Sunday, 29 January 2012

హార్బజన్ సింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రికెట్...హార్బజన్ సింగ్

ఇండియా ఆఫ్ స్పిన్నర్ హార్బజన్ సింగ్ తన తోటి క్రికెటర్స్ యువరాజ్ సింగ్, ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్‌ని క్రికెట్ అకాడమీని నెలకొల్పడంలో ఫాలో అవుతున్నాడు. ఇందులో భాగంగా 'జలంధర్' లో ఆదివారం తన క్రికెట్ అకాడమీని ఏర్పాటు చేస్తున్నాడు. జలంధర్‌కు అతి సమీపంలో ఉన్న సురనుస్సీ‌లో మొత్తం పది ఎకరాల స్దలంలో 'హార్బజన్ సింగ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్రికెట్' అనే పేరుతో ఈ అకాడమీని నిర్మిస్తున్నాడు. వచ్చే సంవత్సరం చివరి కల్లా ఈ అకాడమీ పూర్తిగా వినియోగంలోకి రానున్నదని తెలిపాడు. ఈ సందర్బంలో ఆస్టేలియా టూర్‌లో పరాజయం పాలైన టీమిండియా గురించి భజ్జీ మాట్లాడుతూ.. టీమిండియా త్వరలోనే పుంజుకుంటుందని నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. కొన్ని సిరిస్‌లలో ఇలాంటి ఓటములు సహాజంగా జరుగుతాయని దీని గురించి బాధ పడాల్సిన అవసరం లేదన్నాడు. ప్రపంచంలో ఉన్న అన్ని అగ్రశ్రేణి జట్టులను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచామని, త్వరలోనే టీమిండియా తిరిగి పూర్వ వైభవాన్ని సొంతం చేసుకుంటుందని తన అభిప్రాయాన్ని తెలిపాడు.

రేపు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ

22 వేల పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్‌ను సోమవారం విడుదల చేసేందుకు విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఒకవేళ సోమవారం డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడని పక్షంలో ఫిబ్రవరి 2న విడుదలయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 11,139 పోస్టులు, రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్ఎంఎస్ఎ) కింద 9,569 పోస్టులు, మునిసిపాలిటీల్లోని 1,600 పోస్టులు, ఉర్దూ మీడియం నుంచి డీ రిజర్వు అయిన 314 పోస్టులు నోటిఫై చేస్తున్నారు. అయితే.. డీఎస్సీ-2008లో సెలెక్ట్ అయి హామీ పత్రాలు పొందిన అభ్యర్థులకు దాదాపు వెయ్యి పోస్టులు ఇవ్వటంతో.. ఆ మేరకు ఖాళీల సంఖ్య తగ్గనుంది. ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌లో ఎస్‌జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, లాంగ్వేజ్ పండిట్లు, పీఈటీ పోస్టులు ఉంటాయి. రాజీవ్ విద్యా మిషన్ (ఆర్వీఎం) కింద మంజూరైన 38వేల టీచర్ పోస్టులను ఈ డీఎస్సీలో నోటిఫై చేసే అవకాశం లేదు. వాటికోసం కొద్ది నెలల్లో మరో నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
సోమవారం ఏపీటెట్-2012  విడుదల
 ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (ఏపీటెట్-2012) ఫలితాలు సోమవారం విడుదల కానున్నాయి. ఈ నెల 8న టెట్-2012 జరిగిన విషయం తెలిసిందే. పేపర్-1కు 81,957 మంది దరఖాస్తు చేసుకోగా.. 55,584 మంది (67.82%) పరీక్ష రాశారు. పేపర్-2కు మొత్తం 4,15,137 మంది (1,99,710 మంది మేథ్స్ అండ్ సైన్స్, 2,15,427 మంది సోషల్ స్టడీస్ ) దరఖాస్తు చేసుకోగా.. 4,02,083 (96.86%) మంది హాజరయ్యారు. ఈ సారి పేపర్-1కు డీఎడ్ అభ్యర్థులు మాత్రమే అర్హులైనందున దరఖాస్తులు, పరీక్ష రాసినవారి శాతం బాగా తగ్గాయి. తొలి టెట్‌తో పోలిస్తే పేపర్-2కు దరఖాస్తుల సంఖ్య, హాజరుశాతం పెరిగాయి.