Sunday, 8 January 2012

108 వాహనాల నిర్వహణ రవాణా శాఖ పరిధిలోకి

అత్యవసర వైద్య సేవల కోసం వినియోగిస్తున్న 108 వాహనాల నిర్వహణను ఆర్టీసీకి అప్పగించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ యోచిస్తున్నట్టు సమాచారం. 108ను ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పట్టించుకోకపోవడంతో పార్టీకి నష్టం జరుగుతోందని భావిస్తున్న సత్తిబాబు 108ని రవాణా శాఖ పరిధిలోకి తీసుకురావాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సగానికిపైగా 108 వాహనాలు షెడ్‌లకే పరిమితం కావడం పట్ల సత్తిబాబు సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో 108 వాహనాల బాధ్యతను ఆర్టీసీకి అప్పగిస్తే బాగుంటుందని ఆయన భావిస్తున్నట్టు సమాచారం.

విభేదాలున్నా సర్దుకుంటా...టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు

ప్రోటోకాల్ వీఐపీ దర్శనంలో మూడు కేటగిరిల విధానం రద్దు చేయనున్నట్టు టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు తెలిపారు. వచ్చే పాలకమండలి సమావేశంలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు చెప్పారు. వైకుంఠ ఏకాదశి రోజున తిరుమలలో ఎమ్మెల్యేలకు కలిగిన అసౌకర్యానికి ఆయన క్షమాపణ కోరారు. రెండో బ్రహ్మోత్సవాల గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈవో, జేవోలతో విభేదాలు లేవని, ఒకవేళ ఉన్నా తానే సర్దుకుంటానన్నారు. అన్నదానంలో కల్తీ బియ్యాన్ని పరిశీలిస్తున్నామని, త్వరలో టెండర్ మారుస్తామని బాపిరాజు తెలిపారు.

మహేష్ బాబు-కాజల్ మధ్య ఘాటైన లిప్ లాక్ సీన్లపై. ..నమ్రత ఓకే!

మహేష్ బాబు నటించిన ‘బిజినెస్ మేన్’ సినిమా మరో వారంలో విడుదలవుతుందనే తరుణంలో సినిమాలో మహేష్ బాబు-కాజల్ మధ్య ఘాటైన లిప్ లాక్ సీన్ ఉందనే వార్తలు సినిమాపై మరింత ఆసక్తిని పెంచాయి. మహేష్ బాబు ఇదివరకెన్నడూ ఏ హీరోయిన్ తో కూడా లిప్ లాక్ సీన్లలో నటించలేదు కాబట్టి తమ అభిమాన హీరో తెరపై ముద్దు సరసం పండిస్తుంటే చూడాలని ఆశ పడుతున్నారు అభిమానులు. మరి ముద్దు సీన్ వార్త నిజమా? కాదా?అనే సందేహంలో ఉన్న అభిమానులకు దర్శకుడు పూరి జగన్నాధ్ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ...సినిమాలో మహష్ బాబు-కాజల్ మధ్య ముద్దు సీన్ ఉందని కన్ ఫర్మ్ చేశారు. మహేష్ బాబు తన భార్య నమ్రత శిరోద్కర్ అనుమతి మేరకే ముద్దు సీన్ కు ఓకే చేశాడని, సినిమాకు ఎంతో కీలకంగా ఉండే ఆ సీన్ పై ఆమె ఎలాంటి అభ్యంతరం తెలుపకుండా ఓకే చెప్పిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

