Wednesday, 28 December 2011

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌తో మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ‘ఢీ’

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి వాదులాటకు దిగినట్లు తెలుస్తోంది. ఆరోగ్యశ్రీపై ముఖ్యమంత్రి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశంలో కిరణ్ కుమార్ రెడ్డికి, రవీంద్రా రెడ్డికి మధ్య వాగ్వివాదం జరిగినట్లు తెలుస్తోంది. 104 సర్వీసుల ఉద్యోగుల తొలగింపుపై ఇరువురి మధ్య భేదాభిప్రాయాలు చోటు చేసుకున్నట్లు చెబుతున్నారు. ఎక్కువగా ఉన్న 104 సర్వీసుల ఉద్యోగులను తొలగించాలని రవీంద్రా రెడ్డి పట్టుబట్టగా అలా తొలగిస్తే సమస్యలు వస్తాయని ముఖ్యమంత్రి చెప్పినట్లు సమాచారం. దీంతో రవీంద్రా రెడ్డి సమావేశం నుంచి మధ్యలో ఆగ్రహంగా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. 104 సర్వీసుల్లో హెచ్ఎంఆర్ఐ అవసరానికి మించి ఉద్యోగులను నియమించిందని, ఎక్కువగా ఉన్న ఉద్యోగులను తొలగించే విషయంపై పరిశీలిస్తున్నామని డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. ముఖ్యమంత్రితో ఏ విధమైన వాగ్వివాదం జరగలేదని ఆయన చెప్పారు. 108 సర్వీసులను నెలలోగా అందుబాటులోకి తెస్తామని ఆయన చెప్పారు. 104 సర్వీసులను ప్రభుత్వమే నిర్వహించాలా, కొత్త టెండర్లను ఆహ్వానించాలా అనే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే, ఆరోగ్యశ్రీ పథకాన్ని ట్రస్టు పద్ధతిలో నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. దానిపై అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. దీంతో జివికె నుంచి 108 సర్వీసులను తప్పిస్తారు.

ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీకి సిద్ధమే....భూమానాగిరెడ్డి

రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీకి సిద్ధంగా ఉన్నారని వెనకాడే ప్రసక్తే లేదని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ గవర్నింగ్ సభ్యులు మాజీ ఎంపి భూమానాగిరెడ్డి పేర్కొన్నారు.  గోస్పాడులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో ఎమ్మిగనూరు, ఆళ్ళగడ్డ అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోటీకి సిద్ధంగా ఉన్నామని భూమా స్పృష్టం చేశారు. ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభానాగిరెడ్డి రాజీనామా చేసిందన్నారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి రైతుల అభ్యున్నతికి పాటుపడుతున్నారన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ఆర్ ఆశయాలను కాంగ్రెస్ ప్రభుత్వం తూట్లు పొడుస్తుందన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ప్రజలు బ్రహ్మరథం పట్టి గెలిపిస్తారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పెంచిన ధరలతో రైతులు, సామాన్య ప్రజానికం కొట్టుమిట్టాడుతూ ఇబ్బందులు పడుతున్నారని ఇంత అసమర్థత ప్రభుత్వాన్ని ఎన్నడు చూడలేదన్నారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. రైతుల అభ్యున్నతే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ఆళ్ళగడ్డ ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా తాము సిద్దంగా ఉన్నామని మాజీ ఎంపి భూమానాగిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

రాలయసీమ జిల్లాలో మాఫియాకు రాజకీయ అండ!

