భూగర్భ జలాల పెంపు, జీవనోపాదుల మెరుగులో భాగంగా రాష్ట్రంలో రూ.2250 కోట్లతో 450 మెగా వాటర్షెడ్లు ప్రారంభించిట్లు రాష్ట్ర సమగ్ర జల వనరుల అభివృద్ధి పథకం ప్రత్యేక కమిషనర్ సువర్ణ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ రైతుల జీవనోపాదుల మెరుగు కోసం ఇందిర జలప్రభ కింద రూ.1800 కోట్లతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. పది వేల హెక్టార్లలో ఆరు వేల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారని ఆమె హిందూపురంలో తెలిపారు. ఈ పథ కం కోసం ఉపాధి హామీ ద్వారా రూ. 1000 కోట్లు, నాబార్డ్ ద్వారా రూ.800 కోట్లు విడుదల కానుందని తెలిపారు. ఇప్పటికే నాబార్డ్ ద్వారా రూ. 400 కోట్లు విడుదలైందని ఆమె తెలిపారు. అదనపు నిధుల కోసం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామన్నారు. మెగా వాటర్షెడ్లు, ఉపాధి హామీ పథకం ఒకే గొడుగు కిందకు తేవడం జరిగిందని, దీని ద్వారా అన్ని జిల్లాల్లో జీవనోపాదుల కల్పన కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క మెగా వాటర్షెడ్ ద్వారా 15,500 ఎకరాల భూమి సారవంతమవుతుందని, ప్రతి వాటర్షెడ్పైన 5 నుండి 7 ఏళ్ళ లోపు రూ.5 కోట్ల పైబడి ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. అనంతపురం జిల్లాలో 70 మెగా వాటర్షెడ్లు ప్రతిపాదించడం జరిగిందని, ఇప్పటికే 20 పైబడి వాటర్షెడ్లలో పనులు ప్రారంభమయ్యాయన్నారు. జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛంద సంస్థలకు కొన్ని వాటర్షెడ్లు కేటాయించారన్నారు. పథకాల అమలులో ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమని, లేకపోతే ఆశించిన స్థాయిలు సాధించడం సాధ్యపడదన్నారు. వాటర్షెడ్ల ద్వారా గ్రామాల్లో శాశ్వత వనరులు ఏర్పాటుచేసే అవకాశాలు ఉన్నాయని, దీనికి తోడు వ్యవసాయం, పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతాయన్నారు.
No comments:
Post a Comment