Sunday, 25 December 2011

మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం?

టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్స్ లో మహేష్ బాబు-నమ్రత ఒకరు. ఇద్దరికీ సినీ నేపథ్యం ఉండటంతో వీరికి సంబంధించిన ఏ చిన్న విషయం అయినా టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. ఆ మధ్య ఇద్దరి మధ్య గొడవలు జరిగాయనే వార్తలు కూడా వినిపించాయి. అయితే గత కొన్ని రోజులుగా ఇద్దరూ కలిసి పలు సినిమా ఫంక్షన్లకు కలిసి హాజరవుతుండటంతో అవన్ని పుకార్లే అని తేలి పోయింది. తాజాగా ఈ జంటకు సంబంధించిన ఓ హాట్ న్యూస్ టాలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది. త్వరలో ఈ జంట బాలీవుడ్ లో ప్రొడక్షన్ హౌస్ ను స్థాపించే యోచనలో ఉన్నారని, ఇందు కోసం ముంబైలో తమకు తెలిసిన వారి ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టారని ఫిల్మ్ నగర్ గుసగుస. బహుషా దీని ద్వారానే మహేష్ బాబు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.  
 

బ్రహ్మణికి అనుమతులు రద్దయ్యే అవకాశం?

ఫ్యాక్షన్ గడ్డపై పారిశ్రామికాభివృద్ధి పేరుతో అడుగుపెట్టిన బ్రహ్మణి ఉక్కు పరిశ్రమకు అనుమతులు ఒక్కో క్కటిగా రద్దు చేసే యోచనలో ప్రభు త్వం వుంది. ప్రభుత్వం చూపు మరోవైపు వుండడం, బ్రహ్మణి అధినేత గాలి జైళ్లో వుండడం, యాజమాన్యం పనులు నిలిపివేత వెరసి బ్రహ్మణి పరిస్థితి కనుమరుగయ్యే దుస్థితికి చేరకుంది.ఫ్యాక్షన్ ప్రాంతంగా పేరుపడ్డ జమ్మలమడుగు ప్రాంతంలో పారిశ్రామిక ప్రగతి పేరుతో బ్రహ్మణి అధినేత గాలిజనార్ధన్ రెడ్డి బ్రహ్మణి స్టీలు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. సుమారు రూ.20వేల కోట్లతో 10మిలియన్ టన్నుల సామర్థ్యంతో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి జిల్లాలో ఉపాధి, ఉద్యోగ అవసరాల దృష్ట్యా కంపెనీకి సుమారు 14వేల ఎకరాల భూమి, 68 హెక్టార్ల గనులు, 2టియంసిల గండికోట ప్రాజెక్టు నీరు మైలవరం జలాశయం నుండి తీసుకొనేలా వెసులుబాటు వంటి సౌకర్యాలు కల్పించారు. దీంతో నీటి సౌకర్యం కోసం ఇచ్చిన 84జివోలోని అస్పష్టతను అలుసుగా తీసుకొని ఏకంగా మైలవరం జలాశయం డెడ్ స్టోరేజి వాటర్‌ను తీసుకెళ్లే లక్ష్యంగా పనులు చేపట్టింది. పనులు కాస్తా వివాదాస్పదం కావడంతో ప్రభుత్వం సీరియస్‌తో పనుల ను విరమించుకుంది. తరువాత ఇచ్చిన జివోను సవరించి ప్రభుత్వం 15 అక్టోబర్ 2009లో తాజాగా నీటి కేటాయింపుల ఆదేశాలను ఇచ్చింది. ఇంతవరకు బాగానే వున్నా వైయస్‌ఆర్ అకాలమర ణం తరువాత మైనింగ్ అక్రమాలపై చోటుచేసుకున్న పరిణామాలతో బ్రహ్మణీలో ఏకంగా గత ఏడాది నుండే పను లు పూర్తిగా నిలిపివేసింది. దీంతో బ్రహ్మణి స్థానంలో ఇతరులు ఫ్యాక్టరీకి ప్రభుత్వంతో సంప్రదింపులకు రావడంతో బ్రహ్మణి పరిస్థితిపై నీలినీడలు కమ్ముకున్నాయి. దీనికి తోడు బ్రహ్మణి ఎండి గాలిజనార్ధన్‌రెడ్డి జైలులో వుం డడం, మైనింగ్ లీజులపై సిబిఐ దర్యా ప్తు, కంపెనీలో పనులు పూర్తిగా నిలిపివేయడం వంటి కారణాలతో ప్రభు త్వం బ్రహ్మణీపై ఆరా తీసింది. గత కొంతకాలంగా అనుమతుల రద్దు విషయంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే ఒప్పందం ప్రకారం పనులు చేయనందున పరిశ్రమల శాఖ బ్రహ్మణీకి ఇచ్చిన వెసలుబాటులు, ఒప్పందాలు రద్దుకు ప్రభుత్వానికి సిఫారసు చేసింది. కేటాయించిన నీటి పనులకు సంబంధించి, బ్రహ్మణీలో పనుల పరిస్థితులపై పది రోజుల కిందట కలెక్టర్ ద్వా రా నివేదికలు తెప్పించుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే గండికోట నుండి కేటాయించిన 2 టియంసిల నీటి కేటాయింపులు కూడా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా బ్రహ్మణి అక్కడే ఆగిపోవడంతో మొత్తంగా ప్రభుత్వం కల్పించిన అన్ని అనుమతుల రద్దుకు ముఖ్యమంత్రికి ఆయాశాఖల నుండి సిఫారసులు వెళ్లినట్లు తెలుస్తోంది. బ్రహ్మణి అనుమతుల రద్దుకు ముఖ్యమంత్రి నిర్ణయమే తరువాయిగా తెలుస్తోంది. ఫ్యాక్షన్ గడ్డలో పారిశ్రామిక వెలుగులను నిలపాల్సిన బ్రహ్మణినే కనుమరుగయ్యే పరిస్థితికి రావడం దారుణం.