బిజినెస్‌మేన్ సినిమాలో మహేష్‌ది కంత్రీ క్యారెక్టర్

మహేష్‌ది కంత్రీ క్యారెక్టర్. అతను ఏంచెబుతున్నాడో, ఎందుకు చెబుతున్నాడో అర్థంకాదు. ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటాడు అని పూరీ జగన్నాధ్ చెప్పుకొచ్చారు. ఆయన తన తాజా చిత్రం ‘బిజినెస్‌మేన్’త్వరలో విడుదల కానున్న సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించి ఇలా స్పందించారు. అలాగే... మహేష్‌ని తప్ప సినిమాలో మరెవరినీ చూడలేం. వినోదం కూడా అతని క్యారక్టర్‌ ద్వారానే ఉంటుంది. బ్రహ్మానందం, అలీ వంటి కమేడియన్స్‌ లేరు. పోకిరితో పోలిస్తే మహేష్‌ పర్‌ఫార్మెన్స్‌ పెరిగింది. వాయిస్‌లో కూడా మార్పు కనిపించింది అని పూరి పేర్కొన్నారు. భాయ్ కావాలనుకున్నోడి కథ ఇది. ‘పోకిరి’ చిత్రానికి ఈ చిత్రానికి మహేష్‌లో చాలా మార్పు వచ్చింది. ఇందులో కొత్త మహేష్ కనిపిస్తాడు. ఆ చిత్రం తర్వాత మా ఇద్దరి కాంబినేషన్‌లో చిత్రం అంటే అంచనాలుంటాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గని స్థాయిలో ఈ చిత్రం వుంటుంది అన్నారు.ఇక ఈ చిత్రంలో.. ‘పోకిరి’ తరహా డైలాగ్‌లు మాత్రం వుండవు. ఈ చిత్రంతో మరోసారి ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేయనున్నాం. థియేటర్లు సర్దుబాటు కానందున తమిళ, మళయాల భాషల్లో ఈ చిత్రాన్ని 15 రోజులు ఆలస్యంగా విడుదల చేస్తున్నాం’ అన్నారు. బిజినెస్ గురించి మాట్లాడుతూ..‘మూడున్నర నెలల్లో ‘బిజినెస్‌మేన్’ పూర్తి చేశాం. మొత్తం 74 రోజులు షూటింగ్ చేస్తే మహేష్ 65రోజులు వర్క్ చేశాడు. ముందు ఈ చిత్రాన్ని ఈ నెల 11న విడుదల చేయాలనుకున్నాం. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ నెల 13న విడుదల చేస్తున్నాం’ అన్నారు దర్శకుడు పూరి జగన్నాథ్.ఇది ఈ నెల 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ చిత్రం 16 వందల థియేటర్లలో విడుదలవుతోంది. ఈ రోజు నుంచే అన్ని చోట్లా అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో ఏ చిత్ర విడుదల కాలేదు. ఈ చిత్ర ఆడియోకు అన్ని చోట్లా మంచి స్పందన లభిస్తోంది. సార్ వస్తారా పాట విశేషంగా అలరిస్తోంది. ఈ చిత్రానికి మహేష్ స్పెషల్ ఎట్రాక్షన్.

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కెసిఆర్‌పై ఫైర్ ...మంత్రి టిజి వెంకటేష్

చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుపై ఆదివారం మరోసారి ధ్వజమెత్తారు. కెసిఆర్ వెనుక ఉద్యమకారులు లేరని గూండాలు మాత్రమే ఉన్నారని అన్నారు. నిత్యం ప్రజలను రెచ్చగొట్టే విధానంతో కెసిఆర్ ముందుకెళుతున్నారన్నారు. గుడ్లు, రాళ్లు విసిరినంత మాత్రాన తెలంగాణ రాదన్నారు. ఉద్యమాల పేరుతో అరాచకాలు చేస్తున్న వారి కోసం కొత్త జైళ్లు వస్తున్నాయన్నారు. సంఘ విద్రోహశక్తులకు, ఉద్యమకారులకు ప్రత్యేక జైళ్లు అవసరమన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడిపై తెలంగాణవాదుల దాడి అవివేకం అన్నారు. బాబు తన హయాంలో తెలంగాణకు అధిక ప్రాధాన్యతమిచ్చి, రాయలసీమకు అన్యాయం చేశారన్నారు. తెలంగాణ ఉద్యమం నీరుగారిందని, కెసిఆర్ ఉచ్చులో యువత పడవద్దని సూచించారు.లక్ష ఉద్యోగాల ప్రణాళికను అడ్డుకున్న వారు చరిత్రహీనులవుతారని హెచ్చరించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ముగ్గురు శాసనమండలి సభ్యులపై వేటు పడుతుందని చెప్పారు. కాగా ఆంధ్ర ప్రదేశ్ బ్యాడ్మింటన్ అధ్యక్షుడిగా టిజి వెంకటేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన గుంతకల్లులోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో పూజలు చేసి, ఆర్యవైశ్య పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేశారు.

