Wednesday, 18 January 2012

మహేష్ బాబు బుల్లెట్ లాంటోడు....హీరోయిన్ కాజల్



మహేష్ బాబును బుల్లెట్ లాంటోడు అంటోంది ‘తుపాకి’ హీరోయిన్ కాజల్. మహేష్ బాబుతో కలిసి బిజినెస్ మేన్ చిత్రంలో నటించిన కాజల్ ఈ సినిమా తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో ఓ తమిళ సినిమా చేస్తోంది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘తుపాకి’ పేరుతో విడుదల చేయనున్నారు. బిజినెస్ మేన్ భారీ విజయం సాధించడంతో బుధవారం కాజల్ ప్రెస్ మీట్ లో మాట్లాడింది. బిజినెస్ మేన్ సినిమా అనుభవాలను వివరించింది. మహేష్ బాబు బుల్లెట్ లాంటోడు. నేను ఇప్పటి వరకు నటించిన వారిలో డైనమిక్ హీరో అంటే అతడే. తొలిసారి అతనితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది అంటూ కాజల్ మహేష్ బాబును తెగపొగిడేసింది. మహేష్ బాబు యాక్షన్ సీన్లు, ఆయన డైలాగ్ డెలివరీ చాలా అద్భుతంగా ఉంటాయి. షూటింగ్ జరుగుతున్నప్పుడే నేను ఆయన అభిమానిని అయిపోయాను అంటూ చెప్పుకొచ్చింది. పూరి జగన్నాథ్ అద్భతమైన దర్శకుడు అంటూ ఆయనపైకి రెండు ప్రశంసలు వదిలింది. పూరి జగన్నాధ్ మహేష్ బాబుతో ‘బిజినెస్ మేన్’కు సీక్వెల్ తీస్తానని ప్రకటించడంతో అందులోనూ అవకాశం దక్కించుకోవడానికే కాజల్ ప్రయత్నిస్తుందని, అందుకే బిజినెస్ మేన్ సినిమా ప్రమోషన్ పేరుతో మహేష్ బాబు, పూరి జగన్నాధ్ లను పొగుడుతూ కాకా పడుతోందని కొందరు అంటున్నారు. సినిమా కలెక్షన్లు తగ్గు ముఖం పట్టడంతో సినిమాకు పబ్లిసిటీ పెంచడానికి దర్శక నిర్మాతలు వేసిన ప్లాన్ లో భాగంగానే కాజల్ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిందని మరికొందరు అంటున్నారు

మంత్రి వర్గం నుంచి తొలగించినా కాంగ్రెసు పార్టీకే కట్టుబడి ఉంటా...మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి



తనను మంత్రిగా ఉంచినా, తీసేసినా స్వాగతిస్తానని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి చెప్పారు. మంత్రి వర్గ మార్పులపై మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన బుధవారం సాయంత్రం సమధానాలు ఇచ్చారు. తనను మంత్రి వర్గం నుంచి తొలగించినా కాంగ్రెసు పార్టీకే కట్టుబడి ఉంటానని ఆయన చెప్పారు. తాను ముఖ్యమంత్రికి వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. మంత్రివర్గంలో చేర్పులు, మార్పుల వల్ల ప్రభుత్వం గందరగోళంలో ఏమీ పడదని ఆయన అన్నారు. మంత్రి వర్గం నుంచి కొంత మందిని తీసేసి, మరి కొంత మందిని తొలగించినంత మాత్రాన ప్రభుత్వంలో గందరగోళం ఏమీ ఏర్పడదని ఆయన అన్నారు. మంత్రి వర్గంలో తాను ఎవరినీ ఉంచాలని, ఎవర్నీ తీసేయాలి గానీ చెప్పబోనని ఆయన అన్నారు. మంత్రిగా ఉంటే ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి వీలు కలుగుతుందని ఆయన చెప్పారు. మంత్రి వర్గం విస్తరణ అనేది ముఖ్యమంత్రి ఇష్టానుసారం జరుగుతుందని ఆయన అన్నారు.

