Friday, 24 February 2012

రామ్ చరణ్ తేజ్ సినిమా 'ఎవడు'

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నటిస్తున్న ఎవడు సినిమా సరిగ్గా నెల తర్వాత, మార్చి 24న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న ఈచిత్రం కొన్ని రోజుల క్రితమే లాంఛనంగా ప్రారంభం అయింది. చిరంజీవి-సురేఖ తొలి షాట్ క్లాప్ కొట్టారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. హాట్ హీరోయిన్ సమంత లీడ్ హీరోయిన్ గా, సెక్సీ బ్రిటన్ మోడల్ అమీ జాక్సన్ ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ తొలిసారిగా రామ్ చరణ్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. హీరో రామ్ చరణ్ ను ఈ చిత్రంలో సరికొత్త కోణంలో హాట్ అండ్ రొమాంటిక్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు వంశీ పైడిపల్లి. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఫోస్టర్ విభిన్నంగా ఉండటమే ఇందుకు నిదర్శనం.

భద్రాద్రి రాముని పాత్ర అవకాశం వస్తే తప్పక నటిస్తా బాలకృష్ణ

ప్రేక్షకులు కొత్తదనంను కోరుకుంటున్నారు, అందుకు నిదర్శనం శ్రీరామరాజ్యం విజయమేనని ఆ చిత్ర హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు. శ్రీరామరాజ్యం సినిమా వంద రోజులు పూర్తయిన సందర్భంగా శుక్రవారం సాయంత్రం భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శించేందుకు ఆయన చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబా వచ్చారు.ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం వేద పండితులు ఆశీర్వచనం పలికారు. అనంతరం నందమూరి బాలకృష్ణ విలేకరులతో మాట్లాడుతూ చిత్రం విజయవంతం కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. శ్రీరామరాజ్యం ఆడియో వేడుక భద్రాద్రిలోనే నిర్వహించామని, తిరిగి శతదినోత్సవం పురస్కరించుకొని భద్రాద్రి రావడం జరిగిందన్నారు. మంచి చిత్రాలను ప్రజలు ఆదరిస్తారరనడానికి ఈ చిత్ర వజయమే నిదర్శనమన్నారు. ఇందుకు సహకరించిన చిత్ర నిర్మాత యలమంచిలి సాయిబాబు, సహచర కళాకారులు, సాంతికేక సిబ్బంది, మీడియాకు, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

