Tuesday, 3 January 2012

2012లో సచిన్ వందో సెంచరీ చేస్తాడా...?

2012వ సంవత్సరం క్రీడాభిమానులకు కొత్త అనుభూతిస్తుందా? లేదా అనేది ఇప్పడు ఓ పెద్ద మిస్టరీగా మారింది. ఇందుకు కారణాలు రెండు. ఒకటి క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ తన వందో సెంచురీని ఈ సంవత్సరంలో పూర్తి చేస్తాడని అభిమానులు నమ్ముతుండగా, 2012వ సంవత్సరం ఒలంపిక్స్‌కు ఆతిధ్య సంవత్సరం. 2012లో జరగనున్న ఒలంపిక్ గేమ్స్‌కి లండన్ ఆతిధ్యమివ్వనున్న సంగతి తెలిసిందే. ఐతే ఈ సంవత్సరం ఈ రెండు విషయాలు ఖచ్చితంగా జరుగుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. మొదటి టెస్టుని కొల్పోయిన టీమిండియాకు రెండవ టెస్టు జరగనున్న సిడ్నీ స్టేడియం ఒకింత కలసి వచ్చే అంశంగా భావిస్తున్నారు. సిడ్నీ గ్రౌండ్‌లో సచిన్‌ రికార్డు చాలా మెరుగ్గానే ఉంది. 1992 నుంచి ఇప్పటి వరకు సిడ్నీలో జరిగిన నాలుగు టెస్ట్‌ల్లో సచిన్‌ టెండూల్కర్‌ పాల్గొని, తన సత్తా చాటాడు. 148 నాటౌట్‌(1992), 241 నాటౌట్‌(2004), 154 నాటౌట్‌ (2008). దీంతో పాటు 221 పరుగుల సరాసరితో సచిన్‌ పేరిట సిడ్నీ రికార్డు ఉంది. ఇదే స్ఫూర్తితో సిడ్నీ పిచ్‌పై సచిన్‌ టెండూల్కర్‌ సెంచరీ చేయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. ఇంకా ఈ గ్రౌండ్ విశేషం ఏమిటంటే వందో టెస్ట్‌ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తోంది. ఇది మాత్రమే కాకుండా సచిన్ వందో సెంచురీ సాధించాలే వారిలో ఆస్టేలియా ప్రధాని జూలియా గిలార్డ్ కూడా చేరారు. ఈ సందర్బంలో ఆమె ఆదివారం సిడ్నీలో ఏర్పాటు చేసిన తేనీటి విందులో మాట్లాడుతూ ప్రస్తుత టెస్ట్‌ సీరీస్‌లో సచిన్‌ టెండూల్కర్‌ తన నూరవ అంత ర్జాతీయ శతకం సాధించాలనే ఆకాంక్షను గిలార్డ్‌ వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు 99 అంతర్జాతీయ సెంచరీలు స్కోర్‌ చేసిన సచిన్‌ టెండూల్కర్‌ను గిలార్డ్‌ చూస్తూ, ‘మా క్రికెట్‌ జట్టును ఆస్ట్రేలియన్లు గట్టిగా సమర్థిస్తున్నా ఈ సీరీస్‌లో ఏదో ఒక సమయంలో (టెండూల్కర్‌ నుంచి) ఎంతో ప్రత్యే కమైన 100 స్కోర్‌ కోసం వారు ఎదురుచూస్తున్నారని నా భావన’ అని చెప్పారు.

కెప్టెన్ ధోనీకి ఫెయిర్ ప్లే అవార్డు

కెప్టెన్ కూల్‌గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న టీమిండియా కెప్టెన్ ధోనీ 2011వ సంవత్సరానికి గాను ఏఐపిఎస్‌ ఫెయిర్‌ ప్లే అవార్డుని సొంతం చేసుకొని, ఈ అవార్డు అందుకున్న తొలి ప్రపంచ క్రికెటర్‌గా ధోనీ చరిత్ర సృష్టించాడు. ధోనీకి ఈ అవార్డు రావడానికి గల కారణాలను తెలియజేస్తూ ఇంగ్లాండుతో జరిగిన టెస్టు సిరిస్‌లో ఇయాన్ బెల్ రనౌటైనా తిరిగి వెనక్కి పిలిచి ధోనీ క్రీడా స్పూర్తిని చాటినందుకు గాను అంతర్జాతీయ క్రీడా ప్రెస్‌ సమాఖ్య (ఏఐపిఎస్‌) సెక్రటరీ జనరల్‌ రోస్‌ల్యాన్‌ మోరిస్‌ ఈ అవార్డుని అందజేశారు. ధోనీకి ఈ అవార్డు వచ్చిన సంగతిని మోరిస్‌ ఆదివారం తెలియజేశారు.''జనవరి 13న జరగనున్న అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి ధోనీ హాజరుకావడం లేదు. అందుకే ఆదివారం సిడ్నీలోని షేర్‌టాన్‌ హోటల్‌లో ధోనీకి మెమో అందజేశాం'' అని మోరిస్‌ తెలిపారు. ఏప్రిల్‌ 4, 2012న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభోత్సవ వేడులో ధోనీకి ట్రోఫీని అందజేస్తామని మోరిస్‌ పేర్కొన్నారు.