రాలయసీమ జిల్లాలో అడ్డదారిలో సంపాదనకు అలవాటు పడిన వారు మాఫియా మారి రాజకీయ అండదండలతో చెలరేగి పోతున్నారు. వీరిని కాదని సామాన్యుడికి న్యాయం ఎలా జరుగుతుందన్న ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతోంది. మాఫియాకు రాజకీయ నాయకులు, రాజకీయ నాయకులకు అధికారులు అండగా ఉన్నంత కాలం ఏ అక్రమ వ్యవహారాన్ని అడ్డుకోలేరని వారు తేల్చి చెబుతున్నారు. తమ కష్టం తమకు తప్పదని మాఫియా విషయంలో జోక్యం చేసుకోవడం ప్రమాదమే కాని ప్రయోజనం లేదని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మద్యం, ఇసుక దందాలపై హడావుడి చేసి దాడులు నిర్వహించి భరతం పట్టాలని ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం వాటి అమలులో శ్రద్ధ చూపకపోవడమే ఇందుకు నిదర్శనమని ప్రజలు పేర్కొంటున్నారు. జిల్లాలో మద్యం అధిక ధరలకు విక్రయించడం, ఇసుక అక్రమ రవాణాతో పాటు అడవులను కొల్లగొడుతూ ఎర్ర చందనం, గనులను తవ్వుతూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. వీటిపై ఉక్కు పాదం మోపితే ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున నిధులు సమకూరుతాయి. అయితే ఎక్కడా, ఏ అధికారి ఆ దిశగా అడుగులు వేస్తున్న దాఖాలు కనిపించడం లేదు. అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కుల మేడలపై మేడలు కడుతూ, బీరువాల్లో కరెన్సీ నోట్ల కట్టలను పేర్చుకుంటున్నారు. ఖనిజ సంపదతో పాటు మద్యం వ్యవహారంలో రాజకీయ నాయకులకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు ఉండటంతో మాఫియాలకు తలొంచుతూ వారి వైపు పోలీసు, రెవిన్యూ, గనులు, విజిలెన్స్ అధికారులు కనె్నత్తి చూడడం లేదు. పరోక్షంగా సంబంధాలు ఉన్న రాజకీయ నాయకులు తమ మద్దతుగా ఉన్నందుకు వారికి భారీగా నజరానా ముడుతోందన్న ఆరోపణలు బలపడుతున్నాయి. ఇక ప్రత్యక్షంగా సంబంధాలు ఉన్న నాయకులు అధికారుల సహకారంతో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో అధికార, ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేసుకునే విషయం బహిరంగంగా జరిగితే లోలోన మాత్రం ఒక అభిప్రాయానికి వచ్చి తమ పని చక్కబెట్టుకుంటారంటున్నారు. మద్యం, ఇసుక, కలప, మైనింగ్ మాఫియాలపై నాయకులు చేసే హడావుడి కేవలం తమను నమ్మించడానికి చేసే ప్రయత్నమేనని చెబుతున్నారు. నిజాయితీ కలిగిన రాజకీయ నాయకులను వెతికితే ఎక్కడో ఒకరో ఇద్దరో కనిపించినా వారు కూడా మాఫియాను, వారికి అండగా ఉన్న వారిని ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు. జిల్లాలో చెలరేగుతున్న మాఫియాను వారికి అండగా ఉన్న రాజకీయ నాయకులు, అధికారుల ఆగడాలను అడ్డుకోవాలంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే తప్ప ప్రయోజనం ఉండదని చెబుతున్నారు. మద్యం, ఇసుకపై దాడులు చేయించిన ప్రభుత్వం మద్యం ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, ఇసుకను అక్రమంగా తరలిస్తే కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలు బుట్టదాఖలవుతున్నాయి. ప్రజల కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించనంత కాలం సామాన్యుడికి మేలు జరిగే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. అక్రమార్కులను కట్టడి చేయనంత కాలం సామాన్యుడికి కష్టాలు తప్పవని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

జెకె భారవి దర్శకత్వంలో మోహన్ బాబు,నాగార్జున

ప్రముఖ రచయిత జె కె భారవి దర్శకుడుగా మారి చేస్తున్న చిత్రం ఆది శంకరా చార్య. ఈ చిత్రంలో ఆల్రెడీ నాగార్జున గెస్ట్ గా కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ఇప్పుడు మోహన్ బాబు కూడా ఓ కీలకమైన పాత్రలో కి ఈ సినిమాలోకి వచ్చి చేరిందని తెలుస్తోంది. మోహన్ బాబు భారవి చెప్పిన కథ విని, ఇంత వరకు చిత్రించిన టోటల్ రషెస్ చూసి, అద్భుతంగా ఉందని అభినందిస్తూ ఆది శంకరలో నటించడానికి నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని చెప్పుతున్నారు. గతంలో తాను రాసిన అన్నమయ్యలో మోహన్ బాబు ఓ కీలకమైన పాత్రను చేసి చిత్రానికి వెన్నుముకలా నిలిచారు. ఇక నాగార్జున ఈ చిత్రంలో చేయటంపై భారవి మాట్లాడుతూ..‘నా అభిమాన హీరో నాగార్జునను ఈ పాత్రలో చూడాలని 3 ఏళ్లుగా కలలుకన్నాను. ఆ కలను అవలీలగా ఒక్క స్ట్రోక్ తో నాగ్ నిజం చేశారు. త్వరలో అన్నమయ్య, శ్రీరామదాసులను మించిన సబ్జెక్టు ఇస్తాను’ అంటూ భారవి ఉద్వేగంతో చెప్పారు.ఈ విషయమై నాగార్జున మాట్లాడుతూ...హిందూ ధర్మాన్ని నిలబెట్టిన ఆది శంకరుడి దివ్య చరిత్రలో ఆ మహనీయుడి జీవితాన్ని మలుపు తిప్పిన అత్యంత కీలకమైన ఒక మాస్ పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని, భారతీయుడిగా అది నాబాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. ఇందులో హీరో కౌషిక్, రియల్ స్టార్ శ్రీహరి, డైలాగ్ కింగ్ సాయికుమార్, సుమన్, జయప్రద, రోషిణి, రోజా, తులసి, ఆనంద్, నాగబాబు, అశోక్ కుమార్, శివ పార్వతి, సంగీతలతో పాటు మరికొందరు నటిస్తున్నారు. గ్లోబల్ పీస్ క్రియేటర్స్ పతాకంపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆది శంకరాచార్య, వేదవ్యాస్ పాటలు అందించగా..నాగ్ శ్రీవత్స సంగీతం సమకూర్చుతున్నారు.

