Thursday, 26 January 2012

బాబు డెరైక్షన్‌లో సీబీఐ...భూమా శోభానాగిరెడ్డి

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డెరైక్షన్‌లో సీబీఐ నడుస్తోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత భూమా శోభానాగిరెడ్డి ఆరోపించారు. ఏదో విధంగా ఎమ్మార్ కేసులో జగన్‌ను ఇరికించాలని చూస్తోందని ఆమె అన్నారు. ఎమ్మార్‌పై అప్పటి కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాలనే వైఎస్ రాజశేఖరరెడ్డి అమలు చేశారని.. ఆ సబ్ కమిటీని సీబీఐ విచారించిందా అని శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు, కోనేరు ప్రసాద్‌ల మధ్య ఉన్న సంబంధం రాష్ట్ర ప్రజలందరికి తెలుసున్నారు. జగన్‌కున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక రామోజీరావు నీచమైన కథనాలను రాస్తున్నారని ఆమె మండిపడ్డారు. విజయసాయిరెడ్డి కంటే ముందుగా సీబీఐ జేడీ లక్ష్మినారాయణకు నార్కో టెస్ట్‌లు నిర్వహించాలని శోభానాగిరెడ్డి డిమాండ్ చేశార.సిబిఐ దర్యాఫ్తు చూసి రాష్ట్ర ప్రజలు నవ్వుకుంటున్నారని మరో నేత బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి అంతకుముందు వేరుగా అన్నారు. స్టైలిష్ హోం రంగారావును వదిలేసి సిబిఐ అమాయకుడైన సునీల్ రెడ్డిని అరెస్టు ఎందుకు చేసిందన్నారు. బాబు, కాంగ్రెసు ఫిక్సింగ్ చేసుకొని రైతులను అవమానిస్తున్నారని మండిపడ్డారు. బాబు తమ పార్టీని లక్ష్యంగా చేసుకున్నారన్నారు. రాష్ట్రపతి ప్రసంగం కంటే సునీల్ రెడ్డి అరెస్టే ప్రధానంగా ఎల్లో మీడియా వార్తలు ప్రచురించడమేమిటన్నారు

సిక్సర్ల వీరుడు యువరాజ్‌కు ఏమైంది ..?

సిక్సర్ల వీరుడు యువరాజ్‌ సింగ్‌ హుటాహుటిన బ్రిటన్‌ వెళ్లాడు. ఊపిరి తిత్తుల్లో ఏర్పడ్డ గడ్డ పెద్దదౌతుండడంతో చికిత్స కోసం లండన్‌లోని క్యాన్సర్‌ నిపుణులను కలవడానికి వెళ్లాడు. ఐతే భారత అభిమానులు మాత్రం యూవీ ఊపిరితిత్తుల్లో ఏర్పడ్డ ట్యూమర్‌ క్యాన్సర్‌ కణతి కాకూడదని ప్రార్థిస్తున్నారు. యువరాజ్‌ సింగ్‌ ఇంగ్లండ్‌ వెళ్లాడని అతడి సన్నిహితుడొకరు తెలిపారు. ఐతే యూవీకి ఈ అనారోగ్యం వరల్డ్‌ కప్‌ నుంచే ఉందని గతంలోనే అతని తల్లి షబ్నమ్‌ సింగ్‌ తలిపారు. అతడి ఊపిరిత్తిత్తులో గోల్ఫ్‌ బాల్‌ సైజున్న కణతి ఉందని గత అక్టోబర్‌లో జరిగిన చికిత్సలో తెలిసింది.కాని అది క్యాన్సర్‌ కణతి కాదని డాక్టర్లు తేల్చారు. ఆసీస్‌ టూర్‌కుముందు తాను ఫిట్‌గా ఉన్నానని, ఆస్ట్రేలియా తో వన్డేలు టీ20ల్లో పాల్గొంటానని కూడా బీసీసీఐ హింట్‌ ఇచ్చాడు. కాని ఇప్పుడు యూవీ హుటాహుటిన ఇంగ్లండ్‌ వెళ్లడంతో అతని అభిమానులు మళ్లీ కంగారుకు గురౌతున్నారు. ఇదిలా ఉంటే యువరాజ్‌కు పెద్ద ప్రమాదమేమీ లేదని అతడికి అందాల్సిన రిపోర్టుల్లో మరొ రిఆపోర్టు రావాల్సి ఉందని అందుకే లండన్‌ వెళ్లాడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి. లండన్‌లో మెడికల్‌ రిపోర్టులు వచ్చిన తర్వాత యూవీ అటునుంచి నేరుగా యూఎస్‌ వెళ్లనున్నాడు. మరింత మెరుగైన చికిత్సకోసమే యూఎస్‌ వెళ్తున్నాడని యూవీ బంధువు మీడియాకు వెళ్లడించారు. ఊపిరితిత్తుల్లో ఉన్న కణతిని యూఎస్‌లోని ప్రముఖ ఆస్పత్రిలో చికిత్స చేసి తీసేస్తారని అన్నారు. ఒక్కసారి రిపోర్టులు చేతికి అందాక చికిత్స మొదలు పెడతారని అన్నారు. యూవీ తిరిగి కోలుకోడానికి ఆరునెలలు పడుతుండడంతో అప్పటివరకు క్రికెట్‌కు దూరమవనున్నాడు.

