అసెంబ్లీ సాక్షిగా సీఎం అబద్ధాలు...కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఫీజు రీయింబర్సుమెంట్స్పై అసెంబ్లీ
సాక్షిగా అబద్దాలు చెప్పారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప
ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఒంగోలులో జరిగిన ఫీజు ధర్నాలో
ఆరోపించారు. ఫీజు రీయింబర్సుమెంట్స్ నిధులు విడుదల చేయకుండా విద్యార్థులను
ఇబ్బంది పెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిపించేందుకే ధర్నా
చేస్తున్నట్లు చెప్పారు. పేదరికం పోవాలంటే ప్రతి ఒక్కరూ చదవుకోవాలని, కానీ
ప్రభుత్వం మాత్రం రీయింబర్సుమెంట్స్ చెల్లించడం లేదన్నారు. కుటుంబంలో
ఒక్కరైనా ఉన్నత చదువులు చదివితేనే పేదరికం పోతుందన్నారు. విద్యా సంవత్సరం
ముగుస్తున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. టిడిపి అధినేత నారా
చంద్రబాబు నాయుడు ఈ మధ్య కళాశాలలకు వెళ్లి విద్యార్థులను కలుస్తున్నారని
ఆయన తన తొమ్మిదేళ్ల పాలనలో ఎప్పుడైనా వారిని కలిశారా అని ప్రశ్నించారు.బాబు
పేదల కోసమో, రైతుల కోసమో అవిశ్వాసం పెట్టలేదన్నారు. తమ వర్గం ఎమ్మెల్యేలను
ఇబ్బందులు పెట్టడానికే పెట్టారన్నారు. ప్రభుత్వం పడిపోదని తెలిసినా తన
వర్గం ఎమ్మెల్యేలు విప్ ధిక్కరించి విలువల కోసం ఓటు వేశారన్నారు. తనపై
తప్పుడు కేసులు బనాయించి ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని, వాటికి
ఎలాంటి ఆధారాలు లేవన్నారు. కాంగ్రెసు ప్రతిపక్షాలను వదిలేసి వైయస్సార్
కాంగ్రెసు పార్టీని లేకుండా చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కాగా ఈ
కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి భారీగా కార్యకర్తలు తరలి వచ్చారు.
No comments:
Post a Comment