టీమిండియా జట్టు ఐపిఎల్ టోర్నమెంట్ల వల్లే ఈ ఓటములు...మాజీ కెప్టెన్ బేడీ



విదేశాల్లో జరుగుతున్న టెస్టు సిరీస్‌లలో భారత జట్టు వరుస ఓటములను ఎదుర్కోవడానికి నిస్సందేహంగా ఇండియన్ ప్రీమియర్ లీగే ప్రధాన కారణమని టీమిండియా మాజీ కెప్టెన్ బిషన్ సింగ్ బేడీ అభిప్రాయపడ్డాడు. ‘అన్ని అంశాలపై విస్తృత దృక్కోణంలో ఆలోచిస్తే టెస్టుల్లో భారత జట్టు వైఫల్యాలకు కారణమేమిటో ప్రతి ఒక్కరికీ అర్ధమవుతుంది. ఐపిఎల్‌ను నిర్వహించేందుకు నిష్ణాతులతో కూడిన విభాగం ఉండాలి. ఈ విభాగంలోని గౌరవప్రదమైన పదవులన్నింటిలో వీరే ఉండాలి. కానీ, క్రికెట్‌తో ఏమాత్రం సంబంధాలు లేనివారే ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను నిర్వహిస్తుండటం దురదృష్టకరం. క్రికెట్ అంటేనే విలువలు, సిద్ధాంతాలతో కూడిన క్రీడ. అయితే ఐపిఎల్‌కు ఎటువంటి సిద్ధాంతాలు, విలువలు లేవు. ఇది కేవలం ‘హిట్ అండ్ రన్’ గేమ్‌లా మాత్రమే కొనసాగుతోంది. ఇది పూర్తిగా వ్యాపారాత్మక ధోరణిలో సాగుతోంది. క్రికెట్‌లో వ్యాపారాన్ని ఎంతవరకు అనుమతించవచ్చు అనే విషయంపై బిసిసిఐ భరత క్రికెట్ కంట్రోల్ బోర్డుకి స్పష్టమైన అవగాహన ఉండితీరాలి’ అని బిషన్ సింగ్ బేడీ అన్నాడు.బిసిసిఐ టెక్నికల్ కమిటీపైనా విమర్శలు బిసిసిఐ టెక్నికల్ కమిటీ పనితీరుపై కూడా ఆయన విమర్శలు గుప్పించాడు. సుమారు రెండు దశాబ్ధాల క్రితం తెరపైకి వచ్చిన ఈ కమిటీకి గతంలో టీమిండియా మాజీ కెప్టెన్ ‘లిటిల్ మాస్టర్’ సారథ్యం వహించగా, ప్రస్తుతం భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న విషయం విదితమే. క్రికెట్‌కు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవలసిన ఈ కమిటీ దేశంలో క్రికెట్ అభివృద్ధికి ఇప్పటివరకూ ఎటువంటి సేవలూ అందించలేదని బిషన్ సింగ్ బేడీ ధ్వజమెత్తాడు.పూర్తిగా ఐపిఎల్‌నే నిందించలేము : వెంగీ ఇదిలావుంటే, టెస్టు క్రికెట్‌లో భారత జట్టు వైఫల్యాలకు పూర్తిగా ఇండియన్ ప్రీమియర్ లీగే కారణమని నిందించేందుకు టీమిండియా మాజీ కెప్టెన్ దిలీప్ వెంగ్‌సర్కార్ నిరాకరించాడు. బిసిసిఐకి సరైన ప్రణాళిక లేకపోవడమే భారత జట్టు పేలవమైన ప్రదర్శనకు కారణమని వెంగ్‌సర్కార్ పేర్కొన్నాడు. ‘కేవలం ఐపిఎల్ వల్లనే ఆటగాళ్ల నైపుణ్యం దెబ్బతింటోందని చెప్పలేం. అసలు విదేశాల్లో భారత జట్టు పర్యటనలే లోపభూయిష్టంగా ఉన్నాయి. విదేశీ పర్యటనలకు ముందుగానీ, టెస్టులకు మధ్యగానీ మన జట్టు సరైన సంఖ్యలో మ్యాచ్‌లు ఆడటంలేదు. యువ బ్యాట్స్‌మన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా వంటి రిజర్వు ఆటగాళ్లు నెల రోజులకు పైగా ఒక్క మ్యాచ్‌లోనూ ఆడలేదు’ అని వెంగ్‌సర్కార్ అన్నాడు. ఐపిఎల్ టోర్నమెంట్లను సుదీర్ఘ కాలం పాటు నిర్వహించరాదని, కేవలం నెల రోజుల వ్యధిలోనే ముగించాలని ఆయన సూచించాడు.కాగా, ప్రస్తుత కాలంలో యువ ఆటగాళ్లు దేశవాళీ క్రికెట్ టోర్నమెంట్లలో పాల్గొని తమ ప్రతిభకు పదును పెట్టుకోవాల్సిందిపోయి కాసుల వర్షం కురిపించే ఐపిఎల్ వంటి టోర్నమెంట్లలో ఆడేందుకే ఇష్టపడుతున్నారని టీమిండియా మాజీ పేసర్ మనోజ్ ప్రభాకర్ అన్నాడు. ‘రంజీ ట్రోఫీ మ్యాచ్‌లలో ఆడాలని కోరుకుంటున్నట్టు చెప్పే యువ ఆటగాళ్లను మీరు ఎప్పుడైనా చూశారా? నిస్సందేహంగా అటువంటి వారెవరూ మీకు తారసపడి ఉండరు. ఏవిధంగానైనా సరే ఐపిఎల్‌లో ఆడేందుకు కాంట్రాక్టులు ఇప్పించాలనే ప్రతి ఒక్కరూ కోరుతుంటారు. ట్వంటీ-20 మ్యాచ్‌లలో ఆడి కేవలం నెలన్నర రోజుల్లోనే కోట్లకు పడగలెత్తే అవకాశం లభిస్తుండటంతో ఏ ఆటగాడూ కష్టపడేందుకు ఇష్టపడటం లేదు’ అని మనోజ్ ప్రభాకర్ అన్నాడు. దేశవాళీ క్రికెట్ బాగోగులను బిసిసిఐ ఏనాడైనా పట్టించుకుందా? అని ఆయన నిలదీశాడు. కాగా, గత ఏడాది ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా ఎదురైన పరాభవాల నుంచి భారత బ్యాట్స్‌మన్లు గుణపాఠం నేర్చుకోలేకపోయారని మాజీ సెలెక్టర్ చందూ బోర్డే విమర్శించాడు.

