అది పుడమి తల్లి అందాలన్నీ పొత్తిళ్లలో
పొదివి పట్టుకున్న జిల్లా... అక్కడ కొండ కోనలుంటాయి.. జాలువారే
జలపాతాలుంటాయి. వయ్యారంగా నడిచి వెళ్లే నడక నేర్చిన నదులుంటాయి. శిధిలాలను
ముద్రించుకున్న చారిత్రక ఆధారాలుంటాయి. చిరకాలం నిలిచిపోయే
శిలాశాసనాలుంటాయి.

అవతారపురుషుడు నడయాడిన నేల ఇది.. భూత భవిష్యత్ వర్తమానాలను వివరించే కాలజ్ఞానం పుట్టిందీ కూడా ఇక్కడే.. ఇన్ని ప్రత్యేకతలున్న ఒకే ఒక జిల్లా కర్నూలు.. కనువిందు చేసే కర్నూలు అందాల రాయలేలిన రతనాల సీమ కర్నూలు జిల్లా... ఈ జిల్లాకు సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదతో అలరారిన చరిత్ర ఉంది. రుషులు, మహర్షులు నడయాడిన నేల అందుకే జిల్లా పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లయింది. శ్రీశైలం, మహానంది, యాగంటి, అహోబిలం, కాల్వబుగ్గ వంటి పరమ పవిత్ర స్థానాలు వెలిశాయి. ఈ ప్రాంతంలో హిందూ ఆలయాలే కాక ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ప్రసిద్ధి చెందిన జామియా మసీదు కూడా ఇక్కడే ఉంది. ముస్లింలు జీవితంలో ఒక్కసారయినా దర్శించుకొని తీరాలను కునే మక్కా మసీదు తర్వాత అంతటి పవిత్రతను సంతరించుకున్న దర్గాగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇంకా ఇక్కడి సుకేశుల డ్యామ్ అందాలు ఎంత సేపు చూసినా తనివి తీరదు. కర్నూల్ జిల్లా అడుగడుగూ అందాలతో ఆహ్వానిస్తుంటుంది. ఇక్కడి బెలూం గుహలను చూస్తుంటే ఎంత సేపు చూసే ఏదో తన్మయానికి లోనైనట్టుంటుంది. ఓర్వకల్లు లోని రాక్ గార్డెన్స్, సుంకేశుల డ్యామ్ లు జిల్లా ప్రతిష్టను మరింత ఇనుమడింప జేస్తున్నాయి. చారిత్రక ప్రదేశంగా విలసిల్లే కర్నూలు నందు కొండారెడ్డి బురుజు, బొమ్మాళీ కోటలు, గత చరిత్రను కల్ళముందు కదలాడించే నిర్జీవ సాక్ష్యాలు. ఇక్కడి చారిత్రకప్రదేశాలన్నీ అలనాటి వైభవాన్ని చాటి చెపుతుంటాయి. కలియుగ అవతార పురుషుడిగా భావించే వీరభ్రహ్మేంద్ర స్వామి కూడా ఇక్కడే తన కాలజ్ఞానాన్ని రచించారు. దైవం మానవరూపంలో నడయాడిన నేల ఇదని ఇక్కడి వారు గర్వంగా చెప్పుకుంటారు.చెంచుల నివాసస్ధలాలుగా ఉన్న నల్లమల అడవులు ,ఎర్రమల అడవులూ ఈ జల్లాకు చెందిన ప్రకృతి సంపదలే. తుంగభద్రమ్మ గలగలలతోనే కాదు ప్రకృతి రమణీయమైన ప్రదేశాలతోనూ భాసిల్లుతోన్న కర్నూలు జిల్లా పర్యటకంగా మాత్రం వెనకబడే ఉంది. జిల్లాలో ఉన్న అలనాటి ప్రాచీన కట్టడాలు, పుణ్యక్షేత్రాలు, సహజ సిద్దంగా ఏర్పడిన గుహలు తదితర ప్రదేశాలను టూరిజం డిపార్డ్ మెంట్ అభివృద్ధి చేసి, గత చరిత్ర వైభవాన్ని భవిష్యత్ తరాలకు అందించాల్సి అవసరం ఎంతైనా ఉంది.
No comments:
Post a Comment