Thursday, 15 December 2011

జీవిత, రాజశేఖర్‌లకు కోర్టు సమన్లు జారీ

సినీ నిర్మాత అల్లు అరవింద్ దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో సినిమా నటీనటులు జీవిత, రాజశేఖర్‌లకు నాంపల్లి కోర్టు గురువారం నాడు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9 వ తేదీన వీరిరువురూ కోర్టు ఎదుట హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో రక్తాన్ని అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ జీవిత, రాజశేఖర్ కొన్నాళ్ల క్రితం ఆరోపించిన విషయం తెలిసిందే. చిరంజీవి చారిటబుల్ ట్రస్టుపై జీవిత, రాజశేఖర్ చేసిన ఆరోపణలలో వాస్తవం లేదని, ఈ దంపతులు తప్పుడు ఆరోపణలు చేశారనీ అల్లు అరవింద్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాము ప్రజా సేవ చేస్తున్నామే తప్ప వ్యాపారం చేయడంలేదని, కావాలంటే ఈ విషయమై ప్రభుత్వం ఏ దర్యాప్తు సంస్థతోనైనా దర్యాప్తు చేయించుకోవచ్చునని అప్పట్లోనే బ్లడ్ బ్యాంకు నిర్వాహకుల నుంచి వివరణ వచ్చింది. ఈ విషయమై అల్లు అరవింద్ వేసిన పిటిషన్‌పై ఇప్పుడు నాంపల్లి కోర్టు ఈ సమన్లు జారీ చేసింది.

బ్రహ్మిణి స్టీల్స్‌ను తరలిస్తే ఊరుకోం

బ్రహ్మిణి స్టీల్స్‌ను వేరే ప్రాంతాలకు తరలిస్తే ఊరుకునేది లేదని రాయలసీమ హక్కుల నేత పీహెచ్ చంద్రశేఖరరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సెయిల్ కంపెనీ ద్వారా బ్రహ్మిణి స్టీల్స్‌ను ప్రభుత్వమే నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.  రాయలసీమ ప్రజలకు మేలు చేసే బ్రహ్మిణి స్టీల్స్‌ను ఇక్కడి నుంచి తరలించాలని ప్రయత్నిస్తే ఊరుకోమన్నారు. రాజకీయ విభేదాలతో బ్రహ్మిణిని తరలిస్తే రాయలసీమ ప్రాంతానికి తీరని నష్టం జరుగుతుందన్నారు.

అనంతపురం జిల్లాలో ఉప ఎన్నికలు పార్టీ లు గట్టి పోటీ

గ్రూపు తగాదాలతో కాంగ్రెస్… అవిశ్వాసానికి మద్దతు తెలిపిన అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిల భవితవ్యం ఏ విధంగా ఉండనుందన్నది ఇప్పుడు చర్చనీయాంశమైంది.  వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డికి అత్యంత సన్నిహితులైన గురునాథరెడ్డి, కాపు రామచంద్రారెడ్డిలు 2009 ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ తరుపున గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మరణం తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణమాల నేపథ్యంలో వారు ఆయన తనయుడు వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి వైపు మొగ్గుచూపారు.
ఇప్పటికే కాంగ్రెసులో నియోజకవర్గ ఇన్‌ఛార్జీల కోసం విపరీతమైన పోటీ నెలకొంది. ఆ పదవిని దక్కించుకునేందుకు ఎవరికివారు తమదైన శైలిలో పావులు కదుపుతున్నారు. ఇన్‌ఛార్జి పదవిని దక్కించుకోవడం ద్వారా వైఎస్‌ఆర్ పార్టీ తరపున అనంతపురం నియోజకవర్గానికి తిరిగి గురునాథరెడ్డి బరిలో ఉండే అవకాశాలున్నాయి. టీడీపీలోనూ అభ్యర్థులు తీవ్రంగానే పోటీ పడుతున్నారు. ఇక రాయదుర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే డిసిసి అధ్యక్షులు పాటిల్‌ వేణుగోపాల్‌రెడ్డిని కాదని అప్పట్లో వైఎస్‌.రాజశేఖర్‌రెడ్డి కాపు రామచంద్రారెడ్డికి ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకు పాటిల్‌ సహకరించాల్సి వచ్చింది. ఇప్పుడు కాపు జగన్‌వైపు వెళ్లడంతో పాటిల్‌కు తిరిగి మార్గం సుగమమైంది. ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులున్నందున ఆయన తనయుడు నియోజకవర్గ రాజకీయాల్లో ప్రవేశించేందుకు సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇక టిడిపి తరుపున దీపక్‌రెడ్డిని ఇప్పటికే కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే రాయలసీమలో జగన్‌కు విపరీతమైన క్రేజ్ ఉంది. యువకుడు కావడం ఒక కారణమైతే, కాంగ్రెస్ పెద్దలు మోసం చేశారన్నసానుభూతి ఉంది. మరోవైపు కాంగ్రెస్‌లో ముఠా తగాదాలు ఉన్నాయి. గ్రూపులుగా ఏర్పడటంతో నాయకత్వం లోపించింది. మంత్రులు రఘువీరారెడ్డి, శైలజానాధ్‌లు ఒక గ్రూపుగా, మాజీ మంత్రి  జేసీ దివాకర్‌రెడ్డి మరోగ్రూపుగా ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారు. అందుకని ఇక్కడ జగన్‌కు జనం జై కొట్టే అవకాశముంది.అనంతపురంలో జగన్‌కు జనం జై కొట్టే అవకాశముంది. జనంలోకి వెళ్లిన జగన్‌కు బలమైన క్యాడర్‌ కూడా ఉంది. అనంత జిల్లాలో జగన్ వర్గ ఎమ్మెల్యేలు ఇద్దరు పోటీ చేయనున్నారు. బలంగా ఉన్న తెలుగుదేశం కూడా గట్టి పోటీ ఇవ్వనుంది. కాంగ్రెస్ మాత్రం గ్రూపు తగాదాలతో సతమతమవుతోంది.

శ్రీవారి ఆలయంలో తిరుప్పావై సేవ ప్రారంభం

గురువారం సూర్యుడు ధనూరాశిలో ప్రవేశించాడు. దీంతోతిరుమల శ్రీవారి ఆలయంలో తిరుప్పావై సేవ ప్రారంభం అయింది. ధనుర్మాసం నెల్లాళ్లూ శ్రీవారి ఆలయంలో సుప్రభాతానికి బదులుగా  గోదాదేవి రచించిన పాశురాలను ఆలపించి శ్రీవారిని మేల్కొలుపుతారు. ఈ సేవ రేపటి నుంచి వచ్చేనెల 16వ తేదీ వరకు జరుగుతుంది.  శ్రీవళ్లి పుత్తూరులో కొలువైన గోదాదేవి తన యుక్తవయసునుంచి శ్రీనివాసున్ని తన భర్తగా భావించి ఆరాధిస్తుంది. ఆమె స్వామివారిని కీర్తిస్తూ తమిళంలో 30పాశురాళ్లను రచించి అంకితమిచ్చింది. తదనంతరం శ్రీనివాసుడు గోదాదేవి వివాహం చేసుకున్నట్లు తమిళ పురాణాలు చెబుతున్నాయి. ప్రతిఏటా సూర్య భగవానుడు ధనుర్ రాశిలోకి ప్రవేశించినప్పటి నుంచి కౌసల్యా సుప్రజా, రామా అని ప్రారంభమయ్యే సుప్రభాతానికి బదులుగా గోదాదేవి రచించిన 30పాశురాళ్లను పాడి శ్రీవారిని మేల్కోపుతారు. తిరుప్పావై సూర్యుడు మకర సంక్రమణం చేసేవరకూ ఆచరించడం జరుగుతుంది. ఈ కాలంలో శ్రీవారి ఆలయంలో తిరుప్పావైతో పాటు సహాస్ర నామార్చన, తోమాల సేవలు కొనసాగుతాయి. సహాస్ర నామార్చనలో స్వామి వారికి తులసీ దళానికి బదులుగా బిల్వపత్రాన్ని వినియోగిస్తారు. స్వామివారి అలంకారంలో కూడా మార్పులు జరుగనున్నాయి.  స్వామివారి రత్నభరణాలు పొదిగిన బంగారు చిలుకను సమర్పిస్తారు. ఇదిలా ఉంటే స్వామివారికి ప్రతి రోజు రాత్రి జరిగే ఏకాంత సేవల సాధారణంగా భోగశ్రీనివాసమూర్తి నిర్వహిస్తారు. అయితే ధనుర్మాసంలో మాత్రం గర్భాలయంలో ఉండే శ్రీకృష్ణస్వామికి ఏకాంతసేవ, పవళింపు సేవ నిర్వహించడం జరుగుతుంది.