రాలయసీమ జిల్లాలో అదుపులోకి రాని మద్యం సిండికేట్లు

మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ అధికారులు చేసిన దాడులు ఏ మాత్రం ఫలితానివ్వ లేదు. మద్యం అధిక ధరల విక్రయం యదేచ్చగా కొనసాగుతుండటం గమనార్హం. మద్యం సిండికేట్ల కార్యాలయాల్లో సోదాల సందర్భంలో పలు కీలక డాక్యుమెంట్లు లభ్యమయ్యాయని, ముడుపులు అందుకుంటున్న రాజకీయ తిమింగళాల వివరాలు తెలుసుకున్నామని అధికారులు చెప్పి సంబంధిత నివేదిక ప్రభుత్వానికి పంపారు. అయితే ఎసిబి దాడులు చేసిన తరువాత స్పందించాల్సిన ఎక్సైజు శాఖ అధికారులు మాత్రం ఎక్కడా మద్యం దుకాణాలపై దాడులు నిర్వహించి మద్యం అధిక ధరల విక్రయంపై చర్యలు తీసుకోకపోవడం విశేషం. కాగా తమకు దాడులు సాధరణమేనని కొందరు వ్యాపారులు పేర్కొంటుండటం చూస్తుంటే మద్యం ధరలు ఎక్కువ చెల్లించి మద్యపాన ప్రియులు జేబుకు చిల్లు పెట్టుకోవడం మినహా మరో గత్యంతరం లేదని అర్ధమవుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మద్యం ధరల అదుపునకు దాడులు చేస్తే మరునాడు మరి కొంత పెంచి విక్రయించిన సందర్భాలు అనేకం ఉన్నాయని కొందరు మద్యపాన ప్రియులు వెల్లడిస్తున్నారు. దాడులు చేయడం ప్రజల కోసం కాదని తమ పబ్బం గడుపుకోవడానికేనని అధికారుల తీరుపై మద్యపాన ప్రియులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మద్యం ధరలను అదుపు చేసే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం దాడులు నిర్వహించి ఉంటే ఎసిబితో కాదని ఎక్సైజు, పోలీసు, రెవెన్యూ శాఖలతో దాడులు చేయించి ఉండేదని రాజకీయ విశే్లషకులు అంటున్నారు. మద్యం ధరల అదుపుకన్నా పాలకులకు ఎమ్మెల్యేలను అదుపు చేయడమే ప్రధాన కర్తవ్యమని వారు పేర్కొంటున్నారు. మద్యం సిండికేట్లలో ఉన్న ఎమ్మెల్యేలు తమ చేతిలోంచి జారి పోకుండా ఎసిబి నివేదికను అడ్డుపెట్టుకొని వారిని గుప్పెట్లో ఉంచుకోవడం ద్వారా పాలన సజావుగా సాగుతూ, జనం ఏమైపోయినా పరవాలేదు తమకిబ్బంది లేకుంటే చాలన్న విధంగా ప్రభుత్వ చర్యలు ఉన్నట్లు పరిస్థితి అర్ధమవుతోందని వారు పేర్కొంటున్నారు. మద్యం దుకాణాలను టెండర్ల ద్వారా ఖరారు చేసినపుడే మద్యం అధిక ధరలకు విక్రయించడం తథ్యమని కొంత మేర అర్ధమైందని అది ఇపుడు వ్యాపారులు ఆచరణలో పెట్టారని అంటున్నారు. జిల్లాలో మద్యం దుకాణ టెండర్లను తెరిచిన అధికారులే నోరెళ్లబెట్టి దుకాణాలను ఖరారు చేశారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చంటున్నారు. భారీగా సొమ్మును లెక్కబెట్టి ప్రభుత్వానికి లైసెన్సు ఫీజు రూపంలో చెల్లించిన వ్యాపారులు తమ పెట్టుబడి, లాభం అంతా రాబట్టుకోవాలంటే అధిక ధరలకు మద్యం విక్రయించడంతో పాటు మద్యపాన ప్రియుల ముందుకే మద్యం తీసుకెళ్లేందుకు గొలుసు దుకాణాలను ఏర్పాలు చేసుకున్నారని ప్రజలు పేర్కొంటున్నారు. మద్యం వ్యాపారంలో జరుగుతున్న ప్రతి విషయం జిల్లాలో జగమెరిగిన సత్యమేనన్నారు. ఒకటిన్నర సంవత్సరం నుంచి జరుగుతున్న ఈ తంతును లైసెన్సు కాల వ్యవధి ముగిసే సమయంలో ఎసిబి దాడులు ప్రయోజనమివ్వవని పాలకులకూ తెలుసునని అయితే తమ ప్రయోజనం నెరవేరితే చాలునన్నట్లు దాడులు చేయించారే కాని మద్యపాన ప్రియులపై అభిమానంతో కాదని అభిప్రాయపడుతున్నారు. ఎసిబి దాడులు జరిగిన తరువాత ఏ ఒక్క దుకాణంలోనూ ధరల్లో మార్పు రాకపోవడంపై ప్రభుత్వం ఏమీ సమాధానం చెప్పలేదని అందరికీ తెలిసిందేనన్నారు. జిల్లాలో మద్యం వ్యాపారంతో సంబంధం లేని నాయకుల పేర్లు వెతికినా కనిపించని పరిస్థితి ఉందని సర్వత్రా అంటున్నారు. ఇద్దరు, ముగ్గురు నాయకులు మినహా పార్టీలతో నిమిత్తం లేకుండా అన్ని రాజకీయ పార్టీల వారికి మద్యం దుకాణాలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగా సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. ఇంత మంది ఆగ్రహానికి గురి కావడం కన్నా సిండికేట్లతో సంబంధం ఉన్న వారిని గుప్పెట్లో పెట్టుకుంటే చాలన్న విధంగా పాలకుల శైలి ఉందని వెల్లడిస్తున్నారు. మరో ఆరు నెలల కాలంలో ముగిసే లైసెన్సు కాల వ్యవధిలోపే తమకు రావాల్సిన లాభాల శాతాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉన్న వ్యాపారులు మరి కొంత సొమ్ము చెల్లించైనా ధరల నియంత్రణ చర్యలను అడ్డుకుంటారే కాని నిర్ధేశించిన చిల్లర ధరకు విక్రయించే ప్రశే్న లేదని అత్యధిక శాతం జనం అభిప్రాయపడుతున్నారు. ఎసిబి నివేదికపై ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందోనన్న ఆందోళన వ్యాపారుల్లో ఉన్నా అందుకు వారు సిద్ధపడుతున్నారని ఎక్సైజు శాఖలో ఓ కీలక అధికారి వ్యాఖ్యానించారు. ధరలను అదుపు చేయడం మద్యపాన ప్రియులతో మినహా మరెవరితో కాదని ఆయన అన్నారు. మద్యానికి బానిసైన వారు ఇళ్లు తాకట్టు పెట్టయినా మద్యం సేవించేందుకు సిద్ధపడుతున్నారని అలాంటపుడు ఎవరు అడ్డుకుంటే మాత్రం ధరలు అదుపులోకి వస్తాయని ప్రశ్నిస్తున్నారు. మద్యం ధరలు అదుపు చేయాలంటే ప్రభుత్వంలో నిజాయితీ ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ధరలను ఎక్కువ చెల్లించి తాగడం కన్నా మానేయడం మేలని మద్యపాన ప్రియులు భావిస్తే తప్ప ధరల అదుపు సాధ్యం కాదని అదే సమయంలో దాడులు ఫలితాలను ఇవ్వవని ఆయన అన్నారు.

