కర్నూలు

జిల్లా చరిత్ర

budda pyramid in kurnool

అది పుడమి తల్లి అందాలన్నీ  పొత్తిళ్లలో పొదివి పట్టుకున్న జిల్లా... అక్కడ కొండ కోనలుంటాయి.. జాలువారే జలపాతాలుంటాయి. వయ్యారంగా నడిచి వెళ్లే నడక నేర్చిన నదులుంటాయి.  శిధిలాలను ముద్రించుకున్న చారిత్రక ఆధారాలుంటాయి. చిరకాలం నిలిచిపోయే శిలాశాసనాలుంటాయి.  అవతారపురుషుడు నడయాడిన నేల ఇది.. భూత భవిష్యత్ వర్తమానాలను వివరించే కాలజ్ఞానం పుట్టిందీ కూడా ఇక్కడే.. ఇన్ని ప్రత్యేకతలున్న ఒకే ఒక జిల్లా కర్నూలు.. కనువిందు చేసే కర్నూలు అందాల పై  ప్రత్యేక కథనం.
   రాయలేలిన రతనాల సీమ కర్నూలు జిల్లా... ఈ జిల్లాకు సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదతో అలరారిన చరిత్ర ఉంది. రుషులు, మహర్షులు నడయాడిన నేల అందుకే జిల్లా పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లయింది. శ్రీశైలం, మహానంది, యాగంటి, అహోబిలం, కాల్వబుగ్గ వంటి పరమ పవిత్ర స్థానాలు వెలిశాయి. ఈ ప్రాంతంలో హిందూ ఆలయాలే కాక ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ప్రసిద్ధి చెందిన జామియా మసీదు కూడా ఇక్కడే ఉంది. ముస్లింలు జీవితంలో ఒక్కసారయినా దర్శించుకొని తీరాలను కునే మక్కా మసీదు తర్వాత అంతటి పవిత్రతను సంతరించుకున్న దర్గాగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇంకా ఇక్కడి సుకేశుల డ్యామ్ అందాలు ఎంత సేపు చూసినా తనివి తీరదు. కర్నూల్ జిల్లా అడుగడుగూ అందాలతో ఆహ్వానిస్తుంటుంది.

ఇక్కడి బెలూం గుహలను చూస్తుంటే ఎంత సేపు చూసే ఏదో తన్మయానికి లోనైనట్టుంటుంది.  ఓర్వకల్లు లోని రాక్ గార్డెన్స్, సుంకేశుల డ్యామ్ లు జిల్లా ప్రతిష్టను మరింత  ఇనుమడింప జేస్తున్నాయి. చారిత్రక ప్రదేశంగా విలసిల్లే కర్నూలు నందు కొండారెడ్డి బురుజు, బొమ్మాళీ కోటలు, గత చరిత్రను కల్ళముందు కదలాడించే నిర్జీవ సాక్ష్యాలు.

 ఇక్కడి చారిత్రకప్రదేశాలన్నీ అలనాటి వైభవాన్ని చాటి చెపుతుంటాయి. కలియుగ అవతార పురుషుడిగా భావించే వీరభ్రహ్మేంద్ర స్వామి కూడా ఇక్కడే తన కాలజ్ఞానాన్ని రచించారు. దైవం మానవరూపంలో నడయాడిన నేల ఇదని ఇక్కడి వారు గర్వంగా చెప్పుకుంటారు.

.చెంచుల నివాసస్ధలాలుగా ఉన్న నల్లమల అడవులు ,ఎర్రమల అడవులూ ఈ జల్లాకు చెందిన ప్రకృతి సంపదలే. తుంగభద్రమ్మ గలగలలతోనే కాదు ప్రకృతి రమణీయమైన ప్రదేశాలతోనూ భాసిల్లుతోన్న కర్నూలు జిల్లా పర్యటకంగా మాత్రం వెనకబడే ఉంది. జిల్లాలో ఉన్న అలనాటి ప్రాచీన కట్టడాలు, పుణ్యక్షేత్రాలు, సహజ సిద్దంగా ఏర్పడిన గుహలు  తదితర ప్రదేశాలను  టూరిజం డిపార్డ్ మెంట్ అభివృద్ధి  చేసి, గత చరిత్ర వైభవాన్ని భవిష్యత్  తరాలకు అందించాల్సి అవసరం ఎంతైనా ఉంది

ఇప్పుడు కర్నూలుగా పిలువబడే ఈ నగరం పూర్వ నామధేయం కందెనవోలు. 11వ శతాబ్దిలో ఆలంపూరు లో కడుతున్న ఆలయం కోసం బళ్ల మీద రాళ్లను తరలించే క్రమంలో, ఈ ప్రాంతంలో నదిలోకి బళ్లు దిగేముందు బండి చక్రాలకు కందెన రాయడానికి ఆపేవారట. దీని వల్ల ఈ ప్రాంతానికి కందెనవోలు అనే పేరు వచ్చింది. అదే రానురాను కర్నూలుగా రూపాంతరం చెందింది.