మంత్రివర్గ విస్తరణ ఐదుగురి కి గ్రీన్ సిగ్నల్

ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గ విస్తరణపై బుధవారం ఢిల్లీలో పెద్దలతో భేటీ అవుతూ బిజీ బిజీగా గడిపారు. మంత్రివర్గ ప్రక్షాళనకు అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, కొత్తగా ఐదుగురిని కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని, తెలంగాణకు మూడు, పీఆర్పీకి రెండు పదవులు దక్కనున్నట్లు వార్తలు వచ్చాయి. చివరికి కేబినెట్ విస్తరణ ఇద్దరితోనే జరుగుతుందని, అదికూడా ప్రజారాజ్యం పార్టీకి పరిమితం అయినట్లు తెలుస్తోంది. భారీ ఆశలతో ఢిల్లీకి వెళ్లిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అంచనాలు తారుమారైనట్లే కనిపిస్తున్నాయి. కేబినెట్ విస్తరణపై రాజ్‌భవన్‌కు సమాచారం అందినట్లు తెలుస్తోంది.మంత్రి వర్గ విస్తరణ విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ముగ్గురిని తప్పించి, ఐదుగురిని మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి ముఖ్యమంత్రికి కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించిందనే నేపథ్యంలో మధ్యాహ్నం తర్వాత పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అప్పటి వరకు ముఖ్యమంత్రి మాట నెగ్గించుకున్న సూచనలు కనిపించాయి. అయితే, ఆ తర్వాత పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మాటలను కూడా పార్టీ అధిష్టానం పరిగణనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో చిరంజీవి వర్గానికి చెందిన ఇద్దరికి మాత్రమే మంత్రివర్గ విస్తరణను పరిమితం చేయాలని పార్టీ అధిష్టానం ముఖ్యమంత్రికి సూచించినట్లు తెలుస్తోంది. ప్రజారాజ్యం ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య, శానససభ్యుడు గంటా శ్రీనివాసరావులను మంత్రి వర్గంలోకి తీసుకోవడానికి రేపు గురువారం మంత్రి వర్గ విస్తరణ జరుగనుంది. మంత్రి వర్గ విస్తరణకు ఏర్పాటు చేయాలని సాధారణ పరిపాలనా శాఖకు ఆదేశాలు అందాయి. కాంగ్రెసుకు చెందినవారికి ఈసారి మంత్రి పదవులు దక్కే అవకాశాలు లేవని దీన్ని బట్టి అర్థమవుతోంది.