ఉప ఎన్నికలు జగన్ సొంత జిల్లా పైనే అందరి దృష్టి

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఉప ఎన్నికలు కీలకం కానున్నాయి. తన వర్గం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ఖాయమని తేలడంతో తన మద్దతుదారులను గెలిపించుకునేందుకు జగన్ ఇప్పటి నుంచే కసరత్తు చేపట్టినట్లు సమాచారం. రాష్ట్రంలోని 25 నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికలు ఒక ఎత్తయితే, సొంత జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు జరుగనున్న ఎన్నికలు ఒక ఎత్తు అని చెప్పాలి. జగన్‌కు అత్యంత సన్నిహితులైన ముగ్గురు ఎమ్మెల్యేలు మళ్లీ పోటీచేస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరు కడప జిల్లాపై దృష్టి సారించారు. పార్టీ స్థాపించి ఏడాదికాక మునుపే రెండవసారి ఉప ఎన్నికల పోరుకు జగన్ సన్నద్ధమవుతున్నారు. కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో పోటీచేసిన తల్లీకొడుకులకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తిరిగి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ఉప ఎన్నికల్లో తన వర్గీయులను గెలిపించుకునేందుకు జగన్ సర్వశక్తులు ఒడ్డే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎన్నికల బాధ్యతలు కూడా వైఎస్ కుటుంబ సభ్యులు తీసుకోనున్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఈ నెల 26 నుంచి ఆ మూడు నియోజకవర్గాల్లో ఓదార్పు యాత్ర పేర ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలోని రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు శాసనసభ్యులు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసులు జగన్ వెన్నంటే నిలిచారు. ముగ్గురు ఎమ్మెల్యేలు జగన్ మాటకు కట్టుబడి అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. వీరిపై అనర్హత వేటు రేపోమాపో పడనుంది. ఆ తరువాత జరిగే ఉప ఎన్నికల్లో ఈ ముగ్గురు నేతలు ఆయా నియోజకవర్గాల నుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీకి సిద్ధమవుతున్నారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోకపోతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ మనుగడ ప్రశ్నార్థకమేనని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

