Wednesday, 21 December 2011

అప్పులు తీర్చలేక రైతన్నకు కన్నీటి కష్టాలు

ఖరీఫ్‌లో పంటలు నష్టపోయిన  రైతులు రబీ సీజన్‌లో తమ అదృష్టం పరీక్షించుకుందామని వేరుశనగ తదితర పంటలు సాగు చేశారు. అయితే ఆదిలోనే ఎడతెగని వర్షాలు పంటలను నాశనం చేయగా, ప్రస్తుతం విద్యుత్తు కోతలు రైతన్నకు క'న్నీటి' కష్టాలు తెస్తున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు నీరు లేక ఏం చేయాలో తెలియక ఆందోళనలో పడ్డారు. రబీ సీజన్‌లో  రైతులు వేల ఎకరాల్లో వేరుశనగ సాగు చేశారు. విత్తిన వారం రోజులకే ఎడతెగని వర్షాల ధాటికి పొలాల్లో నీరు నీలిచి విత్తనాలు మొలకెత్తక పంటలు నాశనమయ్యాయి. అయితే వర్షానికి ముందు విత్తిన రైతులు మాత్రం కొంత ఊరట చెందుతున్నారు. ప్రస్తుతం కలుపు కాలం కావడంతో మొక్కల ఏరివేతకు నీటి సమస్య మొదలైంది. విద్యుత్తు కోతల కారణంగా సరఫరా ఎప్పుడొస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. పలువురు రైతులు విధిలేక పొలాల వద్దకు నీరు తెచ్చుకుని కలుపు తొలగిస్తూ తమ పంటలు కాపాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఇక వర్షాలతో రబీ సీజన్ ఆరంభంలోనే దెబ్బతిన్న వేరుశనగకు ఏం చేయాలో తోచని పలువురు రైతన్నలు ఆర్థిక భారమైనా చివరకు ట్రాక్టర్ల సాయంతో దున్నేస్తున్నారు. ఇకపై అప్పు చేసి పంటలు సాగు చేయడం తమ వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. జిల్లా వ్యవసాయ అధికారులు సర్వే చేసి పంట నష్ట పరిహారం అందించి ఆదుకోవాలంటూ మొరపెట్టుకుంటున్నారు. లేదంటే చేసిన అప్పులు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమంటూ గోడు వెల్లబోసుకుంటున్నారు. అధికారులు ఆదుకోకున్నా ఉన్న పంటకు సరిపడా నీరందించేందుకు ఏడు గంటల విద్యుత్తు సరఫరా చేస్తే చాలని కొన్ని ప్రాంతాల రైతులు విన్నవిస్తున్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం, త్వరలో ఇంటికి పంపుతాం ...నారా చంద్రబాబు నాయుడు

ఇది దద్దమ్మ ప్రభుత్వం అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శించారు. ఈ ప్రభుత్వాన్ని ఇక ఇంటికి పంపిస్తామని ఆయన అన్నారు. రాజకీయాల కోసం నేను ఈ యాత్రలు చేయడం లేదు, మరి అటువంటప్పుడు టి.ఆర్.ఎస్., కాంగ్రెస్ నాయకులు ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. రైతులు ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వంలో ఇసుమంతైనా చలనం లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు. తాము పోరాటం చేస్తున్నది రైతులకోసమేనని ఆయన అన్నారు. దేశంలో అవినీతి రహిత సమాజం అవతరించాలంటే లోక్ పాల్ బిల్లు పరిధిలోకి సి.బి.ఐ.ని తీసుకురావలసిందేనని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు డిమాండు చేశారు. లోక్ పాల్ బిల్లు పరిధిలోకి సి.బి.ఐ.ని తీసుకువచ్చినప్పుడే అవినీతిని రూపుమాపడం సాధ్యమవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. అవినీతికి వ్యతిరేకంగా ఎవరు పోరాడినా తమ పార్టీ చిత్తశుద్ధితో మద్దతు ప్రకటిస్తుందని ఆయన చెప్పారు. అన్నా హజారే దేశంలో అవినీతిని నిర్మూలించడానికి పోరాడుతున్నారని ఆయన గుర్తు చేశారు.

ఏఆర్ రహమాన్‌కు తాజ్ మహల్ సమీపంలో అనుమతి నిరాకరణ!

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్‌కు ఆర్కియాలజీ డిపార్టుమెంటు వారి నుంచి చేదు అనుభవం ఎదురైంది. ‘ఏక్ దివాన్ థా’ కోసం రహమాన్ ఓ సాంగ్ కంపోజ్ చేస్తుండగా తాజ్ మహల్ సమీపంలో చిత్రీకరణ జరుపాల్సింది. ఇందుకోసం తాజ్ మహల్ సమీపంలోని మెహతా బాద్ వద్ద పర్మిషన్ అడగ్గా...ఏఎస్ఐ(ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా) వారిని అనుమతి కోరగా అనుమతి ఇవ్వడం కుదరదు అని తేల్చి చెప్పారు అధికారులు. ఇలా సినిమాలకు అనుమతి ఇస్తూ పోతే తాజ్ మహల్ పరిసరస ప్రాంతాలు డ్యామేజ్ అవుతాయని అధికారులు స్పష్టం చేశారు. ఇది వరకు మేరి బ్రదర్ కి దుల్హన్ చిత్రం షూటింగుకు కూడా అనుమతి నిరాకరించారు.

పుణ్యక్షేత్రాలు, ప్రకృతి అందాలతో కనువిందు చేసే కర్నూలు అందాల

 అది పుడమి తల్లి అందాలన్నీ  పొత్తిళ్లలో పొదివి పట్టుకున్న జిల్లా... అక్కడ కొండ కోనలుంటాయి.. జాలువారే జలపాతాలుంటాయి. వయ్యారంగా నడిచి వెళ్లే నడక నేర్చిన నదులుంటాయి.  శిధిలాలను ముద్రించుకున్న చారిత్రక ఆధారాలుంటాయి. చిరకాలం నిలిచిపోయే శిలాశాసనాలుంటాయి. 

 

అవతారపురుషుడు నడయాడిన నేల ఇది.. భూత భవిష్యత్ వర్తమానాలను వివరించే కాలజ్ఞానం పుట్టిందీ కూడా ఇక్కడే.. ఇన్ని ప్రత్యేకతలున్న ఒకే ఒక జిల్లా కర్నూలు.. కనువిందు చేసే కర్నూలు అందాల రాయలేలిన రతనాల సీమ కర్నూలు జిల్లా... ఈ జిల్లాకు సాహితీ, సాంస్కృతిక, ఆధ్యాత్మిక సంపదతో అలరారిన చరిత్ర ఉంది. రుషులు, మహర్షులు నడయాడిన నేల అందుకే జిల్లా పుణ్యక్షేత్రాలకు పుట్టినిల్లయింది. శ్రీశైలం, మహానంది, యాగంటి, అహోబిలం, కాల్వబుగ్గ వంటి పరమ పవిత్ర స్థానాలు వెలిశాయి. ఈ ప్రాంతంలో హిందూ ఆలయాలే కాక ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే ప్రసిద్ధి చెందిన జామియా మసీదు కూడా ఇక్కడే ఉంది. ముస్లింలు జీవితంలో ఒక్కసారయినా దర్శించుకొని తీరాలను కునే మక్కా మసీదు తర్వాత అంతటి పవిత్రతను సంతరించుకున్న దర్గాగా ఇది ప్రసిద్ధి చెందింది. ఇంకా ఇక్కడి సుకేశుల డ్యామ్ అందాలు ఎంత సేపు చూసినా తనివి తీరదు. కర్నూల్ జిల్లా అడుగడుగూ అందాలతో ఆహ్వానిస్తుంటుంది. ఇక్కడి బెలూం గుహలను చూస్తుంటే ఎంత సేపు చూసే ఏదో తన్మయానికి లోనైనట్టుంటుంది.  ఓర్వకల్లు లోని రాక్ గార్డెన్స్, సుంకేశుల డ్యామ్ లు జిల్లా ప్రతిష్టను మరింత  ఇనుమడింప జేస్తున్నాయి. చారిత్రక ప్రదేశంగా విలసిల్లే కర్నూలు నందు కొండారెడ్డి బురుజు, బొమ్మాళీ కోటలు, గత చరిత్రను కల్ళముందు కదలాడించే నిర్జీవ సాక్ష్యాలు. ఇక్కడి చారిత్రకప్రదేశాలన్నీ అలనాటి వైభవాన్ని చాటి చెపుతుంటాయి. కలియుగ అవతార పురుషుడిగా భావించే వీరభ్రహ్మేంద్ర స్వామి కూడా ఇక్కడే తన కాలజ్ఞానాన్ని రచించారు. దైవం మానవరూపంలో నడయాడిన నేల ఇదని ఇక్కడి వారు గర్వంగా చెప్పుకుంటారు.చెంచుల నివాసస్ధలాలుగా ఉన్న నల్లమల అడవులు ,ఎర్రమల అడవులూ ఈ జల్లాకు చెందిన ప్రకృతి సంపదలే. తుంగభద్రమ్మ గలగలలతోనే కాదు ప్రకృతి రమణీయమైన ప్రదేశాలతోనూ భాసిల్లుతోన్న కర్నూలు జిల్లా పర్యటకంగా మాత్రం వెనకబడే ఉంది. జిల్లాలో ఉన్న అలనాటి ప్రాచీన కట్టడాలు, పుణ్యక్షేత్రాలు, సహజ సిద్దంగా ఏర్పడిన గుహలు  తదితర ప్రదేశాలను  టూరిజం డిపార్డ్ మెంట్ అభివృద్ధి  చేసి, గత చరిత్ర వైభవాన్ని భవిష్యత్  తరాలకు అందించాల్సి అవసరం ఎంతైనా ఉంది.

