Wednesday, 9 November 2011

జెనీలియా, సమంతా, త్రిష, శ్రియలకు టెన్షన్

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యత్వం తీసుకోని హీరోయిన్లకు డెడ్ లైన్ దగ్గరపడింది. ఈనెలాఖరులోగా మా లో సభ్యత్వం తీసుకోకపోతే... నిషేధం విధిస్తామని మా అధ్యక్షుడు మురళీమోహన్ హెచ్చరించారు. తెలుగు చిత్రాల్లో నటిస్తున్న హీరోయిన్లు మాలో సభ్యత్వం తీసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే సమయం దగ్గరపడింది. ఈనెలాఖరులోగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకోకుంటే నిషేధానికి గురవుతారని మా అధ్యక్షుడు మురళీ మోహన్ హెచ్చరించారు. ఇప్పటికే సభ్యత్వం లోని హీరోయిన్లకు నోటీసులు పంపించారు. 
వీరిలో టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ గా వెలుగొందుతున్న జెనీలియా, సమంతా, త్రిష, శ్రియ ఉన్నారు. వీరితో పాటు నిత్యామీనన్, స్నేహా లాంటి హీరోయిన్స్ చాలామందే ఉన్నారని సమాచారం. ఇప్పటికే నోటీసులు పంపినా... సదరు హీరోయిన్స్ సభ్యత్వం తీసుకోకపోవడంపై మా చాలా సీరియస్ గా ఉంది. వీరిపై ఆంక్షలు విధించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. అయితే... చివరి అవకాశంగా ఈ నెలాఖరు వరకు సమయమిచ్చారు. ఈలోగా మెంబర్ షిప్ తీసుకోకపోతే ఇక టాలీవుడ్ కి పూర్తిగా దూరమౌతారని మా ఘాటుగా హెచ్చరించింది. మరి ఈ డెడ్ లైన్ పై హీరోయిన్స్ ఎలా స్పందిస్తారో వేచిచూడాలి

నటి స్నేహ త్వరలో శ్రీమతి కాబోతోంది




హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చకున్న నటి స్నేహ త్వరలో శ్రీమతి కాబోతోంది. తమిళ నటుడు ప్రసన్నను పెళ్లి చేసుకోబోతోంది. ఈ విషయాన్ని ఈ రోజు(నవంబర్ 9) ప్రసన్న అధికారికంగా ప్రకటించాడు. ఈ పెళ్లి వార్తను స్నేహ ధృవీకరించింది. 2009లో ఓ తమిళ సినిమాలో స్నేహ, ప్రసన్న కలిసి నటించారు. అప్పటి నుంచే ఇద్దరి మధ్య ఎఫైర్ మొదలైందని, త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఎట్టకేలకు ఈ జంట తమ పెళ్లి విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. పెళ్లి గురించి ప్రసన్న మీడియాతో మాట్లాడుతూ....‘అవును మీడియాలో వస్తున్న వార్తలు నిజమే, నేను స్నేహను పెళ్లి చేసుకోబోతున్నాను, ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో అభిమానులు, శ్రేయోభిలాషుల మధ్య త్వరలోనే వివాహం చేసుకోబోతున్నాం’ అంటూ ప్రసన్న ప్రకటించారు. ఇంకా నిశ్చితార్థం తేదీ ఖరారు కాలేదని ప్రసన్న స్పష్టం చేశారు. త్వరలోనే నిశ్చితార్థం, పెళ్లి తేదీలను ప్రకటిస్తామన్నారు

పవన్ దగ్గరకి రేణు తిరిగి వచ్చేసింది




పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ మధ్య తలెత్తిన అభిప్రాయబేధాలు వారు విడిపోవడానికి కారణమయ్యాయని, చాలా కాలంగా రేణు దేశాయ్ పూణెలో తన పుట్టింట్లోనే ఉంటోందని, అప్పుడప్పుడు తనయుడు అఖీరానందన్ ఇక్కడికి రావడం తప్ప పవన్ తన భార్యని కలుసుకోలేదని పుకార్లు షికారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం ఇప్పుడు వారిద్దరి మధ్య వచ్చిన సమస్యలకి పరిష్కారం దక్కింది. పవన్ దగ్గరకి రేణు తిరిగి వచ్చేసింది.
తానూ పవన్ కళ్యాణ్ వైవాహిక బంధం నుంచి విడిపోలేదని నటి ,డిజైనేర్ రేణు దేశాయ్ పేర్కొన్నారు .తామిద్దరం విడిపోయినట్టు వస్తోన్న వార్తలన్నీ కేవలం పుకార్లే అని ఒక ఆంగ్ల పత్రిక కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో రేణు స్పష్టం చేసారు. తమ కుటుంబాన్ని పూణే కి మార్చినప్పటినుంచి ఈ విధమైన పుకార్లు వ్యాపించాయని ఆమె చెప్పారు.ఈ అర్ధం లేని పుకార్లు తనను ,పవన్ ను ఎంతగానో బాధ పెట్టాయని ఆవేదన వ్యక్తం చేసారు .ఈ పుకార్ల ప్రభావం తమ పిల్లల పై పడుతుందేమో అని భయం గా వుందని చెప్పారు.తాము 11 ఏళ్ళనుంచి పరస్పరం ప్రేమించు కుంటున్నామని భవిష్యత్ లోను అలాగే ఉంటామని రేణు అన్నారు 

