసులను విశేషంగా ఆకర్షించిన ఈ కార్యక్రమంలో డాక్టర్ బాబూరావు దొడ్డపనేని, తానా కోశాధికారి సతీష్ వేమన, తానా ట్రస్టీ నరేన్ కొడాలి, దాము గేదెల, హరనాథ్ దొడ్డపనేని, మోహన్ కృష్ణ మన్నవ (నాటా రీజనల్ కోఆర్టినేటర్), శైలజా అడ్లూరు (టీఏజీడీవీ అధ్యక్షులు), రవి పొట్లూరి (టీఏజీడీవీ కార్యదర్శి) భక్త భల్ల్లా, రమణ గన్నె, రవి పొత్తూరు, లక్ష్మి దేవినేని, పున్నమ్ మంతెన ప్రభృతులు పాల్గొన్నారు,

పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ అభిమానులకు న్యూఇయర్ రోజు గిఫ్టు

2011 సంవత్సరంలో ఒక్క సినిమా కూడా విడుదల చేయకుండా అభిమానులను నిరాశ పరిచిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ న్యూఇయర్ రోజు గిఫ్టుతో అభిమానుల ముందుకు వస్తున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ సంపత్ నంది దర్శకత్వంలో ‘రచ్చ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎలా కనిపించబోతున్నాడనే ఆసక్తి మెగా అభిమానులందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో జనవరి 1న రచ్చ తొలి ట్రైలర్ ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రచ్చ సినిమాపై ఓ మెగా అభిమాని మాట్లాడుతూ ‘‘ రచ్చ సినిమాలో రామ్ చరణ్ న్యూ గెటప్ ను చూడటానికి మేమంతా ఎంతో ఎగ్జైటెడ్ గా ఉన్నాం, న్యూ ఇయర్ రోజు ట్రైలర్ విడుదలైతే దాన్ని మాకు అందిన బహుమతిగా భావిస్తాం’’ అని చెప్పుకొచ్చారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో చెర్రీ మెడికల్ స్టూండెంట్ పాత్ర పోషిస్తున్నారు. చిరంజీవి సినిమాలోని ‘వాన వాన వెల్లువాయే’ పాటను ఈ చిత్రంలో రీమిక్స్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చిలో రచ్చ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మెగా సూపర్ గుడ్ మూవీస్ బ్యానర్ పై ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్ ఈ చిత్రానికి నిర్మాతలు.
 

అన్నా హజారే అవినీతి ఉద్యమం కోసం రజనీకాంత్ ఉచితంగా..రూ. 8లక్షల

అవినీతిపై పోరాటం చేస్తున్న అన్నా హజారే బృందం ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. ముంబైలో దీక్ష చేయడానికి ఎంఎంఆర్‌డి గ్రౌండ్ కు రూ. 8లక్షల అద్దె కట్టే స్తోమత లేక తమ ప్రయత్నాన్ని విరమించుకుంది అన్నా బృందం. అయితే అన్నా అవినీతి పోరాటానికి సూపర్ స్టార్ రజనీ కాంత్ అండగా నిలవడానికి ముందుకు వచ్చారు. చెన్నయ్ లో దీక్ష చేస్తే నగరం నడి ఒడ్డున గల తన రాఘవేంద్ర కళ్యాణ మంటపాన్ని మూడు రోజుల పాటు ఉచితం ఇచ్చేందుకు అంగీకరించారు. భారత అవినీతి వ్యతిరేక కమిటీ మెంబర్ ఎంఎస్. చంద్రమోహన్ ఈ విషయాన్ని మీడియాకు వెల్లడిస్తూ....తమ అభ్యర్థనకు రజనీకాంత్ సానుకూలంగా స్పందించారని, కళ్యాణ మంటపాన్ని దీక్ష కోసం ఉచితంగా ఇచ్చేందుకు అంగీకరించారని వెల్లడించారు. ఇప్పటికే అనేక మందికి అండగా నిలుస్తూ సూపర్ స్టార్ గా ఎదిగిన రజనీకాంత్...తాజాగా అవినీతి కి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటానికి తన వంతు సాయం చేయడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

