‘సబ్సిడీలు ఇవ్వమని మేము ప్రభుత్వాన్ని అడగంలేదు. ఉచిత పథకాలు కూడా అవసరం లేదు. మాకు కావాల్సింది సాగునీరు మాత్రమే ’ - కనగానపల్లి మండలం ముక్తాపురం గ్రామ రైతుల నివేదన
‘జిల్లా వాతావరణానికి అనువైన వంగడాలు రూపొందించాలి. సాగునీటి లభ్యత పెంచి, పండించిన పంటలకు గిట్టుబాటు ధర అందేలా చూడాలి ’- కంబదూరు మండలం ములకనూరు గ్రామ రైతుల వినతి
‘‘ప్రత్యామ్నాయ పంటలు పండించమని సలహాలు ఇస్తున్నారేగాని పండిన తర్వాత ఆ పంట ఉత్పత్తులు ఎక్కడ విక్రయించుకోవాలో ఎవరూ చెప్పడం లేదు. ధర లేకపోతే పంటలు పండించి ప్రయోజనం ఏమిటి’
- గాండ్లపెంట మండలం కమతంపల్లి గ్రామ రైతుల ఆవేదన.
ఇవి అనంతపురం రైతులు పర్యటనకు వచ్చిన కేంద్ర బృందానికి మొర పెట్టుకొన్న సమస్యలు.. జిల్లాలోని వ్యవసాయరంగ స్థితిగతులను అధ్యయనం చేసేందుకు క్షేత్రస్థాయి పర్యటన చేస్తున్న కేంద్ర అత్యున్నత సాంకేతిక కమిటీ రెండో రోజు గురువారం పది మండలాల్లో పర్యటించింది. కంబదూరు మండలం ములకనూరు గ్రామంలోని పంట పొలాలను ఏకే సింగ్ పరిశీలించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేరుగా వారితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు నూతన వంగడాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన ఆవశ్యకతను గుర్తించినట్లు చెప్పారు. పూర్తి వర్షాధారంతో వ్యవసాయం చేస్తున్న రైతులకు సామూహిక(సమష్టి) సాగు విధానం మేలు చేకూర్చుతుందని కేంద్ర బృందం చైర్మన్, భారతీయ వ్యవసాయ పరిశోధన కౌన్సిల్ డిప్యూటీ డెరైక్టర్ ఏకే సింగ్ అభిప్రాయపడ్డారు. నిపుణుల సలహాలు ఇలా ఉన్నప్పటికీ అనంత రైతులకు అవసరం అయినవి ఎన్నో చేయాల్సి ఉంది.
చీడపీడల నుంచి పంటలను సంరక్షించుకోవడానికి తక్షణ సలహాలు, సూచనలు ఇచ్చే నిపుణులు రైతులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి... పండించిన పంటను స్థానికంగానే గిట్టుబాటు ధరకు విక్రయించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది... ప్రధానంగా నీటిలభ్యత తక్కువుగా ఉన్నందున స్పింక్లర్లు, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేసేందుకు రైతులను ప్రోత్సహించాలి... నాణ్యమైన విత్తనాల కొరతను ఎదుర్కొంటున్నట్లు రైతులు చెబుతున్నారు..వారికి మేలురకం విత్తనాలు అందచేయాలి... రైతులు కూడా ఉద్యాన పంటలతోపాటు పశుపోషణపై మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది..... పంటల సాగుకు నీటి లభ్యతలేని ప్రాంతాల్లో పాడిని అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకురావాల్సిన తప్పనిసరి పరిస్థితి ఉంది
రైతులు కూడా కేంద్ర పర్యటక బృందానకి కొన్ని ఫిర్యాదులు చేశారు..స్థానికంగా వ్యవసాయాధికారులు తమకు అందుబాటులో ఉండరన్నారు.. ఉపాధి హామీ పనులను వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కమిటీ దృష్టికి తీసుకువచ్చారు. భూమిలోని తేమతోపాటు వాతావరణంలోని తేమను గ్రహించే వంగడాలతోపాటు సాగునీరు అందచేయాలని కోరారు. కర్ణాటకలో లీటరు పాలకు నాలుగు రూపాయలు అదనంగా ఇస్తున్నారని, ఆ ధరను ఇక్కడ అమలు చేయాల్సిన అవసరం ఉందని రైతులు విన్నవించారు. పలువురు రైతులు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటలు పండిస్తే ఆ పంటలు ఎక్కడ విక్రయించుకోవాలో తెలియని పరిస్థితి ఉందన్నారు. డ్రిప్, స్పింక్లర్లకు విస్తీర్ణంతో సంబంధం లేకుండా సబ్సిడీ విధానం అమలు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా కేంద్ర కమిటీ కూడా స్థానిక అదికార యంత్రాంగంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖల
తీరుపై సరిగా లేదని కమిటీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రైతులకు సలహాలు,సూచనలు అందజేయాల్సిన వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్థక శాఖ అధికారుల పనితీరు సక్రమంగా లేదని కమిటీ అభిప్రాయపడింది. మూడు బృందాల సభ్యులకు ఆయా శాఖల అధికారుల వైఖరిపై పలు ఫిర్యాదు అందాయి. క్షేత్ర స్థాయిలో కూడా కమిటీ సభ్యులకు ఎదురైన అనుభవాలతో ఆయా శాఖల అధికారులు రైతులకు సలహాలు, సూచనలు ఇవ్వడంలో విఫలమవుతున్నారని గుర్తించినట్లు కమిటీలోని ఒక శాస్త్రవేత్త తెలిపారు. కాగా డాగర్ నేతృత్వంలోని బృందం గురువారం సాయంత్రం పుట్టపర్తిలో బాబా సమాధిని సందర్శించింది.

