Monday, 23 January 2012

పరిటాల శ్రీరామ్ రాజకీయ ఎంట్రీపై నిర్ణయం జరగలేదు....పరిటాల సునీత

తన కుమారుడు పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశంపై ఇప్పటి వరకు ఏ విధమైన నిర్ణయం తీసుకోలేదని పరిటాల రవి సతీమణి, తెలుగుదేశం శాసనసభ్యురాలు పరిటాల సునీత చెప్పారు. రేపు పరిటాల రవీంద్ర ఏడో వర్ధంతి సందర్భంగా ఆమె సోమవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. రాజకీయాల్లోకి ప్రవేశించడానికి శ్రీరామ్‌కు ఇంకా సమయం రాలేదని ఆమె అన్నారు. శ్రీరామ్ ప్రస్తుతం చదువుకుంటున్నాడని, చదువును పూర్తి చేయాల్సి ఉందని ఆమె అన్నారు. శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశంపై కుటుంబ సభ్యులం చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆమె చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి సూచన మీద, అభిమానుల కోరిక మీద శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం ఆధారపడి ఉంటుందని పార్టీ శాసనసభ్యురాలు, పరిటాల శ్రీరామ్ తల్లి పరిటాల సునీత చెప్పారు. పరిటాల ట్రస్టు సేవా కార్యక్రమాలకు మాత్రం ప్రస్తుతానికి శ్రీరామ్ నేతృత్వం వహిస్తారని ఆమె చెప్పారు. రాజకీయాల గురించి మాట్లాడే సయమం కాదంటూనే ఆమె శ్రీరామ్ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారనే సూచనను అందించారు.అనంతపురం జిల్లాలో కాంగ్రెసుకు ప్రత్యామ్నాయంగా పరిటాల రవి కుటుంబం ఉంటూ వస్తోంది. తెలుగుదేశం పార్టీకి పరిటాల రవి మొదటి నుంచి బలాన్ని సమకూరుస్తూ వచ్చారు. ఇప్పుడు తన ప్రత్యర్థులను దీటుగా ఎదుర్కోవడానికి పరిటాల శ్రీరామ్ రాజకీయాల్లోకి రావడానికి సిద్ధపడినట్లు సమాచారం. రాకీయాల్లోకి రావాలనే నిర్ణయమే తీసుకోనప్పుడు శ్రీరామ్ శాసనసభకు పోటీ చేస్తాడా, పార్లమెంటుకు పోటీ చేస్తాడనే విషయం ప్రస్తావనకే రాదని ఆమె అన్నారు. తమ కుటుంబం మొదటి నుంచి పేదల పక్షాన ఉందని, అందులో భాగంగానే శ్రీరామ్ తమ ఇంటికి వచ్చేవారిని కలుసుకుంటున్నారని ఆమె అన్నారు.

No comments:

Post a Comment