Sunday, 1 January 2012

2014 ఎన్నికలలోపు జగన్ తిరిగి కాంగ్రెసులోకి రాక తప్పదు..జెసి దివాకర్ రెడ్డి

2014 ఎన్నికల వరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తిరిగి కాంగ్రెసులోకి రాక తప్పదని అనంతపురం జిల్లా సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు, మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి ఆదివారం అభిప్రాయపడ్డారు. వచ్చే సాధారణ ఎన్నికలలోపు పార్టీని వీడిన వారు అందరూ స్వగృహానికి వస్తారని ఆయన ఆశాభావం వ్య్తక్తం చేశారు. తెలంగాణలో ఉప ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్న జగన్ నిర్ణయం తనకు తెలియదని ఆయన వ్యాఖ్యానించారు. సంక్రాంతి తర్వాత నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తానని సిఎం చెప్పడం శుభ పరిణామం అన్నారు. కాగా సంక్షేమ పథకాల ప్రచారంతోనే తాము ఉప ఎన్నికల్లో ప్రజల్లోకి వెళతామని ఆనం వివేకానంద రెడ్డి వేరుగా అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ ఈ ఏడాది పూర్వ వైభవం పొందుతుందన్నారు.ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల మధ్య అవగాహన వాస్తవమైనా అందులో ఆశ్చర్యపడాల్సిన అంశమేమీ లేదని మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ గుంటూరు జిల్లాలో అన్నారు. పాలనలో కొన్ని ఒడిదుడుకులు ఎదురు కావడం సహజమేనని వాటిని అధిగమిస్తామన్నారు. కొత్త సంవత్సరంలో తమ శాఖ మరింత సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఏవీ ప్రజల బాగోగులు పట్టించుకోవని, కేవలం అధికారం కోసమే పాకులాడతాయన్నారు.
నమస్తే రాయలసీమ డాట్ కాం

 పాఠకులకు 2012 నూతన సంవత్సర శుభాకాంక్షలు






ప్రభుత్వ ఉద్యోగార్థులకు వయో పరిమితి రెండేళ్లు పెంపు

నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి నూతన సంవత్సరం కానుక ప్రకటించారు. అన్ని కేటగిరీల్లో గరిష్ఠ వయోపరిమితిని రెండు సంవత్సరాలు పెంచుతున్నట్లు శనివారం ప్రకటించారు. కొన్నేళ్ళుగా ఖాళీల భర్తీ జరగకపోవడం, ఇదే క్రమంలో ఇటీవల లక్ష ఉద్యోగాల భర్తీకి నిర్ణయించడంతో... వయో పరిమితి పెంచాలంటూ విన్నపాలు అందాయి. దీంతో అధిక సంఖ్యలో నిరుద్యోగులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వయో పరిమితి పెంపు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం సర్వీసులో ఉండి మరో పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారికి కూడా ఈ వయోపరిమితి పెంపు వర్తిస్తుంది.