తారకరత్నపై జూ ఎన్టీఆర్ సీరియస్!

నందమూరి తారకరత్న పై జూ.ఎన్టీఆర్ చాలా సీరియస్ గా ఉన్నారని ఫిల్మ్ సర్కిల్స్ లో వినపడతోంది. దానికి కారణం తారకరత్న తన పేరు అయిన ఎన్టీఆర్,తారక్ లను ఉపయోగించుకుని పబ్లిసిటీకి దిగటమేనని చెప్తున్నారు. నందమూరి తారక రత్న తాజా చిత్రం నందీశ్వరుడు కోసం తన పేరులోని మొదట అక్షరాలను ఉపయోగిస్తూ ఎన్ టి ఆర్ అని మార్చుకున్నారు. అలాగే తారకరత్న లోని తారక్ ని కూడా ఉపయోగిస్తున్నారు. ఇది జూ ఎన్టీఆర్ ని ఇబ్బందుల్లో పడేసింది. మీడియాలో సైతం ఎన్టీఆర్ చిత్రం నందీశ్వరుడు,తారక్ కొత్త చిత్రం నందీశ్వరుడు అని పబ్లిసిటీ చేస్తున్నారు. ఎన్టీఆర్ చిత్రం సంక్రాంతి విడుదల వంటివి తన అభిమానులను కన్ఫూజన్ లో పడేస్తాయని జూ.ఎన్టీఆర్ భావించి చాలా సీరియస్ గా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. అయితే ఎలా ఈ విషయాన్ని తారకరత్నకు తెలియచెప్పాలనే ఆలోచనలో ఉన్నారని, ఈ పేరు విషయంలో ఎలాంటి గొడవలు జరగకుండా చూడాలని తన సన్నిహితులను కంగారుపడవద్దని జూనియర్ ఆదేశించినట్లుగా సమాచారం.

జగన్ లక్ష్యంగా విజయ సాయిరెడ్డి అరెస్టు?

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధినేత, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో జగతి పబ్లికేషన్స్ వైస్ చైర్మన్ విజయ సాయి రెడ్డి అరెస్టు వెనుక పెద్ద కథ నడిచినట్టుగా విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసిందని జగన్‌కు చెందిన సాక్షి దిన పత్రిక రాసింది. అసెంబ్లీ స్థానాలకు త్వరలో ఉప ఎన్నికలు జరగనుండటం, మరో పదహారు మంది ఎమ్మెల్యేలపై అనర్హత ఫిర్యాదు స్పీకర్ వద్ద పెండింగులో ఉందని, ఈ నేపథ్యంలో జగన్‌ను ఏదోలా ఇరుకున పెట్టే యత్నంలో భాగంగా, సిఎం కిరణ్ కుమార్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన, కేంద్ర హోంమంత్రి చిదంబరంతో ఆయన చర్చల పర్యవసనంగానే ఈ అరెస్టు చోటు చేసుకుందన్న వాదన వినిపిస్తోందని రాసింది. విచారణలో సిబిఐకి సాయి రెడ్డి పూర్తిగా సహకరించారని, క్రమం తప్పకుండా ఆయన విచారణకు హాజరవుతున్నప్పటికీ అరెస్టు చేయడం వెనుక రాజకీయమైన ఒత్తిళ్లు పని చేశాయనే అనుమానం వ్యక్తం చేసింది.అవిశ్వాసం సందర్భంగా కాంగ్రెసు విప్ ధిక్కరించిన ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటిస్తే జరగబోయే ఉప ఎన్నికలు కాంగ్రెసు, టిడిపికి ఇబ్బందికరమేనని, ఈ నేపథ్యంలో జగన్ ప్రతిష్టను దెబ్బతీయాలన్న లక్ష్యం, ఒత్తిళ్ల కారణంగానే అరెస్టు జరిగిందని వాదనలు వినిపిస్తున్నాయని పేర్కొంది. ఏడాదిగా సొంత పార్టీ తలనొప్పులతో పాటు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుండి ఎదురవుతున్న పెను సవాళ్ల నేపథ్యంలో తాజాగా సిఎం ఢిల్లీలో చిదంబరంతో సుదీర్ఘంగా చర్చించిన క్రమంలో వ్యూహాత్మకంగానే సాయి రెడ్డి అరెస్టు దిశగా అడుగులు పడినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. దీనికి రెండు రోజుల ముందే సిబిఐ జెడి లక్ష్మీ నారాయణ ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారని పేర్కొంది.

