Tuesday, 27 December 2011

టిటిడి ఉద్యోగులకు సంస్కృతభాషపై శిక్షణ

ఎక్కడైతే సంస్కృతభాష వృద్ధి చెందుతుందో అక్కడ సంస్కృతి, సాంప్రదాయాలు కూడా పరిఢవిల్లుతాయని ఆంధ్రా గిర్వాణి విద్యాపీఠం ప్రిన్సిపాల్ బ్రహ్మశ్రీ దోర్భల ప్రభాకర్ శర్మ అన్నారు. టిటిడి ఉద్యోగులకు సంస్కృత భాషపై టిటిడి యాజమాన్యం శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని తిరుపతి శే్వతాభవనంలో ప్రారంభించారు. 10 రోజుల పాటు జరిగే ఈ శిక్షణ కార్యక్రమాన్ని ప్రభాకర్‌శర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్కువ మాటల్లో ఎక్కువ భావాన్ని పఠించగల్గిన శక్తి ఒక సంస్కృతభాషకే వుందన్నారు. ఇది మతపరమైన భాషే కాకుండా శాస్తప్రరంగా కూడా ఎంతో ఉత్కృష్టమైనదన్నారు. సంస్కృతభాషను 50 ఏళ్లక్రితమే ఉద్ధరించి వుంటే దేశం మరింత గొప్పగా అభివృద్ధి పథంలో నడిచేదన్నారు. సంస్కృతభాష శబ్ధపరంగాను, రూపపరంగాను, అలంకార పరంగాను ఏపరంగా చూసినా ఎంతో గాంభీర్యమైనదని, ఈగాంభీరతాభావం ఇతర భాషల్లో లేదన్నారు. ప్రపంచ ప్రఖ్యాతి థార్మిక సంస్థ అయిన టిటిడిలో పనిచేస్తున్న ప్రతిఒక్క ఉద్యోగి భగవంతుని సేవతో పాటు భక్తుల సేవలో కూడా పాల్గొంటున్నారు. అలాంటి కృతార్థులైన ప్రతిఒక్క ఉద్యోగి ఈ భాషను నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. సంస్కృతభాషకు పూర్వవైభవం తీసుకురావడం కోసమే తాము సంస్కృతీభారతీ సంస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా సంస్కృత భాషోద్యమం నడుస్తోందన్నారు. ఈ 10 రోజుల శిక్షణా తరగతులు పూర్తి అయిన తరువాత ప్రతి ఒక్కరూ సంస్కృతభాషను అనర్గళంగా మాట్లాడగలరన్న సంపూర్ణవిశ్వాసం తనకున్నంన్నారు. అందుకు కారణం సంస్కృతభాషను నేర్చుకున్నంత సరళంగా మరేభాషను నేర్చుకోలేరన్నారు. ముగింపు సమావేశం జనవరి 4వతేది జరగనుందని, ఈసందర్భంగా టిటిడి ఇఓ ఎల్వీ సుబ్రహ్మణ్యం హాజరవుతారని, ఈసందర్భంగా ప్రతి ఒక్క ఉద్యోగి సంస్కృతభాషలో సాధించిన పట్టును చాటాలని ఆయన హితవు పలికారు

No comments:

Post a Comment