వెంకన్న సొమ్ముతో ప్రైవేట్ బ్యాంక్‌ల వ్యాపారం

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను విక్రయించే ఓ ప్రైవేటు బ్యాంక్ టిక్కెట్ల విక్రయంతో వచ్చిన సోమ్మును సొంత ఖాతాలో వేసుకుని తన వ్యాపారానికి (రొటేషన్) వినియోగించుకుంటున్న వైనం ఇటవల ఎల్‌ఎఫ్ ఆడిట్‌లో వెలుగు చూసింది. దీంతో టిటిడి యాజమాన్యం బ్యాంక్ అధికారులను పిలిచి ప్రశ్నించింది. తమను నిలదీస్తే టిక్కెట్ల విక్రయాలు తాము చేయలేమని, ఆ బాధ్యతల నుండి తప్పుకుంటామని బ్యాంకు అధికారులు బెదిరింపు ధోరణిలో చెప్పటంతో టిటిడి అవాక్కయింది. ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయాల గత రెండు దశాబ్దాలుకు పైగా ఓ ప్రైవేటు బ్యాంకుకు అప్పగించిన విషయం విదితమే. అయితే ఈ టిక్కెట్ల విక్రయానికి బ్యాంకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, వారి జీతబత్యాల చెల్లింపు, ఇతర వౌలిక సదుపాయాల కల్పనకు ఏటా కొన్ని లక్షల రూపాయల ఆర్థిక భారాన్ని భరిస్తోంది. ఈ నేపథ్యంలో 2009-10 సంవత్సరంలో ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయం ద్వారా 54 కోట్ల రూపాయలు టిటిడి ఖాతాలో జమ చేయాల్సి ఉంది. అయితే ఆ ప్రైవేటు బ్యాంకు కేవలం 52 కోట్ల రూపాయలను మాత్రమే జమ చేసి మిగిలిన రెండు కోట్ల రూపాయలను బ్యాంక్ ఖాతాలోనే ఉంచుకున్నట్లు ఎల్‌ఎఫ్ ఆడిట్‌లో వెలుగు చూసింది. తద్వారా 2 కోట్ల రూపాయలపై వెంకన్నకు రావలసిన వడ్డీ డబ్బులు సదరు బ్యాంకు ఖాతాలోకే చేరుతున్నాయి. ఇది పలు విమర్శలకు దారి తీస్తోంది. ఓ వైపు కోట్ల రూపాయల టిటిడి సోమ్మును తమ ఖాతాలో వేసుకుని, తిరిగి తాము భక్తులకు, టిటిడికి సేవ చేస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ఓ వైపు వ్యాపార దృక్పథంతో తిరుమలలో బ్యాంకును ఏర్పాటు చేసుకుని, మరో వైపు సేవగా చెప్పుకోవడాన్ని ఉద్యోగ సంఘాలు ఖండిస్తున్నాయి. ఇదిలా వుండగా ఈ విషయంపై టిటిడి అధికారులను ప్రశ్నించినప్పుడు తాము గట్టిగా ఒత్తిడి చేస్తే, వారు టిక్కెట్ల విక్రయ సేవలు నిలిపివేస్తామంటూ హెచ్చరిస్తున్నారని వాపోయారు. అలా నిలిపి వేస్తే తిరిగి మరో బ్యాంక్ టిక్కెట్ల విక్రయానికి ఆసక్తి చూపుతుందా.. అనే అనుమానాలు కూడా టిటిడిలో వ్యక్తమవుతున్నాయి. అవసరమయితే ఇందుకు సంబంధించి టిటిడినే మరో సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది

సీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలి

రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్యాకెజీ ఇవ్వాలని ఐఎన్‌టియుసి రాష్ట్ర అధ్యక్షులు రాఘవరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినప్పుడే సమగ్రాభివృద్ధి సాధ్యవౌతుందన్నారు.  కర్నూలు నగరంలోని నేతాజీ కాంప్లెక్స్ సెంటర్‌లో ఐఎన్‌టియుసి జిల్లా, నగర కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రాఘవరాజు మాట్లాడుతూ సంఘటిత, అసంఘటిత కార్మికుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సోనియాగాంధీ ఆలోచన విధానాలకు అనుగుణంగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయని అన్నారు. కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వం ఖాయిలాపడ్డ చక్కెర కార్మాగారాలు, వివిధ పరిశ్రమల పునరుద్ధరణకు 740 కోట్ల రుణ సదుపాయాన్ని కల్పించడం హర్షణీయమన్నారు. కార్మికులు, పేదల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టాన్ని అమలులోకి తెస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదే అన్నారు. ఐఎన్‌టియుసి యూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు విశ్వశాస్ర్తీ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఐఎన్‌టియూసిని బలోపేతం చేసి కార్మికుల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా సభ్యులు పని చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా ఐఎన్‌టియుసి అధ్యక్షులు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చేనత కార్మికులకు వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఐఎన్‌టియుసి అధ్యక్షులు రాజశేఖర్ మాట్లాడుతూ జిల్లాలో అన్ని మున్సిపాలిటీ ప్రాంతాల్లో వివిధ ప్రభుత్వ రంగ సంస్థల్లో యూనియన్‌ను విస్తరించి కార్మిక రంగానికి, అభివృద్ధికి అండగా నిలుస్తామన్నారు. నూతన కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు రాఘవరాజు ప్రకటిస్తూ నియామక ఉత్తర్వులు జారీ చేశారు

