Wednesday, 30 November 2011

అనంతపురం జిల్లాలో మెడికల్ షాపులపై దాడులు

అనంతపురం జిల్లాలో ఔషధ తనిఖీ బృందాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించింది. నిబంధనలు పాటించని 41మందుల దుకాణాలు మూసివేయాలని అధికారులు ఆదేశించారు. అనంతపురంలో 30, హిందూపురంలో 11షాపులను సీజ్ చేశారు. రోగుల బంధువులుగా అధికారులే మందులు కొనుగోలు చేశారు. దీంతో దుకాణదారుల నిజస్వరూపం బయటపడింది. డాక్టర్ల ప్రిస్కిప్షన్ లేకపోయినా అమ్మకాలు జరపడం, బీ ఫార్మసి లేకపోయినా యధేచ్చగా విక్రయాలు కొనసాగించడాన్ని గుర్తించారు. దీంతో సంబంధిత దుకాణదారులపై కేసులు నమోదు చేశారు. అధికారుల వరుస దాడులతో హడలి పెద్దఎత్తున మెడికల్ షాపులు మూసేసుకున్నారు.   మెడికల్ షాపుల యాజమాన్యాలు నిబంధనలు పాటించడంలేదని సాక్షాత్ వైద్యఆరోగ్య  మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అంగీకరించారు. రాష్ట్రంలోని 90శాతానికి పైగా దుకాణాల్లో క్వాలిఫైడ్ ఫార్మసిస్టులు లేరని తెలిపారు. అయితే నిబంధనలు పాటించనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు

‘అధినాయకుడు’ చిత్రంలో బాలకృష్ణకి బామ్మగా జయసుధ

నందమూరి బాలకృష్ణ హీరోగా పరుచూరి మురళి తెరకెక్కిస్తున్న చిత్రం ‘అధినాయకుడు’ ఇందులో బాలకృష్ణ తాతగా, తండ్రిగా, కొడుకుగా మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆల్ మోస్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన లక్ష్మీరాయ్, ఛార్మీ, సలోని హీరోయిన్ లుగా నటిస్తున్నారు.బాలకృష్ణ నటిస్తున్న ఓల్డ్ గెటప్ కు జోడీగా సహజనటి జయసుధ నటిస్తోంది. ఈ చిత్రంలో జయసుధ బాలకృష్ణకి బామ్మగా కనిపించనున్నారు. బాలకృష్ణ వేసిన ముసలాయన గెటప్ కి ప్రేక్షకుల నుండి విపరీతమైన ఆదరణ లభించనుంది. చాలా కాలం క్రితం ద్విపాత్రాభినయంతో అలరించిన బాలకృష్ణ ‘అధినాయకుడు’గా ఏకంగా మూడు పాత్రల్లో కనువిందు చేయబోతుండటంతో ఈ చిత్రంపై అందరిలోనూ భారీ అంచానాలు ఏర్పడ్డాయి. విశ్వసనీయ వర్గాల సమాచారంప్రకారం కళ్యాణీ మాలిక్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ 25న భారీ స్థాయిలో విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే బాలకృష్ణకు సంబంధించిన మూడు పాత్రల్లో రెండింటిని రివీల్ చేసిన చిత్రవర్గాలు మూడవ గెటప్ ని చాలా రోజులు గా సీక్రెట్ గా వుంచుతూ వస్తోంది.

రామ్ చరణ్.... బ్యాచులర్ పార్టీకి ఘనంగా ఏర్పాట్లు

రామ్ చరణ్ తేజ్ త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన తన బ్యాచులర్ పార్టీకి ఘనంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గోవాలో ఈ పార్టీ జరగనుందని సమాచారం. డిసెంబర్ 2 లేదా మూడవ తేదీల్లో ఈ పార్టీ జరగనుంది. ఈ పార్టీకి అల్లు అర్జున్, రానా, శర్వానంద్, నవదీప్ వంటి తెలుగు హీరోలు, మరికొద్ది మంది రామ్ చరణ్ చిన్నప్పటి ప్రెండ్స్ పాల్గొనన్నారు. ఇక రామ్ చరణ్, ఉపాసనా కామినేనిల ఎంగేజ్ మెంట్ కార్యక్రమాన్ని గ్రాండ్ గా నిర్వహించడానికి సన్నాహాలు జరగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మెగాస్టర్ చిరంజీవి ఇంట్లోనూ, అటు అపోలో ఛైర్ పర్సన్ ప్రతాప్ రెడ్డి ఇంట్లోనూ సందడి నెలకొందని తెలుస్తోంది. డిసెంబర్ 1న ఉదయం 10గంటలకు ఈ వేడుక ఆరంభమవ్వనుందట. కరెక్ట్ గా 11.55కు రామ్ చరణ్ ఎంగేజ్ మెంట్ రింగ్ ని ఉపాసనాకి తొడగుతాడని తెలుస్తోంది. గండిపేట సమీపంలోని గోల్కోండ రిసార్ట్స్ లో ఈ వేడుక జరగనుంది. తన నిశ్చితార్థానికి రావాలని చెర్రీ గవర్నర్‌ దంపతులను ఆహ్వానించిన విషయం విధితమే. పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు కూడా ఈ వేడుకలో పాల్గొనబోతున్నారని సమాచారం