టిటిడి ఉద్యోగులకు సంస్కృతభాషపై శిక్షణ

ఎక్కడైతే సంస్కృతభాష వృద్ధి చెందుతుందో అక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు కూడా పరిఢవిల్లుతాయని ఆంధ్రా గిర్వాణి విద్యాపీఠం ప్రిన్సిపాల్ బ్రహ్మశ్రీ దోర్భల ప్రభాకర్ శర్మ అన్నారు. టిటిడి ఉద్యోగులకు సంస్కృత భాషపై టిటిడి యాజమాన్యం శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తిరుపతి శే్వతాభవనంలో ప్రారంభించారు. 10 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రభాకర్‌శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని పఠించగల్గిన శక్తి ఒక సంస్కృతభాషకే వుందన్నారు. ఇది మతపరమైన భాషే కాకుండా శాస్తప్రరంగా కూడా ఎంతో ఉత్కృష్టమైనదన్నారు. సంస్కృతభాషను 50 ఏళ్లక్రితమే ఉద్ధరించి వుంటే దేశం మరింత గొప్పగా అభివృద్ధి పథంలో నడిచేదన్నారు. సంస్కృతభాష శబ్ధపరంగాను, రూపపరంగాను, అలంకార పరంగాను ఏపరంగా చూసినా ఎంతో గాంభీర్యమైనదని, ఈగాంభీరతాభావం ఇతర భాషల్లో లేదన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి థార్మిక సంస్థ అయిన టిటిడిలో పనిచేస్తున్న ప్రతిఒక్క ఉద్యోగి భగవంతుని సేవతో పాటు భక్తుల సేవలో కూడా పాల్గొంటున్నారు. అలాంటి కృతార్థులైన ప్రతిఒక్క ఉద్యోగి ఈ భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. సంస్కృతభాషకు పూర్వవైభవం తీసుకురావడం కోసమే తాము సంస్కృతీభారతీ సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా సంస్కృత భాషోద్యమం నడుస్తోందన్నారు. ఈ 10 రోజుల శిక్షణా తరగతులు పూర్తి అయిన తరువాత ప్రతి ఒక్కరూ సంస్కృతభాషను అనర్గళంగా మాట్లాడగలరన్న సంపూర్ణవిశ్వాసం తనకున్నంన్నారు. అందుకు కారణం సంస్కృతభాషను నేర్చుకున్నంత సరళంగా మరేభాషను నేర్చుకోలేరన్నారు. ముగింపు సమావేశం జనవరి 4వతేది జరగనుందని, ఈసందర్భంగా టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరవుతారని, ఈసందర్భంగా ప్రతి ఒక్క ఉద్యోగి సంస్కృతభాషలో సాధించిన పట్టును చాటాలని ఆయన హితవు పలికారు

వామ్మో హైవే పోలీసులు ద్విచక్రవాహనదారులు భయపడిపోతున్నారు.