కడప జిల్లా వింత దూడ జననం: పూజలు చేస్తున్న గ్రామస్తులు

కడప జిల్లా రాజంపేటలో వింత దూడ జన్మించింది. పెద్ద పెద్ద కళ్లు, పొట్టి కాళ్లతో దూడ చూడటానికి విచిత్రంగా ఉంది. నందలూరు మండలం నాగిరెడ్డి పల్లె గ్రామ పంచాయితీలో ఈ ఘటన జరిగింది. గ్రామస్తులు దూడను నందీశ్వరుడితో పోలుస్తున్నారు. ఇది భగవంతుడి మహిమని ఆనందోత్సాహాలు మునిగిపోయారు. దూడకు బొట్లు పెట్టి పూజలు చేస్తున్నారు. అయితే జన్యులోపమే దూడ వింత ఆకారానికి కారణమని పశువైద్యులు అంటున్నారు.

రాజమౌళి నా కుంకుమ బొట్టు దిద్దాడు...అక్కినేని నాగార్జున

 ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా స్పందించారు - "అలాగే.. రాజమౌళిగారు ఈ కథను బాగా ఇష్టపడ్డారు. ఆయన ఇన్వాల్వ్‌మెంట్ ఈ చిత్రంలో ఎక్కువ. ఆయన వర్కింగ్ స్టైల్ ముచ్చటగా ఉంటుంది. సినిమా తప్ప ఇంకేమీ తెలియని మనిషి. క్లైమాక్స్ సన్నివేశాలు, స్టంట్స్ అన్నీ ఆయనే దగ్గరుండి చేయించుకున్నారు. పోరాట సన్నివేశాలకు రజాకార్ల ఉద్యమంలో ఎటువంటి పరికరాలను ఉపయోగించారో ఇప్పుడు మేం కూడా వాటినే వాడాం. పూర్తిస్థాయి సినిమా చేయడానికి రాజమౌళి ఎప్పుడు సిద్ధమంటే అప్పుడు నేను కూడా సిద్ధమే" అని చెప్పారు."నాకు పొడవాటి జుట్టు బాగా సెట్టవుతుంది. ఈ సినిమాకు కూడా నాలుగైదు రకాల హెయిర్ స్టైల్ చేసి చూశాం. కానీ ఏదో లోటు కనిపించింది. ఓ రోజు రాజమౌళి నా నుదుటన కుంకుమ బొట్టు దిద్దాడు. అద్దంలో చూస్తే గెటప్‌కు నిండుదనం వచ్చినట్టనిపించింది. ఇందులో నా వేషధారణకు మంచి మార్కులు పడుతున్నాయి" అంటున్నారు నాగార్జున. ఆయన తాజా చిత్రం రాజన్న ఈ వారంలో విడుదల కానుంది.ఎక్కడ అన్యాయం కనిపిస్తే... అక్కడ రాజన్న ఉద్భవిస్తాడు. ప్రజలకు ఒక మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఆశయంతో పోరాటం చేస్తాడు. నేలకొండపల్లెలోని గ్రామస్తులకు తన పాట ద్వారా ధైర్యం నూరిపోస్తాడు రాజన్న. పాట ప్రధానంగా సాగే సినిమా కథ ఇది.

న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ లో ముద్దుగుమ్మలు కోట్లు దాకా డిమాండ్!

