Friday, 16 December 2011

ఉప ఎన్నికల ప్రచారానికి కొత్త గెటప్‌లో బాలయ్య?

ఉప ఎన్నికల భారాన్ని బాలయ్యపై పెట్టాలని టిడిపి అధిష్టానం యోచిస్తోంది. ఆయన్ను ప్రత్యక్ష రాజకీయాల్లో కీలకంగా మార్చడానికి రంగం సిద్ధం చేస్తోంది. దూరమైన ఎన్టీఆర్‌ ఫ్యామిలీని దగ్గరకు తీసుకోవడానికి ఇదొక్కట్టే చంద్రబాబు ముందున్న మార్గంగా కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న స్థానాలపై తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా గురిపెట్టింది. కనీసం ఆరు నుంచి ఎనిమిది స్థానాల్ని కైవసం చేసుకోవడానికి ప్లాన్‌ చేస్తోంది. మిగిలిన స్థానాల్లో రెండో స్థానంలో నిలిచేందుకు ప్రణాళికను రూపకల్పన చేస్తోంది. ఇందుకోసం సినీగ్లామర్‌ పుష్కలంగా ఉన్న బాలయ్యను ప్రచారంలోకి దింపాలని ప్రయత్నిస్తోంది. రూట్‌మ్యాప్‌ను కూడా తయారు చేస్తోంది. ఆయన ప్రచారంతో ఆంధ్రా, సీడెడ్‌ ఏరియాల్లో ఓట్ల వర్షం కురిస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. తొలి నుంచి బాలకృష్ణకు బలమైన అభిమాన సంఘాలు రాయలసీమ ప్రాంతంలో ఉన్నాయి. ఆ తరువాత ఆంధ్రా ఏరియాలో అభిమానుల హడావుడి బాగా కనిపిస్తోంది. ఆయన సినిమాలకు భారీ కలెక్షన్లు కూడా అక్కడే వస్తాయి. ఇదే తరహాలో ఓట్లు కూడా పడతాయని పార్టీ అధిష్టానం అంచనా. నేరుగా బాలకృష్ణను రంగంలోకి దింపడానికి ఇది సరైన సమయం కాదని భావిస్తున్న టిడిపి ఆయన సినీగ్లామర్‌ను వీలున్నంత వరకు ఉపయోగించుకోవాలని భావిస్తోంది. బాలకృష్ణ ప్రత్యక్ష ఎన్నికల్లోకి రావడానికి ఇంకొంత కాలం ఉన్నప్పటికీ గతం కన్నా ఇక నుంచి చురుగ్గా ప్రచారానికి వెళతారని టిడిపి నేతలు చెబుతున్నారు. ఉప ఎన్నికలపై వరుసగా అన్ని జిల్లాల నేతలతో చంద్రబాబు రివ్యూ మీటింగ్‌లు పెట్టారు. బాలయ్య ఉప ఎన్నికల ప్రచారానికి వస్తారని...ఏదో చేస్తారని టిడిపి క్యాడర్‌ ఆశలు పెట్టుకుంటోంది. వారి ఆశల్ని ఓట్ల రూపంలో మార్చడానికి ఈసారైన బాలయ్య స్పీచ్‌ మార్చుతారా..? లేక ఎన్టీఆర్‌ ఫ్యామిలీ పార్టీకి దగ్గరగానే ఉందనే సంకేతాలు ఇవ్వడం వరకే పరిమితం అవుతారో చూడాలి.