సచిన్‌కు ఎవరి సలహాలు అక్కర్లేదు...వెంగ్ సర్కార్

ఎప్పుడు రిటైర్ కావాలనే విషయమై సచిన్‌కు ఎవ రూ సలహాలు ఇవ్వనక్కర్లేదని మాజీ కెప్టెన్ వెంగ్‌సర్కార్ అన్నాడు. 39 ఏళ్ల వయస్సులో కూడా సచిన్ పూర్తి ఫిట్‌గా ఉన్నాడన్నాడు. ఒకవేళ సచిన్ రిటైరైనా..అతని స్థానాన్ని భర్తీచేసే ఆటగాడు లేనేలేడని వెంగీ చెప్పాడు. సచిన్ తక్షణమే వన్డేలనుంచి రిటైర్ కావాల్సిందిగా మరో మాజీ కెప్టెన్ కపిల్‌దేవ్ సూచించిన సంగతి తెలిసిందే. మాస్టర్ స్దానాన్ని భర్తీ చేయడం దాదాపు అసాధ్యమేనని వెంగ్ సర్కార్ తెలిపాడు. సచిన్‌కి ఎప్పుడు రిటైర్ కావాలో బాగా తెలుసని, ఇందులో ఎవరి సలహాలు అక్కర్లేదని అన్నారు. ఇటీవల కపిల్ దేవ్ మాట్లాడుతూ సచిన్ ప్రపంచకప్ తర్వాత రిటైర్ కావాల్సిందన్న విషయం తెలిసిందే. ముక్కోణపు టోర్నీల వరుస వైఫల్యాలు చవిచూస్తున్న సచిన్‌ వన్డేలకు రిటైర్మెంట్‌ ప్రకటించాలని కపిల్‌దేవ్‌ చేసిన సూచనను వెంగ్‌సర్కార్‌ తప్పు పట్టాడు. సచిన్‌ ఫిట్‌నెస్‌పై ఎవరు సందేహించాల్సిన అవసరం లేదన్నాడు. జట్టు మొత్తం వైఫల్యం చవిచూస్తున్నప్పుడూ ఒక్క సచిన్‌పైనే విమర్శలు చేయడం తగదన్నాడు. సచిన్‌పై అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని వెంగ్‌సర్కార్‌ పరోక్షంగా కపిల్‌ని ఉద్దేశించి అన్నాడు. 39 యేళ్ల వయసులోనూ సచిన్ చక్కని ఫిట్‌ నెస్‌తో... ఆటతీరుని ప్రదర్శిస్తున్న విషయాన్ని గుర్తించుకోవాలని అన్నాడు. పైగా భారత బ్యాటింగ్‌ లైనప్‌ బలహీనంగా ఉందని, ప్రస్తుత పరిస్థితుల్లో సచిన్‌ వన్డేలకు రిటైర్‌మెంట్‌ ప్రకటిస్తే, ఆ స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరని వెంగీ అన్నాడు. ప్రపంచ క్రికెట్‌కు దొరికిన గొప్ప ఆటగాళ్లలో సచిన్‌ ఒకడు. క్రికెట్ ఆట పట్ల సచిన్ అంకిత భావం, నిబద్దత.. ఆడిన ఆట భవిష్యత్ తరాలకు ఆదర్శమని వెంగ్ సర్కార్ కొనియాడారు.

మద్యం సిండికేట్లపై అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటన

శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో శుక్రవారం మద్యం సిండికేట్ల వ్యవహారంపై ప్రభుత్వం ప్రకటన చేసింది. దీంతో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదప్రతివాదనలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తరఫున మంత్రి కన్నా లక్ష్మినారాయణ వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు ఎసిబి 350 సిండికేట్ల దుకాణాలపై మాత్రమే దాడులు జరిపిందన్నారు. 34 సిండికేట్లపై దాడులు జరిగాయని, ఎసిబి నిష్పక్షపాతంగా విచారణ చేస్తుందన్నారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి చిత్తశుద్ధి లేకపోతే రిమాండ్ రిపోర్టులు కోర్టులకు వెళ్లవని కన్నా పేర్కొన్నారు.మద్యం ముడుపుల అంశంపై శుక్రవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మధ్య వాడి వేడిగా వాగ్వాదం జరిగింది. బాబు ప్రసంగిస్తున్న సమయంలో మంత్రులు అడ్డు తగిలారు. మద్యం ముడుపులపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతుందని, ప్రజల అనుమానాలు నివృత్తి చేయాలని చంద్రబాబు అన్నారు. ఎసిబి రిపోర్టులోని వాస్తవాలను సభ దృష్టికి తీసుకు రావాలని ఆయన అన్నారు. రూ.15వేల కోట్ల ముడుపులు అందాయన్నారు. మద్యం ముడుపులపై ప్రభుత్వానికి సిగ్గుంటే సమాధానం చెప్పాలి.. కానీ దాటవేత ధోరణి సరికాదన్నారు. ముడుపులతో సంబంధమున్న అధికారులు జైళ్లో ఉంటే నేతలు మాత్రం దర్జాగా బయట, సభలో ఉన్నారన్నారు. వాస్తవాలు ప్రభుత్వం తారుమారు చేసిందన్నారు. ఎసిబి 140 మంది ప్రజాప్రతినిధులపై ఆరోపణలు వచ్చాయన్నారు. నున్నా రమణ కాంగ్రెసు నేత అని, ఆయన మీ పార్టీ నేతలకు ప్రకటనలు కూడా ఇచ్చారన్నారు. రాంరెడ్డి అనుచరుడు అన్నారు. అందుకు రాంరెడ్డి వెంకట రెడ్డి స్పందిస్తూ తనను వివాదంలోకి లాగవద్దన్నారు. మా అమ్మ కర్మకు 75వేల మంది వచ్చారని అన్నారు. రమణతో తనకు సంబంధం లేదన్నారు. ఖమ్మం వస్తే అక్కడ నిజానిజాలు తెలుస్తాయన్నారు.

