Friday, 14 October 2011

వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సు ద్వారా యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు

వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సు ద్వారా యువతకు మరిన్ని ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహపరిశోధన సంచాలకులు డాక్టర్‌ కె.రాజారెడ్డి పేర్కొన్నారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో గురువారం వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సు తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ సీమలో నివసించు యువతకు స్వయం ఉపాధి కల్పించాలనే సదుద్ధేశంతో ఆచార్య ఎన్‌.జి.రంగా విశ్వవిద్యాలయం పరిధిలో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కోర్సులను నూతనంగా ప్రారంభించడం జరిగిందన్నారు. దీంతో వ్యవసాయాభివృద్ధి, విత్తనోత్పత్తులలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే అవకాశం ఉంటుందన్నారు ఈ క్రమంలోనే తిరుపతి వ్యవసాయ పరిశోధనా స్థానంలో ఈ నెల 10 నుంచి తరగతులు ప్రారంభించడం జరిగిందన్నారు. రెండు సంవత్సరాల కాలపరిమితి గల ఈ కోర్సుకు పదోతరగతి లేదా దానికి సమానమైన పరీక్షలలో ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. అభ్యర్థులు కనీసం నాలుగు సంవత్సరాలు గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉండవలెనని చెప్పారు. పదోతరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. ఈ కోర్సులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు వ్యవసాయ శాఖలో వ్యవసాయ విస్తరణాధికారులుగా ఉద్యోగాలు పొందడమే కాకుండా ప్రముఖ ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల అసోసియేట్‌ డీన్‌ డాక్టర్‌ ఎన్‌.వి.నాయుడు, డాక్టర్‌ మునస్వామి, డాక్టర్‌ గిరిధర్‌క్రిష్ణ, డాక్టర్‌ ఎ.రామక్రిష్ణారావు, డాక్టర్‌ సుబ్బారావు, డాక్టర్‌ వాసంతి, డాక్టర్‌ మురళీకృష్ణ, డాక్టర్‌ రమణ తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment