Tuesday, 15 November 2011

శ్రీరామరాజ్యం ప్రీమియర్ షో మొదటి టిక్కెట్ 2,500 డాలర్స్

నందమూరి బాలకృష్ణకు యుఎస్ లో మంచి ఫ్యాన్ పాలోయింగ్ ఉందని మరోసారి రుజువైంది.తాజాగా ఆయన చిత్రం శ్రీరామరాజ్యం ప్రీమియర్ షో మొదటి టిక్కెట్ 2,500 డాలర్స్ కు అమ్ముడై రికార్డు క్రియేట్ చేసింది.కొల్లా అశోక్ బాబు అనే అభిమాని ఆ టిక్కెట్ ని పొంది తన అభిమానాన్ని చాటుకున్నారు.ఇక చిత్రం నవంబర్ 17న విడుదల అవుతుండగా ఈ ప్రీమియర్ షో మాత్రం నవంబర్ 16 న జరుగుతుంది.ఈ విషయాన్ని బ్లూ స్కై సినిమా వారు ప్రెస్ రిలీజ్ ద్వారా తెలియచేసారు.సింహా తర్వాత పుంజుకున్న బాలకృష్ణ ఈ చిత్రంతో మరోసారి ఘన విజయం సాధిస్తాడని అందరూ అంచనాలు వేస్తున్నారు.బాలకృష్ణ శ్రీరాముడిగా,నయనతార సీతగా నటించిన చిత్రం 'శ్రీరామ రాజ్యం. బాపు దర్శకత్వంలో సాయి బాబా మూవీస్‌ పతాకంపై యలమంచిలి సాయిబాబు ఈ చిత్రాన్ని నిర్మించారు.ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్రం ఈ నెల 17న సినిమాని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు

పెట్రోల్ ధర లీటరుకు రూ.2 తగ్గే అవకాశం ఉంది

పెట్రోల్ ధరలు తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై బుధవారం ఆయిల్ కంపెెనీలు సమావేశమై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. అదే జరిగితే పెట్రోల్ ధర లీటరుకు రూ.2 తగ్గే అవకాశం ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గడమే ఇందుకు కారణంగా సమాచారం. ధరలు తగ్గితే గురువారం నుంచే అమలులోకి వచ్చే అవకాశం ఉంది

హీరో నిఖిల్ డ్రైవింగ్ లైసెన్స్ ఏడాదిపాటు రద్దు

మద్యం సేవించి డ్రైవింగ్ చేసిన కేసులో టాలీవుడ్ యువ హీరో నిఖిల్ కు నాంపల్లి కోర్టు మంగళవారం శిక్ష విధించింది. సంవత్సం పాటు అతని డ్రైవింగ్ లైసెన్సును సస్పెండ్ చేయడంతో పాటు, రూ. 2600 జరిమానా విధించింది. కోర్టు తీర్పుపై నిఖిల్ స్పందిస్తూ....తాను తప్పు చేశానని, కోర్టు ఆదేశాలను శిరసా వహిస్తానని, సంవత్సరం పాటు డ్రైవింగ్ కు దూరంగా శిక్షను అనుభవిస్తానని తెలిపారు. యువతకు ఆదర్శంగా ఉండాల్సిన నేను ఇలా చేసినందుకు సిగ్గు పడుతున్నానని నిఖిల్ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి తాను మద్యం సేవించడం మానేస్తానని చెప్పిన నిఖిల్...యువతను మంచి మార్గంలో నడిపించే కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని, మద్యం మాన్పించేందుకు తన వంతు ప్రయత్నం, మద్యం సేవించి వాహనాలు నడపకుండా నిర్వహించే కార్యక్రమాల్లో ప్రచారం చేస్తానని చెప్పారు

