Saturday, 29 October 2011

ఇంగ్లండ్ జట్టు గ్రేమ్‌స్వాన్‌కు మాత్రం ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయట!

 భారత్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో 0-5తో వైట్‌వాష్‌కు గురైన ఇంగ్లండ్ జట్టు ఇంటా బయటా తీవ్ర విమర్శలెదుర్కొంటుంటే.. ఆ జట్టు ఆఫ్ స్పిన్నర్ గ్రేమ్‌స్వాన్‌కు మాత్రం ఏకంగా చంపేస్తామంటూ బెదిరింపులు వచ్చాయట! భారత్‌తో ఐదో వన్డేలోనూ చిత్తుగా ఓడిన తర్వాత తనకు ట్విట్టర్‌లో బెదిరింపులొచ్చాయని స్వాన్ పేర్కొన్నాడు. 

అయితే ఈ విషయాన్ని తాను అంతగా పట్టించుకోవడం లేదంటున్న స్వాన్.. అభిమానుల ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలనని తెలిపా డు. చివరి వన్డేలో మేం ఓడిపోయిన తీరు చూస్తే అభిమానులకు కోపం రావడం సహజమేనని అన్నాడు

ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య విభాగం నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.

తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీ దూరవిద్య విభాగం నిర్వహిస్తున్న డిగ్రీ, పీజీ కోర్సుల పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. బీఏ, బీకాం, మొదటి, రెండో, మూడో సంవత్సరం పరీక్షలు, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, ఎంబీఏ మొదటి సంవత్సరం పరీక్షలు కూడా అదే రోజు నుంచే మొదలవుతాయి. బీఎల్ఐఎస్‌సీ పరీక్షలను నవంబర్ ఒకటి నుంచి ప్రారంభమవుతాయి. 

ఇప్పటికే అభ్యర్థుల హాల్‌టిక్కెట్లను ఆయా పరీక్షా కేంద్రాలకు పంపారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్రవ్యాప్తంగా 68 కేంద్రాల్లో సుమారు 25 వేల మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. అదనపు సమాచారం కోసం www.svudde.org వెబ్‌సైట్‌లో లేదా 0877- 2289477 నంబరులో గాని సంప్రదించాలని ఎస్వీయూ డీడీఈ డీన్ ఎస్.వి.సుబ్బారెడ్డి శనివారం తెలిపారు

శ్రీరామరాజ్యం ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది.

                                                           
బాలయ్య రాముడిగా నయనతార సీతగా రూపొందిన శ్రీరామరాజ్యం ఈ నెల 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. బాపూ దర్సకత్వం లో రూపొందిన ఈ చిత్రంలో బాలయ్య రాముడి గెటప్ లో ఎలా ఉంటారా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కాగా రాముడి గెటప్ కి సంబందించిన లుక్ ని ఈ నెల 31 న అధికారికంగా విడుదల చేయడానికి చిత్ర నిర్మాత యలమంచలి సాయి సన్నాహాలు చేస్తున్నారు

తిరుమల లడ్డూ వితరణశాలలోనూ భక్తులు కిక్కిరిశారు

                                     
 తిరుమలలో భక్తుల రద్దీ తరగడంలేదు. శనివారం కూడా కొండకు భక్తులు పోటెత్తారు. దీంతో సర్వదర్శనానికి 15, రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. దీపావళి పండుగ ముగియడం, వారాంతపు సెలవులు కావడంతో తిరుపతి సమీప ప్రాంతాల భక్తులు రెండు రోజులుగా తిరుమలకు తరలివస్తున్నారు. 

ముఖ్యంగా కాలిబాటన, సొంత, ప్రైవేటు వాహనాల్లో భక్తులు అధిక సంఖ్యలో తిరుమల చేరుకుంటున్నారు. ఇక వాహనాల పార్కింగ్‌కు స్థలం సరిపడక రోడ్లపై ఆపుతుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఇక గదుల కేటాయింపు మధ్యాహ్నానికే పూర్తవడంతో సగానికిపైగా భక్తులు ఆరుబయటే సేదతీరుతున్నారు. శనివారం ఎడతెరపి లేని చిరుజల్లులు పడుతుండడంతో వీరంతా ఇబ్బంది పడుతున్నారు.