అనంతపురం జిల్లాలో కాసులు కురిపిస్తున్న ఇసుక అక్రమ రవాణా!


చేతులు కాలాక ఆకులు పట్టుకొన్న చందంగా అక్రమ ఇసుక రవాణాపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించడంతో ఎట్టకేలకు స్థానిక రెవెన్యూ, భూగర్భజలాలు, పోలీసు, మున్సిపల్ అధికారులు మేలుకున్నారు. హిందూపురం నియోజకవర్గంలోని పెన్నా, చిత్రావతి, జయమంగళి నదుల్లో దశాబ్దాల కాలంగా ఇసుక అక్రమరవాణా జోరుగా సాగడంతో అక్రమరవాణా దారులకు కాసులు పండాయి. ఇసుక అక్రమ రవాణా విషయమై ఆయా నదీ పరివాహక ప్రాంతాలకు చెందిన ప్రజలు నిరసనలు వ్యక్తం చేసినా, పత్రికల్లో ఎన్నోమార్లు శీర్షికలు ప్రచురితమైనా అధికారులు తూతూమంత్రంగా చర్యలు తీసుకొని చేతులు దులుపుకోవడంతో ఇసుక అక్రమ రవాణాదారులకు అడ్డూఅదుపు లేకుండాపోయింది. హిందూపురం మున్సిపల్ పరిధిలోని సింగిరెడ్డిపల్లి సమీపంలో ఉన్న పెన్నానదిలో ఏకంగా సమాధులను కూడా ధ్వంసంచేసి ఇసుకను తవ్వడం ఆ ప్రాంత వాసులను తీవ్ర విస్మయానికి గురిచేస్తోంది. ఈ విషయంపై అధికారులతో మొర పెట్టుకున్నా ఠంఛనుగా అందుతున్న మామూళ్లతో అప్పట్లో ఏమాత్రం చర్యలు తీసుకోలేకపోయారు. హిందూపురం రూరల్ మండల పరిధిలోని కిరికెర, తూమకుంట, సంతేబిదనూరు, బేవినహళ్ళి పరిసర ప్రాంతాల్లోని పెన్నానదిలో ఎంతోకాలంగా ఇసుక అక్రమ రవాణా మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాగుతోంది. బెంగళూరులో లారీ లోడ్ ఇసుక ధర రూ.30 వేల దాకా ఉండటంతో ఆయా శాఖల అధికారులకు మామూళ్లు ముట్టచెబుతూ పెద్దఎత్తున ఇసుకను తరలించారు. రాజకీయ నేతలు కూడా ఇసుక అక్రమ రవాణాదారులకు సహకారం అందిస్తుండటం, ఆయా కార్యకలాపాలపై అధికారులు దృష్టి సారిస్తే ఒత్తిళ్లు తీసుకురావడంవంటి కారణాలతో పెన్నానది గుంతల మయమయింది. ఇసుక అక్రమరవాణాతో ఏర్పడిన గుంతల్లో వర్షాకాలంలో నీరు నిలబడటంతో ఈ విషయాన్ని గమనించని ముద్దిరెడ్డిపల్లి, మేళాపురంలకు చెందిన ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అక్రమార్కులు ముందుగా ట్రాక్టర్లను బాడుగుకు తీసుకొని నదుల్లోని ఇసుకను పగటివేళల్లో రహస్య ప్రాంతాలకు తరలిస్తారు. అనంతరం రాత్రి వేళల్లో ఆ ఇసుకను లారీల ద్వారా దర్జాగా చెక్‌పోస్టుల