Tuesday, 24 January 2012

జన గణ మన కు వందేళ్ళు పూర్తి

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ 150వ జన్మదిన వేడుకలు, ఆయన విరచిత జాతీయ గీతం 'జనగణమన' వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా గీతానికి స్వరకల్పన జరిగిన మదనపల్లి బిటి కళాశాలలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంగళవారం ఠాగూర్ విగ్రహాన్ని ఆవిష్కరించి, 10 వేలమంది విద్యార్ధులతో కలిసి 'జనగణమన' గీతం ఆలపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీటీ కాలేజీ ప్రహరీ గోడకై రూ.2 కోట్లు జారీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆయన రచించిన జాతీయ గీతం భారతీయులకు స్ఫూర్తిగా నిలిచిందని సీఎం కొనియాడారు. చిత్తూరు జిల్లాలో రెండు రోజులు పర్యటించనున్నారు.ఏ గీతం వింటే దేశవిదేశాల్లోని భారతీయుల హృదయాలు పులకరిస్తాయో. దేశంలోని 120 కోట్ల మంది లేచి నిల్చుని గౌరవిస్తారో అలాంటి జాతీయగీతాన్ని మంగళవారం మదనపల్లెలోని బిసెంట్ దివ్యజ్ఞాన కళాశాలలో పదివేల మంది విద్యార్థులు ముక్తకంఠంతో 20సార్లు జాతీయగీతాన్ని ఆలపించి రెండు లక్షల గళార్చన పూర్తిచేశారు.తొలుత బెంగాలీలో రచించిన ఈ గీతాన్ని మదనపల్లె బీటీ కళాశాల సందర్శనార్థం ఇక్కడికి వచ్చిన ఠాగూర్ ఆంగ్లంలోకి తర్జుమా చేయడం ద్వారా మదనపల్లెకు ఖ్యాతిని తెచ్చిపెట్టారు. జనగణమన గీతానికి ఎంతటి గౌరవం, ప్రాధాన్యత ఇస్తున్నామో, అంతటికంటే మించిన విశ్వవ్యాప్త గౌరవం కూడా దక్కింది. 1911లో మొదటిసారిగా పాడిన ఈ గీతాన్ని 1950 జనవరి 24 న జాతీయగీతంగా రాజ్యాంగ సభ స్వీకరించింది.ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ ఉత్సవాల్లో బీజేపీ జాతీయనేత, రాజ్యసభసభ్యుడు వెంకయ్యనాయుడు, చిరంజీవి, మంత్రులు రఘువీరారెడ్డి, గల్లా అరుణకుమారి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment