Monday, 13 February 2012

యువరాజ్ త్వరగా కోలుకోవాలి...ధోనీ, గంభీర్

క్యాన్సర్ వ్యాధికి చికిత్స తీసుకుంటున్న యువరాజ్ త్వరగా కోలుకొని తిరిగి జట్టులోకి రావాలని ధోనీ, గంభీర్ ఆకాంక్షించారు. యువీ సవాళ్లను ఇష్టపడతాడని, అతను కాన్సర్‌ను జయించి మరింత దృఢంగా మారతాడని ధోనీ అడిలైడ్‌లో మ్యాచ్ అనంతరం వ్యాఖ్యానించాడు. యువీ త్వరగా కోలుకోవాలని జట్టంతా కోరుకొంటోందని గౌతీ చెప్పాడు. అతన్నెంతగానో మిస్సవుతున్నట్లు గంభీర్ తెలిపాడు.అంతక ముందు సోమవారం ఉదయం యువరాజ్ సింగ్ తండ్రి మాజీ టెస్ట్ క్రికెటర్ యోగరాజ్ సింగ్ మాట్లాడుతూ తన కొడుకు అశ్రద్ద వల్లే చికిత్సలో జాప్యం జరిగిందన్నారు. రెండు సంవత్సరాల క్రితమే ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలని కోరినట్టు యోగరాజ్ తెలిపారు. ఈ విషయంలో ఎవర్ని తాను నిందించడం లేదన్నారు. తన సలహాను పాటించినట్లయితే ప్రస్తుత పరిస్థితులు మరోలా ఉండేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండేళ్ల క్రితం మొహాలీలో టీ20 మ్యాచ్‌లో భారత్‌కు యువరాజ్ విజయాన్ని అందించాడని ఆయన గుర్తు చేసుకున్నారు.ఆ మ్యాచ్‌లో యువరాజ్ సిక్స్ కొట్టిన తర్వాత సురేశ్ రైనా వైపుకు పరిగెత్తుకు వచ్చాడని.. ఆ సమయంలో చాలా దారుణంగా దగ్గుతో బాధపడిన విషయాన్ని ప్రస్తావించాడు. అప్పటి నుంచే యువరాజ్ ఆరోగ్యం క్షీణించడం మొదలుపెట్టిందని యోగరాజ్ సింగ్ కన్నీళ్లతో విలపించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. యువరాజ్ అశ్రద్ద చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశాడు.ఇది ఇలా ఉంటే ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న యువరాజ్‌సింగ్ ప్రైవసీకి భంగం కలుగకుండా చూడాలని మీడియాకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు విజ్ఞప్తి చేసింది. యువరాజ్ ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తామని బోర్డు స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే భారత్‌‌కు ప్రపంచ కప్‌ని అందించడంలో తనదైన పాత్రను పోషించిన ఎడమ చేతి వాటం బ్యాట్స్‌మెన్ యువరాజ్‌ సింగ్‌‌కు క్రీడల మంత్రి అజయ్ మాకెన్ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా యువరాజ్ సింగ్ త్వరగా కోలుకోవడానికి ప్రభుత్వం తరుపున ఎటువంటి సహాకారాన్ని అందించేందుకు సిద్దంగా ఉన్నామని.. యువీ త్వరలోనే కోలుకుంటాడని అన్నారు

No comments:

Post a Comment