కడప జిల్లా ఉప ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ ఆరాటం

గడిచిన ఏడేళ్ల కాలంలో వరస వైఫల్యాలతో చతికిలపడిన తెలుగుదేశం పార్టీ నేటికి తేరుకొని రానున్న ఉప ఎన్నికలకు సిద్ధమవుతున్నది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయంలో తెలుగుదేశం పార్టీని పూర్తిగా జిల్లాలో నిర్వీర్యమైంది. రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలాగా ఉండేది అలాంటిది వైఎస్ ఆ మూడు నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించి తెలుగుదేశం కోటలను బీటలు వార్చారు. ప్రస్తుతం ఆ మూడు నియోజకవర్గాలు దివంగత ముఖ్యమంత్రి బతికినంత కాలం కాంగ్రెస్‌పార్టీకి ఎదురులేదు. ప్రస్తుతం ఆ మూడు నియోజకవర్గాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధీనంలో ఉన్నాయి. దీంతో తెలుగుదేశం పార్టీ ఆ మూడు నియోజకవర్గాలలో తిరిగి పూర్వవైభవం తీసుకురావాలనే ఆలోచనలోపడింది. మూడు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి మంచి క్యాడర్ కలిగి పార్టీ కోసం సర్వశక్తులు ఒడ్డే నాయకులు కూడా ఉన్నారు. దీంతో ఉప ఎన్నికల పోరుకు తెలుగుదేశం పార్టీ సిద్ధమవుతున్నది. అక్కడక్కడ తెలుగుదేశం పార్టీ నేతలలో విబేధాలు ఉన్నప్పటికీ అందరూ కలసి కట్టుగా పనిచేస్తే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఇటీవల అసెంబ్లీలో పెట్టిన అవిశ్వాస తీర్మానానికి ఆ మూడు నియోజకవర్గాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఆదేశాలను ధిక్కరించిన దరిమిలా వారిపై అనర్హత వేటు పడనున్నది. దీంతో ఉప ఎన్నికలలో బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి కంచుకోట స్థానాలను కైవసం చేసుకోవాలనే ఆలోచనలో తెలుగుదేశం నేతలు ఉన్నారు. ఈ మూడు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీపాగా వేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ నుండి కడప ఎంపి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బయటికి వచ్చి సొంత పార్టీ ఏర్పాటు చేసుకోవడంతో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ రెండు వర్గాలుగా చీలిపోయింది. ఒక వర్గం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుండగా మరో వర్గం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతుంది. ఇదే అదనుగా భావించిన తెలుగుదేశం పార్టీ ఆ మూడు నియోజకవర్గాలలో పట్టు బిగించాలనే వ్యూహా పన్నుతోంది. పార్టీ పూర్వవైభవం కోసం తెలుగుదేశం పార్టీ నేతలు ఆరాటపడుతున్నారు. ఈ మూడు నియోజకవర్గాలలో బలమైన కార్యకర్తలు ఉన్నారు. నాయకులంతా విబేధాలను పక్కన పెట్టి అభ్యర్థుల గెలుపుపై దృష్టి సారించారు. ఆ మూడు నియోజకవర్గాలలో ఇప్పటికే తెలుగుదేశం కార్యకర్తలు అభ్యర్థుల విజయంపై ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. ఈ ఉప ఎన్నికలలో కష్టించి పనిచేస్తే కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీను ఎదుర్కొవడం తేలికగా అవుతుందని తెలుగుదేశం కార్యకర్తలు భావిస్తున్నారు. ప్రస్తుతం మారిన పరిస్థితులలో జగన్‌పై ప్రజలలో ఇదివరకటి ఆదరణలేదని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక విధానాలపై. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగనమోహన్‌రెడ్డిపై విస్తృతంగా వస్తున్న చెడుఆరోపణలపై ప్రచారం నిర్వహించి ఓటర్లను తమవైపు తిప్పుకోవాలనే యోచనలో తెలుగుదేశం పార్టీ నేతలు ఉన్నారు. అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీలో ఉన్న వర్గవైష్యమాలను కూడా అనుకూలంగా మలుచుకోవాలని దేశం నేతలు ఉన్నారు. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం అధికార పార్టీ నేతలు క్యూ కట్టుతుండడంతో టికెట్ దక్కని ఆశావాహులు ఉప ఎన్నికలలో గోడదూకేందుకు కూడా వెనుకాడడం లేదు. రాయచోటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో నూతన ఉత్తేజం కనిపిస్తుంది. గతనెల చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో తలపెట్టిన రైతుపోరు బాటలో విజయవంతమైంది. ఈ పర్యటనలో చంద్రబాబు రాయచోటి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా, జడ్పీ మాజీ చైర్మెన్ సుగవాసి సుబ్రమణ్యం పేరును ప్రకటించారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి నియోజకవర్గంలో నేతల మధ్య ఎలాంటి విభేదాలు లేవు. అందరూ ఏకతాటిపై నడుస్తున్నారు. ఇక రాజంపేట నియోజకవర్గ విషయానిక వస్తే మాజీ ఎమ్మెల్యే డాక్టర్ కసిరెడ్డి మదన్‌మోహన్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పనిచేస్తూ నియోజకవర్గ ప్రజలలో మంచి గుర్తింపు పొందారు. అలాగే అనుకోని పరిస్థితులలో తెలుగుదేశం పార్టీని వీడిన మాజీ మంత్రి పి బ్రహ్మయ్య వర్గీయులు కూడా బ్రహ్మయ్యకు పార్టీ టికెట్ ఆశిస్తున్నారు. అలాగే రైల్వే కోడూరు నియోజకవర్గంలో గత ఎన్నికలలో పోటీచేసిన అజయ్‌కుమార్‌ను కానీ లేదా ఇతరుల పేర్లను ఇప్పటికే పార్టీ అధిష్ఠానం పరిశీలిస్తుంది. ఈ మూడు నియోజకవర్గాలలో తెలుగుదేశం పార్టీకి మంచి పట్టుకలిగి ఉండడంతో ఉప ఎన్నికల ద్వారా తిరిగి పూర్వవైభవాన్ని తీసుకురావడంతో పాటు కాంగ్రెస్, వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీలను మట్టికరించే విధంగా ఆలోచనలో తెలుగుదేశం నేతలు ఉన్నారు. ఏది ఏమైనా ఈ ఉప ఎన్నికలలో దేశం పార్టీ సర్వశక్తులు ఒడ్డి తమ ఉనికిని కాపాడుకోనున్నది.