పార్టీ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ...నందమూరి బాలకృష్ణ

పార్టీ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ అన్నారు.తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవిపై హీరో నందమూరి బాలకృష్ణ వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. గురువారం ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించింది. చిరంజీవిపై ప్రశ్నించగా అందుకు బాలకృష్ణ నో కామెంట్ అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని బహిరంగ ప్రకటన చేసినప్పటి నుండి ఇటీవల వరకు చిరంజీవి, బాలకృష్ణల మధ్య వాగ్వుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సామాజిక న్యాయం పేరుతో పార్టీని పెట్టిన వారు ఆ తర్వాత అమ్మేసుకున్నారని, తనను ఎవడో బాలుడు అన్నారని, పార్టీ ఆదేశిస్తే తాను చిరంజీవి పైనా పోటీకి సిద్ధమని ఇటీవల వివిధ సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం చిరంజీవిపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. చిరంజీవి వ్యాఖ్యలపై తానేమీ స్పందించనన్నారు. మిగతా అంశాలపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ లగడపాటి రాజగోపాల్ తన పదవికి రాజీనామా చేసి మళ్లీ విజయవాడ నుంచి గెలవాలని సవాల్ విసిరారు. త్వరలో తెలంగాణలో పర్యటిస్తానని బాలయ్య తెలిపారు. అభిమానులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. కాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా త్యాగమూర్తుల సేవను కొనియాడారు.
నమస్తే రాయలసీమ డాట్ కాం      పాఠకులు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు





పులివెందుల్లో సోలార్ వెలుగులు

రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పులివెందుల్లో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కాబోతోంది. సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు దాదాపు రూ.100 కోట్లతో 38.23 ఎకరాల్లో ఈ ప్లాంట్‌ను వెల్స్‌ఫన్ కంపెనీ చేపట్టింది. ఈ పనులు ప్రస్తుతం చివరి దశలో సాగుతున్నాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం ఢిల్లీకి చెందిన వెల్స్‌పన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పులివెందుల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు సిద్దమైంది. అప్పుడే పులివెందుల పారిశ్రామికవాడలో 38.23 ఎకరాలు కొనుగోలు చేసింది. వెల్స్‌పన్ సోలార్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పులివెందుల్లో ఆరు నెలల క్రితం సోలార్ విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించింది. సూర్యకాంతి ద్వారా (సోలార్) విద్యుత్తును ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రం పులివెందుల్లో ప్రారంభం కాబోతోంది. వెల్స్‌పన్ సంస్థ దాదాపు రూ.100 కోట్లతో ఇక్కడ ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది. ఈ విద్యుత్తు కేంద్రంలో 5 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కానుంది. ఒక్కో మెగావాట్‌కు రూ.14 కోట్ల వంతున 5 మెగావాట్లకు రూ.74 కోట్లు, అలాగే భూమి కొనుగోలు, ఇతరత్రా పనులకు మరో రూ.26 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్యానల్ బోర్డులు అమర్చే కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. అలాగే దీనికి సంబంధించిన విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే విద్యుత్తును పక్కనే ఉన్న 220 కేవీఏ సబ్‌స్టేషన్ ద్వారా గ్రిడ్‌కు అందించనున్నారు. అక్కడి నుంచి ఈ విద్యుత్తును వివిధ అవసరాల కోసం వినియోగించనున్నారు. ఈ విద్యుత్తు ప్లాంట్ మరికొన్ని రోజుల్లోనే విద్యుత్తు ఉత్పత్తిని చేయబోతోంది. ఈ ప్లాంట్ విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభిస్తే జిల్లాలో విద్యుత్తు కొరత కొంతవరకు తీరనుంది.

