Friday, 20 January 2012

అనంత రైతు ప్రత్యామ్నాయం ఏంటి...?

‘సబ్సిడీలు ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని అడగంలేదు. ఉచిత పథకాలు కూడా అవసరం లేదు. మాకు కావాల్సింది సాగునీరు మాత్రమే ’ - కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామ రైతుల నివేదన
 ‘జిల్లా వాతావరణానికి అనువైన వంగడాలు రూపొందించాలి. సాగునీటి లభ్యత పెంచి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా చూడాలి ’- కంబదూరు మండలం ములకనూరు గ్రామ రైతుల వినతి
‘‘ప్రత్యామ్నాయ పంటలు పండించమని సలహాలు ఇస్తున్నారేగాని పండిన తర్వాత ఆ పంట ఉత్పత్తులు ఎక్కడ విక్రయించుకోవాలో ఎవరూ చెప్పడం లేదు. ధర లేకపోతే పంటలు పండించి ప్రయోజనం ఏమిటి’ 
- గాండ్లపెంట మండలం కమతంపల్లి గ్రామ రైతుల ఆవేదన. 
ఇవి అనంతపురం రైతులు పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి మొర పెట్టుకొన్న సమస్యలు.. జిల్లాలోని వ్యవసాయరంగ స్థితిగతులను అధ్యయనం చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్న కేంద్ర అత్యున్నత సాంకేతిక కమిటీ రెండో రోజు గురువారం పది మండలాల్లో పర్యటించింది. కంబదూరు మండలం ములకనూరు గ్రామంలోని పంట పొలాలను ఏకే సింగ్ పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నూతన వంగడాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను గుర్తించినట్లు చెప్పారు.  పూర్తి వర్షాధారంతో వ్యవసాయం చేస్తున్న రైతులకు సామూహిక(సమష్టి) సాగు విధానం మేలు చేకూర్చుతుందని కేంద్ర బృందం చైర్మన్, భారతీయ వ్యవసాయ పరిశోధన కౌన్సిల్ డిప్యూటీ డెరైక్టర్ ఏకే సింగ్ అభిప్రాయపడ్డారు. నిపుణుల సలహాలు ఇలా ఉన్నప్పటికీ అనంత రైతులకు అవసరం అయినవి ఎన్నో చేయాల్సి ఉంది. 
చీడపీడల నుంచి పంటలను సంరక్షించుకోవడానికి తక్షణ సలహాలు, సూచనలు ఇచ్చే నిపుణులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి... పండించిన పంటను స్థానికంగానే గిట్టుబాటు ధరకు విక్రయించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది...  ప్రధానంగా నీటిలభ్యత తక్కువుగా ఉన్నందున స్పింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలి... నాణ్యమైన విత్తనాల కొరతను ఎదుర్కొంటున్నట్లు రైతులు చెబుతున్నారు..వారికి మేలురకం విత్తనాలు అందచేయాలి... రైతులు కూడా  ఉద్యాన పంటలతోపాటు పశుపోషణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది..... పంటల సాగుకు నీటి లభ్యతలేని ప్రాంతాల్లో పాడిని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంది 

రైతులు కూడా కేంద్ర పర్యటక బృందానకి కొన్ని ఫిర్యాదులు చేశారు..స్థానికంగా వ్యవసాయాధికారులు తమకు అందుబాటులో ఉండరన్నారు.. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. భూమిలోని తేమతోపాటు వాతావరణంలోని తేమను గ్రహించే వంగడాలతోపాటు సాగునీరు అందచేయాలని కోరారు. కర్ణాటకలో లీటరు పాలకు నాలుగు రూపాయలు అదనంగా ఇస్తున్నారని, ఆ ధరను ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం ఉందని రైతులు విన్నవించారు.  పలువురు రైతులు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు పండిస్తే ఆ పంటలు ఎక్కడ విక్రయించుకోవాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. డ్రిప్, స్పింక్లర్లకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా సబ్సిడీ విధానం అమలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా కేంద్ర కమిటీ కూడా స్థానిక అదికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖల 
తీరుపై సరిగా లేదని  కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతులకు సలహాలు,సూచనలు అందజేయాల్సిన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖ అధికారుల పనితీరు సక్రమంగా లేదని కమిటీ అభిప్రాయపడింది. మూడు బృందాల సభ్యులకు ఆయా శాఖల అధికారుల వైఖరిపై పలు ఫిర్యాదు అందాయి. క్షేత్ర స్థాయిలో కూడా కమిటీ సభ్యులకు ఎదురైన అనుభవాలతో ఆయా శాఖల అధికారులు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో విఫలమవుతున్నారని గుర్తించినట్లు కమిటీలోని ఒక శాస్త్రవేత్త తెలిపారు. కాగా డాగర్ నేతృత్వంలోని బృందం గురువారం సాయంత్రం పుట్టపర్తిలో బాబా సమాధిని సందర్శించింది.