ఎన్టీఆర్ నివాళులర్పించిన నందమూరి కుటుంబ సభ్యులు



బాలకృష్ణది చిన్నపిల్లాడి మనస్థత్వం అన్న చిరంజీవి వ్యాఖ్యలపై బాలకృష్ణ మాట్లాడుతూ చిరంజీవి మాటలు నేర్చారని, మంత్రి పదువుల కోసం ఢిల్లీలో బేరసారాలు ఆడే వ్యక్తి గురించి తానేమీ మాట్లాడనని బాలకృష్ణ అన్నారు. ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌లో నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా ఉన్నారంటే అది ఆయన ఇష్టమన్నారు.పార్టీ ప్రచారానికి రావచ్చు, రాకపోవచ్చు అని బాలకృష్ణ తెలిపారు. ఎన్టీఆర్ అందరికీ ఆరాద్య దైవం అని కొనియాడారు. ఎన్టీఆర్‌కు తాము రాజకీయ వారసులం కాదని, పార్టీ కార్యకర్తలమని బాలకృష్ణ తెలిపారు.స్వర్గీయ నందమూరి తారక రామారావు 16 వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి కుటుంబసభ్యులు ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళులర్పించారు. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, దగ్గుబాటి తదితరులు ఎన్టీఆర్ ఘాట్‌కు పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు.మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేష్ నాయుడు ఎన్టీఆర్‌కు నివాళులులర్పించారు. అనేక మంది టీడీపీ కార్యకర్తలు ఎన్టీఆర్ ఘాట్‌కు తరలివచ్చారు.

రెండు నెలల్లో తిరుపతిలో రాత్రి వేళల్లో విమానాలు



కలియుగ వైకుంఠం తిరుపతి పుణ్యక్షేత్రానికి ప్రపంచస్థాయి గుర్తింపు ఉందని పార్లమెంట్ అంచనాల కమిటీ పేర్కొంది. తిరుపతికి ఉన్న గుర్తింపును దృష్టిలో ఉంచుకొనే రైల్వే స్టేషన్, విమానాశ్రయాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నామని పార్లమెంటరీ కమిటీ తెలిపింది. తిరుపతిలో సమావేశమైన కమిటీ అభివృద్ధి పనులను సమీక్షించింది. మరో రెండు నెలల్లో తిరుపతిలో రాత్రి వేళల్లో విమానాలు ల్యాండ్ అయ్యేలా చర్యలు తీసుకుంటామని కమిటీ సభ్యులు తెలిపారు. రానున్న ఐదేళ్లలో తిరుపతి రైల్వే స్టేషన్‌ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామన్నారు.

నా రాజీనామాను ఆమోదించండి...ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి

ఎమ్మెల్యే పదవికి తాను సమర్పించిన రాజీనామాను ఆమోదించాలని భూమా శోభా నాగిరెడ్డి స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తన రాజీనామాను సాంకేతిక కోణంలో చూడకుండా విలువలకు కట్టుబడి ఆమోదించాలని ఆమె కోరారు. అసలు ప్రజారాజ్యం పార్టీయే మనుగడలో లేనపుడు విప్ ధిక్కారానికి సంబంధించి వారిచ్చిన అనర్హత నోటీసుకు సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఆ పార్టీ అధ్యక్షుడు చిరంజీవి స్వయంగా కాంగ్రెస్‌లో చేరిపోయి అక్కడ సమన్వయ కమిటీ సభ్యుడుగా నియమితులయ్యారనీ అలాంటపుడు ప్రజారాజ్యం ఎక్కడుందని ఆమె ప్రశ్నించారు. ఇంకా తాను పీఆర్పీ అధ్యక్షుడుగా ఉన్నానని చిరంజీవి చెబితే తాను తప్పకుండా ఆయన వద్దకు వెళ్లి వివరణ ఇస్తానని ఆమె ఎద్దేవా చేశారు. తనపై ఉన్న కేసులను ఎత్తివేస్తే కాంగ్రెస్‌లో చేరడానికి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించినపుడు శోభ తప్పు పట్టారు. తన అక్రమాస్తులు, అవినీతిపై విచారణ జరక్కుండా కోర్టులకు వెళ్లి స్టేలు తెచ్చుకున్న చంద్రబాబుకు మరొకరి అవినీతి గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు చంద్రబాబు, కాంగ్రెస్‌తో కుమ్మక్కు అయ్యారనీ ఆయన అసెంబ్లీలో అవిశ్వాసతీర్మానం పెట్టింది కూడా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కానే కాదనీ కేవలం జగన్‌ను సమర్థించే ఎమ్మెల్యేలను ఇరకాటంలో పెట్టడానికేనని ఆమె అన్నారు. చంద్రబాబుకు రైతుల పట్ల ఏ మాత్రం ప్రేమ లేదననాడికి ఆయన తొమ్మిదేళ్ల పాలనలో చేసిన నిర్వాకమే నిదర్శనమని శోభ గుర్తు చేశారు. చంద్రబాబుకు, కాంగ్రెస్‌కు ధైర్యం ఉంటే తాజాగా అందరమూ కలిసి ఎన్నికలకు పోదాం సిద్ధం కావాలని ఆమె సవాలు విసిరారు. ఇప్పటికే రెండు సార్లు ప్రజల తిరస్కారానికి గురైన చంద్రబాబుకు మళ్లీ అదే అనుభవం ఎదురవుతుందని ఆమె జోస్యం చెప్పారు.

