Sunday, 16 October 2011

అనంతపురం జిల్లా మొదటిస్థానం సాధించింది వాటర్‌షెడ్ల పథకంలో

 వాటర్‌షెడ్ల పథకం నిర్వహణలో అనంతపురం జిల్లా మొదటిస్థానం సాధించింది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం అమల్లో నాల్గవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. విజయవాడలో శుక్ర, శనివారాల్లో ఉపాధిహామీ పథకం సమీక్ష సమావేశం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగిన ఉపాధిహామీ, వాటర్‌షెడ్ల పనులను మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, కమిషనర్ జయలక్ష్మి, స్పెషల్ ఆఫీసర్‌లు విద్యాసాగర్, సువర్ణతో పాటు డెరైక్టర్ ఏ.మురళి సమీక్షించారు. జిల్లాలో 1999 నుంచి 2007 వరకు రూ.227.38 కోట్ల వ్యయంతో 3,78,969.67 హెక్టార్ల విస్తీర్ణంలో వాటర్‌షెడ్ల పథకం అమలు చేశారు. మెగా వాటర్‌షెడ్ల పథకం 2009లో జిల్లాలో ప్రారంభం కాగా, 70 మెగా వాటర్‌షెడ్లు, 202 మైక్రో వాటర్‌షెడ్లు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి.

వీటిని ప్రాతిపదికగా తీసుకున్న ప్రభుత్వం వాటర్‌షెడ్ల నిర్వహణలో జిల్లాకు మొదటిస్థానం ఇచ్చింది. ఉపాధిహామీ పథకం ప్రారంభం నుంచి జిల్లాలో 9,28,73,112 పనిదినాలు కల్పించారు. ఇందుకోసం రూ.1,158.91 కోట్లు ఖర్చు చేశారు. 2010-11లో 2,03,03,163 పనిదినాలు కల్పించి, రూ.332కోట్లు వ్యయం చేశారు. 2011-12లో 91,62,477 పని దినాలను ఇప్పటి వరకు కల్పించారు. ఇందుకోసం రూ.134.70 కోట్లు వెచ్చించారు. అలాగే ఉపాధి కూలీలకు రోజువారీ వేతనం సగటున రూ.106.35 పైసలు చెల్లించారు. నిధుల వినియోగం, కూలీల సగటు వేతనం పరిగణనలోకి తీసుకోవడంతో ఉపాధిహామీలో మాత్రం జిల్లాకు రాష్ర్టంలో నాల్గవ స్థానం దక్కింది.
ఎస్సీ, ఎస్టీల భూములను సాగులోకి తీసుకువచ్చే ప్రక్రియ జిల్లావ్యాప్తంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ రైతుల భూములను ఉపాధిహామీ ద్వారా సాగులోకి తీసుకురావాల్సిందిగా ఆ పథకం కమిషనర్ జయలక్ష్మి ఆదేశాలు జారీ చేశారు. జిల్లాలో సుమారు 47 వేల ఎకరాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీల బీడు భూములు ఉన్నాయని డ్వామా పీడీ ప్రభుత్వానికి నివేదించారు. ఇందులో 20 వేల ఎకరాలను ఈ ఏడాది సాగులోకి తీసుకురావాలని కమిషనర్ సూచించారు. బలహీన వర్గాలకు చెందిన 1,48,044.45 యూనిట్‌లలో రూ.532.96 కోట్లు వ్యయం చేసి ఉపాధి పనులు నిర్వహించారు

No comments:

Post a Comment