Friday, 9 March 2012

అనంతపురం జిల్లా రాజకీయ పార్టీలో ఉప ఎన్నికల సర్వే గోల


త్వరలో అనంతపురం అర్బన్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల విషయంలో కాంగ్రెస్ టికెట్ ఎవరికి కేటాయించాలి అనే దానిపై ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి ఒక సర్వే చేయించడట. దాన్ని లీక్ చేసి అనంతపురం అసెంబ్లీ స్థానానికి పోటీగా తన తమ్ముడే ఉండాలని ఎంపీ అంటున్నాడట…దీనిపై జేసీ దివాకర్ రెడ్డి వర్గం మండిపడుతోంది. ఆ సర్వే వివరాలు ఇవి.. * ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు ఎవరు సరైన వ్యక్తులు, ఆయా రాజకీయ పార్టీల్లో ఎవరెవరికి కార్యకర్తల నుంచి ఆదరణ ఉందనే విధంగా నివేదిక రూపొందించారు. తెలుగుదేశం పార్టీ నుంచి మహాలక్ష్మి శ్రీనివాస్‌కు 97.4 శాతం, మునిసిపల్ మాజీ చైర్మన్ ప్రభాకర్ చౌదరికి 1.1 శాతం, నదీమ్‌కు 1.5 శాతం ఆ పార్టీ కార్యకర్తల ఆదరణ ఉందని చూపించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డికి 99.1 శాతం ఆదరణ ఉన్నట్లు చూపించారు. సీపీఐ నేత కె.రామకృష్ణకు 86.4 శాతం ఆదరణ ఉందని, బీజేపీలో లలిత్‌కుమార్‌కు 94.2 శాతం ఉన్నట్లు నివేదికలో చూపించారు.ఈ శాతాలు పరిశీలిస్తే ఇదో బూటకపు సర్వే అనేది స్పష్టమవుతోంది జేసీ ప్రధాన అనుచరుడు కోగటం విజయభాస్కర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనంతపురం టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో కుట్ర జరుగుతోంది. ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి కుటుంబ సభ్యులకే టికెట్ దక్కేలా జిల్లా మంత్రులు, ఎంపీ హైడ్రామాకు తెరతీశారు. ఎంపీ సోదరుడికి టికెట్ కట్టబెట్టేందుకు బోగస్ సర్వే చేయించారని ధ్వజం ఎత్తారు.ఈ సర్వేను పరిశీలిస్తే ఇది ఎంత బూటకపు సర్వే అన్నది తెలుస్తుందన్నారు. కాంగ్రెస్‌పార్టీలో ఇప్పటి వరకు పనిచేయని… కాంగ్రెస్ పార్టీ జెండా రంగులు తెలియని… కాంగ్రెస్‌పార్టీ కార్యాలయం మెట్లు ఎక్కని… ఎంపీ సోదరుడు అనంత సుబ్బారెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థికి సరైన వ్యక్తని 95.7 శాతం మంది కార్యకర్తలు చెప్పినట్లుగా సర్వేలో చూపించారన్నారు. వాస్తవంగా సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఎంపీ సోదరుడనే విషయం జిల్లాలో 99 శాతం మంది కార్యకర్తలకు తెలియదన్నారు. ఇప్పటి వరకు పార్టీ ద్వారా వీరు లబ్ధిపొందారే తప్ప వీరి వల్ల పార్టీకి ఒనగూరింది ఏమీ లేదని జేసీ వర్గం గుర్రుమంటోంది. మరి ఎన్నికల పోరాటంలో ఎవరు గెలుస్తారో అన్న ఆసక్తి కన్నా కాంగ్రెస్ టికెట్ పోరాటంలో ఎవరు గెలుస్తారు అనేది ఆసక్తి కరంగా ఉంది.

జూ.ఎన్టీఆర్ పై కేసు వేస్తా....రామ్ గోపాల్ వర్మ

ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉండే రామ్ గోపాల్ వర్మ తాజాగా పూజారులపై కామెంట్స్ చేసి వివాదం క్రియేట్ చేసారు. ఆ వివాదాన్ని టీవి ఛానెల్స్ పెద్దది చేయటంతో వర్మ తన ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ అదుర్స్ చిత్రాన్ని కూడా లాగారు. ఆయన ట్వీట్ లో...నా పూజారుల మీద కామెంట్ల కంటే జూఎన్టీఆర్ అదుర్స్ లో చేసింది ఎక్కువ కానీ తను స్టార్ కనుక నేను ప్లాప్ డైరక్టర్ కనుక పూజారులు నన్ను టార్గెట్ చేస్తున్నారు.ఈ విషయం మీద నేను జూ.ఎన్టీఆర్ మీద,పూజారుల మీద,ఎండోమెంట్స్ డిపార్టమెంట్ మీద కంప్లైంట్ ఇస్తా పూజారుల మీద జూ.ఎన్టీఆర్ కి నాకు మధ్య సెలక్టివ్ డిస్క్రిమినేషన్ నేరం క్రింద కేసు పెడతా.నేను ట్వీట్స్ లో రాసినందుకీ జూ.ఎన్టీఆర్ అదుర్స్ లో చేసినందుకీ కంపేర్ చేస్తే ఏ మూర్కుడుకైనా నేను చెప్పింది అర్దమవుతుంది .అంటూ ట్వీట్ చేసారు. ఇక వర్మ ప్రస్తుతం చేస్తానంటున్న రెడ్డి గారు పోయారు వివాదం మరలించటానికే ఈ కొత్త వివాదాన్ని ఎత్తుకున్నాడని పరిశీలకులు అంటున్నారు. మీడియా సపోర్టుతో ఈ వివాదాన్ని పెద్దది చేసి ఆ వివాదాన్ని మర్చిపోయేలా చేయాలని ఆయన ఆలోచనగా చెప్తున్నారు. అందుకనే ఎన్టీఆర్ ని కూడా ఈ వివాదంలోకి లాగుతున్నారని చెప్తున్నారు.