రాయలసీమ జిల్లాలో రాజీవ్ యువ కిరణాలు నీరుగారి పోతోంది

రాజీవ్ యువ కిరణాలు పథకం లక్ష్యానికి ప్రభుత్వమే తూట్లు పొడిచింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన రాజీవ్ యువ కిరణాలు పథకం జిల్లాలో నీరుగారి పోతోంది. ఇప్పటికే శిక్షణ పొంది ఉద్యోగాలు చేస్తున్న వారు వాటిని వదిలేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం కుస్తీ పడుతుండగా శిక్షణలో ఉన్న వారు సైతం గైర్హాజరవుతుండటమే కాక కొత్తగా శిక్షణ పొందేందుకు యువత ముందుకు రాకపోవడం విశేషం. దీంతో రాజీవ్ యువ కిరణాల పథకం కింద లక్ష ఉద్యోగాల కల్పనకు ప్రభుత్వ ఉద్యోగాలకు జారీ చేసిన నోటిఫికేషనే్ల గండి కొట్టుకున్నట్లయింది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి యువత కోసం ప్రవేశ పెట్టిన ఈ పథకం కింద భారీ ఎత్తున ప్రైవేటు ఉద్యోగాలు ఇవ్వాలని భావించారు. గత అనుభవాల దృష్ట్యా యువత నుంచి మద్దతు రాకపోవడంతో తన మాట నిలుపుకోవడానికి ప్రభుత్వ ఉద్యోగాల్లోని ఖాళీలను భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా రాజీవ్ ఉద్యోగ శ్రీ పథకం కింద ప్రైవేటు కంపెనీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను గుర్తించి ఆయా సంస్థలకు అవసరమైన మేరకు ప్రభుత్వమే శిక్షణ ఇప్పించి ఉద్యోగాలను కల్పించింది. అయితే ప్రైవేటు కంపెనీల్లో జీతం తక్కువ ఉండటం, ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి కారణాల వల్ల అపుడు కూడా ఉద్యోగం పొందిన యువత వెనక్కి తిరిగిరావడంతో ఆ పథకం క్రమంగా మూలనపడింది. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత మెరుగులు దిద్దుతారని ప్రచారం జరిగినా కొద్ది రోజులకే ఆయన ఆకస్మికంగా మరణించడంతో ఆ పథకానికి మంగళం పాడేశారు. ఇక ముఖ్యమంత్రిగా కిరణ్‌కుమార్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తరువాత రాజీవ్ యువకిరణాలు పేరుతో పాత పథకాన్ని తెరపైకి తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పేరొందిన 15 సంస్థలకు యువతకు శిక్షణ ఇప్పించే బాధ్యతను అప్పగించారు. ఆయా సంస్థలు ప్రవేటు సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు గుర్తించి వాటికి అవసరమైన మానవ వనరులకు అనుగుణంగా శిక్షణ ఇచ్చి ఆయా సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పించాల్సి ఉంది. ప్రభుత్వం గుర్తించిన 15 సంస్థలు జిల్లాల్లో తమ భాగస్తులుగా స్థానిక శిక్షణా సంస్థలను ఎంపిక చేసుకొని శిక్షణ ఇవ్వడం ప్రారంభింయి. జిల్లాలో 4,308 మందికి శిక్షణ, ఉద్యోగాలు ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో 2వేల మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు చూపించగా అప్పటికే నైపుణ్యం ఉన్న 13 వందల మందికి నేరుగా ఉద్యోగాలు ఇప్పించారు. సుమారు మరో 600 మంది వరకు ప్రస్తుతం శిక్షణలో ఉన్నారు. జిల్లాకు నిర్ణయించిన లక్ష్యంలో సుమారు 3,300మందికి ఉద్యోగాలిచ్చినట్లు ప్రభుత్వానికి నివేదిక వెళ్లగా దానిపై ప్రభుత్వం విచారణ జరిపిస్తే అందులో 45శాతం మంది ఉద్యోగాలు మానేసి వెళ్లిపోయినట్లు తేలింది. మరో 20 శాతం యువకులకు సంబంధించి చిరునామాలు కూడా లభ్యం కాలేదని తెలుస్తోంది. శిక్షణ ఇచ్చి ఉద్యోగావకాశం కల్పిస్తే వెళ్లిపోవడానికి గల కారణాలపై మరో విచారణ నిర్వహించగా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ కారణంగా ఆర్‌వైకె కింద ఉద్యోగం పొందిన వారిలో ఎక్కువ మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వహించే పోటీ పరీక్షలు, ఇంటర్వ్యూలకు అవసరమైన శిక్షణ పొందేందుకు వెళ్తున్నారని తేలింది. మరికొందరు జీతం తక్కువ, పని ఎక్కువగా ఉందని, ఉద్యోగ భద్రత లేదని చెప్పినట్లు తెలుస్తోంది. కొందరు సొంత జిల్లాలో కాకుండా ఇతర జిల్లాల్లో ఉద్యోగాలు ఇవ్వడం కూడా ఆర్థిక భారంగా పరిగణించి వెనక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక వైపు ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు, మరోవైపు ఉపాధి హామీ పథకం పనులు ప్రారంభం కావడంతో రాజీవ్ యువ కిరణాల లబ్ధిదారులు తమకు వచ్చిన ఉద్యోగావకాశాలను వదిలేసి వెనక్కి వచ్చినట్లు విచారణలో వెల్లడయింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా శిక్షణలో ఉన్న సుమారు 600మంది అభ్యర్థుల్లో కూడా చాలా వరకు డ్రాపవుట్స్ కనిపించే అవకాశం ఉందని పథకాన్ని నిర్వహిస్తున్న అధికారి ఒకరు తెలిపారు. మొత్తం మీద రాజీవ్ యువ కిరణాలు పథకానికి ప్రభుత్వమే గండి కొట్టిందన్న అభిప్రాయం ఎక్కువ మంది వ్యక్తం చేస్తుండటం గమనార్హం.