బాదామి చాళుక్యులు, తెలుగు చోళులు, కాకతీయులు ఈ ప్రాంతాన్ని పాలించినట్లుగా చరిత్ర చెబుతోంది. అటు తర్వాత విజయనగర రాజులు ఈ ప్రాంతాన్ని జయించి తమ ఆధీనం లోనికి తెచ్చుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ప్రస్తుత జిల్లా అంతా ఆయన ఏలుబడి లోనికి వచ్చింది. కర్నూలులో ప్రఖ్యాతి గాంచిన కొండారెడ్డి బురుజు, అచ్యుతదేవరాయలు విజయనగర రాజుగా ఉన్నప్పుడు కట్టబడిన కోటలో ఓ భాగం మాత్రమే, ఆ తర్వాత ఎప్పుడో కొండారెడ్డి అనే విప్లవవీరుణ్ణి అక్కడ బంధించడం వల్ల ఆ పేరు వచ్చింది.

1565లో తళ్ళికోట యుద్ధంలో విజయనగర సామ్రాజ్య పతనం తర్వాత గోల్కొండ కుతుబ్ షాహీ సుల్తాన్ కర్నూలును వశపరచుకొన్నాడు. 1687లో ఔరంగజేబు కృష్ణానది తీరాన్ని దాటి దండయాత్ర చేసినప్పుడు, గియాసుద్దీన్ అనే సేనాని కర్నూలును జయించాడు. 1733లో ఇక్కడి నవాబు హిమాయత్ ఖాన్, కర్ణాటక యుద్ధాలుగా ప్రసిద్ధి గాంచిన ఆంగ్లేయ-ఫ్రెంచి వారి గొడవల్లో పాలుపంచుకొన్నాడు. 1741లో మరాఠా విజృంభణ కొనసాగినప్పుడు, కర్నూలు వారి హయాంలోనికి వచ్చింది.

1751 లో సలాబత్ జంగ్, ఫ్రెంచి జనరల్ బుస్సీ (పిల్లల పాటల్లోని బూచాడు) కర్నూలును ముట్టడించారు. 1755 లో మైసూరుకు చెందిన హైదర్ అలీ ఈ ప్రాంతాన్ని వశపరచుకొన్నాడు. 1799లో శ్రీరంగపట్టణంలో జరిగిన యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించగా అప్పుడు ఈ జిల్లా హైదరాబాద్ నిజాం నవాబు సొంతం అయింది. తన రక్షణ కోసం బ్రిటిషు సైనికులని ఉపయోగించుకొన్నందుకు ప్రతిగా 1800లో ఈ ప్రాంతాన్ని బ్రిటిషు వారికి దత్తత ఇచ్చాడు నిజాం నవాబు. అందుకే ఈ ప్రాంతాన్ని అప్పటి నుంచి 'దత్తమండలం' (సీడెడ్) అనేవారు. 1928 లో ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు, గాడిచర్ల హరిసర్వోత్తమ రావు ఇప్పటిరాయలసీమ అనే పేరు పెట్టాడు. ఇప్పటికీ సినీపరిభాషలో 'సీమ'ను సీడెడ్ అనే పిలుస్తారు.

18వ శతాబ్ధం లో కర్నూలు, అర్ధ స్వత్రంత్రుడైన పఠాన్‌ నవాబు యొక్క జాగీరు లో భాగముగా ఉండేది. 1838 లో ఈ నవాబు యొక్క వారసుని, బ్రిటీషు ప్రభుత్వము రాజద్రోహ నేరంమోపి గద్దె దింపినది. నవాబు యొక్క జాగీరు కర్నూలు రాజధానిగా మద్రాసు ప్రెసిడెన్సీలో ఒక జిల్లా అయినది. జిల్లా మధ్యలోబనగానపల్లె సంస్థానము నలువైపులా కర్నూలు జిల్లాచే చుట్టబడి ఉన్నది. 1947లో భారత దేశ స్వాతంత్రానంతరము కర్నూలు, పూర్వపు మద్రాసు ప్రెసిడెన్సీనుండి ఏర్పడిన మద్రాసు రాష్ట్రములో భాగమైనది. బనగానపల్లె సంస్థానము జిల్లాలో విలీనమైనది. 1953లో మద్రాసు రాష్ట్రములోని పదకొండు ఉత్తర జిల్లాలు కలసి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు కర్నూలు ఆంధ్ర రాష్ట్ర తొలి రాజధాని అయినది. 1956లో ఆంధ్ర రాష్ట్రము విస్తరించి, పూర్వపు హైదరాబాద్ రాష్ట్రములో భాగమైన తెలంగాణ ప్రాంతమును కలుపుకొని ఆంధ్ర ప్రదేశ్ అవతరించినది. కొత్తగా ఏర్పడిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి హైదరాబాదును రాజధానిగా చేశారు.


MANDALS IN KURNOOL DISTRICT



No comments:

Post a Comment