Monday, 2 January 2012

జగన్ అక్రమాస్తుల కేసులో తొలి అరెస్ట్...జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి

జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయసాయిరెడ్డి అరెస్ట్ సోమవారం ఉదయం నుంచి దిల్‌కుషా గెస్ట్‌హౌజ్‌లో విజయసాయిరెడ్డిని సుదీర్ఘంగా ప్రశ్నించారు. ఈ సాయంత్రం ఆయనను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విజయసాయిరెడ్డిని అదుపులోకి తీసుకోవడానికి సీబీఐ కారణాల్ని వెల్లడించలేదు. విజయసాయిరెడ్డిపై 120(బి), 409, 477, 477(ఏ) సెక్షన్ల కింద డిసెంబర్ 17 తేదిన కేసు నమోదు చేశారు. ప్రివెన్షన్ అండ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్13 క్లాజ్ 4 కింద మొత్తం 72 మందిపై సీబీఐ అభియోగాలు మోపారు. జగన్ ఆస్తుల కేసులో సీబీఐ పరిధిని మించి విచారణ చేస్తోందని విజయసాయిరెడ్డి కొద్ది రోజుల క్రితం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించడం లేదని పిటిషన్‌లో తెలిపారు. ఈ కేసులో పదుల సార్లు విజయసాయిరెడ్డిని ప్రశ్నించారు. ఇప్పటి వరకు ఏ కేసులోనూ ఎవర్ని కూడా ఇన్నిసార్లు సీబీఐ ప్రశ్నించలేదు.ఈ రోజు ఉదయం నుంచి విజయసాయిరెడ్డిని సుదీర్ఘంగా విచారించిన సి.బి.ఐ మరి కాసేపట్లో మేజిస్ట్రేట్ ముందకు హాజరు పరచనున్న సి.బి.ఐ బెంగళూరులో ఉన్న జగన్ విజయసాయిరెడ్డి అరెస్ట్ పై స్పందించవద్దని పార్టీ నేతలను ఆదేశించిన జగన్.

దూరంగా పొండి అంటూ మీడియాఫై...నాగార్జున ఫైర్

సెలబ్రిటీల కుటుంబాల్లో వివాహ వేడుకైనా, విషాద వేడుకైనా, ఏవేడుకైనా ఈ మధ్య మీడియా తెగ హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. మీడియా ఇలా పోటీ పడటానికి వివిధ చానల్స్ మధ్య పెరిగి పోతున్న పోటీ తత్వమే అని కొత్తగా చెప్పక్కర్లేదు. వీరి పోటీ తత్వం ఒక్కోసారి సదరు సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. తాజా విషయానికొస్తే... .అన్నపూర్ణమ్మ మరణంతో అక్కినేని కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఓ వైపు కుటుంబీకులంతా విషాదంలో మునిగి ఉంటే మీడియా హడావుడి కూడా మొదలైంది. అసలు మీడియాకు చాలా దూరంగా ఉండే నాగార్జునకు వారి తీరు నచ్చ లేదని, తన మనుషుల ద్వారా మీడియా వారిని ఆదేశించాడని, వచ్చి పోయే వారిని ఇబ్బంది పెట్టకుండా తమ ఇంటికి దూరంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. నాగార్జున ఇలా ఆగ్రహం వ్యక్తం చేయడానికి కారణం కూడా ఉంది. అన్నపూర్ణమ్మ అంతిమ యాత్రలో అక్కినేని నాగేశ్వరరావు కనిపించక పోవడంపై కారణం ఏమిటి? అంటూ ఊహాగానాలు ప్రసారం కావడం ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.