రెండో వైకుంఠం క్యూకాంప్లెక్స్ నిండి, వెలుపల ఆళ్వారు ట్యాంకు చుట్టూ ఉన్న క్యూలైన్లో భక్తులు వేచివున్నారు. దివ్య, ప్రత్యేక ప్రవేశ దర్శనం భక్తుల క్యూలైన్ కూడా కిలోమీటర్ల పొడవున వ్యాపించి ఉంది. శనివారం సుమారు 90 వేల మంది భక్తులు మహాలఘులో స్వామివారిని దర్శించుకున్నారు. లడ్డూ వితరణశాలలోనూ భక్తులు కిక్కిరిశారు. ఈ రద్దీ మరో రెండు రోజులపాటు కొనసాగనుంది. దీనికి అనుగుణంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు

11 సంవత్సరాల నుంచి అద్దె కట్టలేదు !

ఆదోని వ్యవసాయ మార్కెట్‌కు 21మంది వ్యాపారులు కేటాయించిన దుకాణాల బాడుగలను చెల్లించకుండా 11 సంవత్సరాల నుంచి కాలయాపన చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వ్యాపారుల బకాయిలను ఆడిట్ అధికారులు ఎత్తి చూపుతుండడం వలన మార్కెట్ అధికారులు ఆందోళన చెందుతున్నారు. బకాయి పడ్డ సొమ్మును మాఫీ చేయించుకోవడానికి వ్యాపారులు రాజకీయ నాయకుల చుట్టూ 11 సంవత్సరాల నుంచి ప్రదక్షిణలు చేస్తున్నారు. అయితే అధికారులు బకాయిలను వసూలు చేయడానికి అవసరమైతే ఆర్‌ఆర్ యాక్టు అమలు చేయడానికి పూనుకుంటున్నారు. మార్కెట్‌యార్డులో 11సంవత్సరాల క్రితం కోట్లాది రూపాయలతో పత్తి మార్కెట్‌యార్డును నిర్మించారు. మార్కెట్లో 21గోదాములను కూడ వ్యాపారులకోసం నిర్మించారు. ఈగోదాములను బహిరంగ వేలం ద్వారా 23మంది వ్యాపారులు తీసుకున్నారు. తీసుకున్నప్పటినుంచి బకాయిలు చెల్లించినమాట వాస్తవమేనని మార్కెట్‌యార్డు కమిటీ కార్యదర్శి రామమోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పోటీ పడి గోదాములను తీసుకున్న వ్యాపారులు తీసుకున్న గోదాముల్లో విభాగాలు చేసి కొంతమంది వ్యాపారులకు దుకాణాలకోసం బాడుగలు ఇచ్చి బాడుగలను వ్యాపారులు జేబుల్లో వేసుకుంటున్నారు. కానీ మార్కెట్ కమిటీకి మాత్రం నెలనెల బాడుగలు చెల్లించలేదు. ఈవిధంగా 11సంవత్సరాలు గడిచిపోయింది. 2006సంవత్సరంలో బాడుగలను తగ్గించి బకాయిలను మాఫీ చేయాలని ప్రభుత్వానికి వ్యాపారులు చేసుకున్న విజ్ఞప్తిని ప్రభుత్వం తిరస్కరించింది. అయినప్పటికీ కూడ వ్యాపారులు బాడుగలు చెల్లించకుండా అలాగే కాలయాపన చేస్తున్నారు. పదకొండేళ్లు కావడంతో బాడుగలు తడిసి మోపుడై ఇప్పుడు రూ.80లక్షల మేర 23మంది వ్యాపారులు మార్కెట్‌యార్డుకు బకాయి పడ్డారు. మార్కెట్ అధికారులు కూడ వసూలు చేయడంలో నిర్లక్ష్యం వహించడం వలన వ్యాపారులు కూడ పెద్దగా స్పందించలేదు. ప్రతి సంవత్సరం బకాయిల వ్యవహారం ఆడిట్‌లో వస్తూనే ఉంది. చాలామంది అధికారులు బకాయిల వసూళ్లకు పూనుకున్నారు. కానీ వ్యాపారులు అప్పటికప్పుడు స్థానికంగా ఉన్న రాజకీయ పార్టీల నాయకులను కలిసి అధికారులపై ఒత్తిడి తీసుకొని రావడంతో అధికారులు కూడ కిమ్మనకుండా ఉండిపోతున్నారు. దీంతో చివరకు రూ.80లక్షల వరకు బకాయి చేరగా వ్యాపారులు ఇంత మొత్తం బకాయి పడ్డ విషయం నిజమేనని మార్కెట్ కమిటీ కార్యదర్శి స్పష్టం చేశారు. ఇటీవల సీమ స్థాయి మార్కెట్ కమిటీ జెడివద్ద బకాయిపడ్డ వ్యాపారులు కలిసి బకాయిలను మాఫీ చేయాలని కూడ కోరినట్లు సమాచారం.



ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులు ముందురోజు రాత్రి MBC కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు

శ్రీవారి భక్తులకు టిటిడి కొత్త నిబంధనలు విధించింది. ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులు ముందురోజు రాత్రి MBC కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రాని భక్తుల టికెట్లు రద్దు చేసి సామాన్య భక్తులకు మంజూరు చేస్తామని టిటిడి అధికారులు తెలిపారు. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఆర్జిత సేవా టికెట్లు వృధా అవుతున్నాయి. సంవత్సరాల తరబడి వేచి ఉన్నా దొరకని ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులు వాటిని వినియోగించుకోవడం లేదు. రెండు నెలలుగా 30 నుంచి 50 శాతం మంది భక్తులు ఆర్జితసేవలకు రావడం లేదు. అభిషేకం, వస్త్రం సేవలకు శుక్రవారం 167మంది భక్తులు హాజరుకావాల్సి ఉన్నా...చాలామంది భక్తులు రాలేదు. హాజరుకాని భక్తులు ముందస్తుగా సమాచారం అందించలేదు.

దీనిపై టిటిడి అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఆర్జిత సేవ టికెట్లు పొందిన భక్తులు ముందురోజు రాత్రి MBC కార్యాలయంలో హాజరుకావాలని టిటిడి జెఇఓ శ్రీనివాసరాజు అన్నారు. ముందురోజు ఆఫీస్‌కు రాని భక్తుల టికెట్లు రద్దు చేస్తామని.... వాటిని సామాన్య భక్తులకు మంజూరు చేస్తామని తెలిపారు. సామాన్య భక్తులకు సౌకర్యాలు మెరుగు పరచడానికి టిటిడి సమయాత్తం అవుతోంది. తిరుమలలోని ప్రైవేటు మఠాలలో ఉన్న 30శాతం గదులను సామాన్య భక్తులకు మంజూరు చేసేందుకు టిటిడి ఏర్పాట్లు చేస్తోంది

తాగునీటి కష్టాలు పెరగనున్నాయి

అసలే కరువు కాటకాలతో అల్లాడుతున్న అనంతపురం జిల్లాలో భూగర్భ జలాలు కూడా అడుగంటుతున్నాయి. గతేడాదితో పోలిస్తే గ్రౌండ్‌వాటర్ లెవల్స్ నాలుగు మీటర్ల మైనస్‌కు పడిపోయాయి. భూగర్భ జలాల పెంపునకు చర్యలు తీసుకోవడంలో విఫలమైన కారణంగానే ఈ దుస్థితి దాపురించింది. అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతలో భూగర్భ జలనిధి కూడా తగ్గిపోవడం ఆందోళన కలిగించే అంశం.^నీటి మట్టం పెంచేందుకు చర్యలు తీసుకోక పోవడం వల్లనే ఈ పరిస్థితి దాపురించింది. దీంతో సాగు, తాగునీటి కష్టాలు పెరగనున్నాయి.

అలాగే నీటిలో ఫ్లోరైడ్ శాతంపెరుగుతుందన్న ఆందోళన వ్యక్తం అవుతోంది. భూగర్భ జలవనరుల శాఖ^సేకరించిన గణాంకాల మేరకు 15.53 మటరల్ లోతుకు జలాలు పడిపోయాయి. నీటిమట్టం పడిపోవడంతో బోర్లకు నీరందని పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో రైతులకు అదనపు కరెంట్ కష్టాలు వచ్చి పడ్డాయి. వర్షపునీటిని నిల్వ చేయడం, చెరువులు, చెక్‌డ్యామ్‌లను సంరంక్షించడంలో అధికారుల విఫలం కావడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడింది.

ఇసుక అక్రమ రవాణా కూడా నీటి నిల్వలు పడిపోవడానికి కారణం అవుతోంది. ఇప్పటికైనా అధికారులు యుద్ద ప్రాతిపదికన వాననీటి సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉంది. చెరువులు, కుంటలను రక్షించకుంటే భవిష్యత్ మరింత దారుణంగా ఉండే ప్రమాదం ఉంది

ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొంది

 తిరుమల మొదటి ఘాట్ రోడ్డు 35వ మలుపు వద్ద శనివారం ఉదయం ఓ ఆర్టీసీ బస్సు పిట్టగోడను ఢీకొంది. కాగా తృటిలో పెను ప్రమాదం తప్పటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘటనతో ఘాట్ రోడ్డులో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.