Thursday, 26 January 2012

పార్టీ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ...నందమూరి బాలకృష్ణ

పార్టీ ఆదేశిస్తే ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సినీనటుడు, టీడీపీ నేత బాలకృష్ణ అన్నారు.తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవిపై హీరో నందమూరి బాలకృష్ణ వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోంది. గురువారం ఆయన బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌లో జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించింది. చిరంజీవిపై ప్రశ్నించగా అందుకు బాలకృష్ణ నో కామెంట్ అన్నారు. తాను రాజకీయాల్లోకి వస్తానని బహిరంగ ప్రకటన చేసినప్పటి నుండి ఇటీవల వరకు చిరంజీవి, బాలకృష్ణల మధ్య వాగ్వుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. సామాజిక న్యాయం పేరుతో పార్టీని పెట్టిన వారు ఆ తర్వాత అమ్మేసుకున్నారని, తనను ఎవడో బాలుడు అన్నారని, పార్టీ ఆదేశిస్తే తాను చిరంజీవి పైనా పోటీకి సిద్ధమని ఇటీవల వివిధ సందర్భాల్లో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం చిరంజీవిపై స్పందించడానికి ఆయన నిరాకరించారు. చిరంజీవి వ్యాఖ్యలపై తానేమీ స్పందించనన్నారు. మిగతా అంశాలపై స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ లగడపాటి రాజగోపాల్ తన పదవికి రాజీనామా చేసి మళ్లీ విజయవాడ నుంచి గెలవాలని సవాల్ విసిరారు. త్వరలో తెలంగాణలో పర్యటిస్తానని బాలయ్య తెలిపారు. అభిమానులు సంయమనం పాటించాలని ఆయన కోరారు. కాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గురువారం జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా త్యాగమూర్తుల సేవను కొనియాడారు.

No comments:

Post a Comment