Wednesday, 7 December 2011

‘పంజా’ సినిమా కు ‘A’సర్టిఫికెట్

పవన్ కళ్యాణ్ తాజా సినిమా ‘పంజా’ మరో రెండు రోజుల్లో డిసెంబర్ 9న విడుదలకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గత మూడు రోజుల క్రితమే సెన్సార్ పూర్తి చేసుకున్నప్పటికీ సర్టిఫికెట్ మాత్రం ఈ రోజు రిలీజైంది. ఈ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఉంటుందని అంతా భావించా....అందరినీ షాక్ కు గురి చేస్తూ సెన్సార్ బోర్డు వారు ఈ సినిమాకు పెద్దలు మాత్రమే చూడతగినది అంటూ..‘A’సర్టిఫికెట్ జారీ చేశారు. వాస్తవానికి సెన్సార్ బోర్డు వారు కొన్ని కత్తెర్ల అనంతరం U/A సర్టిఫికెట్ ఇవ్వాలని చూశారు, అయితే పంజా దర్శక నిర్మాతలు కత్తెర్లకు ఒప్పుకోక పోవడంతో సినిమాకు A సర్టిఫికెట్ జారీ చేశారు.దీంతో ‘పంజా’ కేవలం పెద్దల వర్గానికి మాత్రమే పరిమితం అయిందని, 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న పవన్ అభిమానులకు ఈ సినిమా చూసే హక్కు లేక పోవడం సర్వత్రా చర్చీనీయాంశం అయింది. సెన్సార్ బోర్డు వారు ఈ సర్టిఫికెట్ జారీ చేశారంటే...మితిమీరిన హింస, శృతిమించిన శృంగార సన్నివేశాలు గానీ ఈ సినిమాలో ఉన్నాయా? అనే అనుమానాలకు తావిచ్చినట్లయింది.అయినా ఈ కాలంలో, ముఖ్యమంగా మన రాష్ట్రంలో A సర్టిఫికెట్ ను ఎవరు పట్టించుకుంటున్నారు? మగధీర లాంటి సినిమాలకు A సర్టిఫికెట్ వచ్చినా....కుటుంబ సమేతంగా చూశారు. ఇప్పడు పంజా విషయంలో అదే జరుగుతుందని, A సర్టిఫికెట్ ఉన్నా...పెద్దగా పోయేదేం లేదని పంజా దర్శక నిర్మాతల ఆలోచనగా కనిపిస్తోంది.

సిఎం క్యాంపు కార్యాలయంలో వైయస్ వివేకాకు విచిత్ర అనుభవం

దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి సోదరుడు, మాజీ వ్యవసాయ శాఖ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డికి బుధవారం ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో విచిత్ర అనుభవం ఎదురైంది. వివేకానంద ఉదయం కిరణ్‌ను కలిసేందుకు సిఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. ఆయన లోపలకు వెళుతుండగా ఓ సెక్యూరిటీ గార్డు అతనిని ఆపేసి పూర్తిగా సోదాలు చేశారు. ఆ తర్వాతే అతనిని లోపలకు పంపారు.తన సోదరుడు వైయస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు క్యాంపు కార్యాలయంలో ఎలాంటి నిబంధనలు ఉండేవి కావు. వైయస్ సిఎంగా ఉన్నప్పుడు ఏమాత్రం సోదాలు చేయకుండా సెల్యూట్ కొట్టిన సెక్యూరిటీయే ఇప్పుడు ఆపి పూర్తిగా తనిఖీ చేయడం విశేషం.

రైతు బాధలు చూస్తే గుండె పగులుతోంది....జగన్‌మోహన్‌రెడ్డి

జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో రైతుల బాధలు చూస్తే గుండెలు పగులుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్‌ఆర్ బతికి ఉంటే ఈ కష్టాలు ఉండేవి కావన్నారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనమని ధ్వజమెత్తారు. విద్యార్థులకు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అందించని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ప్రాణాపాయంలో ఉన్నవారిని రక్షించే నిమిత్తం ప్రవేశపెట్టిన 108 అంబులెన్సుల నిర్వహణ లోపానికి తోడు, పేదలకు ఉచిత వైద్యాన్ని కూడా సరిగా ప్రభుత్వం అందించలేకపోతోందని ఆయన తీవ్రంగా విమర్శించారు. ప్రతి పేదవాడికీ ఉచితంగా వైద్యం అందించాల్సిన ప్రభుత్వం ఆ పని చేయలేకపోతోందన్నారు. పేదవాడి గుండె చప్పుడు వినేందుకు ప్రభుత్వానికి ఓపిక లేకుండా పోతోందన్నారు. రచ్చబండ నిర్వహిస్తున్న ప్రభుత్వ అధికారులు.. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కొమ్ము కాస్తున్నవారికే కార్డులు, పింఛన్లు అందజేస్తున్నారని విమర్శించారు. కనీసం ప్రతిపక్షమైనా ప్రభుత్వ తీరుపై పోరు చేస్తుందనుకుంటే ప్రభుత్వంతో అది కుమ్మక్కైన తీరును చూస్తున్నామన్నారు.

మంత్రివర్గ విస్తరణ లో మెగా ప్యాకేజీ….?