న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ లో ఎక్కువ డిమాండ్ సంపాదించి,ఎక్కువ డబ్బు డిమాండ్ చేస్తున్న ముద్దుగుమ్మలు ముగ్గురే. వాళ్లే కత్రినా కైఫ్, కరీనా కపూర్, ప్రియాంకా చోప్రా. ముందుగా వీరిలో కత్రినా కైఫ్ కి ఎక్కువ డిమాండ్ ఉంది. ఆమెను రెండు కోట్లు దాకా ఇచ్చేందుకు క్లబ్ నిర్వాహకులు వెంటబడుతున్నట్లు సమాచారం. అయితే ఆమె సూపర్ హిట్ ఐటం సాంగ్ షీలా కీ జవానీని స్టేజ్ పై డాన్స్ చేయాలి. ఈ కార్యక్రమంలో ఆమె కేవలం 15 నిమిషాలు మాత్రమే వుంటుంది. అయితే ఆమెకు ఆ రేటు ఇవ్వటానకి విపరీతమైన పోటీ ఏర్పడింది. అయితే ఇప్పటివరకూ కత్రినా ఎవరకీ హామీ ఇవ్వలేదు. ఎక్కువ ఎవరు ఆఫర్ చేస్తే వారితో కమిటవ్వటానికి ఆమె వెయిట్ చేస్తోందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.బాలీవుడ్ ఐటం బాంబు మల్లికా షెరావత్ రేటు అమాంతం పెరిగిపోయింది. ఈ డిసెంబర్ నెలాఖరున అంటే కొత్త సంవత్సరం ప్రారంభంలో న్యూ ఇయిర్ సెలబ్రేషన్స్ ను సెలబ్రేట్ చేసుకోవటానికి ఆమె తన రేటుని పెంచేసింది. అందుకోసం ఆమె తన రేటుని నిముషానికి నాలుగు లక్షలు అని ప్రకటించింది. అయినా సరే ఆమెను బుక్ చేసుకోవటానికి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ పోటి పడుతున్నాయి. ఆమె తన హోటల్లో డాన్స్ చేస్తుంది లైవ్ గా అని అంటే వచ్చే మొత్తాన్ని వారు లెక్కేసుకుంటూ ఆమె వెంట పడుతున్నారు. ఆ రాత్రి ఆమె కేవలం పదకొండు నుంచి పన్నెండు దాకానే డాన్స్ చేస్తుంది. ముంబైలోని ఓ స్టార్ హోటల్ వారు ఆమెకు పన్నెండు కోట్లు పే చెయ్యటానికి ఆమెను బుక్ చేసుకున్నారు.


శ్రీవారి సేవకులకు నూతన డ్రస్‌కోడ్ అమలు

శ్రీవారి దర్శనార్థం దేశం నలుమూలల నుండి వచ్చే శ్రీవారి భక్తులకు సేవ చేయడానికి టిటిడి ఏర్పాటు చేసిన శ్రీవారి సేవకులకు నూతన డ్రస్‌కోడ్ విధానాన్ని వచ్చే ఏడాది రథసప్తమి నుండి అమలు చేయనున్నట్లు టిటిడి ప్రజాసంబంధాల అధికారి తలారి రవి ఒక ప్రకటనలో తెలిపారు. మానవసేవే మాధవసేవ అన్న ప్రధానలక్ష్యంతో టిటిడి శ్రీవారి సేవకులను ఏర్పాటు చేసింది. సాటి భక్తులకు సేవలు అందించడానికి వీలుగా ఈ వ్యవస్థ టిటిడి ప్రవేశ పెట్టింది. గత 11సంవత్సరాల కాలంలో మూడున్నర లక్షలమంది శ్రీవారి సేవకులు ఇప్పటివరకు భక్తులకు వివిధ విభాగాల్లో సేవలు అందించారు. నేడు సుమారు 40 విభాగాల్లో శ్రీవారి సేవకులు భక్తులకు విశిష్ట సేవలు అందిస్తున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా పేర్కొనవలసినవి దర్శనం క్యూలైన్లు, అన్న ప్రసాద భవనం, కల్యాణకట్ట, పరకామణి, ఉద్యానవనశాఖ, పబ్లికేషన్ స్టాల్స్, సమాచార కేంద్రాలు తదితర ప్రాంతాల్లో శ్రీవారి సేవకులు భక్తులకు అందిస్తున్న సేవలు ఎంతో విశిష్టమైనవి. అయితే తిరుమలకు విచ్చేసే భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్న నేపధ్యంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా టిటిడి శ్రీవారి సేవకుల సేవలను మరింత పటిష్టం చేయడానికి నడుం బిగించింది. అందులో భాగంగా శ్రీవారి సేవను క్రమబద్దీకరించడానికి తద్వారా ఈ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి నూతన విధివిధానాలను నిర్దేశించినట్లు టిటిడి తెలిపింది. శ్రీవారి సేవకు విచ్చేసే సేవకులకు ఒక నిర్దిష్టమైన యూనిఫాంను నిర్ణయించింది. అందులో భాగంగా పురుషులు తెల్లపంచె, లేదా ఫ్యాంటు, తెల్లషర్టు విధిగా ధరించాలని, మహిళలు ముదురు ఆకుపచ్చ రంగు చీర, అదే రంగు రవిక(చీరపై డిజైన్ ఉండవచ్చు, లేకపోవచ్చు) విధిగా ధరించి శ్రీవారి సేవకు రావాల్సి ఉంటుందని తెలిపారు. ప్రారంభంలో 200మందితో ఆరంభమైన శ్రీవారిసేవ వ్యవస్థ నేడు అపారంగా విస్తరించింది. శ్రీవారి సేవకుల్లో భక్తుల పట్ల మరింత సమర్థతతో సేవలు అందించడానికి వీలుగా, అదే రీతిలో శ్రీవారి సేవకులను ప్రోత్సహించడంలో భాగంగా టిటిడి ఇప్పటికే శ్రీవారి సేవకులకు ఉచిత వసతి, అన్నప్రసాద సౌకర్యాలను కల్పిస్తోంది. అంతేకాకుండా ఏడురోజులు సేవ చేసిన వారికి ఎనిమిదవరోజు శ్రీవారి దర్శనభాగ్యం కూడా టిటిడి కల్పిస్తోంది. త్వరలో శ్రీవారి సేవకులకు లడ్డూ,ప్రసాదాన్ని సబ్సిడీకి అందించాలని టిటిడి యోచిస్తోంది. కాగా ఈ నూతన డ్రస్‌కోడ్ విధానం 2012వ సంవత్సరం జనవరి 30న రథసప్తమి పర్వదినం నాటి నుండి టిటిడి విధిగా అమలు చేయనుంది. దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న శ్రీవారి భక్తులకు ఈ మార్పును గమనించి విధిగా టిటిడి ప్రవేశపెట్టిన నూతన విధివిధానాలను పాటించాలని టిటిడి కోరింది.

