Thursday, 5 January 2012

మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి లంచం ఆఫర్ చేసిన ఓ అధికారి

రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డికి లంచం ఆఫర్ చేసిన ఓ అధికారి ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ దినపత్రిక ఆ మహిళా అధికారి ఉదంతం గురించి రాసింది. రాష్ట్ర పరిపాలనా కేంద్రమైన సచివాలయంలోనే, సాక్షాత్తూ కేబినెట్ మంత్రికే ఒక జిల్లా స్థాయి అధికారి లంచం ఆఫర్ చేశారు. మంత్రి ముందే తన బ్యాగు జిప్పు తీసి, రూ.మూడు లక్షల కరెన్సీ కట్టలు టేబుల్ మీద పెట్టారు. 'ఇది ఉంచండి సార్' అంటూ చెప్పారు. ఇది చూసి మంత్రి విస్తుపోయారు. రంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్యాధికారి జయకుమారి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డీఎల్ రవీంద్రా రెడ్డికి లంచం ఇవ్వజూపిన ఉదంతం ఇది.విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అంటూ ఆ పత్రిక ఇలా రాసింది - తనను బదిలీ చేస్తున్నట్లు జయకుమారికి ఎందుకో అనుమానం వచ్చింది. దీంతో వెంటనే ఆమె సచివాలయానికి వెళ్లారు. మంత్రి రవీంద్రా రెడ్డిని కలిశారు. 'సర్ నను ట్రాన్స్‌ఫర్ చేయాలని అనుకుంటున్నారట!' అంటూ... తనను బదిలీ చేయొద్దని, రంగారెడ్డి జిల్లా అధికారిగానే ఉంచాలని విన్నవించుకున్నాను. ఈ విషయం తనకు తెలియదని, పరిశీలిస్తానని మంత్రి చెప్పారు. కానీ జయకుమారి అక్కడి నుంచి కదల్లేదు.తన వెంట తెచ్చిన బ్యాగు నుంచి రూ.3 లక్షల ఫెళఫెళలాడే కరెన్సీ తీసి, మంత్రి టేబుల్ ముందు పెట్టారు. మంత్రి ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యం నుంచి తేరుకుని 'ముందు నా చాంబర్ నుంచి బయటికి వెళ్లిపోండి' అని కసురుకున్నారు. ఆ తర్వాత ఆమె మంత్రి డీఎల్ చాంబర్ నుంచి బయటికి వచ్చి ఆయన ఓఎస్‌డీ గౌడ్‌ను కలిశారు.'సార్... ఇది.. ఉంచుకోండి. ట్రాన్స్‌ఫర్ చేయకుండా చూడండి' అంటూ ఈసారి గౌడ్ టేబుల్ మీద రూ.3 లక్షలు పెట్టారు. ఆమె తీరును పసిగట్టిన డీఎల్ ముందుగానే ఓఎస్డీకి ఫోన్ చేసి విషయం చేరవేశారు. వెరసి... ఓఎస్డీ కూడా జయకుమారిని కసిరి పంపారు. ఈ ఉదంతాన్ని మంత్రి ధ్రువీకరించినట్లు ఆ పత్రిక తెలిపింది.

ఒక్కసారే వైకుంఠ దర్శనం : మంత్రి టీ జీ వెంకటేష్

ముస్లింలు మక్కా మసీదుకు ఎలా వెళతారో.. ఆ విధంగా తిరుమల స్వామివారిని కూడా ఏడాదికోసారి మాత్రమే దర్శించుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ వెంకటేష్ సూచించారు. తిరుమల శ్రీవారిని గురువారం దర్శించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు.తాను మొదటిసారిగా వైకుంఠ ఏకాదశి రోజున తిరుమల వచ్చానన్నారు. తాను క్యూలైన్లో వెళ్లేటప్పుడు చాలామంది భక్తులు పలుసార్లు వచ్చామని చెప్పారన్నారు. అందుకని భక్తులు తమ జీవితంలో ఒకసారి మాత్రమే వైకుంఠ ఏకాదశికి రోజున స్వామివారిని దర్శించుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇక భక్తులు త్వరితగతిన ఆలయం వెలుపలకు వచ్చేలా గర్భగుడి తప్ప మిగిలిన ప్రాంతాల్లోని క్యూలైన్లను తాజా సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేయాలన్నారు. మఠ, పీఠాధిపతుల సలహాలు భక్తులకు ఇబ్బందులు తలెత్తెలా ఉన్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందరికీ ఆమోదయోగ్యమైన క్యూలైను ప్రవేశపెట్టాలని టీటీడీ అధికారులను మంత్రి కోరారు.

మొదటిసారిగా కలత చెందా...మోహన్ బాబు

తిరుమల శ్రీవారి చెంతకు వచ్చి మొదటిసారిగా కలత చెందానని సినీ నటుడు మోహన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మనసును బాధ పెట్టుకుని వెళ్తున్నానని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.తాను ఏది మాట్లాడినా వివాదమే అవుతుందని, అందువల్ల తాను ఏమీ మాట్లాడబోనని, తనను వదిలేస్తే సంతోషిస్తానని అంటూనే ఆయన టిటిడి తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంట్లోవారిని గౌరవించకుండా వీధుల్లో ఉన్నవారిని గౌరవిస్తున్నారని ఆయన మండిపడ్డారు.మొదట ఇంట్లోవారిని గౌరవించాలని, మనల్ని మనం గౌరవించుకోవాలని ఆయన అన్నారు. ఎవరిని గౌరవిస్తున్నారో చూస్తూనే ఉన్నామని, ఇక్కడి తీరు చూసి మనసు కష్టంగా ఉందని, మొదటి సారి మనసు కష్టపెట్టుకుని వెళ్తున్నానని ఆయన అన్నారు.

సంక్రాంతి తర్వాత మాకు పదవులు ఖాయం : చిరంజీవి

సంక్రాంతి తర్వాత రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ జరుగుతుందని, అందులో తమ వారికి బెర్త్‌లు ఖాయమని కాంగ్రెస్ నేత చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది సినిమా చేస్తారా అన్న మీడియా ప్రశ్నకు సమాధానంగా కథ నచ్చితే సినిమా చేస్తానని చిరు తెలిపారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురువారం ఉదయం శ్రీవారిని దర్శించుకున్న చిరంజీవి అనంతరం మీడియాతో పై విధంగా మాట్లాడారు.ఎట్టకేలకు చిరంజీవి నోరు విప్పడంతో రాష్ట్ర కేబినేట్‌లో పీఆర్పీకి చెందిన వారికి పదవులు వచ్చే విషయంపై కొనసాగుతున్న ఊహాగాలకు తెరపడింది. చిరంజీవి వర్గం ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు విషయంలో కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పష్టమైన హామీ వచ్చినట్లు భావించాలి.