Monday, 31 October 2011

కర్నూలు జిల్లా లో 300 ఏళ్ల నాటి శివాలయ ముఖ మంటపం కూలిపోయింది

కర్నూలు జిల్లా ఆత్మకూరులో 300 ఏళ్ల నాటి శివాలయ ముఖ మంటపం సోమవారం కూలిపోయింది. కార్తీక మాసం మొదటి సోమవారం పురస్కరించుకుని ఆలయానికి విద్యుద్దీపాలంకరణ చేసేందుకు మౌలాలి అనే కార్మికుడు ఆలయం పైకి ఎక్కగా ఈ ఘటన చోటుచేసుకుంది. అతడికి గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

పూర్వం శ్రీశైల మల్లిఖార్జునుని దర్శించుకునేందుకు మహర్షులు ఆత్మకూరు మీదుగా కాలినడకన వెళ్లే సమయంలో ఓ భారీ రాతిబండను పంచలింగాల ఆకృతిలో మలచి స్వయంభూ పరమేశ్వరుడిని రూపొందించి పూజలు చేశారన్నది చరిత్ర. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయానికి 300 ఏళ్ల క్రితం భక్తులు ముఖమండపాన్ని నిర్మించారు. అప్పటి నుంచి నిత్యపూజలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కార్తీక మాసం మొదటి సోమవారం నాడు ముఖమంటపం కూలిపోవడంతో భక్తులు ఆందోళన చెందుతున్నారు

యువరాజ్ సింగ్ దేశ రాజధానిలో తొలి ఇండోర్ క్రికెట్ శిక్షణ కేంద్రం ప్రారంభించారు

                                            
తన చిరకాల స్వప్నమైన ‘యువరాజ్ సింగ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్’ను భారత క్రికెట్ క్రీడాకారుడు యువరాజ్ సింగ్ సోమవారం గుర్గావ్‌లో ప్రారంభించారు. ఈ క్రికెట్ అకాడమీలో యువ క్రికెట్ క్రీడాకారులకు అత్యాధునిక సౌకర్యాలతో శిక్షణను అందించనున్నాడు. నైపుణ్యం కలిగిన కోచ్‌ల సహాయంతో ఇండోర్, అవుట్ డోర్ శిక్షణ సౌకర్యాల్ని అందించనున్నాడు. దేశ రాజధానిలో తొలి ఇండోర్ క్రికెట్ శిక్షణ కేంద్రంగా ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ క్రికెట్ అకాడమీలో బౌలింగ్ యంత్రాలతోపాటు, జిమ్, స్విమ్మింగ్ పూల్ సౌకర్యాలను యువరాజ్ సింగ్ ఏర్పాటు చేశారు. స్కూల్ విద్యార్థులతోపాటు, ఇతర వర్గాలకు కూడా అకాడమీ అందుబాటులో ఉంటుందని ఆయన తెలిపారు

తిరుపతి రైల్వే స్టేషన్‌లో పది చెల్లిస్తే ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవచ్చు

రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫాం నుంచి ఏసీ క్లాస్ టిక్కెట్లు కొన్నవారందరూ రూ. పది చెల్లిస్తే ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవచ్చు. దీన్ని ప్రయోగాత్మకంగా తిరుపతిలో ప్రారంభించారు. ఇది సఫలమైతే ఈ విశ్రాంతి గదుల నిర్వహణను ప్రైవేటుపరం చేసే అవకాశముంది. ప్రధాన రైల్వే స్టేషన్‌లో ఏసీ, స్లీపర్ సాధారణ క్లాస్‌లలో ప్రయాణించే వారే రైలు వచ్చే వరకు ఏసీ గదుల్లో ఉచితంగా విశ్రాంతి తీసుకోవచ్చు.

ఇక స్లీపర్ క్లాస్ ప్రయాణికులు స్లీపర్ క్లాస్ విశ్రాంతి గదుల్లో ఉండొచ్చు. వీరు తమ టిక్కెట్లను గదుల రికార్డులో నమోదు చేసి ఉచితంగా విశ్రాంతి తీసుకుంటారు. ఇకపై రైల్వే స్టేషన్‌లో ప్లాట్‌ఫారం టిక్కెట్ కొన్న ప్రతి ఒక్కరు రూ. పది చెల్లించి ఏసీ గదుల్లో మూడు గంటల పాటు విశ్రాంతి తీసుకోవచ్చు. ప్రస్తుతం దీనిపై ప్రచారం లేకపోవడంతో పెద్ద సమస్యగా లేదు. ఒకవేళ అందరూ రూ. పది చెల్లించి ఏసీ గదుల్లో విశ్రాంతి తీసుకోవాలంటే తిరుపతిలో సాధ్యమేనా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ఎందుకంటే స్టేషన్‌లో ఉండేవి రెండు ఏసీ విశ్రాంతి గదులే. అందులో 80 సీట్లు ఉన్నాయి. తిరుపతి నుంచి వెళ్లే ఏసీ క్లాస్ ప్రయాణికులకే ఇవి చాలవు. అలాంటిది అందరూ విశ్రాంతి కోసం వస్తే ఎలా సాధ్యమని అధికారులు తలలు పట్టుకుంటున్నారు