వైకుంఠ ఏకాదశికి ఈ దర్శన్ ద్వారా టిక్కెట్ల జారీ

వైకుంఠ ఏకాదశి సందర్భంగా కలియుగ వైకుంఠ దైవం శ్రీనివాసుడిని దర్శించుకునే భక్తులకు ఈ దర్శన్ కౌంటర్ ద్వారా టిక్కెట్ల జారీ ప్రక్రియను టీటీడీ బుధవారం ప్రారంభించింది. టిక్కెట్ల కోసం భక్తులు భారీగా క్యూలైన్లలో వేచి ఉన్నారు. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ.100, రూ.300 ప్రత్యేక ప్రవేశం టికెట్లను జారీ చేయనున్నారు. తిరుపతి మహతి ఆడిటోరియంలోని ఈ-దర్శన్ కౌంటర్‌లో బుధవారం ఉదయం 9 గంటల నుంచి టికెట్లు మంజూరు చేయనున్నారు. జనవరి 5వ తేదీ ఏకాదశి దర్శనం కోసం రూ.100 ప్రత్యేక ప్రవేశం 5 వేలు, రూ.300 ప్రత్యేక ప్రవేశం 500 టికె ట్లు జారీ చేయనున్నారు. 6వ తేదీ ద్వాదశి దర్శనం కోసం కూడా ఇదే సంఖ్యలోనే టికెట్లు జారీ చేయనున్నారు. రూ.100 ప్రత్యేక ప్రవేశం పొందిన భక్తులు ఆయా పర్వదినాల్లో అలిపిరి, శ్రీవారి మెట్టు ద్వారా నడిచివెళ్లి కాలిబాటలోని కౌంటర్లలో తమ టికెట్టును తిరిగి నమోదు చేసుకుంటేనే శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు. ఇందుకోసం ఈ-దర్శన్ కౌంటర్‌లో ప్రత్యేకంగా రెండు కౌంటర్లు ఏర్పాటు చేశామని, అవసరమైతే మరికొన్ని కౌంటర్లు ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈడీపీ విభా గం అధికారి భాస్కర్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఇక ఈనెల 24వ తేదీ నుంచి హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, బెంగళూరు, చెన్నయ్, ముంబయి, ఢిల్లీ, పూణెతో పాటు మరో 60 ఈ-దర్శన్ కేంద్రాల ద్వారా రోజుకు రూ.100 ప్రత్యేక ప్రవేశం టికెట్లు 25 వేలు, రూ.300 ప్రత్యేక ప్రవేశం టికెట్లు మరో 4500 కేటాయించనున్నారు.