తిరుపతి ప్రజాసమస్యలు గాలికొదిలేసిన... చిరంజీవి

పదవులు తప్ప ప్రజా ప్రయోజనాలు తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవికి పట్టవని  ఈసందర్భంగా ప్రజలనుద్దేసించి కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ తిరుపతి ఎమ్మెల్యే చిరంజీవి ప్రజాసమస్యలను గాలికి వదిలేసి మంత్రి పదవి దక్కించుకునే పనిలో బిజిగా వున్నారన్నారు. ఎమ్మెల్యేగా చిరంజీవి పనికిరాడన్న విషయాన్ని ప్రజలు ఎప్పుడో తేల్చేశారన్నారు. అందుకే ఆయన ఎక్కడ తిరిగినా మహిళలు తిరగబడుతున్నారన్నారు. ఇటీవల చింతలచేనుకు వచ్చి కనీసం ప్రజలతో మాట్లాడకుండా అక్కడ నుండి పారిపోయిన సంఘటనలున్నాయన్నారు. నగరంలో కనీసం దోమల నియంత్రణకు కూడా చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో చిరంజీవి వున్నారన్నారు. ప్రజలు కూడా నేడు చిరుకు ఎందుకు ఓట్లు వేశామా? అని బాధపడుతున్నారన్నారు. తాము గత మూడు రోజులుగా వార్డులలో తిరుగుతుంటే కుప్పలు తెప్పలుగా వినతులు వస్తున్నాయన్నారు. వైఎస్ పాలనలో రాష్ట్రం ఎంతో సుభిక్షంగా వుండేదన్నారు. అయితే నేడు రాష్ట్రంలో ఆ పరిస్థితి కనిపించడం లేదన్నారు. అభివృద్ది, సంక్షేమం రెండుకళ్లుగా ప్రజారంజకంగా పాలన చేశారన్నారు. అయితే నేడు రచ్చబండ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహించి ప్రభుత్వం చేతులు దులుపుకుంటున్నారన్నారు.

సమంత పై బెల్లంకొండ సురేష్ ..ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్


సమంత పై బెల్లంకొండ సురేష్ ..ఫిల్మ్ ఛాంబర్ లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాటర్ పై ఫిల్మ్ ఛాంబర్ లో ఈ రోజు(శుక్రవారం)చర్చ జరిగింది. నిర్మాత కె.ఎల్ నారాయణ అధ్యక్ష్యతన జరిగిన ఈ సమావేశంలో ఫైనల్ గా సమంతను ఆ చిత్రానికి డేట్స్ ఎడ్జెస్ట్ చేయవలిసిందేనని ఆర్డర్ చేసారు. మొదట సమంత ఒప్పుకోకపోయినా చివరకు ఆమె ఒప్పుకోవాల్సి వచ్చింది. వచ్చే జనవరి నుంచి ఆ చిత్రం షూటింగ్ లో ఆమె పాల్గొననుంది. సమంత వెనక్కి అడ్వాన్స్ ఇవ్వటానకి రెడీ అయ్యినా ఆమెను వదులుకోవటానికి నిర్మాత బెల్లంకొండ రెడీగా లేరు. ఎందుకంటే దూకుడు చిత్రం తర్వాత సమంత స్టేచర్ మారిపోయింది. ఆమె తెలుగులో నెంబర్ వన్ స్టేజికి వచ్చింది. సిద్దార్ద హీరోగా నందినీ రెడ్డి దర్శకత్వంలో ఆ చిత్రం రూపొందనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఆ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇక అస్సలు గొడవ మొదలైన విధానం ఏమిటంటే..సమంతపై బెల్లంకొండ సురేష్ రీసెంట్ గా మూవీ ఆర్టిస్టుల అశోశియేషన్ మరియు నిర్మాతల మండలిలో కంప్లైంట్ చేసారు. ఆమె అన్ ప్రొఫెషనల్ బిహేవియర్ ఈ కంప్లైంట్ లో ప్రధానాంశం. ఆమెను తమ సినిమాలో సిద్దార్ధ సరసన బుక్ చేసుకోగా ఆమె అదే డేట్స్ ని మహేష్ చిత్రం కేటాయించి తమను ఫైనాన్సియల్ క్రైసిస్ లో పడేసిందని ఆయన ఆరోపించారు. అయితే సమంత అడ్వాన్స్ తీసుకుని డేట్స్ కేటాయించి ఈ లోగా మహేష్ తో దిల్ రాజు నిర్మిస్తున్న సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు చిత్రం కోసం అవే డేట్స్ ని ఇచ్చేయటం జరిగింది. దీనిపై బెల్లంకొండ సురేష్ మండిపడుతున్నారు. ఈ విషయమై నిర్మాతల మండలి ఓ నోటీస్ ను ఇచ్చింది. దానికి సమాధానం వచ్చిన తర్వాత ఈ విషయమై నిర్ణయం తీసుకుంటారని చెప్తున్నారు. అయితే సమంతకు చెందిన వారు మాత్రం ఆ నిర్మాత సరైన ప్లానింగ్ లేకపోవటంతో ఈ పని చేయవలిసి వచ్చింది..మా దగ్గర వేలీడ్ రీజన్ ఉంది అని చెప్పారు. కానీ చివరకు ఇలా సెటిల్ చేసుకోక తప్పలేదు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై ఆరోపణలను తేలుస్తాం: జీవిత రాజశేఖర్