అనంతపురం జిల్లాలో కరవు బృందం పర్యటన

జిల్లాలో వ్యవసాయ పరిస్థితులపై అధ్యయనం చేసి వ్యవసాయ అభివృద్ధి ప్రణాళిక రూపొందించేందుకు కేంద్ర అధ్యయన బృందం రెండు రోజుల పాటు జిల్లాలో క్షేత్రస్థాయిలో పర్యటన చేయనున్నట్లు కలెక్టర్ వి.దుర్గాదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర సాంకేతిక బృందంలో 19 మంది సభ్యులు ఉంటారన్నారు. వీరందరూ ఆయా రంగాలలో వివిధ అంశాలలోనిష్ణాతులని పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో, వాతావరణ అంశాలు వంటి అనేక పరిశోధనలు చేసిన అపార అనుభవజ్ఞలన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మంచి పేరు ప్రఖ్యాతులు పొందినవారన్నారు. క్షేత్ర పర్యటనలో వివిధ భౌగోళిక, స్థానిక అంశాలు, అక్కడి పంటల సాగు, దిగుబడి, వర్షపాతం తదితర వివరాలతో పాటు స్థానిక రైతులతో ముఖాముఖి కార్యక్రమం చేపడతారన్నారు. 19 మం ది సభ్యులతో కూడిన బృందం జిల్లాలో మూడు బృందాలుగా విడిపోయి క్షేత్రస్థాయి పర్యటన చేయనుందన్నారు. 18న ఒకటవ బృందం అనంతపురం నుంచి బయలుదేరి మలకవేములకు చేరుకుంటుంది. అక్కడ రైతులతో ము ఖాముఖి ఏర్పాటు అనంతరం కదిరికి చేరుకుని అక్కడ నుంచి బట్రేపల్లి, యనుములదొడ్డివారి పల్లి, కటారుపల్లి చేరుకుంటుంది. రెండవ బృందం అనంతపురం నుంచి గుట్టూరు, అడదాకులపల్లి, చెరుకూరులకు చేరుకుని అక్కడి రైతులతో మాట్లాడుతుందన్నారు. అనంతరం మడకశిరకు చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తుందన్నారు. మూడవ బృందం అనంతపురం నుంచి బయలుదేరి చక్రాయపేట, చీమలవాగుపల్లిలలో రైతులతో సమావేశమవుతుందన్నారు. అనంతరం గుంతకల్లుకు చేరుకుని రాత్రికి గుంతకల్లులోనే బస చేస్తుందన్నారు. 19న ఒకటవ బృందం కటారుపల్లి నుంచి బయలుదేరి కమతంపల్లి, పులగంపల్లి, ముక్తాపురం గ్రామాలలో రైతులతో సమావేశమవుతుందన్నారు. రాత్రికి అనంతపురం చేరుకుంటుందన్నారు. రెండవ బృందం మడకశిర నుంచి బయలుదేరి హీరేతుర్తి, ములకనూరు, పంపనూరు గ్రామాలలో రైతులతో సమావేశమై రాత్రికి అనంతపురం చేరుకుంటుందన్నారు. మూడవ బృందం గుంతకల్లు నుంచి బయలుదేరి పందికుంటలో రైతులతో సమావేశమవుతుందన్నారు. రేణిమాకుల పల్లిలో ఆయిల్ పామ్ ప్లాంటేషన్‌ను సందర్శిస్తుందన్నారు. మాళ్యంలో రైతులతో సమావేశమై రాత్రికి అనంతపురం చేరుకుంటుందన్నారు. 19న రాత్రికి మూడు బృందాలు అనంతపురం చేరుకుని జిల్లా కేంద్రంలోనే బస చేస్తాయన్నారు. 20న ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ రెవెన్యూ భవన్‌లో ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఎన్‌జీఓలు, అభ్యుదయ, ఆదర్శ రైతులతో సమావేశమవుతారని తెలిపారు.