Saturday, 3 December 2011

కర్నూలు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుముఖం

కొంత కాలంగా జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం తగ్గుముఖం పట్టడంతో కోట్ల రూపాయల లావాదేవీలు స్తంభించిపోయాయి. వందల ఎకరాల సాగు భూములను టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్న వ్యాపారులు గడువు దాటిపోయినా అసలు మొత్తాన్ని చెల్లించలేక చేతులెత్తేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారుల పుణ్యామా అంటూ ఇప్పుడు వ్యవసాయ భూములు రెంటికి చెడ్డ రేవడిలా మారాయి. ఇటు రైతులు పంటలు సాగు చేసుకోలేక..అటు వ్యాపారస్తులు ప్లాట్లను విక్రయించలేకపోతున్నారు. దీంతో కొందరు
వ్యాపారులు పరారీలో ఉండగా, మరి కొందరు ముఖం చాటేశారు. మొన్నటి వరకు జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు ప్లాట్లు.. ఆరు రిజిస్ట్రేషన్లుగా కొనసాగింది. బడా వ్యాపారులు కర్నూలు, నంద్యాల, ఆదోని డివిజన్ పరిధిలోని పట్టణ శివారు ప్రాంతాల్లో ఇబ్బడి ముబ్బడిగా వ్యసాయ భూములను కొనుగోలు చేశారు.
ప్లాట్లకు మంచి డిమాండ్ ఉండటంతో భూముల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. వర్షాలు లేక వేసిన పంటలు కోల్పోయి నష్టపోవటం కంటే ఉన్న భూములను విక్రయించగా వచ్చిన దాంతోనైనా వ్యాపారం చేసుకుందామని కొందరు రైతులు భూములను విక్రయించేందుకు సిద్ధపడ్డారు. వ్యాపారులు టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్లు చేసుకున్నారు. కొందరు గడువు లోపే మిగిలిన మొత్తాన్ని చెల్లించి భూములను స్వాధీనం చేసుకున్నారు. ఈమధ్యలో వ్యాపారం స్తంభించి పోయింది.
ఎంతకీ రియల్ ఎస్టేట్ రంగానికి డిమాండ్ రాకపోవటంతో కొందరు వ్యాపారులు ఊరొదిలి వెళ్తే, మరి కొందరు రైతులకు ముఖం చాటేసి సెల్ ఫోన్లు స్విచ్చాఫ్ చేశారు. కర్నూలు-ఓర్వకల్లు, కర్నూలు-కోడుమూరు ప్రాంతాల పరిధిలో సుమారు 2,601 ఎకరాల సాగు భూములకు ఎకరం రూ. 20 లక్షల నుంచి రూ. 50 లక్షలకు అగ్రిమెంట్ చేసుకున్నారు. టోకెన్ అడ్వాన్స్‌గా లక్షకు రూ. 25వేలు రైతులకు ఇచ్చారు.
టోకెన్ అడ్వాన్స్ ఇవ్వగానే సాగు భూములను ప్లాట్లుగా మార్చేశారు. కొందరు మాత్రం ప్లాట్లను విక్రయించి రైతులకు చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించేశారు. మరి కొందరు మాత్రం అధిక ధరలకు విక్రయించాలని ఆశపడి ఒక్క నెల ఆలస్యం చేశారు. దురదృష్టవశాత్తు ఉన్నట్లుండి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి డిమాండ్ పడిపోయింది. దాంతో రైతులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని చెల్లించలేక, మార్కెట్లో తిరిగలేక సతమతమవుతున్నారు. టోకెన్ అడ్వాన్స్ కోసం వడ్డీకి తెచ్చిన మొత్తాన్ని కూడా చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

No comments:

Post a Comment