Thursday, 26 January 2012

ర్యాగింగ్ చేయొద్దన్నందుకు దాడి

ఓ విద్యార్థిపై దాడి చేసిన కేసులో ఏడుగురు విద్యార్థులను చంద్రగిరి పోలీసులు అరెస్టు చేశారు. శ్రీ విద్యానికేతన్ ఇంజినీరింగ్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్న జ్ఞానేంద్రనాయుడు, సాయికృష్ణ, శరత్‌కుమార్, నిరంజన్, వినోద్, భరత్, దిలీప్‌లు స్నేహితులు. వీరందరూ నెల క్రితం మొదటి సంవత్సరం విద్యార్థులను ర్యాగింగ్ చేసేందుకు సిద్ధపడ్డారు. అయితే వీరిలో జ్ఞానేంద్రనాయుడు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించడంతో వీరి మధ్యన భేదాభిప్రాయాలు తలెత్తాయి. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కాలేజీ విడిచిపెట్టిన తరువాత జ్ఞానేంద్రనాయుడు మోటార్ సైకిల్‌పై తిరుపతి వెళుతుండగా, మిగిలిన ఆరుగురు దాడి కి పాల్పడ్డారు. ఇందుకు కేఎంఎం కాలేజీకి చెందిన భరత్ సహాయం తీసుకున్నారు. దీనిపై బాధితుడు చంద్రగిరి పోలీస్ స్టేషన్‌లో బుధవారం ఫిర్యాదు చేశాడు. దాడికి పాల్పడిన ఆ ఏడుగురిని అరెస్టు చేశారు. ర్యాగింగ్ చేయడం తగదని చెప్పినందుకు కక్షకట్టి దాడుల వరకు వెళ్లిన ఆ విద్యార్థులను చంద్రగిరి సీఐ నాగభూషణం తీవ్రంగా మందలించారు. వారిని కోర్టులో హాజరుపరిచారు. అంతేకాక దాడికి పాల్పడ్డ విద్యార్థుల గురించి ఆయా కాలేజీల యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ర్యాగింగ్ చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

No comments:

Post a Comment