అనంతపురం జిల్లాలో రౌడీషీటర్లుకు కౌన్సెలింగ్

మండలంలోని వడియంపేట గ్రామంలో ఇరువర్గాలకు చెందిన రౌడీషీటర్లుకు పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. రానున్న పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ముందుస్తు చర్యగా ఎస్ఐ నారాయణరెడ్డి మండలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఐదుగురు రౌడీషీటర్లును గుర్తించారు. వారిని అనంతపురం డీఎస్పీ దయానందరెడ్డి ఎదుట హాజరుపరిచారు.గ్రామంలో అధిపత్యం కోసం ఇరువర్గాలు ఘర్షణలు,బెదిరింపులు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. గతంలో జరిగిన సంఘటనలు పునురావృత్తం కాకుండా చూడాలని మాజీ సర్పంచ్ పీ శ్రీనివాసులుకు సూచించారు. ప్రస్తుతం 12 సంవత్సరాల అనంతరం గ్రామంలోకి వచ్చిన రౌడీషీటర్ శ్రీరాములను తిరిగి గ్రామబహిస్కరణ చేయాలని పోలీసులు నిర్ణయించినట్టు సమాచారం. ముందుస్తు జాగ్రత్తగా ఐదుగురు రౌడీ షీటర్లు గంధం రవి, తలారి కాశీం, పరిశే నరసింహలు, పరిశే శ్రీనివాసులు, గంధం శ్రీరాములును తహీసీల్దార్ నాగరాజు వద్ద 50 వేల పూచీకత్తుతో బైండోవర్ చేశారు.గ్రామాల వారీగా రౌడీషీటర్లుకు కౌన్సెలింగ్- ఎస్ఐ త్వరలో గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి సంఘటనల జరగుకుండా ముందస్తు భాగంగా రౌడీషీటర్లు, ఫ్యాక్షన్ నేతలకు కౌన్సెలింగ్ ఇవ్వనున్నట్టు ఎస్ఐ నారాయణరెడ్డి తెలిపారు. గ్రామాల వారీగా తొలుత రౌడీషీటర్లును గుర్తించి వారిని స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామన్నారు. అనంతరం మండలంలోని ఫ్యాక్షన్ గ్రామల్లో ఉన్న ఇరు వర్గాల నేతలకు కూడ దశలవారిగా కౌన్సెలింగ్ నిర్వహించి బైండోవర్ చేయనున్నట్లు ఆయన తెలిపారు

ర్యాగింగ్ చేయొద్దన్నందుకు దాడి

ఓ విద్యార్థిపై దాడి చేసిన కేసులో ఏడుగురు విద్యార్థులను చంద్రగిరి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్న జ్ఞానేంద్రనాయుడు, సాయికృష్ణ, శరత్‌కుమార్, నిరంజన్, వినోద్, భరత్, దిలీప్‌లు స్నేహితులు. వీరందరూ నెల క్రితం మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే వీరిలో జ్ఞానేంద్రనాయుడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో వీరి మధ్యన భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కాలేజీ విడిచిపెట్టిన తరువాత జ్ఞానేంద్రనాయుడు మోటార్ సైకిల్‌పై తిరుపతి వెళుతుండగా, మిగిలిన ఆరుగురు దాడి కి పాల్పడ్డారు. ఇందుకు కేఎంఎం కాలేజీకి చెందిన భరత్ సహాయం తీసుకున్నారు. దీనిపై బాధితుడు చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన ఆ ఏడుగురిని అరెస్టు చేశారు. ర్యాగింగ్ చేయడం తగదని చెప్పినందుకు కక్షకట్టి దాడుల వరకు వెళ్లిన ఆ విద్యార్థులను చంద్రగిరి సీఐ నాగభూషణం తీవ్రంగా మందలించారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. అంతేకాక దాడికి పాల్పడ్డ విద్యార్థుల గురించి ఆయా కాలేజీల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ర్యాగింగ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.