సినీ నటి జెనీలియా త్వరలో శ్రీమతి కాబోతోంది

ప్రముఖ సినీ నటి జెనీలియా పెళ్లి కేంద్ర మంత్రి కుమారునితో ఖరారైంది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి విలాస్ రావు కుమారుడు రితీష్ ని ఆమె పెళ్లి చేసుకోనుంది. ఫిబ్రవరి 4న వీరి పెళ్లి జరుగనుంది. వీరిద్దరూ 8 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నట్లు తెలిసింది

పోటెత్తిన మహానంది

కార్తీకమాసం సోమవారం నేపథ్యంలో మహానంది పుణ్యక్షేత్రం భక్తులతో పోటెత్తింది. సుమారు 20 వేల మందికి పైగా భక్తులు ఆలయానికి రావడంతో ఆలయ పరిసరాలన్ని కిక్కిరిసిపోయాయి. వేకువ జాము నుండే ప్రారంభమైన శ్రీ కామేశ్వరి దేవి సహిత మహానందీశ్వర స్వామి వారి దర్శన సౌకర్యం రాత్రి 9గంటల వరకు నిర్వీరామంగా కొనసాగింది. భక్తుల తాకిడితో క్యూలైన్లన్ని కిటకిటలాడిపోయాయి. అభిషేక ప్రియుడైన శ్రీ మహానందీశ్వర స్వామి వారి అభిషేకాలతో తడిసి ముద్దయ్యారు. ఒకే రోజు 160కి పైగా సామూహిక అభిషేకాలు జరగడంతో స్వామి వారు నిజంగానే అభిషేక ప్రియుడయ్యారు. ఈఓ సాగర్‌బాబు ఆధ్వర్యంలో వేద పండితులు రవిశంకర అవధాని, నాగేశ్వరశర్మ, జ్వాలా చక్రవర్తి, శాంతరాంభట్ అభిషేక పూజాధికాలను నిర్వహించారు. సాధారణ దర్శనంలో 15వేల మంది భక్తులు, ప్రత్యేక దర్శనంలో 5వేల మంది, ఉచిత దర్శన సమయంలో మరి కొంత మంది భక్తులతో మహానంది క్షేత్రం పోటెత్తింది.
శ్రీశైలం క్షేత్రం తరహాలో మహానందిలో ప్రవేశపెట్టిన సామూహిక అభిషేకాలు విజయవంతమైనట్లు కర్నూలు జిల్లా దేవాదాయశాఖా డీసీ, మహానంది ఈఓ సాగర్‌బాబు తెలిపారు. కార్తీకమాసం మొదటిసోమవారం సుమారు 14వేలు, రెండవ వారం 16వే లు, పౌర్ణమిరోజు 16800 లడ్లను విక్రయించామని, ఈ నెల 23న మహానందీశ్వరస్వామివారికి లక్షబిల్వార్చన పూజలు, 24న శ్రీకామేశ్వరీదేవి అమ్మవారికి లక్ష కుంకుమార్చన పూజలు నిర్వహిస్తున్నట్లు వివరించారు.

ఉద్యమం చేస్తే ఊరుకోం : టీజీ వెంకటేష్


తెలంగాణపై ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో మళ్లీ ఉద్యమం చేస్తామంటే ప్రభుత్వం

 చూస్తూ  ఊరుకోదని, కఠినచర్యలు తీసుకుంటామని రాష్ట్ర చిన్ననీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ హెచ్చరించారు. తెలంగాణ సాధనలో కేసీఆర్ కాలిపోతాడు తప్పితే ప్రజలకు ఒరగబెట్టేదేంలేదని అన్నారు.
కేసీఆర్ ను నమ్ముకున్న వారు,  టీఆర్‌ఎస్ పార్టీని నమ్మి వెళ్లిన వారు నట్టేట మునుగుతారే తప్ప ఎంతోకాలం కేసీఆర్‌తో కలిసి ఉండలేరని అన్నారు. తన మాటల చాతుర్యంతో ఆయన ప్రజలను రెచ్చగొడుతున్నారని, కేసీఆర్ ఎవరితోనూ కలవరు, ఎవరినీ కలుపుకోలేరని విమర్శించారు.