జాతీయ రహదారి 44 పై హైవే పోలీసులు ద్విచక్రవాహనదారులకు బెంబేలెత్తిస్తున్నారు. ముఖ్యంగా రుద్రంపేట, రాప్తాడు పరిసర ప్రాంతాల్లో వీరి దందా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. వీరి ధాటికి భయపడి ద్విచక్ర వాహనదారులు అటుగా వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. పగలనక రాత్రనక తాగి ఉండడం, వాహనదారులను మాటలతో హింసించడం ఆనక వారి దగ్గరున్న డబ్బులు, సెల్‌ఫోన్ లాంటి విలువైన వస్తువులను లాక్కోవడం పరిపాటిగా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక ఏదయినా వాహనంపై అమ్మాయి ఉన్న ఆనవాళ్లు కనపడితే ఇక వారిని వెంబడించి, అటకాయించి నానా యాగీ చేయడం నిత్యకృత్యంగా మారిందన్న ఆరోపణలు వీరిపై ఉన్నాయి. అమ్మాయి భుజాలపై చేతులు వేసి నిమరడం, ద్వంద్వార్థాల మాటలతో విసిగించడం, కౌన్సిలింగ్ అంటూ అమ్మాయిని ఒక వైపు అబ్బాయిని ఒక వైపు ఉంచి మాటలతో వేధించడం చేస్తున్నట్లు తెలిసింది. ఆనక వారి వద్ద ఉన్న డబ్బులు, సెల్‌ఫోన్ లాంటి వస్తువులను బలవంతంగా లాక్కోవడం చేస్తున్నట్లు సమాచారం. రెండు నెలల క్రితం నగరంలోని ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేసే ఉద్యోగి సాయంకాలం ఆరు గంటల సమయంలో పెనుకొండ నుంచి ద్విచక్ర వాహనం లో అనంతపురానికి వస్తున్నాడు. అతనికి కొన్ని రోజుల క్రితమే పెళ్లయ్యింది భార్యతో కలసి ద్విచక్రవాహనంపై వస్తున్నారు. రాప్తాడు దాటిన తరువాత బాగా తాగి వున్న ఒక యువకుడు మరో ద్విచక్రవాహనంలో వీరిని వెంబడించాడు. కొద్ది దూరం పోయిన తరువాత వీరిని దాటవేసి వీరి వాహనాన్ని నిలిపివేశాడు. అప్పటికే బాగా తాగి ఉన్న అతను తాను కానిస్టేబుల్‌నని వాహనానికి సంబంధించిన రికార్డులు చూపించమని అడిగాడు. రికార్డులన్నీ తనిఖీ చేసిన తరువాత అమ్మాయితో అసభ్యంగా, ప్రవర్తించసాగాడు. దీంతో కోపం వచ్చిన సదరు అబ్బాయి అతనితో వాగ్వాదానికి దిగాడు. ఆ సందర్భంలో ఇద్దరూ గొడవపడ్డారు. దీంతో ఆగ్రహించిన సదరు కానిస్టేబుల్ రాప్తాడు పోలీసుస్టేషనుకు ఫోన్ చేసి తన తోటి సహచరులను రమ్మని ఆజ్ఞాపించాడు. దీంతో అక్కడికి చేరుకున్న మిగిలిన పోలీసులు అతనిని లాక్కెళ్లి పోలీసుస్టేషనుకు తీసుకెళ్లి తమ ప్రతాపం చూపించారు. అనంతరం ఈ విషయం బయటకు ఎక్కడా చెప్పవద్దంటూ బెదిరించి అతనిని నుంచి పదివేల నగదు తీసుకుని వదిలేశారు. పదివేలు ఇచ్చిన తరువాత పార్టీ చేసుకోవాలని డిమాండ్ చేసి మరో ఐదు వేలు గుంజారు. దీంతో పాటు అతని దగ్గరున్న రెండు సెల్‌ఫోన్‌లు లాక్కున్నారు. వారం రోజుల తరువాత మళ్లీ ఫోన్‌లు చేసి బెదిరించడం మొదలుపెట్టారు. ఇక వారం రోజుల క్రితం ముస్లిం కుటుంబానికి చెందిన ఇద్దరు యువతీ యువకులు ఇదే పరిస్థితిలో మధ్యాహ్నం పూట వారికి తారసపడ్డారు. ఇంకేం వారిని వేధించడం మొదలుపెట్టారు. వారిద్దరినీ మాటలతో మానసికంగా వేధించడంతోపాటు తీవ్ర మానసిక క్షోభకు గురి చేశారు. వారి సంప్రదాయాన్ని కూడా పట్టించుకోకుండా బురఖా తీయమంటూ బెదిరించారు. సుమారు అరగంట పాటు అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించారు. మధ్యాహ్నం కావడంతో వారిద్దరివీ సెల్‌నంబర్లు తీసుకుని ఎవరికీ చెప్పవద్దంటూ బెదిరించి అక్కడ నుంచి పంపించారు. ఇవి మచ్చుకు రెండు మాత్రమే. ఇలాంటి సంఘటనలు రుద్రంపేట, రాప్తాడు రహదారి మధ్య చాలా కాలం నుంచీ జరుగుతున్నట్లు సమాచారం. సదరు కానిస్టేబుల్‌కు సంబంధించిన సహచరులు కూడా ఆ కానిస్టేబుల్ వ్యవహార శైలి పట్ల ఆగ్రహంతో ఉన్నారు. సదరు కానిస్టేబుల్ తండ్రి కూడా పోలీసు శాఖలోనే ఎస్సై హోదాలో పనిచేస్తుండడంతో అతని ఆగడాలకు అంతే లేకుండా పోతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. సదరు కానిస్టేబుల్ వ్యవహార శైలి పట్ల ఎవ్వరికీ సదభిప్రాయం లేకపోవడం గమనార్హం. రహదారులపై తాగుబోతులను, జులాయిలను అరికట్టాల్సిన పెట్రోలింగ్ పోలీసులే ఇలా వ్యవహరిస్తుంటే బాధితులు ఎవరికి చెప్పుకోవాలో తెలీక బాధపడుతున్నారు. పోలీసులతో వ్యవహారం కాబట్టి ఎందుకు వచ్చిన గొడవలే అన్నట్లు కిమ్మనకుండా ఉంటున్నారు. ఉన్నతాధికారులు మాత్రం ఇలాంటి వారి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీంతో జాతీయ రహదారి 44 పై రుద్రంపేట, రాప్తాడు మధ్య ఇద్దరు కలసి వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొని ఉంది.