టీటీడీకీ శతవిధాలా శఠగోపం కిలో రూపాయి బియ్యం

ధార్మిక సంస్థ టీటీడీకి గుత్తేదారులు శతవిధాలా శఠగోపం పెడుతున్నారు. కిలో రూపాయి సర్కారీ బియ్యానికి పాలిష్‌చేసి టీటీడీకి అంటగడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. పౌరసరఫరాల బ్యాగుల్లోనే వచ్చిన వేలాది కిలోల బియ్యాన్ని టీటీడీ మార్కెటింగ్ అధికారులు పక్కన పెట్టారు. వాటి నమూనాలు తీసి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. టీటీడీకి బియ్యం సరఫరా టెండరుదారైన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌కు చెందిన గంగాదేవి మోడ్రన్ రైస్‌మిల్ నిర్వాహకులు శనివారం రెండు లారీల్లో 50 కిలోల బరువున్న 2,220 బియ్యం బ్యాగులు టీటీడీ మార్కెటింగ్ గోడౌన్‌కు పంపారు. మార్కెట్‌లో కిలో రూ.30లు పలుకుతున్న సోనా మసూరి బియ్యాన్ని రూ.21.06 లకు సరఫరా చేస్తామని గుత్తేదారు టెండర్ దక్కించుకున్నారు. నెలకు 50 లారీల బొప్పున 6 నెలలకు 300 లోడ్ల బియ్యం వారు సరఫరా చేయాల్సి ఉంది. మూడు నెలలుగా 150 లారీల బియ్యాన్ని సరఫరా చేశారు. కాగా అర్మూర్ రైస్ మిల్లు నుంచి వచ్చిన బియ్యం సంచులు పౌరసరఫరాల శాఖ రేషన్‌షాపు డీలర్లకు సరఫరా చేసే బ్యాగులు కావడం, వాటిపై అగ్‌మార్క్ ముద్ర లేకపోవడంతో టీటీడీ అధికారులకు అనుమానం వచ్చింది. అవి కిలో రూపాయి సబ్సిడీ బియ్యమనే భావించి వాటిని పక్కన పెట్టారు. పరీక్షల నిమిత్తం వాటిని టీటీడీ ల్యాబ్‌కు పంపినట్లు టీటీడీ మార్కెటింగ్ ఆఫీసర్ శ్రీహరి తెలిపారు.

రూ.7 లక్షలిస్తే పోస్టు గ్యారంటీ!

‘మీరు పరీక్షకు హాజరైతే చాలు. మిగతా సంగతి మేము చూసుకుంటాం. మాకు తెలిసిన ఒక మంత్రి ద్వారా పోస్టు వచ్చేలా చూస్తాం. రూ.7 లక్షలిస్తే పోస్టు గ్యారంటీ’ అంటూ వీఆర్వో, వీఆర్‌ఏ ఉద్యోగార్థులను దళారులు మభ్యపెడుతున్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసినప్పటి నుంచే కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు దళారులు రంగంలోకి దిగారు. మరోవైపు ప్రభుత్వం ఈ పరీక్షను అవకతవకలకు తావులేకుండా నిర్వహిస్తామని చెబుతోంది. రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మూల్యాంకనం సైతం అందుబాటులో ఉన్న సాంకేతిక విధానం ద్వారా నిర్వహిస్తారు. ఈ విషయం తెలియని కొందరు అమాయక నిరుద్యోగులు దళారుల మాయలో పడి మోసపోతున్నారు. కొందరైతే అప్పు చేసి మరీ దళారుల చేతుల్లో పెడుతున్నారు. అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు దళారుల అవతారమెత్తి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు. జిల్లాలో వీఆర్వో, వీఆర్‌ఏ పోస్టులకు విపరీతమైన పోటీ నెలకొంది. ఒక్కో పోస్టుకు సగటున 440 మంది పోటీ పడుతున్నారు. ఈ నెల 30న జిల్లా కేంద్రంలో రాత పరీక్ష జరగనుంది. ఆరోజు ఉదయం వీఆర్వో, మధ్యాహ్నం వీఆర్‌ఏ అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రాన్ని రూపొందించే బాధ్యత జేఎన్‌టీయూకు అప్పగించారు. జిల్లాలో పర్యవేక్షణలో రాత పరీక్ష నిర్వహిస్తారు.

పరిటాల కుటుంబం నుంచి ప్రాణహాని...సూరి భార్య గంగుల భానుమతి

పరిటాల కుటుంబం, ఆయన అనుచరులే సూరిని హత్య చేశారని సూరి భార్య గంగుల భానుమతి ఆరోపించారు. మంగళవారం ఉదయం మీడియతో మాట్లాడుతూ  పరిటాల కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని మద్దిలచెర్వు సూరి భార్య గంగుల భానుమతి భయం వ్యక్తం చేశారు. తన భర్త హత్యకు పరిటాల కుటుంబీకులే కారణం అని ఆరోపించారు. టిడిపి నేతలతో కుమ్మక్కై తన భర్తని భానుయే హత్య చేశాడని ఆమె ఆరోపించారు. భాను బతికే ఉన్నాడని ఆమె చెప్పారు. పోతుల సురేష్, చమన్ సహకారంతో తనని హత్య చేసే అవకాశం ఉందని ఆమె తెలిపారు. పటోళ్ల, సూరి హత్యలకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. సూరి హత్య తరువాత తమ కుటుంబం కష్టాల్లో ఉందని ఆమె చెప్పారు.