సినీనటుడు సిదార్థపై బెదిరింపు ఫిర్యాదు

ప్రముఖ సినీ నటుడు సిద్ధార్థ్‌పై హత్యాబెదిరింపు కేసు నమోదైంది. దక్షిణచెన్నయ్ పరిధిలోని లక్ష్మీనగర్‌కు చెందిన డిజైనర్ బాబు పోలీసు కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఫిర్యాదు చేశారు. సిద్దార్థ, ఆయన తండ్రి సూర్యనారాయణ కోరిక మేరకు గతంలో వారి ఇంటిని రూ.6 లక్షల 63 వేల వ్యయంతో అలంకరించారని, అయితే వారు రూ.4 లక్షల 30 వేలు మాత్రమే ముట్టజెప్పి మిగతా సొమ్ము ఇచ్చేందుకు నిరాకరించారని ఫిర్యాదులో తెలిపారు. ఈ నెల 13వ తేదీన బాకీ కోసం వారి ఇంటికి వెళ్లిన తనను హత్య చేస్తామని బెదిరించారని, వారిపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. దీనిపై విచారణ జరపాల్సిందిగా ఆర్థిక నేర విభాగం సీఐడీ పోలీసులకు ఉత్తర్వులు జారీ అయ్యాయి.

అధికార పార్టీ నాయకులు జలయుద్ధం




వారికి మద్దతుగా రంగంలోకి దిగిన రాజకీయ పార్టీల నాయకులు షట్టర్లకు అడ్డుగా వేసిన మట్టిని జేసీ ఆధ్వర్యంలో తొలగించిన తాడిపత్రి రైతులు కట్టలు గాలికి పోతుంటే ఏకులు ఏరుకున్నారనే చందంగా తయారయ్యారు మన నేతలు. హెచ్చెల్సీకి న్యాయంగా రావాల్సిన నీటి వాటాకు దారుణంగా కోత పడుతుంటే గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయడం మాని వచ్చిన అరకొర నీటి కోసం రచ్చకెక్కుతున్నారు. మంత్రి శైలజానాథ్, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ దివాకర్ రెడ్డి సుబ్బరాయసాగర్ నీటి విషయంలో నువ్వా.. నేనా అనే రీతిలో పోరు సాగిస్తున్నారు. అనంతపురం:ప్రభుత్వ అనాలోచిత వైఖరి.. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం అనంతపురం జిల్లాలో జల యుద్ధానికి దారితీసింది. ఇన్నాళ్లూ అన్నదమ్ముల్లా కలిసిమెలిసి జీవించిన రెండు నియోజకవర్గాల ప్రజల మధ్య చిచ్చు రేపింది. ఒక నియోజకవర్గం రైతులకు మంత్రి శైలజానాథ్ మద్దతుగా నిలిస్తే.. మరొక నియోజకవర్గం రైతులకు మాజీ మంత్రి జేసీ దివాకర్‌రెడ్డి దన్నుగా నిలుస్తున్నారు. అధికార పార్టీలో ఉప్పునిప్పుగా పేరొందిన వీరిద్దరూ ఇప్పుడు ప్రత్యక్ష యుద్ధానికి తెరతీశారు. వివరాల్లోకి వెళితే.. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ (హెచ్చెల్సీ) ఆయకట్టులో తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ) కింద 31,131 ఎకరాల ఆయకట్టు విస్తరించి ఉంది. ఈ ఏడాది టీబీసీ కింద 1.312 టీఎంసీలతో పది వేల ఎకరాల్లో ఆరుతడి పంటలకు నీళ్లందించాలని నిర్ణయించారు.
