Tuesday, 28 February 2012

ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే స్వాగతిస్తాం....జెసి దివాకర్ రెడ్డి

తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తే స్వాగతిస్తానని మాజీ మంత్రి, అనంతపురం జిల్లా కాంగ్రెసు పార్టీ సీనియర్ శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మంగళవారం స్పష్టం చేశారు. తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ, ప్రత్యేక అభివృద్ధి మండలి ఏర్పాటు చేస్తున్నట్టు తనకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని చెప్పారు. అయితే వెనుకబడిన ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వడం మాత్రం సబబేనని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు, రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఉన్న నేపథ్యంలో నిర్ణయం ఎప్పుడో చెప్పలేమని జెసి దివాకర్ రెడ్డి అన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ పరిస్థితి బాగుంటుంది ఆయన అభిప్రాయపడ్డారు.కాగా తెలంగాణ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి మండలి, ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చే దిశలో ఆలోచిస్తుందనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణవాదులు మాత్రం తమకు ఎలాంటి ప్రత్యేక ప్యాకేజీలు, అభివృద్ధి మండళ్లు అవసరం లేదని తెలంగాణ రాష్ట్రమే కావాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ తప్ప ఎలాంటి ప్రత్యామ్నాయాలకు తాము ఆమోదించే ప్రసక్తి లేదని స్పష్టం చేస్తున్నారు.


 

బాలయ్యతో సినిమా చేయడం లేదు...వైవిఎస్ చౌదరి

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా ‘కామన్ మ్యాన్’ చిత్రం రూపొంద బోతోందని, దర్శకుడు కృష్ణ వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారని, వైవిఎస్ చౌదరి ఈ చిత్రాన్ని బొమ్మరిల్లు వారి బ్యానర్‌పై నిర్మిస్తున్నారని ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై పలు టీవీ ఛానళ్లలో కూడా జోరుగా ప్రచారం మొదలైంది. రాజకీయాలను టార్గెట్ చేస్తూ ఈ చిత్రం రూపొందుతోందని, త్వరలో రాజకీయ తెరంగ్రేటం చేయబోతున్న బాలయ్యకు ఈ సినిమా ప్లస్సవుతుందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ వార్తలు అభిమానులను కూడా ఊత్సాహ పరిచాయి.అయితే అందరికీ షాక్ ఇస్తూ ఈ వార్తలను వైవిఎస్ చౌదరి ఖండించారు. తాను బాలకృష్ణతో గానీ, కృష్ణ వంశీతో గానీ ప్రస్తుతం ఎలాంటి సినిమాలు చేయడం లేదని....‘సీఎం(కామన్ మ్యాన్)’ సినిమా తాను నిర్మిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని, ఈ సినిమాతో తనకు గానీ, బొమ్మరిల్లు బ్యానర్ కు గానీ ఎలాంటి సంబంధం లేదని వైవిఎస్ చౌదరి స్పష్టం చేశారు.


 

అనంతపురం జిల్లాకు జాతీయ అవార్డు

ఓటరు గుర్తింపుకార్డుల జారీలో మొదటిసారి వందశాతం పూర్తీచేసినందుకు భారత ఎన్నికల కమిషన్ జిల్లాకు జాతీయ అవార్డు ప్రకటించింది. ఈమేర కు ఎన్నికల కమిషన్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి. జిల్లా యంత్రాంగం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో 2011 లో రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాప్రప్రథమంగా వందశాతం ఓటరు గుర్తింపు కార్డుల జారీ ప్రక్రియ పూర్తీ చే సింది.దీంతో రాష్ట్రంలో మొదటిసారి అనంతపురం జిల్లాలో వందశాతం ఓ టరు గుర్తింపు కార్డుల జారీ జరిగింది. ఈ ఘనత సాధించినందుకు ప్రస్తుత రాష్ట్ర పురపాలక సంఘం డైరెక్టర్ జనార్థన్‌రెడ్డిని ఎన్నికల కమిషన్ ప్రశంసించింది. తాను పనిచేసిన సమయంలో జిల్లాకు జాతీయ అవార్డు రావటం గర్వకారణంగా ఉందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. వ్యక్తిగత సర్వీసు రికార్డులో ఈ విషయాన్ని చేర్చామని ఎన్నికల కమిషన్ సూచించటం ఆనందం కలిగిస్తోందన్నారు. ప్రజాస్వామ్య ప్రక్రియ బలోపే తం చేయటంతో పాటు ఎన్నికల సక్ర మ నిర్వాహణకు దోహదపడే గుర్తింపు కార్డుల జారీని సమర్థవంతంగా నిర్వహించగలిగింది. 2011లో అప్పటి కలెక్టర్ జనార్థన్‌రెడ్డి ప్రత్యేక చొరవ చూపారు. వందశాతం గుర్తింపుకార్డులు జారీచేయాలని యంత్రాంగంతో ప్రణాళిక రూపొందించి పని చేయించా రు.