చిరంజీవి బ్లాడ్ బ్యాంక్‌పై చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నామని సినీ నటి, దర్శక నిర్మాత జీవిత రాజశేఖర్ చెప్పారు. తమకు వచ్చిన సమన్లుపై న్యాయపోరాటం చేస్తామని ఆమె శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై సినీ నటులు డాక్టర్ రాజశేఖర్, జీవిత చేసిన ఆరోపణలపై పరువు నష్టం దావా వేసిన కేసుకు సంబంధించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సోమవారం 12వ తేదీన నాంపల్లి కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆ వాంగ్మూలాన్ని న్యాయస్థానం నమోదు చేసుకుంది. తదుపరి కేసు విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసిన విషయం తెలిసిందే. కాగా చిరంజీవి డబ్బులకు బ్లడ్ బ్యాంక్‌లో రక్తాన్ని అమ్ముకుంటున్నారని జీవిత, రాజశేఖర్‌లు విమర్శలు చేసిన విషయం తెలిసిందే. చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై గతంలో జీవిత, రాజశేఖర్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. చిరంజీవి బ్లడ్ బ్యాంకులో ఏ విధమైన అక్రమాలు జరగడం లేదని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో జీవిత, రాజశేఖర్‌లపై అల్లు అరవింద్ కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

ఆమెకు మంత్రిగా చెయ్యాలనేది డ్రీమ్...హీరోయిన్ రోజా

సినిమాలను వదిలి రాజకీయాల్లోకి వచ్చిన రోజా మళ్లీ సెకండ్ ఎంట్రీ ప్రారంభించి నెగిటివ్ పాత్రలు,తల్లి పాత్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడామె ఓ తమిళ చిత్రంలో ఐటం సాంగ్ చేయనుంది. వెట్టైవాడు టైటిల్ తో రూపొందే ఆ చిత్రంలో ఆమె నటుడు ఫాండ్యరాజన్ తో కలిసి డాన్స్ చేస్తోంది. విజయ్ బాలన్ డైరక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో అంతా కొత్త నటీనటులను పరిచయం చేస్తూ రూపొందిస్తున్నారు. ఇక రోజా రీసెంట్ గా శ్రీరామరాజ్యం చిత్రంలో భూదేవి గా నటించింది. అలాగే మొగుడు చిత్రంలో తాప్సీకి తల్లిగా, గోపీచంద్ కి అత్తగా,ఓ మినిస్టర్ గా సమర్ధవంతంగా నటించి శభాష్ అనిపించుకుంది. ఆ చిత్రంలో హీరోయిన్ తల్లిగా రోజా చేసింది.ఆమెకు ఎప్పటినుంచో కృష్ణవంశీ దర్శకత్వంలో చేయాలనే కోరిక.అది తీరటం ఒకెత్తు అయితే ఆమెకు మంత్రిగా చెయ్యాలనేది డ్రీమ్.. అది కూడా ఈ చిత్రంతో తీరింది అంటున్నారు. ఈ చిత్రంలో రోజాది మంత్రి పాత్ర. ఇక రోజా వంటి సీనియర్ నటి నటించటం వల్ల ఆ పాత్రకు నిండుతనం వచ్చిందని అంటున్నారు.సినిమా రిజల్టు నెగిటివ్ గా ఉన్నా రోజా పాత్ర మాత్రం హైలెట్ అయ్యింది.

ఉప ఎన్నికలంటేనే భయం!

