Sunday, 8 January 2012

వెంకన్న సొమ్ముతో ప్రైవేట్ బ్యాంక్‌ల వ్యాపారం

శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్లను విక్రయించే ఓ ప్రైవేటు బ్యాంక్ టిక్కెట్ల విక్రయంతో వచ్చిన సోమ్మును సొంత ఖాతాలో వేసుకుని తన వ్యాపారానికి (రొటేషన్) వినియోగించుకుంటున్న వైనం ఇటవల ఎల్‌ఎఫ్ ఆడిట్‌లో వెలుగు చూసింది. దీంతో టిటిడి యాజమాన్యం బ్యాంక్ అధికారులను పిలిచి ప్రశ్నించింది. తమను నిలదీస్తే టిక్కెట్ల విక్రయాలు తాము చేయలేమని, ఆ బాధ్యతల నుండి తప్పుకుంటామని బ్యాంకు అధికారులు బెదిరింపు ధోరణిలో చెప్పటంతో టిటిడి అవాక్కయింది. ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయాల గత రెండు దశాబ్దాలుకు పైగా ఓ ప్రైవేటు బ్యాంకుకు అప్పగించిన విషయం విదితమే. అయితే ఈ టిక్కెట్ల విక్రయానికి బ్యాంకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించి, వారి జీతబత్యాల చెల్లింపు, ఇతర వౌలిక సదుపాయాల కల్పనకు ఏటా కొన్ని లక్షల రూపాయల ఆర్థిక భారాన్ని భరిస్తోంది. ఈ నేపథ్యంలో 2009-10 సంవత్సరంలో ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయం ద్వారా 54 కోట్ల రూపాయలు టిటిడి ఖాతాలో జమ చేయాల్సి ఉంది. అయితే ఆ ప్రైవేటు బ్యాంకు కేవలం 52 కోట్ల రూపాయలను మాత్రమే జమ చేసి మిగిలిన రెండు కోట్ల రూపాయలను బ్యాంక్ ఖాతాలోనే ఉంచుకున్నట్లు ఎల్‌ఎఫ్ ఆడిట్‌లో వెలుగు చూసింది. తద్వారా 2 కోట్ల రూపాయలపై వెంకన్నకు రావలసిన వడ్డీ డబ్బులు సదరు బ్యాంకు ఖాతాలోకే చేరుతున్నాయి. ఇది పలు విమర్శలకు దారి తీస్తోంది. ఓ వైపు కోట్ల రూపాయల టిటిడి సోమ్మును తమ ఖాతాలో వేసుకుని, తిరిగి తాము భక్తులకు, టిటిడికి సేవ చేస్తున్నామంటూ ప్రచారం చేసుకోవడాన్ని ఉద్యోగులు తప్పుపడుతున్నారు. ఓ వైపు వ్యాపార దృక్పథంతో తిరుమలలో బ్యాంకును ఏర్పాటు చేసుకుని, మరో వైపు సేవగా చెప్పుకోవడాన్ని ఉద్యోగ సంఘాలు ఖండిస్తున్నాయి. ఇదిలా వుండగా ఈ విషయంపై టిటిడి అధికారులను ప్రశ్నించినప్పుడు తాము గట్టిగా ఒత్తిడి చేస్తే, వారు టిక్కెట్ల విక్రయ సేవలు నిలిపివేస్తామంటూ హెచ్చరిస్తున్నారని వాపోయారు. అలా నిలిపి వేస్తే తిరిగి మరో బ్యాంక్ టిక్కెట్ల విక్రయానికి ఆసక్తి చూపుతుందా.. అనే అనుమానాలు కూడా టిటిడిలో వ్యక్తమవుతున్నాయి. అవసరమయితే ఇందుకు సంబంధించి టిటిడినే మరో సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది

No comments:

Post a Comment