Wednesday, 23 November 2011

(ఎస్కేయూ) దూరవిద్య పీజీ ప్రశ్నపత్రాలు లీక్

శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ (ఎస్కేయూ) దూరవిద్య పీజీ ప్రశ్నపత్రాలు లీకయ్యాయి. దీంతో బుధవారం నుంచి జరగాల్సిన పరీక్షలను రద్దు చేశారు. మంగళవారం ఇంగ్లీషు పరీక్ష రాశారు. ఎస్కేయూ దూరవిద్య కేంద్రం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పరీక్ష కేంద్రాలకు పంపిన ప్రశ్నపత్రాల్లో ప్రకాశం జిల్లాలో ఓ కాలేజీ వద్ద బుధవారం జరగాల్సిన తెలుగు పేపర్ లీక్ అయినట్లు వార్తలు వచ్చాయి. అనంతపురం జిల్లాలో కూడా ప్రశ్నపత్రం బయటపడడంతో యూనివర్సిటీ వీసీ, రిజిస్ట్రార్, దూరవిద్య కేంద్రం డెరైక్టర్లు అవాక్కయ్యారు. ఎక్కడ పరీక్ష పేపర్ లీక్ అయిందో తెలియకపోవడంతో వీసీ ఆచార్య రామకృష్ణారెడ్డి రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీకి, ఉన్నత విద్య ముఖ్య కార్యదర్శికి విషయాన్ని వివరించారు. వారి ఆదేశాల మేరకు కలెక్టర్, ఎస్పీలతో సమావేశమయ్యారు. అక్కడి నుంచి నేరుగా ఎస్కేయూకి చేరుకుని దూరవిద్య కేంద్రం డెరైక్టర్‌తో పాటు రిజిస్ట్రార్, ఇతర దూరవిద్య కేంద్రం అధికారులతో రాత్రి 9.30 వరకు సమావేశమయ్యారు. తెలుగు పేపర్ ఒక్కటే లీక్ అయిందా లేక అన్ని పేపర్లూ లీక్ అయ్యాయా అన్న విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అయితే ప్రిన్సిపల్ సెక్రటరీ సూచనల మేరకు బుధవారం నుంచి జరగాల్సిన దూరవిద్య పీజీ పరీక్షలన్నింటినీ రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. లీకైన ఘటనపై విచారణ చేస్తామని చెప్పారు.

No comments:

Post a Comment