కర్నూలు జిల్లా నదీతీరాన కెసిఆర్ విగ్రహం...టీజీ వెంకటేశ్

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ మీద కూల్చివేతకు గురైన మహనీయుల విగ్రహాలను కర్నూలు సమీపంలో తుంగ భద్ర నదీతీరాన ఏర్పాటు చేస్తామని చిన్న నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంక టేశ్ తెలిపారు. వాటికి ఎదురుగా వాటిని చూస్తూ సిగ్గుపడుతున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు విగ్రహాన్ని కూడా పెడతామని ఆయన చెప్పారు. వాటిని కూల్చివేసినందుకు కెసిఆర్ విగ్రహం అలా పెడతామని ఆయన అన్నారు. కర్నూలు జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో మహాత్మాగాంధీ విగ్రహ ఏర్పాటుకు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ- తెలంగాణ ఉద్యమం పేరుతో రాజధానిలోని ట్యాంక్‌బండ్‌పై ఉన్న సాహితీ, సాంస్కృతిక రంగాల మహనీయులు, స్వాతంత్య్రోద్యమ నాయకుల విగ్రహాలను టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేయడం విచార కరమన్నారు. అందుకే ఆ విగ్రహాలను తుంగభద్ర నదీతీరాన నిర్మించే వరద రక్షణ గోడలపై నెలకొల్పుతున్నట్టు చెప్పారు.

అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్....రాహుల్ ద్రావిడ్

టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం, మిస్టర్ డిపెండబుల్ రాహుల్ ద్రావిడ్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకుంటున్నట్లు శుక్రవారం ప్రకటించారు. ఇప్పటికే టి-20 కేరీర్‌కు వీడ్కోలు పలకగా, చివరిగా టెస్ట్ క్రికెట్ నుంచి కూడా వైదొలిగారు. పదహారేళ్ళపాటు టెస్ట్ క్రికెట్‌లో ఆడడం ఆనందంగా ఉందని, తనను ఇంతగా ఆదదరించిన అభిమానులకు ద్రావిడ్ కృతజ్ఞతలు తెలియజేశారు. బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో తమ రిటైర్‌మెంట్ ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడుతూ తన కెరీర్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు తెలిపారు. తన కెరీర్‌లో భార్య, కుటుంబ సభ్యుల సహకారం మరువరానిదని ఆయన అన్నారు. భారత జట్టుకు సారథ్యం వహించడం తన అదృష్టమని, ఆస్టేలియా టూర్ తరువాత రిటైర్ కావాలనుకున్నానని, యువ క్రికెటర్లకు అవకాశం కల్పించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాట్లు రాహుల్‌ద్రావిడ్ పేర్కొన్నారు. కికెట్ నుంచి తప్పుకుంటున్నందుకు విచారంగా లేదని అన్నారు. తప్పుకుంటున్నందుకు విచారమేమీ లేదని ఓ ప్రశ్నకు సమాధానంగా ద్రావిడ్ చెప్పారు. ద్రావిడ్ 164 టెస్టు మ్యాచులు ఆడాడు. 13,288 పరుగులు చేశాడు. టెస్టుల్లో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 36 సెంచరీలు, టెస్టుల్లో 63 అర్థ సెంచరీలు చేశాడు. సచిన్ టెండూల్కర్, గంగూలీ, అనిల్ కుంబ్లే, హర్భజన్, సెహ్వాగ్ వంటి ఆటగాళ్లతో ఆడడం తనకు గౌరవమని ద్రావిడ్ అన్నారు. 16 ఏళ్ల పాటు ఆటపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా చాలా నేర్చుకున్నానని ఆయన అన్నారు. తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని, యువకులకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. అద్భుతమైన యుగంలో తాను భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు. విచారంతోనే తప్పుకుంటున్నా గౌరవంగా ఉందని ఆయన అన్నారు.తన నిర్ణయాన్ని సచిన్ స్వాగతించినట్లు ద్రావిడ్ చెప్పారు. క్రికెట్ జీవితంలో పొగడ్తలూ ఉన్నాయి, విమర్శలూ ఉన్నాయని ఆయన అన్నారు. టీమిండియాలో విభేదాలున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందని చెప్పారు. తన నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తారని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.