దాటిస్తూ బెంగళూరుకు చేరవేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా కారణంగా హిందూపురం - బెంగళూరు రహదారి అధ్వాన్నంగా తయారయింది. దీంతో పలు ప్రమాదాలు చోటుచేసుకొని కొందరు మృత్యువాతన పడ్డారు. ఇటీవల విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించి ఇసుక లారీలు, ట్రాక్టర్లను సీజ్ చేయడంతో స్థానిక అధికారుల వైఫల్యం తేటతెల్లమయింది. ఇకపోతే కిరికెర, బేవినహళ్ళి సమీపంలోని పెన్నానదిలో అధికార పార్టీకి చెందిన మండల స్థాయి నాయకుడొకరు మూడు సంవత్సరాలుగా ఇసుక అక్రమ రవాణా సాగిస్తూ సంపన్నుడయ్యారు. చిన్నాచితక వ్యక్తులు ట్రాక్టర్లలో గృహ నిర్మాణాల కోసం ఇసుకను తరలిస్తే కఠినంగా వ్యవహరిస్తున్న అధికారులు ఆ నాయకుడు ఏకంగా జెసిబితో నదిలోని ఇసుకను తవ్వుతూ దర్జాగా లారీల్లో బెంగళూరుకు తరలిస్తున్నా చర్యలు నామమాత్రంగా కూడా లేవన్న విమర్శలు ఉన్నాయి. అదే విధంగా ఆ ప్రాంతానికి చెందిన ప్రతిపక్ష నాయకుడు కూడా అధికారులకు మామూళ్లు ముట్టచెబుతూ ఇసుక అక్రమ రవాణాను ఇప్పటికీ జోరుగా సాగిస్తున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాగా చిలమత్తూరు, పరిగి మండలాల పరిధిలోని చిత్రావతి, జయమంగళి నదుల్లో కూడా కొందరు రాజకీయ నాయకులు ఇసుక అక్రమ రవాణాను సాగిస్తూ కాసులు పండించుకొంటున్నారు. ఇసుక అక్రమ రవాణా విషయంలో స్థానిక రెవెన్యూ అధికారులు పలుకుబడి ఉన్న రాజకీయ నాయకులకు మినహాయింపు ఇస్తూ మామూళ్లు దండుకుంటున్నారని ఇటీవల జాయింట్ కలెక్టర్ అనితా రామచంద్రన్‌ను కలిసి హిందూపురానికి చెందిన కొందరు ఫిర్యాదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహిస్తూ ఇసుక అక్రమ రవాణాపై చర్యలు ముమ్మరం చేస్తున్న తరుణంలో స్థానిక అధికారుల్లో చలనం ఏర్పడింది. అయినప్పటికీ రాజకీయ ఒత్తిళ్లు, ఠంఛనుగా అందుతున్న మామూళ్ళతో కొందరు అక్రమరవాణాదారులకు మాత్రం మినహాయింపు ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇసుక అక్రమ రవాణాపై అధికారులు పూర్తిస్థాయిలో చర్యలు తీసుకొంటే ఫలితాలు ఉంటాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

శ్రీశైలప్రభలో ఆధ్యాత్మిక పత్రికలో నాయకుల ఫొటోలా?

శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో ప్రచురితమవుతున్న శ్రీశైలప్రభ ఆధ్యాత్మిక పత్రికలో రాజకీయ నాయకుల ఫొటోలు కనిపించడం విడ్డూరంగా ఉందని, ఆధ్యాత్మికతకు పెద్దపీట వేయాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా జరుగుతోందని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామీజీ అన్నారు. రాజకీయ నాయకుల ఫొటోలను పత్రికలో ముద్రించడం హేయమైన చర్య అని అన్నారు. మల్లన్న దర్శనార్థం శ్రీశైలం చేరుకున్న స్వామీజీ విలేఖరులతో మాట్లాడుతూ శ్రీశైలప్రభ పత్రిక భక్తి పారవశ్యంతో ఆధ్యాత్మిక చింతనతో ప్రచురితం కావాల్సి ఉండగా అందుకు విరుద్ధంగా వివిధ రాజకీయ నాయకుల ఫొటోలతో వారికి ప్రచారం చేస్తున్నట్టుగా ఉందన్నారు. సొంత నిర్ణయాలతో ఇటువంటి చర్యలకు పాల్పడటం హేయమైన చర్యగా స్వామీజీ అభివర్ణించారు. ఇప్పటికైనా దేవాదాయశాఖ అధికారులు కళ్లు తెరవాలని, ఇటువంటి కార్యకలాపాలను ప్రోత్సహించడం మానుకోవాలని స్వరూపానందేంద్ర హితవు పలికారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను ఆధ్యాత్మిక చింతనతో నిర్వహించాలని సూచించారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల ప్రాంగణాల్లో అన్యమత ప్రచారం ఎక్కువగా జరుగుతోందన్నారు. దాన్ని నిరోధించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అన్యమత ప్రచారానికి లోనైన ప్రజలు మతమార్పిళ్లకు పాల్పడి హిందూత్వాన్ని కాలరాస్తున్నారన్నారు. అలా జరుగకుండా చూడాల్సిన బాధ్యత ఆయా దేవాలయాల అధికారులు, కార్యనిర్వహణ సిబ్బందిపై ఉందన్నారు. అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించేవారిని దేవాదాయ చట్టం కింద కఠినంగా శిక్షించాలన్నారు. ఈ విధంగా మతమార్పిళ్లను కొంతైనా నిరోధించవచ్చునన్నారు. గిరిజన, చెంచుగూడేల్లో శివాలయాలు నిర్మించి అన్యమత ప్రచారానికి తావివ్వకుండా చూడాలన్నారు.

మదనపల్లె వందేళ్ల జనగణమన ప్రభాత గీతమే

వందేళ్ల జనగణమనకు మన రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా మదనపల్లెతో 92 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం ఉంది. ఎలాగంటారా... మదనపల్లెలో హోమ్‌రూల్ ఉద్యమ స్థాపకురాలు అనిబిసెంట్ స్థాపించిన బిసెంట్ థియోసాఫికల్ కళాశాల (బీటీ కాలేజ్) విద్యార్థులు జాతీయోద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. దీనిపై ఆగ్రహించిన బ్రిటిష్ ప్రభుత్వం కళాశాల గుర్తింపును రద్దు చేసింది. 1919 ఫిబ్రవరిలో బెంగళూరుకు వచ్చిన రవీంద్రుడిని ఈ కాలేజీ ప్రిన్సిపాల్ కజిన్స్ తమ కళాశాలకు ఆహ్వానించారు. 1919 ఫిబ్రవరి 25న మదనపల్లెకు వచ్చిన ఠాగూర్ వారం రోజులపాటు ఈ కళాశాలలోనే గడిపారు. అదే సమయంలో తాను తత్సమ బెంగాలీలో రచించిన జనగణమన గీతాన్ని 'ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా' (భారత సుప్రభాత గీతం) పేరిట ఆంగ్లంలోకి అనువదించారు. ఈ గీతానికి ప్రిన్సిపల్ కజిన్స్ సతీమణి మార్గరెట్ కజిన్స్ బాణీ కట్టి విద్యార్థులతో కలసి ఆలపించారు. ఠాగూర్ గౌరవార్థం దాన్నే తమ కళాశాల ప్రార్థనాగీతంగా ప్రకటించారు. ఆనాటి నుంచీ 1950 వరకూ బీటీ కళాశాల ప్రార్థనా గీతంగా కొనసాగిన జనగణమనకు 1950లో జాతీయ గీతం హోదా లభించింది.