కర్నూలు, అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలిపి ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటుచేయాలని తెలంగాణవాదులు పేర్కొనడం విడ్డూరంగా వుందని, రాయలసీమను విడగొడితే ఒప్పుకునే ప్రసక్తే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ ఎస్వీ.మోహన్రెడ్డి హెచ్చరించారు. తెలంగాణ ఇస్తే మొదటగా గ్రేటర్ రాలయసీమను ఇచ్చి ప్రత్యేక నిధులను ఇవ్వాలని డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని ధర్మవరం సుబ్బారెడ్డి స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఎస్వీ.మోహన్రెడ్డి మాట్లాడారు. రాయలసీమ ప్రాంతంలోని కర్నూలు, అనంతపురం జిల్లాలను కలిపి రాయలతెలంగాణ ఇవ్వాలని ఒకరు, చిత్తూరు, కడపలను కోస్తాంధ్రలో కలిపి మరోక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని మరికొంతమంది ప్రతిపాదనలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. రాయలసీమ వాసులు ఎవ్వరి కాళ్ల పంచన చేరాల్సిన ఖర్మ పట్టలేదని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే తమకు గ్రేటర్ రాయలసీమ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. గ్రేటర్ రాయలసీమ ఇవ్వకుండా రాయలసీమను ఇతర ప్రాంతాల్లో కలిపితే ఉద్యమం లేవదీస్తామని హెచ్చరించారు. సకల జనుల సమ్మెతో రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విచారం వ్యక్తం చేశారు. 50 ఏళ్ల కిందట భాష సంయుక్త రాష్ట్రాల పేరుతో తెలంగాణను ఆంధ్రలో కలిపి ఆంధ్ర రాష్ట్ర అవతరణ ఏర్పాటుచేశారని గుర్తుచేశారు. 50 ఏళ్ల కిందట కలిసిన తెలంగాణవాదులు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరితే 350 ఏళ్ల కిందటనే సీమ ప్రాంతాన్ని శ్రీకృష్ణదేవరాయులు పాలించారని, ముందుగా గ్రేటర్ రాయలసీమను ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. సీమ జిల్లాలతోపాటు ప్రకాశం, నెల్లూరు, బళ్లారి జిల్లాలను కలిపి ప్రత్యేక రాయలసీమను ఏర్పాటుచేయాలని అన్నారు. రాష్ట్రం సమైక్యంగా వుండాలని కోరుకుంటున్నామని, విభజిస్తే తమకు ప్రత్యేక రాయలసీమ ఇవ్వాలని, లేకపోతే నేతల ఇళ్లపై దాడులు చేస్తామని ఎస్వీ హెచ్చరించారు
No comments:
Post a Comment