టీబీసీ ఆయకట్టుకు నీళ్లందించడానికి వీలుగా సుబ్బరాయసాగర్ జలాశయాన్ని హెచ్చెల్సీ నీటితో నింపుతారు. సుబ్బరాయసాగర్ నీటి నిల్వ సామర్థ్యం 0.48 టీఎంసీలు. ఈ జలాశయం గేట్లకు మరమ్మతు చేయకపోవడం వల్ల నీళ్లన్నీ వృథా అవుతున్నాయి. ఏనాడూ నీటి నిల్వ సామర్థ్యం మేరకు నీళ్లను నిల్వచేయలేని దుస్థితి నెలకొంది. సుబ్బరాయసాగర్ గేట్లకు మరమ్మతు చేయకపోవడానికి ప్రధాన కారణం సున్నపురాళ్ల గనుల యజమానుల ఒత్తిళ్లకు తలొగ్గడమేనన్న వాదన బలంగా విన్పిస్తోంది. సాగర్‌లో పూర్తిస్థాయిలో నీటిని నిల్వ చేస్తే సున్నపురాళ్ల గనుల్లోకి నీళ్లు చేరుతాయి. అప్పుడు ఖనిజాన్ని వెలికితీయడం కష్టమవుతుంది. ఈ గనులన్నీ అధికార పార్టీకి చెందిన ఓ కీలకప్రజాప్రతినిధి, మరొక సీనియర్ ప్రజాప్రతినిధి, విపక్ష పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి, వారి అనునయులకు చెందినవి కావడం గమనార్హం. సుబ్బరాయసాగర్ గేట్లకు మరమ్మతు ఎందుకు చేయడం లేదని నిలదీస్తే.. నిధుల్లేవనే కారణాన్ని హెచ్చెల్సీ అధికారులు చెప్పడం రివాజుగా మారిపోయింది. ఇదే తాడిపత్రి, శింగనమల నియోజకవర్గాల ప్రజల మధ్య జల యుద్ధానికి దారితీసింది.
సుబ్బరాయసాగర్ నుంచి టీబీసీ కెనాల్ ద్వారా తాడిపత్రి, శింగనమల నియోజకవర్గంలో పుట్లూరు, కోమటికుంట్ల చెరువులకు నీళ్లందుతాయి. సాగర్‌లో నీటిమట్టం ఆరు మీటర్ల మేర ఉంటేనే ఈ కాలువకు నీటిని విడుదల చేస్తారు. రెండు నియోజకవర్గాల మధ్య నీటి యుద్ధం శాంతిభద్రతలకు సవాల్‌గా మారడంతో సుబ్బరాయసాగర్ నుంచి నీటి విడుదలను అధికారులు ఆపేశారు. ఇదే అంశంపై హెచ్చెల్సీ ఎస్‌ఈ టీబీ రవిని  వివరణ కోరగా.. రెండు ప్రాంతాల నేతలతో మాట్లాడుతున్నామని,పరిస్థితినచక్కదిద్దుతున్నామని వివరించారు.
చెరువులను తప్పకుండా నింపుతాం :మంత్రి శైలజానాథ్
తాగునీటి సమస్యను తీర్చడానికి పుట్లూరు మండలంలోని చెరువులను తప్పకుండా నింపుతామని మంత్రి శైలజనాథ్ చెప్పారు. మంగళవారం ఆయన తో ఫోన్‌లో మాట్లాడారు. 15 రోజుల క్రితం ఐదు రోజుల పాటు సుబ్బరాయసాగర్‌లో ఉన్న నీటిని దౌర్జన్యంగా తీసుకెళ్లినా.. అప్పట్లో ఎవరూ అడ్డుచెప్పలేదన్నారు. కానీ తాగునీటి కోసం చెరువులకు నీటిని విడుదల చేస్తే అడ్డుకుంటున్నారన్నారు. మూడేళ్ల నుంచి ఏదో విధంగా పుట్లూరు చెరువులను నింపుతున్నామన్నారు. ప్రజా సమస్యల విషయంలో ఘర్షణలకు దిగాల్సిన అవసరం లేదని, బుధవారం సాయంత్రం అనంతపురం వచ్చి, సమస్యపై స్పందిస్తానన్నారు.