వడ్డీ లేకుండా అప్పిచ్చువాడు.. ఆ మహానుభావుడు

శ్యామరాజు అంటే పుంగనూరు, చౌడేపల్లె మండలాల్లో తెలియని వారంటూ లేరు. తొమ్మిది పదుల వయసులో కూడా పాదరక్షలు ధరించకుండా, ఎలాంటి ఆర్భాటాలు లేకుండా, నిరాడంబరంగా కనిపించే ఆయనో కోటీశ్వరుడంటే నమ్మశక్యం కాదు! చిన్నతనం నుంచీ వ్యవసాయంతో కోట్లాది రూపాయల ఆస్తులను కూడబెట్టినా ప్రజల కోసం కోట్లాది రూపాయల ఆస్తులను విరాళాలుగా ఇచ్చిన దాతృత్వం ఆయనది.
చౌడేపల్లె మండలం పందిళ్లపల్లె పంచాయతీ బాలసముద్రం గ్రామంలో పెరుమాళ్లరాజు, కుప్పమ్మ అనే రైతు కుటుంబంలో 1912లో శ్యామరాజు ఐదవ సంతానంగా జన్మించారు. పెరుమాళ్లరాజు కుటుంబం తమిళనాడు నుంచి చౌడేపల్లె మండలానికి వచ్చి స్థిరపడింది. శ్యామరాజు ఆయన భార్య లక్ష్మమ్మకు ఇద్దరు సంతానం. చిన్నతనం నుంచీ వ్యవసాయం అంటే శ్యామరాజుకు ఎంతోఇష్టం. ఆయన తల్లిదండ్రులు సంపాదించిన 62 ఎకరాల్లో మామిడి, చింత తోటలను పెంచారు. అలాగే వేరుశెనగ, చెరుకు సాగు చేసేవారు. కాలక్రమంలో వ్యవసాయ కష్టంతో కోట్లాది రూపాయల ఆస్తులను సంపాదించారు. వ్యవసాయ పనుల కోసం రైతులకు ఏ రూపంలో సాయం కావాలన్నా చేస్తారనే పేరుతెచ్చుకున్నారు. వడ్డీ లేని రుణాలు ఇవ్వడమే కాదు; బ్యాంకుల్లో రైతుల రుణాలకు హామీదారుడిగా ఉంటారనే పేరూ ఉంది. రైతులు ఫలసాయం చేతికొచ్చాక సొమ్ము రూపేణాగానీ లేదా పంట రూపంలోగానీ ఆయనకు అప్పు చెల్లిస్తూంటారు. ఈ గుణమే ఆయన్ను రైతులకు ఆప్తుడిని చేసింది. నిరాడంబరి, నిగర్విగా పేరున్న శ్యామరాజు పందిళ్లపల్లె పంచాయతీకి 1960లో తొలిసారిగా ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. నాటి నుంచి సర్పంచ్ పదవిలో కొనసాగుతున్నారు. 2000 సంవత్సరంలో ఎస్సీలకు రిజర్వు చేశారు. తిరిగి 2005లో సర్పంచ్‌గా ఆయన ఎన్నికయ్యారు. పంచాయతీని ఎంతగానో అభివృద్ధి చేశారు. పందిళ్లపల్లె పంచాయతీకి నాలుగుసార్లు జిల్లాలో ఉత్తమ పంచాయతీ అవార్డు లభించింది. బెంగళూరులో శ్రీ మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఇన్‌స్టిట్యూట్స్ ఆధ్వర్యంలో నిర్మించిన ఇంజినీరింగ్, మెడికల్ ఇతర కళాశాలల్లో తన కుమారులను భాగస్వామ్యులుగా చేసి, ప్రతి ఏటా నలుగురు ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. శ్యామరాజు ప్రస్తుతం పుంగనూరులోని ఎల్‌ఐసీ కాలనీలో నివాసముంటూ వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటున్నారు. ఈయన భార్య లక్ష్మమ్మ మాత్రం బాలసముద్రం గ్రామంలో ఉంటూ వ్యవసాయ పనులు పర్యవేక్షిస్తుంటారు. ఈయన కుమారులు, కోడళ్లు, అందరూ ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. వీరు కూడా తీరిక వేళల్లో వ్యవసాయ పనులు చేస్తుంటారు.

ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు
వ్యవసాయంతో కష్టపడ్డాను. పైవాడూ దయ చూపాడు. అందుకే ఈ స్థితికొచ్చాను. మట్టిని నమ్ముకున్నోళ్లు పచ్చగా ఉంటేనే అందరూ బాగా ఉంటారనే నమ్మేవాళ్లలో నేనూ ఒకణ్ని. అందుకే రైతులకు చేతనైనంత సాయం చే స్తున్నా. ఇరవై ఏళ్ల క్రితం ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవా కార్యక్రమాలు చేస్తున్నా. పుంగనూరు పట్టణంలో కోర్టు భవనాల నిర్మాణం కోసం సుమారు 2 కోట్ల రూపాయల విలువ చేసే ఎకరా పొలం, ఆర్టీసీ బస్టాండు నిర్మాణానికి సుమారు 3 కోట్ల రూపాయల విలువ చేసే ఎకరా స్థలాన్ని విరాళంగా ఇచ్చాను. చౌడేపల్లె మండలంలో ఎన్నో కుటుంబాలకు సాయం చేశాను. కుడిచేత్తో సాయం చేస్తే ఎడమ చేతికి తెలియకూడదని సామెత ఉంది. అవన్నీ ఎందుకు చెప్పడం? పైవాడు పిలిస్తే ఏమీ మూట కట్టుకుని పోలేం కద నాయనా!? ఇతరులకు సాయం చేస్తే ఆ పైవాడే చల్లగా చూస్తాడు. - శ్యామరాజు

తిరుమలలో సిగరెట్‌ ప్యాకెట్‌ పక్కన పెట్టుకుని ప్రెస్‌మీట్‌ లో ఎమ్మెల్యే

తిరుమలలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వీరశివారెడ్డి నిబంధనలు అతిక్రమించారు.తిరుమలలో ఉదయం శ్రీవారిని దర్శించుకున్న వీరశివారెడ్డి ఆ తర్వాత ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేశారు.తిరుమలలో సిగరెట్‌ నిషేధం ఉందని తెలిసి కూడా సిగరెట్‌ ప్యాకెట్‌ పక్కన పెట్టుకుని ప్రెస్‌మీట్‌ నిర్వహించారు.ఎమ్మెల్యే తీరుపట్ల పలువురు భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పదిమందికి ఆదర్శంగా నిలవాల్సిన ప్రజాప్రతినిధే ఇలా వ్యవహరిస్తే సామాన్య జనం పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు... ప్రెస్‌ మీట్‌లో వీరశివారెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌పై విరుచుకుపడ్డారు.జగన్‌ ఓ మాఫియా కింగ్‌లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు

కర్నూలు: కొత్త టూరిజం ప్రాజెక్టు ప్లాన్

కర్నూలు జిల్లాలోని వివిధ దేవస్థానాలు, చారిత్రక ప్రదేశాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దేందుకు రంగం సిద్ధమవుతోంది. గత జూన్ 23న టూరిజం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జమేష్ రంజన్ ప్రముఖ దేవస్థానాలు, చారిత్రక ప్రదేశాల అభివృద్ధికి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్, పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. అందులో భాగంగా జిల్లాలోని 15 క్షేత్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.7.53 కోట్లతో జిల్లా పర్యాటక శాఖ కలెక్టర్ ద్వారా ప్రతిపాదనలు పంపింది. 
స్థల సేకరణను బట్టి గెస్ట్‌హౌస్‌లు, నీటి వసతి, పబ్లిక్ టాయ్‌లెట్స్, పార్కులు, స్వాగత తోరణాలు తదితరాలను నిర్మిస్తారు. డార్మెటరీల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తారు. అవసరమున్న చోట రెస్టారెంట్ల నిర్మాణం చేపడతారు. 

నాకు డైరెక్టుగా కాల్ చేయండి- చిత్తూరు ఎస్పీ

కాల్‌యువర్ ఎస్పీ కార్యక్రమం బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ క్రాంతి రాణా టాటా ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి 11.30 వరకు 08572- 234000 నెంబర్‌కు ఫోన్ చేసి బాధితులను సమస్యలను నిర్భయంగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. పేర్లను రహస్యంగా ఉంచుతామన్నారు. ఇప్పటి వరకు నిర్వహించిన 14 కార్యక్రమాల్లో 430 ఫిర్యాదులు అందాయని తెలిపారు. వీటిలో భూ తగాదాలు, కోర్టు కేసులను మినహాయించి మిగిలిన సమస్యలను ఆయా స్టేషన్ల ద్వారా పరిష్కరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు.

