Wednesday, 4 January 2012

మంత్రులు, ఎమ్మెల్యేలకు మద్యం మాఫియాతో సంబంధాలు..చంద్రబాబు

నిబంధనలకు విరుద్ధంగా 31 మద్యం దుకాణాలను పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణకు ఎలా కేటాయించారని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. డిస్టిల్లరీ పర్మిట్లు ఇష్టాను సారంగా ప్రభుత్వం ఇస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి కిరణ్ ముడుపు తీసుకుని మద్యం తయారీకి అనుమతులు ఇస్తున్నారని బాబు ఆరోపించారు.చిత్తూరు జిల్లా, కుప్పం నియోజక వర్గంలో రెండో రోజైన బుధవారం పర్యటిస్తున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మద్యం ఎమ్మార్పీ ధరలకే అమ్మాలన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందని చంద్రబాబు ఎద్దేవా చేశారు. ప్రజా వ్యతిరేక విధానాలు కొనసాగిస్తున్న ఈ ప్రభుత్వం అధికారంలో కొనసాగే నైతిక హక్కులేదని అన్నారు. మద్యం నియంత్రణకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న మద్యం మాఫియాపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీయే సమాధానం చెప్పాలని చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడి మద్యం విక్రయాలతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు మద్యం మాఫియాతో సంబంధాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ సందర్భంగా జరిగిన మోటారు సైకిల్ ర్యాలీలో ఆయన పాల్గొని పార్టీ శ్రేణులను ఉత్సాహపరిచారు.

No comments:

Post a Comment