అనంతపురం జిల్లాలో ఫ్యాక్షన్ గ్రామాల్లో పోలీసుల సోదాలు

ధర్మవరం రూరల్ పోలీసుసర్కిల్ పరిధిలోని పలు ఫ్యాక్షన్ గ్రామాల్లో దిగ్భంద సోదాలు నిర్వహిస్తున్నట్లు సిఐ గంగయ్య తెలిపారు.  స్థానిక రూరల్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సర్కిల్ పరిధిలోని ధర్మవరం, బత్తలపల్లి, తాడిమర్రి మండలాల్లోని ఫ్యాక్షన్ గ్రామాల్లో ఇప్పటికే పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించి ముఠాతగాదాలతో జరిగే అనర్థాలు ప్రజలకు వివరించామన్నారు. ముఖ్యంగా ఫ్యాక్షన్ గ్రామాలైన ధర్మవరం మండలంలోని రేగాటిపల్లి, నేలకోట, ఓబుళనాయునిపల్లి, సిసి కొత్తకోట, కామిరెడ్డిపల్లి, బత్తలపల్లి మండలంలోని గరిశలపల్లి, తాడిమర్రి మండలంలోని దాడితోట గ్రామాల్లో దిగ్భంద సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సోదాల్లో భాగంగా ఉదయానే్న పోలీసులు గ్రామాల్లో ప్రవేశించి గ్రామస్థులను గ్రామం వెలుపలికి వెళ్ళనివ్వకుండా ఇతరులను గ్రామంలోకి అనుమతించకుండా పకడ్బందీగా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో అనుమానం వచ్చిన వారి ఇళ్ళతో పాటు పశువులపాకలను, గడ్డివాములు తదితర ప్రాంతాలను సైతం క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. శనివారం ధర్మవరం మండలంలోని ఓబుళనాయునిపల్లి గ్రామం లో ఎస్‌ఐ అబ్దుల్‌కరీం ఆధ్వర్యంలో దిగ్భందసోదాలు నిర్వహించగా తాడిమర్రి మండలంలో ఎస్‌ఐ శేఖర్ ఆధ్వర్యంలో దాడితోట గ్రామంలో దిగ్భందసోదాలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే బత్తలపల్లి మండలంలోని గరిశలపల్లి గ్రామంలో పిఎస్‌ఐ రఘురాంప్రసాద్ ఆధ్వర్యంలో పల్లెనిద్ర నిర్వహించినట్లు తెలిపారు. ముఖ్యంగా పల్లెనిద్ర దిగ్భందసోదాల కార్యక్రమాల వల్ల ముఠా తగాదాల జోలికి ప్రజలను వెళ్ళకుండా చైతన్యపరుస్తూ వాటివల్ల జరిగే అనర్థాలను వివరిస్తున్నట్లు ఆయన తెలిపారు.

నేడు శ్రీశైలం మల్లన్న వార్షిక ఆరుద్రోత్సవం

పరమశివుని జన్మనక్షత్రమైన ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆదివారం రాత్రి శ్రీమల్లికార్జున స్వామికి వార్షిక ఆరుద్రోత్సవ  నిర్వహిస్తున్నట్లు  ఈఓ హనుమంతరావు  తెలిపారు. ఈ ఉత్సవంలో భాగంగా ఆదివారం రాత్రి 10.30 గంటలకు స్వామివార్లకు లింగోద్భవకాల, మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం, 9వ తేదీ సోమవారం స్వామివార్ల ప్రాతఃకాల పూజలనంతరం 5.30 గంటలకు ఉత్తరద్వార దర్శనం ఉంటుందన్నారు. అనంతరం 6 గంటలకు స్వామి అమ్మవార్లను నంది వాహనంపై వేంచేయించి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహిస్తారని తెలిపారు. సోమవారం వేకువజామున 3.30 గంటలకు ఆలయ ఉత్తరద్వారమైన శివాజీ గోపురాన్ని తెరచి 4 గంటలకు సుప్రభాతసేవ, 5 గంటలకు మహామంగ ళహారతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. వార్షిక ఆరుద్రోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం వేకువజామున జరిగే సుప్రభాత, మహామంగళహారతి సేవా టికెట్లను నిలుపుదల చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఉత్సవంలో ఆలయ మహాద్వారమైన కృష్ణదేవరాయ గోపురం (తూర్పుద్వారం) మీదుగా గ్రామోత్సవానికి తరలివేళ్లే స్వామివారు ధనుర్మాసంలో వచ్చే ముక్కొటిఏకాదశి, వార్షిక ఆరుద్రోత్సవం రోజులలో మాత్రమే ఉత్తరద్వారం గుండా తరలి వెళ్లడం విశేషమన్నారు. స్వామివార్ల ప్రాతఃకాల ఉత్తర ద్వార దర్శనానంతరం 6 గంటలకు తూర్పుద్వారమైన శ్రీకృష్ణదేవరాయ రాజగోపురద్వారాలను తెరచి భక్తులకు దర్శన, ఆర్జితసేవలకు అనుమతిస్తున్నట్లు ఈఓ పేర్కొన్నారు