పశుగ్రాసం పెంపకంలోకడప జిల్లాకు రెండోస్థానం

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద పశుగ్రాసం పెంపకంలో కడప జిల్లా రాష్ట్రంలో రెండవ స్థానంలో నిలిచిందని పశు సంవర్ధక శాఖ జేడీ విజయ్‌కుమార్ అన్నారు. స్థానికంగా పశువైద్యశాలను  ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కరువును దృష్టిలో ఉంచుకొని చెరువులలోని మిగులు నీటితో పశుగ్రాసం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 40 చెరువులను గుర్తించామన్నారు. కరువు తీవ్రత దృష్ట్యా పశుగ్రాసం నిల్వ చేసేందుకు దృష్టి సారిస్తున్నామన్నారు. ఇందుకు జిల్లా వ్యాప్తంగా మండలానికి ఒకటి చొప్పున 50 పాతర గుంతలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇందులో మొక్క జొన్న, జొన్న పైరును కటింగ్‌చేసి పాతర గుంతలలో వేసి వాటిపై బెల్లం పానకం చల్లితే మూడు నెలలపాటు నిల్వ చేసుకోవచ్చన్నారు. అలాగే జిల్లాకు 404 మినీ డెయిరీలు మంజూరయ్యాయన్నారు. ఇప్పటివరకు 10మినీ డెయిరీలు ఏర్పాటు చేశామన్నారు. పాడి పశువుల పెంపకానికి జిల్లాకు రూ..85లక్షలు మంజూరయ్యాయని, ఇందులో రూ..65లక్షలతో పాడి పశువులను కొనుగోలు చేసి లబ్ధిదారులకు అందించామని చెప్పారు. అలాగే జిల్లాకు 91 గొర్రెల పెంపకం యూనిట్లు మంజూరయ్యాయని, ఇందుకు రూ..12లక్షల సబ్సిడీ విడుదలైందన్నారు. దీని ద్వారా 50శాతం సబ్సిడీతో లబ్ధిదారులకు గొర్రెలను ఇస్తున్నామన్నారు. అంతేకాక జిల్లాకు కోళ్ల పెంపకానికి రూ..40లక్షలు మంజూరయ్యాయన్నారు. ఇప్పటివరకు 1800మంది లబ్ధిదారులను గుర్తించామన్నారు. జిల్లా వ్యాప్తంగా 6కోడి పిల్లల పెంపకం కేంద్రాలను కడప 2, పులివెందుల, రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు ప్రాంతాలలో ఒక్కొక్కటి చొప్పున నెలకొల్పనున్నట్లు ఆయన తెలిపారు. ఒక్కో లబ్ధిదారునికి ఉచితంగా 45కోళ్లను అందిస్తామన్నారు. అలాగే ఆర్‌కేయూవై పథకం కింద జిల్లాకు 220 గొర్రెల యూనిట్లు మంజూరయ్యాయన్నారు. ఒక్కో యూనిట్‌కు రూ..28వేలు ఇస్తున్నామని, ఇందులో రూ..14వేలు సబ్సిడీ వర్తిస్తుందన్నారు. ఇప్పటివరకు 110 యూనిట్లను లబ్ధిదారులకు ఇచ్చామని వివరించారు. అనంతరం ఆయన పశువైద్యశాలలో రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏడీ ప్రసాదరావు పాల్గొన్నారు.

బాలకృష్ణ గెలుస్తాడు...జెసి


హీరో నందమూరి బాలకృష్ణ హిందూపురం నుండి పోటీ చేస్తే గెలుపొందటం ఖాయమని మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డి సోదరుడు జెసి ప్రభాకర్ రెడ్డి శుక్రవారం అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లాలో మాత్రం బాలయ్య ప్రభావం ఉండదన్నారు. కాగా జిల్లాలో మరోసారి కాంగ్రెసు పార్టీలో వర్గ పోరు బహిర్గతమైంది. జిల్లా కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు పాటిల్ వేణుగోపాల్ రెడ్డి శుక్రవారం మాజీ మంత్రి జెసి దివాకర్ రెడ్డిపై విరుచుకు పడగా, జెసి ప్రభాకర్ రెడ్డి పాటిల్‌కు కౌంటర్ ఇచ్చారు. ఇటీవల జరిగిన శాసనమండలి ఎన్నికల్లో జెసి దివాకర్ రెడ్డి తనను కావాలనే ఓడించారని పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ఆరోపించారు. టిడిపి అభ్యర్థిని గెలిపించినందుకు ప్రతిఫలంగా జెసి అల్లుడికి ఆ పార్టీ అధిష్టానం రాయదుర్గం ఇంచార్జ్ పదవి కట్టబెట్టిందని ధ్వజమెత్తారు. తనను ఓడించి తెలుగుదేశం పార్టీని గెలిపించిన జెసిపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పారు. పాటిల్ వ్యాఖ్యలపై జెసి సోదరుడు ప్రభాకర్ రెడ్డి స్పందించారు.ఎవరు ఏ పార్టీలోనైనా ఉండవచ్చునని ఎదురుదాడికి దిగారు. తమ బంధువు టిడిపి పార్టీలో ఉంటే తమకేం సంబంధమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాటిల్ వేణుగోపాల్ రెడ్డి ఓటమికి స్థానిక మంత్రుల అసమర్థతే కారణమన్నారు. గెలిస్తే మీ గొప్పతనం ఓడిపోతే మా వైఫల్యమా అని ప్రశ్నించారు. రాయదుర్గం ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా పాటిల్ ఓడిపోతారన్నారు. కాగా గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిపై కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ ఓడిపోయిన విషయం తెలిసిందే