డిసెంబరు రెండో వారంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఈమేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కసరత్తులు చేస్తున్నారు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ఇప్పటి వరకూ మంత్రివర్గ విస్తరణ జరగలేదు. రోశయ్య హయాంలో పనిచేసిన మంత్రులనే నేటికీ కేబినెట్‌లో కొనసాగిస్తున్నారు. ప్రజారాజ్యం పార్టీ విలీనం తర్వాత కేబినెట్ విస్తరణ ఉంటుందని ఊహాగానాలొచ్చాయి. అయితే సకలజనుల సమ్మె, తెలంగాణా సమస్య తీవ్రం కావడంతో విస్తరణ వాయిదా పడింది .ఇక జాక్‌పాట్ కొట్టింది మెగాస్టారే. ఎందుకంటే మొన్న జరిగిన అవిశ్వాస తీర్మానం సందర్భంగా చిరంజీవి బ్యాచ్ అలక వహించి నేరుగా హైకమాండ్ నుంచి పెద్ద హామీలనే పొందింది. మెగా ప్యాకేజీనే దక్కించుకుంది. మంత్రివర్గ విస్తరణలో పిఆర్పీ ఎమ్మెల్యేలు ఐదుగురికి మంత్రి పదవులు ఇవ్వాన్నది వారి డిమాండ్. అంతకు ముందు ఇద్దరికి మంత్రి పదవులిస్తే చాలన్న చిరు మొన్న అవిశ్వాస తీర్మానం తర్వాత ఐదుగురికివ్వాలని హైకమాండ్ ముందు ప్రతిపాదన ఉంచారు. ఇందుకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్, సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ చిరుకు ఆమేరకు హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఇదే జరిగితే తూర్పు, విశాఖలోని ఇద్దరు మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదు. మొత్తం మీద చిరు బ్యాచ్ జాక్ పాట్ కొట్టిందని చెప్పక తప్పదు

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో జాగ్రత్త..!

గూగుల్, ఫేస్‌బుక్, యూట్యూబ్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సెట్లు తమ సైట్లలో ప్రచురితమయ్యే కంటెంట్ విషయంలో జాగ్రత్తపడాలని, అభ్యంతరకర సమాచారాన్ని వెంటనే తొలగించాలని, వాటిని నియంత్రించే చర్యలు తీసుకోవాలని కమ్యూనికేషన్స్, ఐటీ మంత్రి కపిల్ సిబల్ కోరారు. ఈ సైట్లలో ఉంచుతున్న సమాచారం, చిత్రాలతో దేశంలో పెద్ద సంఖ్యలో ఉన్న వర్గాల ప్రజల మనోభావాలు, మతవిశ్వాసాలు దెబ్బతింటున్నాయని సిబల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇకపై ఇలా జరగడాన్నిప్రభుత్వం అంగీకరించదని స్పష్టం చేశారు. ఈ సైట్ల ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అనుమానిత టెర్రరిస్టుల సమాచారాన్ని కూడా వారు ఇవ్వట్లేదని మండిపడ్డారు. ఈ ఏడాది సెప్టెంబర్‌లోనే దీనిపై గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ఇంటర్‌నెట్ దిగ్గజాలను ప్రశ్నించామని.. నాలుగువారాల్లోగా అభ్యంతరకర సమాచారాన్ని తొలగించాల్సిందిగా కోరామని వివరించారు. అప్పట్నుంచీ పదేపదే అడుగుతున్నా వారు సరిగా స్పందించడంలేదని ఆరోపించారు. ఈమేరకు.. ఇలాంటి అభ్యంతరకర సమాచారంతో వ్యవహరించేందుకు ఒక నియమావళిని రూపొందించామని, మైక్రోసాఫ్ట్, యాహూ, గూగుల్, ఫేస్‌బుక్ సంస్థలతో మరోమారు చర్చించామని వివరించారు. తమ ప్రభుత్వానికి పత్రికా స్వేచ్ఛపై అపారమైన నమ్మకం ఉన్నదని, అలాంటి వాటిపై పర్యవేక్షణ ఉండాలనే తప్ప సెన్సార్‌షిప్ ఆలోచనే లేదని స్పష్టం చేశారు. "ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ.. పత్రికాస్వేచ్ఛ విషయంలో జోక్యం చేసుకునే ఆలోచన మా ప్రభుత్వానికి లేదు'' అని ప్రకటించారు. అలాంటి సమాచారం సైట్లలో ప్రత్యక్షమవగానే, వీలైనంత తొందరగా పసిగట్టి తొలగించే విధానాలను స్వయంగా రూపొందించుకోవాలని ఆయా సైట్ల నిర్వాహకులకు సూచించామని.. ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో సిబల్ తెలిపారు అయితే, తాము రూపొందించిన నియమావళికి సంబంధించి వారు మౌఖికంగానే స్పందించారు తప్ప రాతపూర్వక హామీ ఇవ్వలేదని తెలిపారు. "కొన్ని క్లాజులకు వారు మౌఖికంగా అంగీకారం వ్యక్తం చేశారు. కానీ రాతపూర్వకంగా అంగీకరించడానికి వెనుకంజ వేశారు. తామేమీ చేయలేమని చెప్పారని, అమెరికా నాణ్యత ప్రమాణాలనే ఇక్కడా పాటిస్తామన్నారు'' అని సిబల్ వివరించారు. అలాగైతే ఇక్కడి ప్రమాణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా కోరామన్నారు. మరి దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందని విలేకరులు ప్రశ్నించగా.. తామేం చర్య తీసుకున్నా అన్ని పరిణామాలనూ పరిగణనలోకి తీసుకుని, మత విశ్వాసాలకు భంగం కలిగించే సమాచారాన్ని ఏ రకంగానూ అనుమతించని విధంగా నిబంధనలు రూపొందిస్తామని వివరించారు.