క్రికెట్‌లో సచిన్ గొప్ప బ్యాట్స్‌మన్‌గా గొప్పతనం...కెప్టెన్ క్లార్క్

 క్రికెట్‌లో సచిన్ గొప్ప బ్యాట్స్‌మన్‌గా ఎదగడానికి అతడికి ఉన్న మానసిక దృఢత్వమే కారణమని, అదే అతని గొప్పతనమని ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ క్లార్క్ అభిప్రాయపడ్డాడు. సిడ్నీ మైదానంతో ప్రత్యేక అనుబంధం ఉన్న కారణంగా రెండో టెస్ట్‌లో సచిన్ తన వందవ సెంచరీ చే సే అవకాశం ఉందన్నాడు. ఆసీస్ బౌలర్లు జాగ్రత్తగా లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉందని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్‌కు రాసిన వ్యాసంలో హెచ్చరించాడు. ప్రపంచ క్రికెట్‌లోని మేటి బౌలర్లను సచిన్ చీల్చి చెండాడాడని, కోర్ట్నీ వాల్ష్, వసీం అక్రం, కర్ట్‌లీ ఆంబ్రోస్, వకార్ యూనిస్, మెక్‌గ్రాత్, షేన్‌వార్న్ వంటి బౌలర్లను కూడా అద్భుతంగా ఎదుర్కొన్నాడని ఆధునిక బ్రాడ్‌మన్ గురించి క్లార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు.

ద్విచక్ర వాహనాలతో కాలేజీలకు వచ్చేవిద్యార్థులకు హెల్మెట్ తప్పనిసరి

మోటార్ సైకిల్ వేగంగా నడిపి ప్రాణాలు పోగొట్టుకుంటున్న విద్యార్థులకు ప్రాణరక్షణ కల్పించేందుకు అర్బన్ ఎస్పీ ప్రభాకర్‌రావు నడుం బిగించారు. ఇందులో భాగంగానే సోమవారం నుండి తిరుపతిలోని ఏ కాలేజీకి మోటార్ సైకిల్‌పై వెళ్లే విద్యార్థి అయినా హెల్మెట్ లేకుండా వెళితే వారిని అనుమతించరాదని కళాశాల యాజమాన్యాలకు పోలీసు శాఖ గట్టి హెచ్చరికలు చేసింది. అంతేకాకుండా తల్లిదండ్రులు కూడా విధిగా పిల్లలకు హెల్మెట్లు తీసివ్వాలని, లేని పక్షంలో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని కూడా హెచ్చరించింది. ఈ నేపధ్యంలో అన్ని ప్రైవేటు కళాశాలల ప్రిన్సిపాళ్లకు, కరస్పాండెంట్లకు అర్బన్ ఎస్పీ ప్రభాకర్‌రావు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రభుత్వ కళాశాలలకు కూడా వీటిని వర్తింపజేసేందుకు రంగం సిద్ధం చేశారు. సంపన్నులు అయిన తల్లిదండ్రులు సొమ్ములున్నాయి కదా అని నగర రోడ్లకు ఉపయోగపడని అత్యధిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన మోటార్ సైకిళ్లను కొనిస్తున్నారు. పిల్లలను సంతృప్తి పరచడానికి తల్లిదండ్రులు చేస్తున్న ఈ తీరు చివరకు వారికి కడుపుకోత మిగుల్చుతున్నా అప్రమత్తమవుతున్న తల్లిదండ్రుల సంఖ్య అంతంత మాత్రంగానే ఉందని మేధావులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో పోలీసులు చొరవ తీసుకుని హెల్మెట్ వాడకాన్ని నిబంధనగా విధించడం సంతోషదాయకమని వారంటున్నారు. ఇది కేవలం రెండురోజులకు పరిమితం కాకుండా శాశ్వతంగా అమలు చేయాల్సిన బాద్యత పోలీసులపై ఉందని అంటున్నారు. ఇందుకు తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు పోలీసులకు సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారంటున్నారు. ఎవరైనా ఈ నిబంధనలను అతిక్రమిస్తే వారి తల్లిదండ్రులు అయినా పాఠశాల యజమానులు అయినా ముందుగా వారిపై కేసులు నమోదు చేయించాలని సూచిస్తున్నారు

కర్నూలు జిల్లా ఉప ఎన్నికల అభ్యర్థులపై పార్టీల కసరత్తు!

 జగన్ వర్గం ఎమ్మెల్యేలపై వేటు నేపధ్యంలో ఉప ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆయా పార్టీల నాయకులు తమ వంతు ప్రయ త్నాలు ముమ్మరం చేశారు. ఇదే సమయంలో ఆయా పార్టీలు అభ్యర్థుల వేటలో పడ్డాయి. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డిపై అనర్హత వేటు వేసినా, రాజీనామా ఆమోదించినా ఉప ఎన్నికలు ఖాయం కావడంతో ఆ దిశగా రాజకీయ పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఆళ్లగడ్డ బరిలో వైఎస్సార్ కాంగ్రెస్ తరపున భూమా దంపతుల్లో ఒకరు పోటీ చేయడం ఖాయం కాగా తెలుగుదేశం తరపున ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు ఇరిగెల రామపుల్లారెడ్డి పేరును ఖరారు చేశారు. కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు గంగుల సోదరులు సిద్ధపడుతున్నారు. గంగుల ప్రతాప రెడ్డి తనకు పార్లమెంటుకు పోటీ చేయడమే ఇష్టమని ఉప ఎన్నికల బరిలో తన సోదరుడు గంగుల ప్రభాకర రెడ్డి ఉంటారని తన సన్నిహితుల వద్ద పేర్కొన్నట్లు సమాచారం. అయితే పార్టీ రాష్ట్ర నాయకులు మాత్రం గంగుల ప్రతాప రెడ్డి బరిలోకి దిగి విజయం సాధించి వస్తే మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు అవకాశం ఉన్నట్లు సమాచారం అందించారని వార్తలు వస్తున్నాయి. ఇక ఎమ్మిగనూరు అసెంబ్లీ స్థానంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యే ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి బరిలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. టిడిపి తరపున మాజీ మంత్రి బివి మోహన రెడ్డి రంగంలోకి దిగనున్నారు. కాంగ్రెస్ తరపున రుద్రగౌడు పేరు ప్రస్తుతం ప్రచారంలో ఉన్నా అభ్యర్థి పేరు ఖరారు చేసే సమయానికి మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. ఇక ఈ రెండు స్థానాలతో పాటు మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డిపై టిడిపి చేసిన ఫిర్యాదు మేరకు స్పీకర్ తన నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది. ఈ విషయంలో బాలపై వేటు ఖాయమని టిడిపి వర్గాలు ఆశతో ఉన్నా కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వేటు పడకపోవచ్చని పేర్కొంటున్నారు. దాంతో ఈ స్థానంలో ఉప ఎన్నిక అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఉప ఎన్నికలు జరగడం ఖాయంగా కనిపిస్తున్న ఎమ్మిగనూరులో విజయం ఖాయమని టిడిపి ధీమాతో ఉండగా కాంగ్రెస్ పార్టీ ఆళ్లగడ్డ స్థానంపై విశ్వాసంతో ఉంది. ఇక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆళ్లగడ్డపై ధీమాగా ఉన్నప్పటికీ ఎమ్మిగనూరు విషయంలో వారికి కొంత అనుమానం ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికల సమయానికి అక్కడ ఉన్న లోపాలను సరిదిద్దుకొని బరిలోకి దిగితే విజయం వరిస్తుందన్న నమ్మకం కూడా ఉంది

విద్యార్థిలా దర్శనమిచ్చిన ద్రవిడ్!

సీనియర్ బ్యాట్స్‌మన్‌గా టీమిండియాకు ఎనలేని సేవలు అందిస్తున్న ‘మిస్టర్ డిపెండబుల్’ రాహుల్ ద్రవిడ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన రెండవ మేటి బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కి ఉండవచ్చు. కానీ క్రికెట్‌లో మాత్రం ద్రవిడ్ ఇప్పటికీ నిత్య విద్యార్థిగానే కొనసాగతున్నాడు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భాగంగా సిడ్నీ క్రికెట్ గ్రౌండ్ (ఎస్‌సిజి)లో మంగళవారం నుంచి ప్రారభం కానున్న రెండో టెస్టు సన్నద్ధమవుతున్న ద్రవిడ్ ఆదివారం ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్‌లో పాల్గొని మరోసారి విద్యార్థిలా దర్శనమిచ్చాడు. బ్యాటింగ్‌లో కొత్త మెళకువలను నేర్చుకుంటూ క్రికెట్ పట్ల తనకున్న నిబద్ధతను, అంకితభావాన్ని చాటుకున్నాడు. ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీ స్వల్ప దూరం నుంచి విసురుతున్న బంతులను ఎదుర్కొంటూ సాధన చేసిన ద్రవిడ్ తన బ్యాటింగ్ తీరును నిశితంగా గమనించి తగిన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా టీమిండియా కోచ్ డంకన్ ఫ్లెచర్‌ను కోరాడు. ఈ సిరీస్‌లో భాగంగా ఇంతకుముందు మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లోనూ క్లీన్‌బౌల్డ్‌గా పెవిలియన్‌కు చేరిన ద్రవిడ్ ఇప్పుడు నెట్స్‌లో తన బ్యాటింగ్ తీరును మరోసారి సమీక్షించుకుని లోపాలను సరిదిద్దుకునేందుకు ప్రయత్నించాడు. మైదానంలో ప్రత్యర్థి జట్టు బౌలర్లు విసిరే బంతులను డిఫెన్సివ్ స్ట్రోక్స్ రూపంలో ఆఫ్ సైడ్‌కు తరలిస్తున్నప్పడు తన బ్యాట్‌కు-ప్యాడ్‌కు మధ్య ఎందుకు గ్యాప్ ఏర్పడుతోందో పరిశీలించుకున్నాడు. నెట్ ప్రాక్టీస్‌లో ద్రవిడ్ ఆటతీరును పరిశీలించిన ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీ, జట్టు కోచ్ ఫ్లెచర్ పైన పేర్కొన్న లోపాన్ని సరిదిద్దేందుకు అవసరమైన సలహాలు, సూచనలు ఇచ్చారు. ద్రవిడ్‌తో పాటు టీమిండియాలోని మిగిలిన సభ్యులు కూడా  ఉదయం 9 గంటలకే మైదానంలోకి దిగి ముమ్మరంగా నెట్ ప్రాక్టీస్‌ను కొనసాగించారు. డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెవాగ్, ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్, సీనియర్ పేసర్ జహీర్ ఖాన్, విరాట్ కోహ్లి నెట్స్‌లో ఎంతో ఉల్లాసంగా గడిపారు. బిసిసిఐ (్భరత క్రికెట్ కంట్రోల్ బోర్డు) సెలెక్టర్లు నరేంద్ర హీర్వాణి, మొహిందర్ అమర్‌నాథ్ కూడా నెట్స్ వద్దకు వచ్చి ఆటగాళ్ల సాధనను పరిశీలించారు.

డీఎస్సీ నోటిఫికేషన్‌కు సీఎం ఆమోదం

రాష్ట్రంలో భారీగా టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే ఖాళీగా 11 వేల పోస్టులతోపాటు మరో తొమ్మిదివేల పోస్టులకు సీఎం ఆమోదం తెలిపారు. జనవరి 15 తేది తర్వాత 20 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను ప్రభుత్వం జారీ చేయనుంది. 11 వేల 139 ఖాళీలను ఇప్పటికే గుర్తించారు. వాటిలో 7 వేలకు పైగా ఎస్‌జీటీ పోస్టులు, 2 వేలకు పైగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఈ పోస్టులకు తోడుగా మరో 9 వేల 659 పోస్టులను ఒకేసారి భర్తీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
 డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయుల భర్తీకి సీఎం ఆమోదం తెలిపిన నేపథ్యంలో రాలయసీమ జిల్లాల వారీగా ఉన్న టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.
చిత్తూరు- 528, కడప- 97, అనంతరపురం- 399, కర్నూలు- 625