కోహ్లీని యువరాజ్ సింగ్ అభినందించారు.

భారత యువ ఆటగాడు విరాట్ కోహ్లీ వీరోచిత ఇన్నింగ్స్‌పై యువరాజ్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అమెరికాలో క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న యువరాజ్.. 86 బంతుల్లో 133 పరుగులతో నాటౌట్‌గా నిలిచిన విరాట్ కోహ్లీని అభినందించారు. చీకూ(సపోటా పండు) కోహ్లీది గ్రేట్ ఇన్నింగ్స్ అని.. నిద్రకు ముందు సపోటా జ్యూస్‌ను తీసుకో అంటూ ట్విట్టర్‌లో మెసేజ్ పోస్ట్ చేశారు. బొస్టన్‌లో చికిత్స పొందుతున్న యువరాజ్‌ను గతవారంలో అలాగే తన స్నేహితుడు, నటుడు రణ్‌విజయ్ సింగ్ కూడా ఈ విధంగానే యువీ దగ్గరకు వెళ్లి పరామర్శించాడు. ఇద్దరూ కలిసి 'అందాజ్‌ అప్నా అప్నా' మూవీ చూశామని యువీ అన్నాడు. క్యాన్సర్‌ కణితికి కీమోతెరపీ తీసుకుంటున్న యువీ ఆరోగ్యం రోజురోజుకూ కుదుటపడుతోంది. తొలి దశ కీమోతెరపీ తర్వాత కణితి దాదాపు పోయిందని అతడికి చికిత్స అందిస్తున్న డాక్టర్‌ లారెన్స్‌ రిపోర్టు ఇచ్చాడు. ఇప్పుడు రెండో దశ కీమోతెరపీ జరుగుతోంది. మార్చి చివరి కల్లా యువీ కీమోతెరపీ ముగుస్తుందని మే నెల లోపు గ్రౌండ్‌లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయని అన్నారు.

శ్రీలంకపై భారత్ ఘన విజయం

 భారత్ - శ్రీలంక మద్య జరుగుతున్న వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 86 బంతులలో (133)సెంచరీ చేసి నాటౌట్‌గా నిలిచాడు. అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ కోహ్లీకి ఇది తొమ్మిదవ సెంచరీ కాగా.. శ్రీలంకపై రెండవ సెంచరీ కావడం విశేషం. అంతక ముందు శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లకు గాను 320 పరుగులు చేయగా.. 321 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రీలంక బౌలర్స్‌ని చితకబాదారు. టీమిండియా మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లీ రాణించి సెంచరీ నమోదు చేయగా.. ఓపెనర్ గౌతమ్ గంభీర్ 63 పరుగుల వద్ద పెవిలియన్‌కు చేరాడు. శ్రీలంక బౌలర్స్‌లలో మలింగ, మహారూఫ్ తలో వికెట్ తీసుకున్నారు.భారత్ 36.4 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 321 పరుగులు చేసి 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. విరాట్ కోహ్లీ 88 బంతులలో 133 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవగా, గౌతమ్ గంభీర్ 63, సచిన్ : 39, సెహ్వాగ్ : 30 పరుగులు చేశారు. కాగా టీంఇండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.అంతకు ముందు బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 320 పరుగులు చేసి 321 పరుగుల విజయలక్ష్యాన్ని ఇండియా ముందుంచింది. మ్యాచ్ ప్రారంభం నుంచి నిలకడగా ఆడిన శ్రీలంక భారీ స్కోర్ చేసింది. దిల్షాన్ సంగక్కర పరుగుల వర్షం కురిపించి ఇండియా బౌలర్లకు చెమటలు పట్టించారు.