బెజవాడ రిలీజ్... పోలీసులు అప్రమత్తం

నాగచైతన్య తాజా చిత్రం   బెజవాడ రిలీజ్ అవుతోందంటే బెజవాడలో భయం మొదలైంది. మళ్ళీ ఏ గొడవలు మొదలవుతాయో, కులాల మధ్య కొట్లాటలు ప్రారంభమవుతాయో అని అంతా భయపడుతున్నారు. మరో ప్రక్క పోలీసులు సైతం అప్రమత్తంగా ఉండాలని పైనుంచి ఆర్డర్స్ ఉండటంతో బెజవాడ విడుదలైన మూడు రోజుల వరకూ చాలా జాగ్రత్తగా అన్ని చోట్లా కన్నేసి ఉంచుతున్నారు. అల్లరి మూకలు చెలరేగి పోకుండా ఉండేందుకు వారు అన్ని విధాలుగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాదాపు అప్రకటిత 144 సెక్షన్ నడిచే అవకాశముందని తెలుస్తోంది. ధియోటర్స్ వద్ద కూడా పెద్ద హంగామా జరపకూడదని ధియోటర్స్ ఓనర్స్ ప్రత్యేకంగా చెప్పినట్లు సమాచారం. ఇది ఇలా ఉంటే వంగవీటి రంగా వర్గీయులు ఈ చిత్రంలో తమ కాపు కులాన్ని తక్కువ చేసి చూపెట్టినా,రంగాని సరిగ్గా చూపకపోయినా ఫలితాలు దారుణంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. మరో వర్గం అయితే ఆ చిత్రంలో తమ వారిని బాగా చూపెట్టారని బ్యానర్స్ కట్టి మరీ సంతోషం వెల్లబుచ్చుతోంది. ఈ గొడవలు ఎక్కడికి దారి తీస్తాయో అని అంతా భయం భయం గా చూస్తున్నారు.

ప్రొద్దుటూరు కోర్టుకు నిర్మాత సింగనమల రమేష్‌

పలు క్రిమినల్, చెక్‌బౌన్స్ కేసులకు సంబంధించి తెలుగు చలనచిత్ర నిర్మాత సింగనమల రమేష్‌  కడప జిల్లా ప్రొద్దుటూరు కోర్టుకు హజరయ్యారు. హైదరాబాదు నుంచి బందోబస్తుతో ప్రొద్దుటూరు వచ్చి ఒకటో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ ఎదుట హాజరయ్యారు. రమేష్‌కు వడ్డీకి డబ్బులిచ్చామని, ఆ డబ్బులు ఇవ్వాలని కోరినపుడు బెదిరించాడని ప్రొద్దుటూరుకు చెందిన కొంత మంది ఫిర్యాదు చేశారు. తనకు భాను, మద్దెలచెర్వు సూరి తెలుసునని, బాకీ ఇవ్వాలని అడిగితే వారి చేత చంపిస్తానని బెదిరించాడంటూ రుణదాతలు ప్రొద్దుటూరు రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో సింగనమల రమేష్‌పై ఫిర్యాదు చేశారు.ఈ మేరకు అతనిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. క్రైం నెంబర్ 146/11, 147/11, 148/11, 151/11లకు సంబంధించి, అలాగే పలు చెక్‌బౌన్స్ కేసుల్లో విచారణ పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపర్చిన తర్వాత తిరిగి హైదరాబాద్ తీసుకెళ్లిపోయారు

ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు నోటీసులు !!

ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేసే విధంగా.. సాక్షులను భయాందోళనలకు గురిచేసేలా తప్పుడు కథనాలను ప్రచురిస్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలను కట్టడి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు స్పందించింది. పరిశోధనాత్మక జర్నలిజం పేరుతో సాక్షుల వాంగ్మూలాలంటూ దర్యాప్తును తప్పుదోవ పట్టించే కథనాలను ప్రచురిస్తున్నారన్న ఆరోపణలపై ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలకు హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. పిటిషనర్ చేసిన ఆరోపణలకు సీబీఐ హైకోర్టుకు వివరణ ఇచ్చుకుంది. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను తామెవ్వరికీ లీక్ చేయటం లేదని సీబీఐ తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. దీనిపై సంతృప్తి చెందని న్యాయమూర్తి.. పిటిషనర్ ఆరోపణలకు సంబంధించిన పూర్తి వివరాలను కోర్టు ముందు ఉంచాలని సీబీఐకి స్పష్టం చేశారు. సీబీఐ తన దర్యాప్తు వివరాలను ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలకు లీక్ చేస్తోందని, సిటింగ్ జడ్జి లేదా రిటైర్డ్ న్యాయమూర్తితో దర్యాప్తు చేయించాలని కోరుతూ ఎమ్మార్ హిల్స్ ప్లాట్ కొనుగోలుదారు కె.రఘురామకృష్ణరాజు గత వారం హైకోర్టులో దాఖలు చేసిన వ్యాజ్యాన్ని జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పి.మునికృష్ణారెడ్డి వాదనలను వినిపిస్తూ.. ఎమ్మార్ వద్ద ప్లాట్లు కొనుగోలు చేసిన వారి పట్ల ప్రజల్లో ద్వేషభావం కలిగేలా.. సీబీఐ జాయింట్ డెరైక్టర్, అతని సహచరులు దర్యాప్తునకు సంబంధించి అతి సున్నితమైన అంశాలను ఈనాడు, ఆంధ్రజ్యోతిలకు చేరవేస్తున్నారని తెలిపారు. చట్టబద్ధంగా ప్లాట్లు కొనుగోలు చేసిన తన క్లయింటు లాంటి కొనుగోలుదారులను నేరస్తులుగా చిత్రీకరించేందుకు సీబీఐ ప్రయత్నిస్తోందని కోర్టుకు నివేదించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు సాక్షుల వాంగ్మూలాలు, వారి ప్రకటనలు, నేరాంగీకారాలు తదితర అంశాలను యథాతథంగా ప్రచురిస్తూ.. సీబీఐ దర్యాప్తును ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలు జర్నలిజం విలువలను కాలరాసి, అనైతిక చర్యలకు పాల్పడుతున్నాయని వివరించారు. ఈనాడు, ఆంధ్రజ్యోతిలు ఇప్పటి వరకు ప్రచురించిన తప్పుడు కథనాలను సీబీఐ అధికారులు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఖండించలేదని.. తద్వారా సీబీఐ అధికారులే కీలక సమాచారాన్ని ఆ రెండు పత్రికలకు లీక్ చేస్తున్నారని అర్థమవుతోందని పేర్కొన్నారు. ఈ సమయంలో సీబీఐ తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. పిటిషనర్ ఆరోపణల్లో వాస్తవం లేదని, తాము ఎవ్వరికీ ఎటువంటి సమాచారాన్ని లీక్ చేయలేదని చెప్పారు. వాదనలను విన్న న్యాయమూర్తి.. ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల యాజమాన్యాలకు, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డెరైక్టర్, సీబీఐ జాయింట్ డెరైక్టర్, ఎమ్మార్ హిల్స్ టౌన్‌షిప్స్ ప్రయివేట్ లిమిటెడ్ తదితరులకు నోటీసులు జారీ చేశారు. ఈ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కోర్టు ముందు ఉంచాలని సీబీఐ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. 

రేపు ముంబయి నగరంలో టీటీడీ సమాచార కేంద్రం ప్రారంభం

ముంబయి నగరంలోని సైమాన్ ఏరియాలో గురువారం టీటీడీ సమాచార కేంద్రాన్ని ప్రారంభించనున్నారు. శ్రీవారి భక్తులకు కోరిన సమాచారాన్ని అందించేందుకు అత్యాధునిక సమాచార వ్యవస్థ, మౌలిక సదుపాయాలతో ఈ సమాచార కేంద్రాన్ని నెలకొల్పారు. గురువారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి జయంత్ పాటిల్ చేతుల మీదుగా ఈ సమాచార కేంద్రం ప్రారంభమవుతుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. మహారాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఆర్‌వై.గైక్వాడ్, టీటీడీ చైర్మన్ కనుమూరి బాపిరాజు, ఈవో ఎల్‌వీ.సుబ్రమణ్యం, పాలక మండలి సభ్యులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారని టీటీడీ పేర్కొంది