తిరుమలలో కలకలం శ్రీవారి ఆలయంపై వెలుగుచుక్క

తిరుమల శ్రీవారి ఆలయం పైభాగాన బాగా ఎత్తులో బుధవారం రాత్రి ఓ వెలుగుచుక్క ప్రయాణించిన సంఘటన కలకలం రేపింది. ఆకాశంలో జరిగిన ఈ అద్భుతంపై రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ఇది స్వామి దివ్యజ్యోతి అని, తిరుమల క్షేత్రానికి అదృష్టమని కొందరు అంటుంటే, ఇది ‘ఫ్లైయింగ్ సాసర్ ’(ఎగిరే పళ్లెం) అయి ఉంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే భక్తులు మాత్రం ఇది స్వామి జ్యోతి అయి ఉంటుందని గట్టిగా విశ్వసిస్తున్నారు. ఇది సాయిజ్యోతి అని కొంత మంది ప్రచారం చేస్తుంటే, ఇది తోకచుక్క అని ఇంకొంతమంది అంటున్నారు. తోకచుక్క అయితే ఆకాశం నుండి కిందకు జారుతూ క్రమంగా అదృశ్యమవుతుంది. అయితే బుధవారం శ్రీవారి ఆలయంపై తూర్పు నుండి పడమర వైపు కదులతూ వెలుగుచుక్క దర్శనమిచ్చింది. అందరూ చూస్తుండగానే కనుమరుగైంది. అయ్యప్ప మకరజ్యోతి తరహాలో రెండు నిమిషాల పాటు ఆలయంపై ఈ వెలుగు చుక్క ముందుకు సాగింది. ఆలయ గోపురంపై నుండి ఓ వెలుగుచుక్క వెళుతూ వుండటాన్ని విధి నిర్వహణలో వున్న ఓ సెక్యూరిటీ గార్డు గమనించి, పాత్రికేయులకు చూపించాడు. కొంత మంది ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన వారు ఈ వెలుగుచుక్కను కెమేరాల్లో బంధించారు. అయితే సాధారణ కెమేరాల్లోకి ఈ చుక్క అందుబాటులోకి రాలేదు. దివిటీలా వెలుగుతూ పడమర వైపు పయనిస్తూ రెండు, మూడు నిమిషాల వ్యవధిలో కనుమరుగయింది. ఈ వెలుగు రహస్యమేమిటో శాస్తవ్రేత్తలే తేల్చాల్సి ఉంది. ఏది ఏమైనా బుధవారం వెంకన్న ఆలయంపై ఆవిష్కృతమైన ఈ అద్భుతంపై వాడివేడిగా చర్చ సాగుతోంది.