ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిమ్మమ్మమర్రిమాను ఒక చరిత్రగా నిలిచిపోయింది. మహాశివరాత్రి పండుగ వస్తూనే ఆంధ్రప్రదేశ్, కర్నాటక ప్రాంత ప్రజలకు ఒక్కసారిగా తిమ్మమ్మమర్రిమాను చరిత్రను గుర్తు చేసుకుంటారు. రాష్ట్రంలోని అనంతపురం జిల్లా, కదిరి నియోజకవర్గం, నంబులపూలకుంట మండలంలోని కదిరి-రాయచోటి ప్రధాన రహదారిలో కదిరి పట్టణానికి 27 కిలోమీటర్ల దూరంలో నెలకొన్న తిమ్మమ్మమర్రిమాను గూటిబైలు పరిసరాలలో మర్రిమాను 1100 ఊడలతో 6.20 ఎకరాలు విస్తరించి ఉన్నది. మద్రాసులో ఉన్న అడియార్ మర్రిచెట్టు, కలకత్తాలోని బొటానికల్ గార్డెన్లో ఉన్న మర్రిచెట్టుకన్నా తిమ్మమ్మమర్రిమాను పెద్దచెట్టుగా ప్రసిద్ధి చెందింది.
ఈ మర్రిచెట్టును తిమ్మమ్మమర్రిమానుగా గిన్నీస్బుక్క్ ఆఫ్ వరల్డ్లో తన స్థానం సుస్థిర పరుచుకుంది. ప్రస్తుతం ఈ మర్రిచెట్టుకు దాదాపు 562 సంవత్సరాలు చరిత్ర ఉంది. ఆ ప్రాంత మంతా దైవసంభూతంగా పేరు ఉన్న పతీవ్రత తిమ్మమాంబ పేరు మీద తిమ్మమ్మమర్రిమానుగా ఈ మహావృక్షం ప్రసిద్ది గాంచినది. ఈ మహావృక్షం వెనుక ఆసక్తి గల కథ కూడా ఉన్నది. అనంతపురం జిల్లా, పెనుకొండ తాలుక, బుక్కపట్నం గ్రామంలో చెన్నక్క, వెంకటప్ప అనే దంపతులకు తిమ్మమాంబ జన్మించింది. ఈమెకు పెళ్ళి వయస్సు వస్తూనే నంబులపూలకుంట మండలానికి చెందిన గూటిబైలు గ్రామంలో నివాసం ఉన్న బాలవీరయ్యతో వివాహం జరిపించారు. అయితే వివాహం జరిగిన కొద్దిరోజులకే ఆమె భర్తకు అంటువ్యాధి సోకి అనారోగ్యంతో క్షీణిచారు.
గ్రామంలో ఉన్న వారు వారిని చూసి అసహించుకుంటుంటే ఈ బాధను పడలేక గ్రామానికి ఒక కిలోమీటరు సమీపంలో తిమ్మమాంబ ఒక రాతి కోటను నిర్మించుకుని, అనారోగ్యంతో బాధపడుతున్న భర్తను కోటలోకి తీసుకెళ్ళి ఆయనకు సేవలు చేసింది. అయినా అతను ఆరోగ్యం క్షీణించి మరణించాడు. అప్పట్లో ఆమె తన భర్త మరణించడంతో తానుకూడా అతనితో పాటు సతీసహగమణం చేసుకోవాలని చితిపేర్చుకుంది, చితిలోపల పచ్చని మర్రికొమ్మతో పాటు, మామిడి తోరణాలు కట్టారు. గ్రామ స్తులు అందరు చూస్తుండగానే భర్తను చితిలో దహనం చేస్తున్న సమయంలో ఆమెకూడా చితిలోకి దూకి సతీసహగమణం చేసుకున్నది. తర్వాత కొంత కాలానికి ఆ చితి వద్ద మర్రికొమ్మ మొక్క చిగురించింది.
ఆ మొక్క నేడు ప్రపంచంలోకెల్లా పెద్ద వృక్ష్యంగా మారింది. నాటి నుంచి మర్రిమాను తిమ్మమ్మమర్రిమానుగా ప్రఖ్యాతి గాంచినది. వారి సమాధి వద్ద చిన్న గుడి నిర్మించారు. అందులో బాలవీరయ్య, తిమ్మమాంబ విగ్రహాలు నెలకొల్పి ఉన్నాయి. అప్పటి విగ్రహాలకు నేటి వరకు మహాశివరాత్రి పండుగ రాగానే మూడు రోజులు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అక్కడ నిర్మించిన తిమ్మమాంబ సమాధిఘాట్, తిమ్మమాంబ, బాలవీరయ్యల విగ్రహాలు, వన్యప్రాణుల షెడ్, శివఘాట్, కళ్యాణమండపం, గెస్ట్ హౌస్, ఓబుళేసుని గుట్ట తదితర వంటివి అక్కడ సందర్శించదగ్గ విషయాలుగా నెలకొల్పారు. ఈ మహాశివరాత్రి పండుగ రాగానే కర్నాటక ప్రాంతం బెంగుళూరు, కోలార్, చెనై్న, చిత్తూరు, కడప, అనంతపురం వివిధ జిల్లాల నుంచి పర్యాటకులు, భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు.
ప్రయాణికులకు మహాశివరాత్రి ఉత్సవాలకు గాను తిమ్మమ్మమర్రిమాను వద్దకు కదిరి డిపో నుంచి స్పెషల్ సర్వీసులు బస్సులు కూడా నడుపుతున్నారు. అయితే అక్కడ పర్యాటకులకు, సందర్శకులకు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. మర్రిమాను వద్దకు వస్తున్న యాత్రికులు, పర్యాటకులకు అక్కడ బసచేయాలన్న గధులు లేక వచ్చిన వారు పూజలు నిర్వహించుకుని వెళ్లుతున్నారే తప్ప బసచేయడానికి కష్టంగా మారిందని పర్యాటకులు పేర్కొన్నారు. అదే విధంగా పర్యాటకులకు స్నానం గదులు, లేక పోవడంతో వచ్చిన పర్యాటకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కనీసం ప్రయాణం చేసి వచ్చిన వారికి సకాలంలో తాగునీటి కుళాయిలు లేక పోవడంతో ఎక్కువ సమయం మర్రిమాను వద్ద గడపలేక పోతున్నారు
No comments:
Post a Comment