Thursday, 26 January 2012

పులివెందుల్లో సోలార్ వెలుగులు

రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా పులివెందుల్లో సోలార్ విద్యుత్తు ఉత్పత్తి కాబోతోంది. సోలార్ విద్యుత్తు ఉత్పత్తి చేసేందుకు దాదాపు రూ.100 కోట్లతో 38.23 ఎకరాల్లో ఈ ప్లాంట్‌ను వెల్స్‌ఫన్ కంపెనీ చేపట్టింది. ఈ పనులు ప్రస్తుతం చివరి దశలో సాగుతున్నాయి. దాదాపు ఏడాదిన్నర క్రితం ఢిల్లీకి చెందిన వెల్స్‌పన్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ పులివెందుల్లో సోలార్ విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటుకు సిద్దమైంది. అప్పుడే పులివెందుల పారిశ్రామికవాడలో 38.23 ఎకరాలు కొనుగోలు చేసింది. వెల్స్‌పన్ సోలార్ ఏపీ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో పులివెందుల్లో ఆరు నెలల క్రితం సోలార్ విద్యుత్తు ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు పనులు ప్రారంభించింది. సూర్యకాంతి ద్వారా (సోలార్) విద్యుత్తును ఉత్పత్తి చేసే మొట్టమొదటి కేంద్రం పులివెందుల్లో ప్రారంభం కాబోతోంది. వెల్స్‌పన్ సంస్థ దాదాపు రూ.100 కోట్లతో ఇక్కడ ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తోంది. ఈ విద్యుత్తు కేంద్రంలో 5 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కానుంది. ఒక్కో మెగావాట్‌కు రూ.14 కోట్ల వంతున 5 మెగావాట్లకు రూ.74 కోట్లు, అలాగే భూమి కొనుగోలు, ఇతరత్రా పనులకు మరో రూ.26 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆ సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి ప్యానల్ బోర్డులు అమర్చే కార్యక్రమం చివరి దశకు చేరుకుంది. అలాగే దీనికి సంబంధించిన విద్యుత్తు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ తయారయ్యే విద్యుత్తును పక్కనే ఉన్న 220 కేవీఏ సబ్‌స్టేషన్ ద్వారా గ్రిడ్‌కు అందించనున్నారు. అక్కడి నుంచి ఈ విద్యుత్తును వివిధ అవసరాల కోసం వినియోగించనున్నారు. ఈ విద్యుత్తు ప్లాంట్ మరికొన్ని రోజుల్లోనే విద్యుత్తు ఉత్పత్తిని చేయబోతోంది. ఈ ప్లాంట్ విద్యుత్తు ఉత్పత్తి ప్రారంభిస్తే జిల్లాలో విద్యుత్తు కొరత కొంతవరకు తీరనుంది.

No comments:

Post a Comment