ఏసీబీ రిమాండ్ రిపోర్టు బయటపెట్టాలి..చంద్రబాబు డిమాండ్

 రిమాండ్ రిపోర్టులో 7వ పేజీ కనిపించడంలేదని, ఆ రిపోర్టును బయట పెట్టాలని, ఓ మంత్రిని కాపాడటానికి సీఎం ఇలా చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఈ విషయంలో మరో మంత్రి బహిరంగగా చెప్పారన్న విషయాన్ని బాబు గుర్తుచేశారు.దీంతో సభలో టీడీపీ నేతలు నిరసన తెలిపారు. దీనిపై ముద్దుకృష్ణమ మాట్లాడుతూ తనపై పోలీసుల కేసు ఉంటే వివరాలు చెప్పాలని, దేనికైనా సిద్దంగా ఉన్నాన ని సవాల్ చేశారు. ఏసీబీ రిపోర్టుపై చర్చ జరపాల్పిందే అని, ఏసీబీ రిపోర్టు సభలో పెట్టాలని డిమాండ్ చేశారు. తన సామాజికవర్గానికి చెందిన మంత్రిని కాపాడుకోడానికి మోపిదేవిని ఇరికించారని స్వయానా మంత్రి డీఎల్ అన్నారని గాలి తెలిపారు. దేశంలోనే మద్యం కుంభకోణం అతిపెద్దదని ముద్దకృష్ణమ అన్నారు.మద్యం సిండికేట్ల వ్యవహారంపై మంత్రి కన్నా ఇచ్చిన వివరణపై టీడీపీ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఏసీబీ రిమాండ్ రిపోర్టు బయటపెట్టాలని, ముడుపులు తీసుకున్న ప్రజాప్రతినిధులు సభలో దర్జాగా కూర్చున్నారని, అధికారులు జైల్లో ఉన్నారని ఇది ఎంతవరకు సమంజసమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ వ్యవహారంపై శుక్రవారం సభలో చంద్రబాబునాయుడు మాట్లాడుతూ నున్న వెంకట రమణ ముమ్మాటికీ కాంగ్రెస్ కార్యకర్తే అంటూ సభలో ఆధారాలను చూపించారు.

కర్నూలు జిల్లాలో చిరుతను బంధించిన గ్రామస్థులు

కర్నూలు జిల్లాలో ఓ చిరుత హల్‌చల్‌ చేసింది. ముప్పుతిప్పలు పెట్టి ఎట్టకేలకు గ్రామస్తుల చేతిలో బందీగా మారింది. డోన్‌ మండలం చనుగొడ్ల గ్రామంలో గొర్రెల కోసం వచ్చిన చిరుతను కుక్కలు వెంబడించటంతో భయపడిన చిరుత చెట్టు పైకెక్కింది. ఇది చూసిన గ్రామస్తులు చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నించారు.పారిపోతున్న చిరుతను గ్రామస్తులంతా రాళ్లతో దాడిచేసి ప్రాణాలతో పట్టుకున్నారు. కొనఊపిరితో ఉన్న చిరుతను గ్రామంలో ఊరేగింపు నిర్వహించిన అటవీశాఖ అధికారులకు అప్పగించారు. నెలరోజులుగా చిరుత సంచరిస్తోందని అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని గ్రామస్తులు చెప్తున్నారు.