పరిటాల రవి హత్య కేసులో పటోళ్ల గోవర్ధన్ రెడ్డి దారుణ హత్య

కొన్నాళ్లుగా ప్రాణాపాయం ఉందని చెబుతున్న పటోళ్ల గోవర్ధన్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం రాజధాని నడిబొడ్డున దారుణ హత్యకు గురయ్యాడు. అబిడ్స్ సమీపంలోని బొగ్గులకుంట ప్రాంతంలో ఈ హత్య జరిగింది. పటోళ్లను హతమార్చిన వెంటనే హంతకులు ద్విచక్రవాహనంపై పారిపోయినట్టు తెలుస్తున్నది. పరిటాల రవి హత్య కేసులో నిర్దోషిగా ఇటీవల విడుదలైన పటోళ్ల గోవర్ధన్ రెడ్డి అనేక హత్య కేసులలో నిందితుడు. పటోళ్ల మంగళవారం మధ్యాహ్నం తెలుగు అకాడమీ ప్రాంతంలో ఒక ఆటో ఎక్కి అబిడ్స్‌కు బయలుదేరాడు. చూస్తుండగానే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు నాలుగైదు ద్విచక్ర వాహనాలలో వచ్చి తన ఆటోలో ప్రయాణిస్తున్న వ్యక్తిని హతమార్చారని, అతడు ప్రాణాలు కోల్పోయిన తర్వాతే వారు పరారయ్యారని ఆటో డ్రైవర్ పోలీసులకు చెప్పినట్టు తెలుస్తున్నది. హత్య జరిగిన వెంటనే కొందరు స్థానికులు ఆటో దగ్గరకు రాబోగా ఎవ్వరూ దగ్గరకు రావద్దని హంతకులు హెచ్చరించినట్టు తెలుస్తున్నది. రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన పటోళ్ల గోవర్థన రెడ్డికి హైదరాబాద్‌లో జరిగిన అనేక హత్యలతో సంబంధం ఉన్నట్టు తెలుస్తున్నది. ఆర్.పి.టి. అనే సంస్థను ప్రారంభించిన పటోళ్ల ఇటీవలే చర్లపల్లి జైలునుంచి విడుదల అయ్యాడు. పరిటాల రవి హత్య కేసులో నిందితుడైన పటోళ్ళ హత్య వార్త అనంతపురం జిల్లాలో సంచలనం సృష్టించింది.

బ్రాడ్‌మన్‌ను అధిగమించిన... సచిన్ తెండూల్కర్ !

అంతర్జాతీయ క్రికెట్‌లో ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ వందో శతకాన్ని ఎప్పుడెప్పుడు సాధిస్తాడా అని ఎంతో ఆసక్తితో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న అభిమానులు అంతకంటే ముందు సెంచరీల విషయంలో సచిన్ ఆస్ట్రేలియా మేటి ఆటగాడు సర్ డొనాల్డ్ బ్రాడ్‌మన్‌ను ఎప్పుడో అధిగమించిన విషయాన్ని మాత్రం గమనించలేకపోయారు. ప్రస్తుతం 185వ టెస్టు ఆస్ట్రేలియాతో ఆడుతున్న సచిన్ అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లలో 51 శతకాలు, వనే్డ మ్యాచ్‌లలో మరో 48 శతకాలు సాధించడంతో పాటు ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో మరో 27 సెంచరీలను నమోదు చేయడంతో అతని సెంచరీల సంఖ్య 126కు చేరింది. దీంతో బ్రాడ్‌మన్ తన కెరీర్‌లో సాధించిన సెంచరీల కంటే సచిన్ తొమ్మిది సెంచరీలు ఎక్కువే సాధించినట్టయింది. బ్రాడ్‌మన్ శకంలో వనే్డ క్రికెట్ మ్యాచ్‌లు లేవు. కెరీర్‌లో మొత్తం 52 అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లు ఆడి 29 సెంచరీలు సాధించిన బ్రాడ్‌మన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో మరో 88 శతకాలను నమోదు చేయడంతో ఆయన సాధించిన సెంచరీల సంఖ్య 117గా ఉంది. అటు ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోనూ, ఇటు అంతర్జాతీయ టెస్టు మ్యాచ్‌లలోనూ కలిపి వందో శతకాన్ని నమోదుచేసే నాటికి బ్రాడ్‌మన్ వయసు 39 ఏళ్లుకాగా, ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్‌లో వందో శతకం సాధించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచిన సచిన్ 38వ పడిలో ఉన్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లలో ఇప్పటివరకూ మొత్తం 99 శతకాలు నమోదు చేసిన సచిన్ సమకాలీన క్రికెట్ ప్రపంచంలో మరెవ్వరికీ అందనంత ఎత్తున నిలిచిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీల జాబితాలో రెండో స్థానంలో కొనసాగుతున్న ఆస్ట్రేలియా జట్టు మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ మొత్తం 69 శతకాలతో సచిన్‌కు చాలా దూరంలో నిలిచాడు.