శ్రీశైల మహాపుణ్య క్షేత్రంలో సోమవారం నుంచి మహాశివరా త్రి బ్రహ్మోత్సవాలు
ప్రారంభం కా నున్నాయి. 11 రోజులపాటు వైభవంగా నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు
భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల ఉభయ దేవాలయాలను విద్యుద్దీపాలతో
అలంకరించారు. ఉత్సవాలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులు, శివస్వాములకు
దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉత్సవాల్లో భాగంగా భ్రమరాంబ
మల్లికార్జున స్వామివార్లకు ప్రత్యేక పూజలు, వివిధ వాహనసేవలు
నిర్వహిస్తారు. ప్రధానంగా మహాశివరాత్రి పర్వదినం రోజున లింగోద్భవ సమయాన
స్వామివారికి మహారుద్రాభిషేకం జరుగుతుంది.అనంతరం పాగాలంకరణ,
కల్యాణ మహోత్సవం జరుగుతుంది. మొదటిరోజు సోమవారం ఉదయం వేదపండితులు యాగశాలలో
గణపతిపూజ, పుణ్యాహవాచనం, శివసంకల్పం, చండీశ్వరపూజ, రుత్విగ్వరణం చేస్తారు.
అనంతరం అఖండస్థాపన, వాస్తుపూజ, వాస్తుహోమం, పంచావరణార్చన, మండపారాధన,
రుద్రకలశ స్థాప న జరుగుతుంది. సాయంత్రం అంకురారోపణ, అగ్ని ప్రతిష్ఠాపన,
రాత్రి త్రిశూల పూజ, ధ్వజారోహణ, ధ్వజపటావిష్కరణ, బలిహరణలు చేపడతారు. కాగా
రహదారులు సరిగా లేక కంకరతేలి ఉండటంతో శ్రీశైల క్షేత్రానికి పాదయాత్రగా
వచ్చే భక్తులకు ముఖ్యంగా శివమాల ధరించిన భక్తులు తీవ్రఇక్కట్లకు
గురవుతున్నారు.
శివదీక్షా శిబిరాల వద్ద శివస్వాములకు ఉచిత వసతి ఏర్పాట్లతోపాటు విద్యుత్
సౌకర్యం, మంచి నీరు ఏర్పాటు చేసి, జ్యోతిర్ముడిని సమర్పించుకోవడానికి
అనువుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అన్ని క్యూలతో పాటు ఆలయ
ప్రాంగణం లోపల, ప్రధానాలయ గోపురం నుంచి ముఖ ద్వారం వరకు విద్యుద్ధీకరణ
పనులు పూర్తయ్యాయి. సాక్షి గణపతి, హఠకేశ్వరం, శిఖరేశ్వరం, కైలాస ద్వారం
తదితర ప్రదేశాలకు మొబైల్ ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి రంగం
సిద్ధం చేశారు. శాశ్వత ప్రాతిపదికన నిర్మించిన మరుగుదొడ్లలో చేయాల్సిన
పనులు పూర్తికాగా, వివిధ ప్రదేశాలలో తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణాలు మరో
రెండు, మూడు రోజుల్లోగా పూర్తయ్యే అవకాశం ఉంది. పాతాళగంగ మెట్ల మార్గంలో
విద్యుద్ధీకరణ, మంచి నీటి కొళాయిల ఏర్పాట్లు పూర్తయ్యాయి. పాతాళగంగలో గజ
ఈతగాళ్లను నియమించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే వాహనాలకు
ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నిర్ణీత ప్రదేశాలలో పార్కింగ్ చేయడానికి
అనువుగా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
No comments:
Post a Comment