Monday, 23 January 2012

సచిన్ సెంచరీ కంటే.. భారత్ గెలుపే ముఖ్యం..గౌతం గంభీర్

‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ తెండూల్కర్ 100వ సెంచరీ కంటే భారత్ విజయమే ముఖ్యమని, టీమిండియా ఓపెనర్ గౌతం గంభీర్ అభిప్రాయపడ్డాడు. వ్యక్తిగత ప్రయోజనాల కన్నా జట్టు ప్రయోజనాలే కీలకమని వ్యాఖ్యానించాడు. ఆసీస్ టెస్టు సిరీస్‌ను ఇప్పటికే చేజార్చుకున్న క్రమంలో మంగళవారం అడిలైడ్‌లో చివరి టెస్టు జరగనున్న విషయం తెలిసిందే. దీంతో చివరి టెస్టునైనా గెలిచి ‘వైట్‌వాష్’ నుంచి తప్పించుకుని పరువు దక్కించుకోవాలని చూస్తున్న టీమిండియా ఇక్కడ ముమ్మర ప్రాక్టీస్ చేస్తోంది. ఈ సందర్భంగా ప్రాక్టీస్ సెషన్ అనంతరం విలేఖరులతో మాట్లాడిన గంభీర్..ప్రతి టెస్టు ప్రత్యేకమేనన్నారు. గత టెస్టు జయాపజయాలకు అతీతంగా తనను తాను మార్చుకొని సహజసిద్ధమైన ఆటలోకి ప్రవేశించని ఆటగాడు క్రికెట్‌కు పనికి రాడని పేర్కొన్నాడు. కాగా, ఒకటి, రెండు టెస్టు సిరీస్‌లలో విఫలం చెందినంత మాత్రానా చెడుగా భావించడం సరికాదని, ఇంగ్లాండ్, ఆసీస్ సిరీస్‌ల ముందు భారత్ ప్రపంచ ర్యాంకింగ్‌లో మొదటి స్థానంలో ఉందని గుర్తు చేశాడు. ఇక సచిన్ తెండూల్కర్ సెంచరీపై స్పందిస్తూ సచిన్ సెంచరీ సాధించడం కంటే జట్టు గెలిస్తేనే తనకు అమితానందమని, ఓ దేశం కోసం ఆడుతున్న సమయంలో వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయానే్న ఆటగాడు కోరుకోవాలన్నాడు. సచిన్ సెంచరీ చేయలేదన్న బాధ కంటే నాలుగు టెస్టుల సిరీస్‌ను 0-3 తేడాతో చేజార్చుకోవడమే అధికంగా బాధిస్తోందని, చివరి టెస్టులో సచిన్ సెంచరీ కన్నా జట్టు 1-3 తేడాతో విజయం సాధిస్తేనే ఆనందమన్నాడు. సచిన్ సెంచరీ సాధించి, చివరి టెస్టులో ఓటమిపాలైతే అది తమకు ఆనందం కలిగించబోదన్నాడు. మరోవైపు తొలి మూడు టెస్టుల్లో దూకుడు మీదున్న ఆసీస్‌ను చివరి టెస్టులో కట్టడి చేసి విజయం సాధిస్తామనే ధీమాను ఈ సందర్భంగా గంభీర్ వ్యక్తం చేశాడు. ఆసీస్‌తో వనే్డ సిరీస్ ఉన్న నేపథ్యంలో బ్యాటింగ్ విధానంపై స్పందిస్తూ తాము స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తున్నామని, ఆసీస్ బ్యాట్స్‌మెన్లు ఆ విధంగా బ్యాటింగ్ చేయలేకపోతున్నారన్నాడు. అయితే ఈ పర్యటనలో తన ఫాం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేశాడీ ఢిల్లీ బ్యాట్స్‌మన్. ఓపెనర్‌గా ఉన్న తాను పేలవమైన ప్రదర్శననిస్తున్నానని అంగీకరించాడు. అయితే ఓపెనర్‌గా దిగుతుండటంతో పరిస్థితులు భిన్నంగా ఉంటాయని, బంతి బాగా బౌన్స్ అవుతోందని వివరించాడు

No comments:

Post a Comment