తిరుమలలో నో రష్ !

తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ అనూహ్యంగా తగ్గింది. భక్తులు స్వామివారి దర్శనం కోసం అయిదు కంపార్ట్ మెంట్లలో వేచి ఉన్నారు. వెంకన్న సర్వ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతోంది

ఓ రైతు రికార్డు: ఎద్దుకు గంతలు కట్టి సాగు

అనంతపురం జిల్లా ఆత్మకూరుకు చెందిన తైదుల ఈశ్వరరెడ్డి పొలంలో బుటారు నాగరాజు  మంగళవారం  వినూత్న ప్రయోగం చేశారు. ఒంటెద్దుకు గంతలు కట్టి పగ్గాలు, పట్టెండ్లు లేకుం డా 12 ఎకరాల్లో జొన్న సాగుచేశాడు. ఉద యం ఆరు నుంచి మధ్యాహ్నం రెండు గంటల లోపు సాగు పూర్తిచేశాడు. సాధారణంగా కాడెద్దులతోనే ఎనిమిది గంటల వ్యవధిలో ఇంత విస్తీర్ణంలో సాగుచేయడం కష్టసాధ్యం. అలాం టిది ఒకే ఎద్దుకు గంతలు కట్టి విత్తడం ఆషామాషీకాదు. ఈ దృశ్యాన్ని మండలంలోని పలు గ్రామాల రైతులు తిలకించి యువరైతు నాగరాజును అభినందించారు.

సత్యసాయి జయంతి వేడుకలు త్వరలో

సత్యసాయి బాబా జయంతి వేడుకలు మరో రెండు వారాల్లో జరగనున్నాయి. వీటి కోసం భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాబా భౌతికంగా ఉన్నప్పుడు ప్రతి జన్మదినం ఒక పర్వదినంలా జరిగేది. సత్యసాయి సెంట్రల్ ట్రస్టు, ప్రభుత్వం జన్మదిన ఏర్పాట్లపై మూడునెలల ముందు నుంచే కసరత్తు చేసేవి. వేడుకలకు దేశ,విదేశాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు విచ్చేశారు. వారికి ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేసేవారు. ప్రతి జన్మదినాన బాబా వరాలు కురిపించేవారు. 

విద్య, వైద్యం, తాగునీరు తదితర కార్యక్రమాలకు చేయూతనిచ్చేవారు. సత్యసాయి దివ్యప్రకాశం వల్ల పుట్టపర్తి అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా ఎదిగింది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అన్ని ప్రాంతాల వారు ఇక్కడ స్థిరపడ్డారు. గుడిసెలు పోయి ఆకాశ హార్మ్యాలు వెలిశాయి. మాంద్యం సందర్భాలను ఎరుగక ఎంతో వేగంగా అభివృద్ధి సాధిస్తూ వచ్చింది. బాబా భౌతికంగా ఉన్న రోజుల్లో పుట్టపర్తిలో కోట్ల రూపాయల లావాదేవీలు సాగాయి. 

పతినిత్యం వచ్చీ వెళ్లే భక్తులతో పట్టణం కిటకిటలాడేది. బాబా తన దేహాన్ని వదిలి ఇటీవల శివైక్యం చెందారు. బాబా జయంతి వేడుకలపై ప్రభుత్వం ఇప్పటి వరకు దృష్టి సారించలేదు. బాబా పూర్వపు దివ్య వైభవాన్ని సత్యసాయి ట్రస్టు నిర్వాహకులు ఏ విధంగా కొనసాగిస్తారో వేచిచూడాల్సి వుంది. బాబా చివరి కోరికలుగా ప్రచారమవుతున్న వేయి స్తంభాలగుడి, ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికీ ఉపాధి, సేవలందించే పథకాలను ట్రస్టు ప్రకటించవచ్చని భక్తులు ఎదురుచూస్తున్నారు. 

సివిల్స్ కు ఉచిత శిక్షణ

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమ్స్) 2012కు హాజరయ్యే బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ డెరైక్టర్ డాక్టర్ సి.రామాంజినేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. 21 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగి ఉండి డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 

బయోడేటా ఫారం లో అభ్యర్థి పేరు, తల్లిదండ్రుల పేర్లు, సంవత్సరాదాయం, కులం, విద్యార్హతలు, వాటి ధ్రువీకరణ పత్రాలు, రెండు పాస్‌పోర్ట్‌సైజు ఫొటోలు, రూ.5 విలువైన స్టాంపులు అతికించిన రెండు సెల్ఫ్ అడ్రస్ కవర్లతో ఈ నెల 20లోపు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. దరఖాస్తులను ఏపీ బీసీ స్టడీ సర్కిల్, అనంతపురం అనే చిరునామాకు పంపాలన్నారు.