అవిశ్వాస తీర్మానం తెచ్చిన తంటా.. అన్ని రాజకీయ పార్టీల నేతలకు నష్టాలను వెంట తెచ్చినట్లయింది. ఎందుకంటే ఎన్నికలకు చాలా ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి గెలిచినా, రెండేళ్లే పదవి ఉంటుంది. ఈ కాలంలోనే అంత సంపాదించుకుంటామా? అంటే అదీ నమ్మకం లేదు. అందుకోసం ఆయా రాజకీయ పార్టీల నాయకులు అంతర్మథనంలో పడ్డారు. ఉప ఎన్నికలపై అన్ని రాజకీయ పార్టీల నేతలు బయటికి గంభీరంగా మాట్లాడుతున్నా లోలోపల మాత్రం అంతర్మధనం చోటు చేసుకుంది. ఖర్చు తడిసి మోపెడవుతున్న ఉప పోరు పట్ల ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించేందుకు సిద్ధపడడం లేదు. కాకపోతే పరువు ప్రతిష్ఠలు సమస్యగా మారడడంతో అటు రాజకీయ పార్టీలు, నేతలు విధిలేకే ఈ ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. ఈ ఏడాది మే నెలలో జరిగిన కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అభ్యర్థులకు ఖర్చు వచ్చింది. ఇప్పుడు తిరిగి ఉప ఎన్నికల్లో పోటీ చేయాలంటే అటు అభ్యర్థులు, ఆ యా పార్టీలు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితులు నెలకున్నాయి. మరో ఆరు నెలలు గడుస్తే కేవలం రెండు సంవత్సరాలు మాత్రం ఎమ్మెల్యేలుగా కొనసాగుతారు. ఈ రెండేళ్ల కాలానికి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుందో అని ప్రధాన రాజకీయ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఓడిపోతే కోలుకోవడం కష్టం అవుతుందని కూడా అనుకుంటున్నట్లు తెలిసింది. మరోవైపు జగన్ వర్గం ఎమ్మెల్యేలు పోటీ చేయక తప్పని పరిస్థితి అయినా వారిలో కూడా ఎన్నికల భారం ఆందోళన కలిగిస్తున్నట్లు సమాచారం. ఈఉప ఎన్నికల ఘట్టం ముగిస్తే మరో రెండు ఏళ్లల్లో సాధారణ ఎన్నికలు వస్తాయి. అప్పుడు కూడా కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుందని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. జగన్ వర్గాన్ని జిల్లాలో కట్టడి చేయాలంటే ఈ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు బరిలోకి దిగి పరపతిని నిరూపించుకోవలసిన సమయం వచ్చింది.

అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో సొసైటీ రద్దు!

ప్రభుత్వ ఆసుపత్రిలో పడకలను 750కు పెంచడమే కాకుండా, అక్కడ సొసైటీ ద్వారా పనిచేసే ఉద్యోగులను రెగ్యులర్ కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించడానికి వైద్య విద్యా శాఖ డైరెక్టర్ ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే సొసైటీలోనూ కొందరిపై, ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ నియామకం చేసిన మరో 20 మందితో కలిపి మొత్తం 37 మందిపై వేటు వేయనున్నట్లు సమాచారం. ప్రభుత్వ వైద్య కళాశాల, ఆసుపత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన కొందరు ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాంట్రాక్టు ప్రాతిపదికన ఆసుపత్రి, కళాశాలల్లో 230 మంది ఉద్యోగులను నియమించుకోమని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. అయితే ఇక్కడ 210 మంది ఉద్యోగులు మాత్రమే పనిచేస్తున్నారు. ఇంకా 20 ఖాళీలు ఉన్నాయి. వీరందరూ ఒక సొసైటీగా ఏర్పడ్డారు. వీరికి సొసైటీ ద్వారానే జీతభత్యాలు అందుతున్నాయి. ఇంకా మిగిలిన 20 ఖాళీలనూ అప్పటి వైద్య కశాశాల ప్రిన్సిపాల్ భర్తీ చేశారు. దీంతో అక్కడి నుంచి సొసైటీ కమిటీకి ప్రిన్సిపాల్‌కు మధ్య కోల్డ్‌వార్ కొనసాగుతూ వస్తోంది. ప్రిన్సిపాల్ భర్తీ చేసిన కాంట్రాక్టు ఉద్యోగులు రెండున్నర సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా వారికి జీత భత్యాలు అందడం లేదు. దీంతో వారు జీతాల కోసం రోడ్డెక్కడంతో ఆసుపత్రి అభివృద్ధి సంఘం నిధుల నుంచి వీరికి ఆరు నెలల జీతాలు చెల్లించారు. అప్పటి నుంచి 18 నెలల వరకూ వీరికి జీతాలు అందలేదు. దీంతో వీరు కొన్ని రోజులుగా ప్రభుత్వ వైద్య కళాశాల ముందు ధర్నాకు దిగారు. అయినా పరిష్కారం కనిపించకపోవడంతో ఎమ్మెల్సీ గేయానంద్ ఆధ్వర్యంలో కొందరు సభ్యులు బుధవారం డిఎంఇని కలిసినట్లు సమాచారం. ఈ సందర్భంగా డిఎంఇ మాట్లాడుతూ సొసైటీని రద్దు చేసి రెగ్యులర్ కాంట్రాక్టు ఉద్యోగులుగా వీరిని నియమించడానికి చర్యలు తీసుకోనున్నామని హామీ ఇచ్చినట్లు సమాచారం.